11 ఆగస్టు 2011

మంచుబిందువు

ఉదయాన్నే మంచుబిందువులు
ఆకాశం నుండి పిట్టల వలె ఎగురుతూ వచ్చి గడ్డిపరకలపై వాలతాయి.

వస్తూ, వస్తూ అవి ఒక్కొక్క చల్లని సూర్యుని వెంట తెచ్చుకొంటాయి.

వాటితో
'ఇన్ని సంవత్సరాలలో ఒక్క సూర్యుడైనా నాలో ప్రతిఫలించలేదు.
మీలో ఎలా నిలిచాడు?' అంటాను.

'మా వలే పారదర్శకంగా ఉండు.
నీలో విశ్వమంతా ప్రతిఫలిస్తుంది.' అంటాయి.

చూస్తూ ఉండగానే
వర్ణ వర్ణాలుగా రెక్కల్ని అల్లార్చుతూ
కనిపించే లోకం నుండి కనిపించని లోకానికి ఎగిరిపోతాయి.

మంచు నివసించిన జ్ఞాపకాలు ఏవో
గడ్డిపరకలపై గాలికి ఊగుతుంటాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి