17 ఫిబ్రవరి 2025

వ్యాసం : నా మొదటి పుస్తకం

' ప్రభూ! నిన్ను సేవించుదామని ఎన్నో సుందరపుష్పాలు ఏరి తెచ్చాను. తుదకు వాటి సౌందర్యంపై మోహంతో నిన్నే విస్మరించాను ' చలం అనువదించిన టాగోర్ కవిత్వం చదువుకున్నాక రాసుకున్న వాక్యాలివి. 

కవిత్వం పలికితే రాయటమే గానీ, పనిగట్టుకు రాయటం లేదు. ఇంటర్ చదివే రోజుల్లో సహజంగా ఉండే ఉద్రేకాలతో పాటు, శ్రీశ్రీ, సామ్యవాద సాహిత్యాల ప్రభావంతో సమాజాన్ని మార్చాలనే ఆవేశంతో రాస్తున్న కవితలు, టాగోర్ ని చదివాక ఆగిపోయినట్టున్నాయి. బయటి చూపు లోపలికి మళ్ళాక, మారాల్సింది నేను అనిపించాక, రాసుకొనే కవిత్వం మారింది. దైవం, ప్రకృతి, మృత్యువు, ప్రేమ వంటి ఉదాత్తభావాలు కవితా వస్తువులయాయి.
 
డిగ్రీ చివర్లో, 86లో చలం రాసిన భగవాన్ స్మృతులు దొరికింది. ఒక ఆధ్యాత్మిక గురువు అత్యంత సరళంగా, సహజంగా, సూటిగా, దయగా ఉండటం గమనించి శ్రీ రమణమహర్షి పట్ల గురుభావం కలిగింది. వారి సహేతుకమైన బోధ ' నిన్ను నీవు తెలుసుకో ' జీవిత లక్ష్యమైంది. ఆ తర్వాత వచ్చిన కవితలని, ఇంటర్ లోని తెలుగు మాష్టారు జీయస్వీ నరసింహారావుగారికి చూపిస్తే, చాలా బాగా రాస్తున్నావన్నారు. 89లో వీటిని పుస్తకంగా తీసుకురావాలనిపించింది.
 
మా ఊరు తణుకులో సాహిత్య వాతావరణం చైతన్యవంతంగానే ఉండేది. నన్నయ్య భట్టారక పీఠం, రీడర్స్ ఫోరం సాహిత్య సభలు జరిపేవి. అయితే, స్వతహాగా ఉన్న బిడియం వల్ల ఎవరినీ కలవటం జరగలేదు.

సంస్కృతాంధ్రాల్లో పండితులు చెరువు సత్యనారాయణశాస్త్రిగారి దగ్గర కూర్చుని ఎడిట్ చేద్దాం అన్నారు జీయస్వీగారు. ఎడిటింగ్ కి ముందు కొన్ని చిత్రమైన ప్రశ్నలు అడిగారు శాస్త్రిగారు. రైలు ఎక్కటానికి స్టేషన్ కి టైముకి వెళతావా, ముందుగానా వంటివి. జవాబులు విని, నీ సాహిత్యం ప్రసిద్ధి పొందుతుంది వంటి మాటేదో అన్నారు. ఎడిటింగ్ జరిగింది. నేను చదవటం, వారిద్దరూ విని, సరిచేయటం. ముందుమాట అడిగితే రాసుకోమని, చెప్పుకుంటూ వెళ్ళారు శాస్త్రిగారు. ఆరాధన టైటిల్ నేననుకున్నానో, వారు చెప్పారో గుర్తులేదు. ఆరాధన భగవాన్ కి అంకితమైంది. 

మా ఊరిలోనే రవి ప్రింటర్స్ లో పుస్తకం అచ్చుకి ఇచ్చాను. కవర్ పై నా ఫోటో వేసుకోవాలనే ఆలోచన అప్పటికే ఉన్నట్టుంది. పాలంగిలోని రాయల్ ఆర్ట్స్ దగ్గరికి వెళ్ళి, ఫోటో ఇచ్చి, బొమ్మ గీయించాము. 89 చివర్లో పుస్తకం వచ్చింది. ఆవిష్కరణ సభ తలపెట్టలేదు. తొలికాపీ దేవుడి దగ్గర పెట్టి ఉంటాను. లేదా తల్లిదండ్రులకి ఇచ్చి వుంటాను. కొన్ని పత్రికలకి సమీక్షలకి పంపి ఊరుకున్నాను. 

తర్వాత చలంగారి సన్నిహితులు చిక్కాల కృష్ణారావుగారికి పంపిస్తే, వారంలో ఉత్తరం వచ్చింది. మరునాడు ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చారు కృష్ణారావుగారు చెప్పారంటూ. ఆలపాటి రాంబాబుగారు, పుల్లేశ్వరరావుగారు. 2018లో వెళ్ళిపోయేవరకూ, సుమారు మూడు దశాబ్దాలు లోపలి అన్వేషణలో సహచరుడిగా, సంక్లిష్ట సమయాల్లో ఆప్తుడిగా ఉన్నారు రాంబాబుగారు. 

తర్వాత రోజుల్లో చిరునామాలు దొరికిన ప్రముఖులకి పుస్తకాలు పంపించాను. మీవి మాటలతో వ్రాయబడినప్పటికీ, మాటలను దాటి వెళ్ళిపోయాయి, సంవేదనా జగత్తును వదిలి, శుద్ధవేదనా జగత్తుకన్నారు సంజీవదేవ్. కవి తన్ను తాను వెదుక్కునే ప్రయత్నంలోనే కవిత్వం పుడుతుంది. అందుకనే నిజమైన, స్వచ్చమైన కవిత్వం రాయగలిగారన్నారు ఇస్మాయిల్. పట్టుపురుగులోంచి పట్టు వచ్చినట్లు, మీలోంచి కవిత్వం నిర్గతమవుతోందన్నారు శేషేంద్ర. 

2017లో ఆరాధన మూల కవితలు చదివితే, ఎడిటెడ్ కన్నా అవే మరింత సహజంగా తోచాయి. వాటినే కాలక్రమంలో కూర్చి, ఆరాధన రెండో ప్రతి తయారు చేసి ఆన్లైన్ లో ఉంచాను. కవర్ పై సవరించిన ప్రతి అని రాశాను గానీ, నిజానికి సవరించని ప్రతి అని రాయాలి. 

94లో తణుకు వచ్చి, నన్ను వెదికి పట్టుకున్న కొప్పర్తి గారి స్నేహం తర్వాత, 95 లో నా తొలి హైకూ సంపుటి దృశ్యాదృశ్యం వచ్చింది. తణుకులో ఆవిష్కరణసభకి చేరా, ఇస్మాయిల్, కె. రామ్మోహన్ రాయ్ గార్లు వచ్చారు. బివివి ప్రసాద్ అప్పటి నుండి సాహిత్య ప్రపంచానికి తెలియటం మొదలైంది. తర్వాతి కాలంలో నాగభైరవ, ఓల్గా, అద్దేపల్లి ఆరాధన చదివి సాంద్రమైన అనుభూతితో స్పందించారు. 




16 ఫిబ్రవరి 2025

కవిత : లోపలికి


1
కొలతలకి లొంగకు, లెక్కల నుండి ఎగిరిపో
లొంగనట్టు కనబడటానికి కూడా..
అప్పుడు మేలుకొంటావు
నిశ్శబ్ద, రహస్య, ప్రశాంత తటాకం ఒడ్డున

సీతాకోకలు 
నిన్ను పట్టించుకోకుండా ఎగురుతుంటాయి
పిట్టల పాటలు దూరాలకి పిలుస్తుంటాయి
తటాకంలోని నీటి తడి
జన్మల మాతృప్రేమలా తాకుతుంది
ఇక నిన్ను పూర్తిగా మాయం చేయగల
ప్రియురాలి కోసం ఎదురు చూస్తుంటావు

2
కలలు కంటే తప్పేమిటి 
లోకం కల అయినప్పుడు
ఆదర్శాలూ, విజయాలూ, విరామాలూ 
కళ్ళ ముందు కరిగిపోతున్నపుడు

కలలు రాలిపోతే గాయాలెందుకు 
ఒక సూర్యోదయం 
నువు లేని రోజున కూడా జరగబోతున్నపుడు
గాలి వీయబోతున్నపుడు 
మనుషులు ఎప్పటిలానే ఈదబోతున్నపుడు

3
ఇదంతా బావుంది, బావోలేదు కూడా
ఇదంతా ఉన్నట్టుంది, లేదేమో కూడా
కొంచెం తడిగా ఉండటం తప్ప
ఇక్కడ వేరేదీ చేయదగింది లేనట్టుంది

బహుశా, అతను ఉన్నాడు 
ఇంత ప్రపంచం అతనికి
రాలుతున్న ఎండుటాకు పాటి కాకపోవచ్చు
అప్పుడు నీ బరువుకి అర్థమేమిటి

బహుశా, అతనే నీలా ఉన్నాడు
ఇప్పుడు నువు
చేయవలసింది ఏమైనా మిగిలి ఉందా ఇక్కడ

24.9.24 11.00 రాత్రి
ప్రచురణ : కవితా ఫిబ్రవరి 2025



16 డిసెంబర్ 2024

కవిత : సృష్టి

ఖాళీ మనసులో కొన్ని రంగులు ఒంపు
అవి ఆకాశమూ, గాలీ, నీరూ 
కాంతీ, చీకటిలో వెన్నెలా

రంగులపై కొన్ని గీతలు గీయి
నదులూ, కొండలూ, మైదానాలూ 
ఉదయాస్తమయ మేఘాలూ, పాలపుంతలూ 

గీతలను కొంచెం కదిలించి చూడు 
చెట్లూ, పిట్టలూ, చేపలూ 
చీమలూ, ఏనుగులూ, మనుషులూ

కదలికలలో ఉద్వేగాలు కలుపు
చిక్కగా, లేతగా, తీవ్రంగా, తేలికగా
మంచీ, భయమూ, బాధా, ప్రేమా

ఇంతకన్నా ఊహించేదేమీ లేదు
నువ్వైనా, దేవుడైనా

మళ్ళీ మొదటికి రావలసిందే
నిద్రలోనో, మరణంలోనో, జ్ఞానం లోనో 


- బివివి ప్రసాద్
ప్రచురణ : ' మెహఫిల్ ' మన తెలంగాణ 16.12.24



02 డిసెంబర్ 2024

కవిత : ఉండటం

దీనికి అర్థం ఉందని 
నమ్మటం నుండి బయటపడాలి
ఆర్థాలకి అర్థమేమిటి
ఈ నమ్మకాలకి మొదలేమిటి

చివరికి మంచి గెలుస్తుందనే
చిన్నప్పటి భ్రమని వదిలించుకోవాలి
ఏ చివర, ఎవరికి మంచి
ఎంతకాలం గెలుస్తుంది 

ఈ కథకి ముగింపు ఉంటుందనే 
ఉద్వేగం నుండి తెప్పరిల్లాలి
మగతనిద్రల్లోని కలలు ఎక్కడ ముగిశాయి

తలపై బెలూనులా ఎగురుతోంది గగనం
మన తలల్లోని ఊహల్లాంటివి 
ఎందరిలో, ఎన్నిటిని చూసింది

కాంతినీ, చీకటినీ విరజిమ్మి
రంగుల్ని శూన్యంలో ఆరబోసి
చివరికి ఏమీ కాకపోవటంలో విశ్రమిస్తోంది

ఊరికే ఉంటే చాలనుకొంటాను
ఆకు కింద నీడ ఉన్నట్టు 
ఎండలో రంగులు వున్నట్టు
చీకటిలో నలుపు వున్నట్టు

ఈ అక్షరాల వలలోంచి బయటకు వెళ్ళాక
ఏది మనసుకి తగులుతుంది
లేదా తగలటం లేదు

28.7.24
ప్రచురణ : పాలపిట్ట, నవంబర్ 2024

కవిత : ఈ క్షణమిలా..

ఈ క్షణం అద్భుతం
ఎండ వాలే, వాన కురిసే, వెన్నెల జారే ఒక క్షణం
దీని కోసమే పుట్టావు, పెరిగావు
ఏడ్చావు, నవ్వావు, భయాన్ని దాటావు,
మనుషుల్ని అల్లుకొన్నావు చుట్టూ,
కావాలనుకొన్నవి పొందావు, పొందినవి కోల్పోయావు 

తీరా ఈ క్షణం నీ కనుల ముందు నిలిచి
ఏమి ఆజ్ఞ అన్నపుడు కనులు మూసుకొన్నావు

నీ దోషమేమీ కాదు
దీని కాంతి అటువంటిది
సౌందర్యం, జీవనహేల అలాంటివి

భరింపరాని మహోధృత వేగంతో, వత్తిడితో
ఈ క్షణం నిన్ను ప్రేమించినపుడు
కనులు మూసుకొంటావు
జ్ఞాపకాల్లోకో, కలల్లోకో తప్పుకొంటావు

అప్పుడు వచ్చిన కవి
పదాలలో నింపి దానిని నీ ముందు పెడతాడు
చిత్రకారుడు రంగుల్లో, గీతల్లో ఒంపి
నీ కళ్ళ ముందు పరుస్తాడు

అప్పుడు అంటావు కదా
అవును ఇదే నేను చూసింది
వాళ్ళు ఎంత అద్భుతంగా పట్టుకొన్నారు అని

నీపై వీస్తున్న లేతగాలివంటి క్షణం 
ఇప్పుడు కూడా 
నన్ను పట్టుకోలేకపోయావని నవ్వుతుంది

వాళ్ళూ అంతే, నాలో కరిగి, నేనై పోతే
ఆ పిచ్చి పనుల్లో కాలయాపన చేసేవారు కాదు 
అని జాలిపడుతూ మాయమవుతుంది

23.10.24
ప్రచురణ : కవిసంధ్య, సంచిక 51, నవంబర్ 2024

19 నవంబర్ 2024

కవిత : పుట్టినరోజున

1
ఇవాళ నీకు నువ్వే గుర్తుకు వస్తుంటావు
ఉదయం పూలూ, చినుకులూ రాలినట్టు
ఒకనాడు ఇక్కడికి రాలావు
వాటికి కరిగి, మాయమైపోవటం తెలుసు
మరి నీ సంగతి అంటారెవరో

2
తొలిసారి చుట్టూ చూసి వుంటావు
కొంత ఆశ్చర్యంగా, కొంత భయంగా
వాటి నుండి బయటికి రాలేదు ఇప్పటికీ
బయటపడటం చాతకాలేదా, ఇష్టం లేదా 
అని నవ్వుతారు నీలోంచి

3
ఋతువుల చివర మిగిలేవి
వెలితీ, దిగులూ అని తెలిసివచ్చినా
బతుకు మీద తీపి ఎందుకో అర్థం కాదు
ఆడుకుందాం రారమ్మని సూర్యకాంతి పిలుస్తుందా
నిన్నటి గాయాలు మరిచి ఎగురుతూ వెళతావు 

4
కనులు తెరిచింది మొదలు 
నిన్ను కనుగొనే మనిషి కోసం వెదికావు
కాలమింత గడిచినా ఇంకా తెలియరాలేదు
నువు మాత్రమే నిన్ను కనుగొనగలవని
మృదువుగా దగ్గరకు తీసుకోగలవని

5
బతుకు ఒక నైరూప్య చిత్రం
అర్థాల ఇరుకు నుండి ఎంత విముక్తమైతే
అంత సారవంతం అవుతుంది 
ఎంత స్వేచ్ఛలోకి మేలుకొంటే 
అంత ఆర్ద్రతలోకి వికసిస్తుంది

6
ఆ చినుకుల్ని అలా రాలనీ
చూడకు వాటివంక
పూలని పాడుకోనీ రంగుల పాటలు
వినకు వాటిని
వాటి స్వేచ్ఛకి వాటిని వదిలి
నీ స్వేచ్ఛలో ఉండిపో 

ఇపుడు చూడు
జీవితం తల్లి గర్భాలయం, కదూ..

21.11.23
ప్రచురణ : సారంగ 15.11.24