12 మార్చి 2018

కవిత : తెంచుకొంటూ





ప్రచురణ : నవ్య వారపత్రిక 3.3.2018 

ఏడు పుస్తకాలు : 7. ఐ యాం దట్ - నిసర్గదత్త మహరాజ్

మనస్సు సందేహాల పుట్ట, కాస్త తర్కమూ, ఊహా కూడా బాగా తెలిస్తే, ఇక అది పుట్టించే సందేహాలకి అంతే వుండదు. పెద్దగా తెలివిలేనివారికి ఇలా చెయ్యి అని చెబితే చాలు , దానినే పట్టుకొని వెళతారు, తెలివైనవారికి ఒకటి చెబితే, పది సందేహాలు వస్తాయి అంటారు శ్రీ రమణమహర్షి. చాలా సందర్భాల్లో ఆయన 'నీ సందేహాలన్నీ సరే, అవి ఎవరికి కలుగుతున్నాయంటే, నాకు అంటావు కదా, ఆ నేనెవరో చూడు' అని చెప్పేవారు. మనబోటి తెలివైనవాళ్ళు సందేహాలకి జవాబులు దొరక్క నిరాశ పడేవారు. నిన్న చెప్పినట్టు, ఎవరు చెబుతున్నా సారాంశం ఒకటే, కానీ వినే మనస్సే పరిపరివిధాలు గనుక, దానికి తగినట్టు దొరికే మాటల్ని వెదుకుతూ వుంటుంది. అలా వెదకగా దొరికినవారు శ్రీ నిసర్గదత్త మహరాజ్. 

మారుతి అనే యువకుడు కుటుంబపోషణ నిమిత్తం బొంబాయిలో చిన్న వ్యాపారం చేస్తూ, ఒక సందర్భంలో నవనాధ సంప్రదాయానికి చెందిన సిద్దరామేశ్వర్ మహరాజ్ అనే గురువుని కలుస్తాడు. ఆయన ఇచ్చిన ఉపదేశమూ, సూచనల మేరకి సాధన చేసి, రెండుమూడు సంవత్సరాలలోనే జ్ఞానం పొందుతాడు. ఆ మారుతినే నిసర్గదత్త మహారాజ్ పేరుతో పిలవబడతారు. 

దేశ, విదేశాలకు చెందిన పలువురు అన్వేషకులు ఆయనను కలిసి ప్రశ్నలడిగేవారు. నిసర్గదత్త చదువుకున్నవారు కాదు. మరాఠీ లోనే మాట్లాడేవారు. విదేశీయులు వచ్చినపుడు మౌరిస్ ఫ్రీడ్మన్, బహుశా మరికొందరూ అనువాదకులుగా పనిచేసేవారు. వారు ఆ సంభాషణలని రికార్డు చేసేవారు. అట్లా ఫ్రీడ్మన్ రికార్డు చేసిన నూటొక్క సంభాషణల ఆంగ్లానువాదమే ఈ ఐ యాం దట్. 'నేను' ను గురించి, దానిని కప్పిన మనస్సు గురించి, శరీరం గురించి మరింత సూక్ష్మం గా, అనేక విధాల వివరిస్తారు నిసర్గదత్త. చాలాసార్లు, ఇప్పటివరకూ మనం మననీ, ప్రపంచాన్నీ అర్థం చేసుకొన్నా మనుకొన్న పద్దతిని తలక్రిందులు చేస్తారు ఆయన. తర్కానికి అంతకు మించిన తర్కంతో జవాబిస్తారు. మాటల్లో అద్భుతమైన కవితాత్మకత కలిగిన ఊహలు జాలువారుతూ ఉంటాయి.


జ్ఞానం వల్ల ఏం కలుగుతుందో ఒక్కమాటలో చెప్పమంటే, నేనైతే భయం పోతుంది అని చెబుతాను. మనం చూసే, వినే సో కాల్డ్ ధైర్యాలూ, సాహసాలూ భయానికి రెండో కొసన ఉండేవే కాని, అవి భయరాహిత్యం కాదు. అట్లాంటి భయరాహిత్యం నిసర్గదత్తలో స్పష్టంగా కనిపించేది. ప్రాథమిక విద్యకూడా లేని ఆయనకి అంత సూక్ష్మ బుద్ధి ఎలా సాధ్య మయిందనేది మరొక ఆశ్చర్యం. జ్ఞానం పొందాక కూడా ఆయన చాలాకాలం తన చిన్న వ్యాపారాన్నే చూసుకొంటూ గడిపేవారు. చివరివరకూ తన చిన్న ఇంటిలోనే జీవితం గడిపారు. ఒక చిన్నగదిలో తనతో మాట్లాడవచ్చినవారితో సంభాషించేవారు. క్రిష్ణాజీకి వచ్చినట్లే, ఈయనకూ చివరిలో గొంతు కాన్సర్ వచ్చినపుడు, దేహానికీ, తనకీ సంబంధం లేనట్లే మాట్లాడేవారట. 

ఈ పుస్తకమూ, తరువాత వరుసగా నిసర్గదత్తతో మరికొందరు జరిపిన సంభాషణల పుస్తకాలూ చదివిన తరువాత, నా వరకూ, పుస్తకాల ద్వారా నేనేమి పొందాలని కోరుకొన్నానో అదంతా లభించినట్లుగా అనిపించింది. ఎనిమిదేళ్ళ క్రితం అవి చదవటం పూర్తయాక, ఇక చదువుపై ఆసక్తి పోయింది, కావలసిందేదో చదువుకొన్నాను అనే తృప్తి ఒక కారణమైతే, అంత నిశితమైన, లోతైన భావాలనో, అవగాహననో చదువుకొన్నాక మిగిలినవన్నీ వెలిసిపోయిన వాక్యాల్లా కనిపించటం మరొక కారణం.

నా టైం లైన్ చూసే మిత్రులు తరచూ నేను నిసర్గదత్త కోట్స్ షేర్ చేయటం గమనించే వుంటారు. ఇటీవలి కాలంలో నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ గారు అనువదించిన నిసర్గదత్త సంభాషణలు కొన్ని 'అమృతధార ఖడ్గధార' పేరుతో పుస్తకంగా వచ్చాయి. లక్ష్మీప్రసాద్ గారు గొప్ప అవగాహన గల వ్యక్తి గనుక, చాలా బాగా అనువదించారు. మిత్రులెవరైనా ఆ పుస్తకం సంపాదించి చదవవచ్చును. ఇంగ్లీషు పుస్తకాలు అమెజాన్ లో లభిస్తున్నాయి ఇప్పుడు. పీడీయఫ్ ఫైల్స్ నెట్లో పలుచోట్ల ఉచితంగానే అందుబాటులోనే వున్నాయి.



ఈ పుస్తకం ఆన్ లైన్ సైట్లలో లభిస్తుంది.

ఏడు పుస్తకాలు : 6. శ్రీ త్రిపురా రహస్యం

మౌలికంగా, మనకు జీవితం లో రెండు ప్రశ్న లుంటాయి. మనకు ఊహ తెలిసిన మొదట్లో ఈ రెండూ మనకి ఆశ్చర్యాన్ని గొలుపుతాయి. రాను, రానూ జీవించటం మానేసి, బతకటం ఒక అలవాటుగా మారిపోయే మొరటుదనంలో ఈ ప్రశ్నలు మరుగునపడిపోయి, తత్కాల ఘటనలకి తోచిన విధంగా స్పందిస్తూ కాలం గడుపుతాము మనం. ఆ ప్రశ్నలు నేనేమిటి, ఈ ప్రపంచం ఏమిటి. ఇవి ఇట్లా పద రూపంలో కాకపోయినా, మన బాల్యంలో మనలోంచి ప్రకటమయ్యే ఆశ్చర్యం వెనుక ఉండేది ఈ ప్రశ్నలే. మనస్సు స్థూలాన్నే ఆశ్రయిస్తుంది గనుక, అధికులు ప్రపంచానికి తోచిన జవాబులు కల్పించుకొంటూ సాగుతారు. కొద్దిమంది మాత్రం నేను కి అర్థం వెదుకుతారు. నేను అనేది పరిష్కారమైతే ప్రపంచం పరిష్కారమౌతుంది, ప్రతి నేనూ నా నేనుకి నమూనానే గనుక. ఒకటి తెలిస్తే, అన్నీ తెలుస్తాయి. ఈ దృక్పథం రమ్మంటే వచ్చేదీ కాదు, వస్తే పోయేదీ కాదు. ఇట్లా ఈ నేను ఏమిటి అనే ప్రశ్న వచ్చినపుడు లోచూపు మొదలవుతుంది, ఈ దారిలో వెళ్ళినవారు ఏమి చెప్పారో తెలుసుకోవాలనిపిస్తుంది. వారి మాటలనుండి తనకి కావలసిన జవాబులూ, సారమూ తీసుకోవటం జరుగుతుంది. అట్లా నన్ను నేను వెదుక్కొంటున్న క్రమంలో నాకు ఎంతో సహాయం చేసిన పుస్తకాలలో త్రిపురా రహస్యం ఒకటి. 

అప్పుడేమి చదివానో గుర్తులేదు కాని, ఈ పుస్తకం ముద్ర నాపై బలంగానే ఉందనుకొంటాను. త్రిపురాదేవి అంటే మన యదార్థస్వరూపమే. త్రిపురాలు అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. భౌతిక దేహం స్థూలమనీ, దానికి కారణమైన మనస్సు సూక్ష్మమనీ, మనస్సుకి కారణమైన మౌలిక సంస్కారాలు కారణమనీ చెబుతారు. కారణ శరీరానికీ ఆధారమై 'నేను ' గా తోచే స్వరూపాన్నే త్రిపురాల యొక్క రహస్యంగా భావించవచ్చును. పరశురాముడు సుమేథునికి చేసిన బోధగా త్రిపురా రహస్యంలో కథ జరుగుతూ ఉంటుంది. కథలో మళ్ళీ అనేక ఉపకథలు వస్తూ ఉంటాయి. నేను అంటే ఏమిటి, మనస్సు స్వభావం ఏమిటి, ప్రపంచం యొక్క ఉనికి ఎటువంటిది వంటి విషయాలు చర్చకు వస్తూ ఉంటాయి దీనిలో.


స్వరూపానుభవం మనకు తరచూ జరుగుతూనే ఉంటుందన్న విషయం ఈ గ్రంథం లోనే చదివిన గుర్తు. ఆలోచనకీ, ఆలోచనకీ నడుమ విరామంలో, మెలకువ నుండి నిద్రలోకీ, నిద్ర నుండి మెలకువలోకీ వచ్చే సందర్భాల్లో, మహా సుఖం, మహా దుఃఖం, మహా భయం సంభవించి మనస్సు నిశ్చేష్టితమయ్యే సమయాల్లోనూ మనం స్వరూపంగా క్షణకాలమో, కొద్దికాలమో ఉంటామని, మళ్ళీ మనస్సు మనని స్థూల ప్రపంచంలోకి తీసుకు వచ్చినపుడు ఆ స్వరూపానుభవం మరుగున పడుతుందనీ చెబుతారు. అట్లానే మనస్సుకి స్వతహాగా రూపం లేదనీ, తాను చూసే దృశ్యాలని అనుసరించి అది ఒక రూపం తీసుకొంటూ ఉంటుందనీ, అట్లానే బయటి ప్రపంచమూ, బయట కాక మనస్సులోనే ఉందనీ చర్చిస్తారు. విరుద్ధంగా కనిపించే ఈ ప్రతిపాదనలకు పై మాటగా చూసేవాడూ (ద్రష్ట), చూడబడేదీ (దృశ్యం) ఒకసారే తోచి, ఒకసారే మాయమయే విషయాలే కాని, వాటికి అస్థిత్వం లేదనీ, చూపు (దృక్కు) మాత్రమే సత్యమనీ, స్వతంత్రమనీ చెబుతారు. ఏ తాత్విక చర్చ చూసినా ఈ పర్యవసానాలకే భిన్న మార్గాల ద్వారా రావటం కనిపిస్తుంది. భారదేశంలోనే కాక, ప్రాక్పశ్చిమ దర్శనాలలో ఎక్కడైనా, ప్రాచీనంలోనే కాక, నవీన దార్శనికుల్ని చదివినా ఇవే మౌలిక విషయాలుగా గోచరిస్తాయి. తిరిగి తిరిగి మనస్సే సమస్య. మనస్సే పరిష్కారం కూడా. లోనికి చూసినా, బయటికి చూసినా.

మనలో ఏదో వత్తిడి ఉండాలి, వేదన ఉండాలి, వెలితీ, వెదుకులాటా ఉండాలి. మంచిగా బతికే ప్రయత్నం, మంచిగా మాత్రమే బతకాలనే మొండితనం ఉన్నపుడు ఈ వత్తిడి కలుగుతుం దనుకొంటాను. అది ఉన్నపుడు వెదుకుతాము. వెదుకు దొరుకుతుంది. తట్టు తెరుచుకొంటుంది. అని జీసస్ చెప్పేది దీని గురించే అనుకొంటాను. నిజానికి నడిపించేది ఆ వెదుకులాటే అయినా, ఆ మార్గంలో నడిచినవారి అవగాహన తెలుసు కొన్నపుడు మన ప్రయాణం వేగవంతమౌతుంది. చదవటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటే ప్రయాణం వేగవంతం కావటం ఒక్కటే అనుకొంటాను. కానీ, ఎవరి ప్రయాణం వారు చేయవలసిందే. పడుతూ, లేస్తూ తన అనుభవం తను చూడవలసిందే.



 ఈ పుస్తకం శ్రీ రమణాశ్రమం, తిరువణ్ణామలై లో లభిస్తుంది.

ఏడు పుస్తకాలు : 5. అష్టావక్ర గీత - వ్యాఖ్య : స్వామి చిన్మయానంద

 భారతీయఋషుల గురించి మనకి చాలా తక్కువ మాత్రమే తెలుసనుకొంటాను నేను. వారి అన్వేషణ, దాని ద్వారా వారు గ్రహించిన సత్యాలు అద్భుతమైనవి. జీవన మౌలిక వాస్తవికతని గ్రహించటానికి వారు తమ అంతస్ఫురణను ఆశ్రయించినట్టు కనిపిస్తుంది. అది మేథ కన్నా లోతైనది, ఖచ్చితమైనది. కాలక్రమంలో అనేక సామాజిక, రాజకీయ ప్రయోజనాలతో నిండిన అంశాలు మాత్రమే జాతిపై పెత్తనం చేసినపుడు, భారతీయ దర్శనం అంటే అది మాత్రమే అని సామాన్యులు అనుకొంటున్నపుడు, ఆయా అంశాల వలన ప్రయోజనం పొందేవారూ, నష్టపోయేవారూ రెండుగా చీలి, ఇద్దరూ కూడా ఆ మౌలిక విషయాలని ప్రతిపాదించిన శాస్త్రాలని విస్మరించారని నాకనిపిస్తూ వుంటుంది. 

ఉపనిషత్తులూ, మరికొన్ని స్వరూపవర్ణన గ్రంథాలూ ఏ మహాసత్యాన్ని విశదీకరించాలని పలువిధాల ప్రయత్నించాయో అనిపిస్తుంది, వాటిని నిజమైన వెదుకులాట తో సమీపించినపుడు. వాటికి మతంతో, ఆచారవ్యవహారాలతో ఉండే సంబంధం నామమాత్రమైనది. నిజానికి, వారందరూ కూడా అన్ని రకాల కపటవిలువలపైనా తిరుగుబాటుదారులు అని కూడా అనిపిస్తుంది నాకైతే. ఒకరన్నట్టు మతం ముగిసిన చోట ఆధ్యాత్మికత లేదా తాత్విక అన్వేషణ మొదలవుతుంది.

ఒక జనకుని (సీతాదేవి తండ్రి కావచ్చు, మరొకరు కావచ్చు)కి సత్యం తెలుసుకోవాలనే కోరిక పుడుతుంది. గుర్రపు రికాబులో ఒక కాలు ఉంచి, రెండోవైపు రెండో కాలు వేసేలోగా జ్ఞానం పొందవచ్చును అనే రుషి వాక్యం సభలో ప్రస్తావనకి వస్తే, నిరూపిస్తారా అంటాడాయన పండితుల్ని. కొంత కథ తరువాత, అష్టావక్రమహర్షి ప్రవేశించి తాను నిరూపిస్తానంటారు. రాజు గుర్రపు రికాబులో కాలుంచి నిలబడతాడు, అప్పుడు, మహర్షి జ్ఞానం ఇస్తున్నాను గనుక గురుదక్షిణ ఇమ్మంటాడు. ఏమి కావాలంటే, 'నేను' 'నాది' అనుకొనే సమస్తాన్నీ తనకి అర్పించమంటాడు. భౌతికమైనవే కాక, మనస్సుతో, సంకల్పంతో సహా అర్పిస్తాడు జనకుడు. సంకల్ప రాహిత్యమే జ్ఞానం గనుక, జనకుడు జ్ఞానంతో నిండిపోతాడు. తరువాత గురు, శిష్యులిరువురికీ జరిగిన సంభాషణే ఈ పుస్తకం.

శ్రీ చిన్మయానంద వ్యాఖ్యని పెద్దగా చదివిన గుర్తులేదు. శ్లోకార్థం వరకే చదువుకొన్నాను. ప్రతి శ్లోకమూ అద్భుతమైన కవితలా తోచింది అప్పుడు. జ్ఞానికి ఈ జీవితం ఎట్లా అనుభవమౌతూ ఉంటుందో వివరంగా చర్చిస్తారు వారిరువురూ ఈ పుస్తకంలో. 
లోతైన ఏ రచన చదవటానికైనా ఆకలి లాంటి ఆర్తి కలిగి ఉండటం ముఖ్యం. జ్ఞానమనేది ఉందని నమ్మకపోయినా కూడా, ఇంతకన్నా సారవంతమైన జీవితానుభవం ఉంటుందా అనుకొంటూ వేసట చెందిన హృదయాలైనా ఈ పుస్తకాన్ని సమీపిస్తే, వారికి ప్రగాఢ మైన శాంతి కలుగుతుందని అనిపిస్తుంది నాకు.




పద్మినీ జ్యూయలర్స్, భీమవరం వారి వద్ద ఈ పుస్తకం లభిస్తుంది. 

ఏడు పుస్తకాలు : 4. ద పవర్ ఆఫ్ నౌ - ఎకార్ట్ టోలీ

జ్ఞానం, మరీ గంభీర పదమైతే, 'మెలకువ' అందాం, ఎవరికి ఎలా ప్రాప్తిస్తుందో తెలియదు. ఎకార్ట్ టోలీ తీవ్రమైన నిస్పృహలో నెలల తరబడి జీవించాడు. 29 వ యేట ఒకరాత్రి చాలా రాత్రుల్లాగే సరిగా పట్టని నిద్రనుండి తటాలున మేలుకొన్నాడు. ఇక నన్ను నేను ఎంతమాత్రమూ భరించలేననిపించింది ఆయనకి. అంతలో ఒక ప్రశ్న. నన్ను నేను భరించలేను అంటున్నానేమిటి, అంటే భరించే నేనూ, భరించబడే నేనూ రెండున్నాయా అనుకొంటాడు. అది కేవలం మేధో పరమైన ప్రశ్న కాదు, తన మౌలిక చేతనలోకి తొలుచుకుపోతున్న ఒక చూపు. అకస్మాత్తుగా ఏదో శక్తి తనని సంపూర్ణంగా లొంగదీసుకొంటున్నట్టు అనుభవమవుతూ వచ్చింది. నిద్రపట్టింది. లేచాడు. తను చూస్తున్నది తాజా ప్రపంచం. కిటికీలోంచి పక్షికూత వినిపించింది. ఆ కూత ఒక వజ్రంలా అనిపించింది. కొన్ని నెలలు ఆలోచనలూ, భయాలూ, వేదనలూ తాకలేని ఆనందంలో మునిగిపోయాడు. తరువాత తన అవగాహనని ప్రపంచంతో పంచుకోనారంభించాడు. ఆయన రాసిన పుస్తకం ఈ పవర్ ఆఫ్ నౌ. కొద్దిగా అంతరిక అన్వేషణలో ప్రవేశం ఉన్నవారికి ఈ టైటిల్ చాలా చెబుతుంది.

మిత్రుల దగ్గరనుండి సంపాదించిన పుస్తకాన్ని జిరాక్స్ తీసుకొన్నాను. పూర్తిగా చదవలేదు ఈ నాటికీ. అక్కడక్కడ చదివే సరికి ఆయన దేనిని సూచిస్తున్నారో అర్థమైంది. అది సరిపోయిందనిపించింది. అంతరిక అన్వేషణకి సంబంధించిన మౌలిక సూత్రాలు చాలా సరళమైనవి. సంక్లిష్టమైన మనసు పొరల్ని తొలగించుకోవటంలోనే ఉంది కష్టమంతా. ఆయన చెబుతున్నది అంతా టైటిల్ లోనే వచ్చింది. ఈ క్షణపు శక్తి.

గతం, భవిష్యత్తూ మానసికమని మనకి తెలుస్తూనే ఉంటుంది. వర్తమానానికి మాత్రమే భౌతికత ఉంటుంది. ఈ వర్తమానపు వాస్తవికతలో కూడా పంచ భూతా (ఫైవ్ ఎలిమెంట్స్)త్మక ప్రపంచానికి ఆధారంగా, స్థిరంగా మరొక వర్తమానం ఎప్పుడూ ఉంది. దీనినే అనంత వర్తమానం అంటారు రమణ మహర్షి. సత్యం ఇప్పుడే, ఇక్కడే ఉంది అంటారు నిసర్గదత్త. ఇంకా సులువుగా అర్థం కావాలని, ఇప్పటి లోపల ఇప్పుడు అంటారు ఆయన. మొదటి ఇప్పుడు మానసికం, ఇంద్రియ సంవేదనాత్మకం. రెండవ ఇప్పుడు ఏమీలేని లేదా అంతా తానే అయిన ఇప్పుడు. దానినే ఎకార్ట్ టోలీ ప్రధానంగా ప్రతిపాదిస్తూ వచ్చారు. కాస్త చూపు సూక్ష్మమైతే తెలుస్తుంది ఆ ఇప్పుడు, దాని అనంత శక్తి, కాంతి. కానీ, మనస్సు బూడిదై అది మాత్రమే మిగలటం అంత తేలికేమీ కాదు. ఆ దివ్యమైన వర్తమానానికి మేలుకోవటానికి ఎకార్ట్ టోలీ సూచనలు ఎంతగానో ఉపకరిస్తాయి.




ఈ పుస్తకం ఆన్ లైన్ సైట్లలో లభిస్తుంది.

ఏడు పుస్తకాలు : 3. క్రాంతి బీజాలు - ఓషో

 ఓషో రచనలలో నేను చదివిన మొదటిపుస్తకం ఇది. ఓషో జీవిత విధానమూ, ఆయన బోధ గురించి జరిగిన దుష్ప్రచారాల వలన చాలా కాలం ఆయన్ను దూరంగానే పెట్టినా, మిర్దాద్ కు ముందు కనిపించిన ఆయన నాలుగుమాటలూ, భిన్నంగా ఆలోచించేలా చేసాయి. ఒక మిత్రుడి దగ్గర ఈ పుస్తకం చూసి, చదువుకొని, ఏ పుస్తకమూ రెండోసారి చదివే అలవాటు లేకపోయినా, స్వంతంగా ఒక పుస్తకం ఉండాలని కొనుక్కొన్న కాపీ ఇది.

తన శిష్యురాలు ఆనందమయికి ఓషో రాసిన ఉత్తరాలు ఈ పుస్తకం. చాలా మృదువుగా, ప్రేమగా జీవితం పట్ల ఎరుకని బోధిస్తారు ఈ ఉత్తరాల్లో. మేథ తో కాక, హృదయంతో ఓషో భావాలని సమీపించినపుడు, మన జీవితాల్లో అంతకుముందు లేని తాజా వెలుతురు ప్రసరిస్తుంది.

నా వరకూ అన్ని రకాల కండిషనింగ్ ల నుండీ విముక్తం కావటానికి, కాగల ధైర్యం తెచ్చుకోవటానికి చలం తరువాత ఓషో మహోపకారం చేసారని భావిస్తాను.



ఓషో రచనలు ఇప్పుడు తెలుగులో కూడా విరివిగా లభిస్తున్నాయి. ఆన్ లైన్ లో వెదకవచ్చును.

ఏడు పుస్తకాలు : 2. మిర్దాద్ - మైకేల్ నేమీ

మైకేల్ నేమీ అనే రచయిత (కవి?) రాసిన నవల ఇది. జిబ్రాన్ ప్రాఫెట్ ని పోలిన ప్రబోధాత్మక రచన. ఒక మనిషి జీవితాన్ని, దానిలో తోచే అన్నిదోషాలతో సహా ఇంతగా ప్రేమించవచ్చా అని ఆశ్చర్యం కలిగింది చదువుతుంటే. ఇది ఒక పవిత్రమైన రచన అనిపిస్తుంది. కవరు మీది మాటలు ఓషో అన్నవి అనుకొంటాను. అప్పటికి ఓషోని చదవలేదు గనుక చదివే ముందు పట్టించుకోలేదు. చదివాక వాటినీ, ఓషోనీ కూడా పట్టించుకొన్నాను.


ఈ పుస్తకం తెలుగు అనువాదం పిరమిడ్ ప్రచురణగా లభిస్తోంది.
ఇంగ్లీషు పుస్తకం ఆన్ లైన్ సైట్లలో  లభిస్తుంది.


ఏడు పుస్తకాలు : 1. భగవాన్ స్మృతులు - చలం

 శ్రీ రమణమహర్షి సన్నిధిలో జీవించినవారి అనుభవాలని చలం రికార్డు చేసిన పుస్తకం ఇది. ఇది చదివేనాటికి జీవితం గురించీ, మనుషుల గురించి తీవ్రమైన అయోమయంలో ఉన్నాను. ఇది చదివాక, జీవితానికి ఒక అద్భుతమైన లక్ష్యం ఉందనీ, భూమ్మీద దురదృష్టకరమైన మానవజాతిలో నూరుశాతం ప్రేమించదగిన, నమ్మదగిన మనిషి ఒకరైనా జీవించి వెళ్ళారనీ అర్థమైంది.



ఈ పుస్తకం ఇప్పుడు ప్రియదర్శిని ప్రచురణలు, హైదరాబాద్ వారివద్ద లభిస్తోంది. 
శ్రీ రమణాశ్రమం,  తిరువణ్ణామలై వారి వద్ద కూడా లభిస్తుంది.

పుస్తకాలూ - నేనూ

శరత్ బాబు రచనలతో మొదలైన సీరియస్ సాహిత్య పఠనం దాదాపు రెండు దశాబ్దాలు సాగింది. తరువాత ఒక దశాబ్దం ఎంపిక చేసుకొన్న పుస్తకాలు మాత్రమే చదవగలిగాను. చివరగా ఇష్టంగా చదువుకొన్నది నిసర్గదత్త మహరాజ్ సంభాషణల పుస్తకాలు. సుమారు ఏడెనిమిదేళ్ళుగా చదవటం ఆగిపోయింది. ఇప్పుడు చదవమంటే, బడి పుస్తకాలు చదవమన్నంత బాధ.

చదవటం కన్నా చూడటం, స్పందించటం ముఖ్యం. వాటికన్నా లోనికి చూసుకోవటం ముఖ్యం. లోచూపు చిక్కితే, తనకి కావలసినవి చాలాసార్లు తనకే తెలుస్తాయి. దానిని సహజ జ్ఞానం (intuition) అనవచ్చునేమో. ఇదేమీ ప్రత్యేక విద్యా / ప్రతిభా కాదు. అది ఎప్పుడూ ఉన్నదే. లోపలి దుమ్మునీ, గట్టిపడిన భావజాలాలనీ, ఉద్వేగాలనీ, వాటి వెనుక అంతకన్నా బిగుసుకుపోయిన అహంభావాన్నీ ఎంత వదులుకోగలిగితే, అంతగా ఆ స్ఫురణ ప్రకాశిస్తుంది.

కానీ, బహుశా, చదవటంలో ఏమీ లేదు అని తెలిసే వరకైనా, చదవటం మంచిది. దాని వలన మేథ వికసిస్తుంది. చూపు విస్తృతమౌతుంది, అనేక తలాలని తాకుతుంది. అనుభవశక్తీ, వ్యక్తీకరణశక్తీ సున్నితమౌతాయి. పదును దేరుతాయి. తరువాత, వాటితోనే ఆగిపోకుండా, జీవితానుభవంలోకి ప్రయాణించాలి.

ఫేస్ బుక్ లో సునీతా రత్నాకరం గారు ఏడు పుస్తకాల ఆటకి (చాలెంజ్ పదం బాగోలేదు నాకు) టాగ్ చేసినప్పుడు, జీవితంలో ఆయా దశల్లో బాగా లోతుగా తీసుకొన్న రచనలేవా అని చూసుకొంటే, సుమారు ఇరవై పుస్తకాలు గుర్తొచ్చాయి. మరికాస్త జ్ఞాపకంలోకి వెళితే మరో ఇరవై కూడా ఉండవచ్చును. కొన్నిసార్లు పుస్తకం అంటే రచయిత / కవి అని కూడా అర్థం. :) చివరి ప్రభావాలకి సంబంధించిన ఏడు పుస్తకాల గురించి చెప్పదలిచాను గనుక, మిగిలిన లిస్టు ముందుగా రాస్తున్నాను.

బాగా చదివిన రోజుల్లో ఇంగ్లీషు అంతగా రాకపోవటమూ, కొద్దిగా ఇంగ్లీషు వచ్చాక, చదివే ఆసక్తి పోవటమూ జరగకపోతే ప్రపంచ సాహిత్యం బాగా చదువుకొందును కదా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ, దానికేమీ దిగుల్లేదు.

ఇంతకన్నా రాయటం చాతకాకనో, ఇది రాయటం చాతనయో కవిత్వం రాసుకొంటున్నాను కాని, వ్యక్తిగతంగా రచనా ప్రక్రియల్లో నవలకి అభిమానిని. అంత ఊహ ఎలా చేస్తారా అని ఆశ్చర్యం ఏ టాల్ స్టాయో, చండీ దాసో గుర్తుకు వస్తే. తరువాత వ్యాసం, కథ. ఆ తరువాతనే కవిత్వం. ఈ లిస్టు కూడా ఆ విషయాన్నే ధ్రువ పరుస్తుంది. :)

శరత్ శ్రీకాంత్, ఇతర నవలలు, కథలు  
విశ్వనాథ నవలలు, కథలు  
ప్రేంచంద్ నవలలు 

శ్రీశ్రీ మహాప్రస్థానం
చలం మ్యూజింగ్స్, స్త్రీ, ప్రేమలేఖలు, బిడ్డల శిక్షణ
సంజీవదేవ్ దీప్తిధార, ఇతర వ్యాసాలూ
గోపీచంద్ పోస్టు చెయ్యని ఉత్తరాలు 
నండూరి రామమోహనరావు విశ్వదర్శనం 

వడ్డెర చండీదాస్ అనుక్షణికం
విక్టర్ హ్యూగో బీదలపాట్లు
టాల్ స్టాయ్ యుద్ధమూ శాంతి
అలెగ్జాండర్ కుప్రిన్ యమకూపం
అలెక్స్ హేలీ ఏడుతరాలు
అలెగ్జాండర్ డ్యూమా కౌంట్ ఆఫ్ మాంట్ క్రిష్టో

ఖలీల్ జిబ్రాన్ ప్రాఫెట్, ఇతర కవిత్వం  
టాగోర్ గీతాంజలి, మిగతా కవిత్వం 
చలం వెలుగురవ్వలు
మసనోబు ఫుకువోకా గడ్డిపరకతో విప్లవం
జిడ్డు కృష్ణమూర్తి కామెంటరీస్ ఆన్ లివింగ్ 
మహేష్ భట్  యూజీ కృష్ణమూర్తి 
రిచర్డ్ బాక్ నవలలు
పాలో కోయిలో నవలలు