02 డిసెంబర్ 2025

వెలుగునీడల దోబూచులాటలో తండ్రీ తానే, బిడ్డా తానే: ఏ.గంగారెడ్డి

 1

కవి రాసిన సృష్టి కావ్యం ఆసాంతం, ఒకటికి రెండుసార్లు చదివాను. కవి ఏం చెబుతున్నాడో కనెక్ట్ కావడానికి ప్రయత్నించాను. ఇది సున్నితమైన, కళాకారుడైన ఓ జీవుడి ఘర్షణ. ఘర్షణ నుండి, ద్వంద్వాల నుండి బయటపడాలని చేస్తున్న తాత్విక ప్రయాణం. ఏది నిజమో, ఏది అబద్దమో పూర్తిగా తేల్చుకోలేని ఊగిసలాట. దొరికినట్లు, జారినట్లు ఉండే జీవనఫల ప్రయాణం.

బయటి మనిషికి, లోపలి మనిషికి మధ్య నడుస్తున్న రాయబారం. బయటి ప్రపంచంలో కొడుకు అలసిపోతే, తన లోపలి తానే తండ్రిగా కొడుకు భుజం మీద చెయ్యి వేసి ఓదార్చుతున్న తాత్వికకావ్యం. ఇక్కడ తండ్రీ తానే, కొడుకూ తానే. బాధా తానే, బోధా తానే. బాహ్యానికి అంతరానికి మధ్యలో సంధి కుదిర్చే ప్రయత్నం. లోకం నుండి పోవాలనుకునే కవికి, ఉండాలనుకునే కవికి మధ్య సయోధ్య ఈ కావ్యం. పొంతన కుదరని అంతర, బాహ్యాలకు, చీకటి, వెలుగులకు మధ్య సమన్వయ ప్రయత్నం ఈ కావ్యం. సత్యాసత్యాల సంఘర్షణ ఈ తాత్వికకావ్యం. మనసు పగుళ్ళతో విరక్తి చెంది, మనసులేని ప్రకృతి ఒడిలో సాంత్వన పొందుతున్న కవి అంతరంగప్రయాణం ఈ కావ్యం.

ఇట్లాంటి మనోస్థితిని అనుభవించే సున్నితమైన బుద్ధిజీవులు ఉండవచ్చు. కానీ, దాన్ని ఓ తాత్వికకావ్యంగా మలుచుకుంటూ, దాంట్లోనే విముక్తిని కోరుకునే ఇలాంటి కవులు అరుదుగా ఉంటారు.

ఇది తనకు తానే రాసుకున్న మ్యూజింగ్స్ంటి కావ్యలేఖ. ఈ కవిత్వం చదివి, అర్థం చేసుకున్న తరువాత నాలో ఈ విచారధార అప్రయత్నంగా ఇలా వస్తున్నది. ఇది కవిత్వ పరామర్శకు సంబంధించిన విషయమా, కాదా నాకు తెలియదు. కవిత్వాన్ని తూచే కొలతలూ తెలియవు. ఈ కావ్యమంతా కవి జీవితస్వేచ్ఛను,విముక్తిని కోరుతున్నాడు. ఇది సుస్పష్టం. అయితే విముక్తి దేని నుండి? తన నుండి తనకే! ఇంతకీ ఆ తను ఎవరు? తనువా, ఆలోచనా; రూపమా, మానసిక నిర్మాణమా?

2

సూక్ష్మంగా ఆలోచిస్తే ఇలా ద్యోతకమవుతుంది : మనం పుట్టామా?

పుట్టినట్లు అనుకుంటున్నామా? పుట్టింది తనువా? ఆలోచననా? పుట్టినట్లు మనకు ఏ వయసు నుండి అనుభవంలో ఉంది? మన ఇంట్లో పెరుగుతున్న పిల్లలను జాగ్రత్తగా చూసినా కూడా ఏం అర్థమవుతుంది? నేను పుట్టాను, అందరితోపాటే పెరుగుతున్నాను అనుకుంటూ, నేను వేరు అనే వ్యక్తిత్వభావనను పెంచుకుంటారు. చుట్టూ ఉన్న సమాజం అలానే నేర్పుతుంది. నమ్ముతాడు. అదే అలవాటుగా మారుతుంది. గత సంస్కారం ద్వారానో, జీన్స్ ద్వారానో కొన్ని లక్షణాలను తెచ్చుకుంటాడు. స్థల, కాలాలు మారుతున్నట్లుగా అనుభవంలోకి వస్తుంటాయి. అవి నిజమని నమ్ముతాము.

నామరూపాల మాంత్రిక సముద్రంలో ఈదడం మొదలెడతాము. భాషకు, రూపానికి సంబంధించిన అర్థాలు ఇవే అని బలపడుతుంటాయి. జ్ఞాపకాల బలం పెరుగుతుంది. సమాజం, మతం, సైన్స్ అనేవి కూడా శాస్త్రం, హేతువుల పేరుతో ఈ 'అనుకోడాన్ని' మరింత బలపరుస్తున్నట్లుగా కనిపిస్తాయి. కండిషన్ అవుతాము. ఇలా కండిషనింగ్ గా మారడమే అహంగా మారడం. అహమంటే ఒక్కటిగా కాకుండా భేదంతో చూడడం, భేదమైపోవడం. ఇదే స్ట్రాంగ్, ఫిక్సెడ్ అండ్ రిజిడ్ గా మారి నేను నీవు అనే సపరేషన్తో, గొప్ప శక్తిగా విస్తరిస్తుంది. పోలికతో గొప్ప ఆటను సృష్టిస్తుంది. కానీ, తనను తాను మరిచి, పెద్ద సమస్యై కూర్చుంటుంది.

మనిషి గాయపడడమంటే, దుఃఖపడడమంటే ఈ అహం గాయపడడమే. భయపడడం అంటే అభద్రతతో ఈ అహం భయపడడమే. సుఖసంతోషాలు కూడా ఈ అహానికే. అహం చుట్టూ నేను, నీవు; నాదీ, నీది; మంచీ, చెడు; ఈర్ష్య, అసూయ: సుఖదుఃఖాల వలయం ఏర్పడుతుంది. అది నైజమై కూర్చుంటుంది. ఈ ఫాల్స్ ఇగో ముదిరి పెద్దదవుతుంది. ఇక దాని నుండి బయటపడం.

చుట్టూ ఉన్న వాతావరణంలో మనం భౌతికంగా మానసికంగా అలానే పెరుగుతున్నట్లుగా భావిస్తూ, ఆ మనోనిర్మాణానికి అలవాటుపడతాము. తాను శరీరాన్ని మాత్రమే అనే ఆలోచనతో బందీ అవుతాము. ఆలోచన అంటే కాలమే. కాలం, ఆలోచన పరస్పర ఆశ్రయాలు. మొదటి ఆలోచన మరెన్నో ఆలోచనలను సృష్టిస్తుంది. ఎన్నో ఆలోచనలు జ్ఞాపకాలుగా, జ్ఞాపకాలు ఆలోచనలుగా మరింత ముదురుతాయి. ఇంద్రియజ్ఞానం దృఢమైన ఓ నమ్మకంగా, నిజంగా మారుతుంది. ఇలా ఈ కంటిన్యుటీ అనే తాడుతో బలంగా కట్టివేయబడి, కొనసాగి అసలైన తనను మర్చిపోతుంటాము. పోలిక, కోరిక, లక్ష్యం, ఐడెంటిటీ, అసూయ, అవసరం, అహంకారం, చర్యా, ప్రతిచర్యలతో భగభగ మండుతుంటాము. ఇక ఈ కంటిన్యుటీ తాడు తెగదు.

వాస్తవానికి మనకు పుట్టిన అనుభవమూ లేదు, మరణించిన అనుభవమూ లేదు. కానీ అందరిలాగే పుట్టినట్లు, మరణిస్తున్నట్లు నమ్ముతుంటాము. ఇతరులను అంటే బాహ్యంలోని మార్పును చూసి, మన మార్పును నమ్ముతాము. మారినట్లుగా ఉన్నది బయటనా, మన లోపలనా? ఈ ఇతరమే పెద్ద మాయ! ఇతరం ఉన్నదా, ఉన్నట్లు కనిపిస్తున్నదా? ఇతరము తనలో ఉన్నదా, బయట ఉన్నదా? ఇది కేవలం తన ఆలోచనలలో మార్పా, సత్యమా? ఆలోచనలు ఎక్కడినుండి ఎందుకు మొదలయ్యాయో, దాని పునాది ఎక్కడుందో తెలియదు. కనీసం రెండు ఆలోచనల మధ్యన ఉన్న ఖాళీని స్పష్టంగా చూడలేని ఆలోచనల వేగపరంపర. ఇక ఆ కంటిన్యుటీ తాడు తెగదు.

అనుకోవడాలూ, అలవాట్లూ అనే ఈ రెండూ మనల్ని బంధిస్తాయి. తానే వేటగాడై పన్నిన మాయావల ఇది. వల వేసిన వేటగాడూ తానే, చిక్కుకున్న పక్షి తానే. అది మనం ఏర్పరుచుకున్న మాయవల అని తెలియకుండానే మన ఒరిజినాలిటీ కోల్పోతాము. భౌతికంగా చూస్తున్నదే నిజమని నమ్ముతాము. ద్వంద్వాల సుడిగుండంలో గిరగిరా తిరుగుతుంటాము. గాయపడుతుంటాము. పడతాము, లేస్తాము, మళ్ళీ పరుగెడతాము. వాస్తవానికి సత్యం కోసం నిజంగా కలవరించే సతాన్వేషికి దుఃఖం, నొప్పి, కన్నీళ్ళు అనేవి వరమే. గాయాలు తూట్లు పొడుస్తున్నపుడు, బాహ్యం పట్ల భ్రమ తగ్గి, సత్యం కోసం లోపల చూసుకునే తపన తీవ్రమవుతుంది. ఇంద్రియ, ఇంద్రియాతీతమైన అనుభూతుల ఘర్షణలో తన తావును వెతుక్కునే ప్రయత్నం నిరంతరం చేస్తుంటాడు. దాని స్పర్శ ఏ కొంచెం దొరికినా, మళ్ళీ మళ్ళీ దాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటాడు.

అయితే అలవాట్లు, అంటే, బలమైన వాసనల వల్ల, అంతర్లీనంగా ఉన్న వ్యక్తిత్వకాంక్షల వల్ల, దొరికిన నిజస్థితి అవగాహన నుండి జారిపోతుంటాడు. ఈ కావ్యంలో కూడా కవి తనకు దొరికినట్లే దొరికి చేజారిపోతున్న స్వస్థితి స్పర్శ కోసం వేదన పడతాడు. తన నిజస్వరూపం కోసం అల్లాడుతుంటాడు. తానే తయారు చేసుకున్న తన మనోనిర్మాణంతోనే నిరంతరం గాయపడుతూ, దాన్ని దాటిన స్వస్థితి కోసం కలలు కంటాడు. అటువంటి తాత్వికకవి మనస్సును, తపనను ఈ కవిత్వం నిండా చూడవచ్చు.

ఏ "అనుకోవడాలు” ద్వారా, ఏ అలవాట్ల ద్వారా, ఆలోచనల ద్వారా ఈ మాయాప్రపంచంతో మానసికబంధం ఏర్పరచుకుని ఓ మనోనిర్మాణపు వలయంలో చిక్కుకున్నాడో కవి, ఆ నిర్మాణాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ, లోకంతో సమన్వయం కోసం, తన శాంతి కోసం, తప్పిపోతున్న తనకు, తానే బోధించుకుంటూ, తిరిగి దారిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తనను తానే ఓదార్చుకుంటూ అమృతఘడియల వైపు ప్రయాణిస్తున్నాడు. తన జీవనయాత్రలో ఎన్నిసార్లు దారి తప్పి దుఃఖపువలలో చిక్కుకున్నా, తిరిగి మళ్ళీ మళ్ళీ లేస్తూ, ఏ మానసికఛాయలు లేని అమ్మలాంటి సహజప్రకృతి ఒడిలో సేద తీరుతూ, తనదైన రాగంలో పాటలు అల్లుకుంటున్నాడు కవి.

3

ఈ కావ్యమంతా తనే గురువు, తనే శిష్యుడు. తనే తండ్రి, తనే బిడ్డా. వేదన తానే, ఓదార్పు తానే. కవి అత్యంత సున్నితత్వం గలవారు. ఆ సున్నితత్వంలోంచే తన్ను తాను ఆవిష్కరించుకుంటున్నారు. తన సంతోషాల్ని, దుఃఖాల్ని, గాయాలను, ఆత్మానందాన్ని, భయాల్ని, ఓదార్పుల్ని, కన్ఫెషన్స్ ని, తాను శాంతిని పొందుతున్న తావులని కవితలుగా మలిచారు. ఎవరికో ఏదో చెప్పడం కాకుండా తనకు తాను లోపలి టోన్లో చేసుకుంటున్న ఆత్మావిష్కరణ. ఇది ఓ రకంగా భిన్న ప్రయోగం. తన కవితాశక్తి ద్వారా కవి తన మనోభూమికపై ఎగసిపడుతున్న అలల సముద్రానికి పటం కట్టి తనను తాను చూసుకుంటున్నాడు. మనల్ని మనకూ చూపిస్తున్నాడు. ఐడెంటిఫై చేసుకునే వాళ్ళకు కవి చాలా దగ్గరగా తోస్తాడు. దిస్ ఈస్ ఎ వెరీ యూనిక్ అండ్ సెన్సిబిల్ టోన్.

జననం, మృత్యువు, మనస్సు, విముక్తి, సత్యం, అసత్యం, స్వర్గం, కల, మెలకువ, గాయాలు, నవ్వులు, ఏడుపులు, సుఖం, ప్రేమ, దయ, శాంతి, అసూయ, దిగులు, వేదన, ఆనందం, కలత, లాలస, స్పర్శ, దుఃఖం, వెలితి, గాయం, క్షమా, స్నేహం, ఏకాంతం, నిట్టూర్పు, పోలిక, కోరిక, ఓదార్పు, భయం, బాధా, ఆశ్చర్యం, మంచీ, చెడూ, అనుమానం, అనంతం, జ్ఞానం అనే ఈ జీవనకోణాలన్నిటి వెంట కవి పదేపదే ప్రయాణించి తన నిశ్శబ్ద ఏకాంతానికి చేరుకునే ప్రయత్నం చేస్తుంటాడు.

ఈ కావ్యంలో వాడిన సింబాలిక్ ఇమేజెస్ మొత్తం చూస్తే, కవి రాగ ద్వేషాలు అంటని స్వచ్ఛప్రకృతి ముందు తనను తాను హృదయార్పితం చేసుకోవడం వలన, తన త్రోవ ఏమిటో స్పష్టపరుస్తున్నాడు. ఆ ఇమేజెస్: ఆకాశం, నక్షత్రాలు, మేఘాలు, చంద్రుడు, సూర్యుడు, పగలు, రాత్రి, కాంతి, గాలి, నీరు, వెలుతురు, పూలు, కాలం, సూర్యాస్తమయాలు, వాన, మబ్బులు, ఇంద్రధనస్సు, మంచుబిందువు, రంగులు, పిట్టలు, సీతాకోకలు.

ఇలా మనసు సోకని బాహ్యప్రకృతిని కవి పదేపదే వాడడంలో నిర్మలప్రకృతిని ఆలింగనం చేసుకుంటున్న తీరును గమనిస్తే, లోకం, మనుషుల తీరుకన్నా, తనను గాయపరచని, దుఃఖపరచని ప్రకృతి జాడలే తనకు సుఖమని సింబాలిక్గా నమ్ముతున్నాడు. అంతేకాకుండా మనోమాలిన్యం లేని, తన లోపలి సత్ వస్తువు పట్ల ఎట్లా తపించిపోతున్నాడో కూడా ఈ సింబాలిక్ ఇమేజెస్ వల్ల అర్థమవుతున్నది. మనస్సు లేని అటువంటి తావుల్లో తన శాంతిని కాంక్షిస్తున్నాడు. ఈ ఇమేజెస్ అన్నీ బయటి వస్తువులుగా కనబడుతున్నా, మనస్సు అంతమయ్యే లోపలిచూపుకు దారిగా కవిని అవి గట్టిగా పట్టుకుంటున్నాయి.

కవి ఎక్కడ ఉన్నాడని చూస్తే, కవితల్లో ద్వంద్వాల మధ్య మానసికయుద్ధం చేస్తున్నాడు. వీటిలో లోకంతో పొసగక అశాంతితో, ఇక వెళ్ళిపోతాను అన్న కవితలూ ఉంటాయి. జీవితేచ్ఛతో సమన్వయాన్ని పొందుతూ, హాయిగా బతికిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుని శాంతిని పొందిన కవితలూ ఉంటాయి. తనకు తానే గురువై బోధించుకుని ఓదార్చుకుంటున్న కవితలూ ఉన్నాయి. ఒక కవిత నుండి మరో కవితకు కాంట్రడిక్షన్లా అటూ ఇటూ ఊగిసలాడడం ఉంటుంది. ఒక కవితలో జీవితామృతం దొరికిందని జీవితేచ్ఛను వ్యక్తం చేస్తారు, మరో కవితలో జీవితం దుఃఖమయమని నిరాశను వ్యక్తం చేస్తారు. ఇవి ఆయా సందర్భాల్లో కవి మూడ్స్్స్న రిఫ్లెక్ట్ చేస్తాయి.

రచయిత, సత్యాన్వేషి చలంగారు కూడా తన నలభై ఏళ్ళవయసులో జీవితం చాలా నిరాశగా ఉంది అన్నారట. ఏభై ఏళ్ళ వయసులో ఇక జీవితంలోంచి వెళ్ళిపోవాలనుకున్నారట. అరవై ఏళ్ళు వచ్చేసరికి అసలైన జీవితం ఇప్పుడే మొదలైంది అన్నారట! ఇక్కడ అరవై ఏళ్లకు చేరుకుంటున్న కవి మనోభావాలు కూడా ఆశనిరాశలవలయంలో చలిస్తూ ఉంటాయి. గ్రౌండ్వల్లో ఉండి తనను తాను ఆవిష్కరించుకుంటున్నారు. రోజువారీ డైరీ రాసినట్లు, సందర్భాలను బట్టి ఈ కవితాశిల్పాలను మనసుపెట్టి చెక్కారు. అందుకే కవిని చదువుతూ మనల్ని కూడా అందులో చూసుకోవచ్చు.

4

కవి మనోరీతిని ఈ కవితల్లో చూడవచ్చు :

"ఈ లోకంలో ఏమన్నా బ్రతికితే, చిన్నపుడు బ్రతుకుతాం, మిగిలిన జీవితమంతా బదులు చెల్లిస్తాం, కాసిని శైశవక్షణాలు అనుభవించినందుకు ఇంత బదులుతీర్చడం అవసరమా అని అడుగుతావు దేవుడిని, ఉండీ, లేనివాడిని, లేకుండడంలో దాగినవాడిని, జవాబురాదు, బ్రతికావు కదా కాసిని రోజులో, నిమిషాలో, శుభ్రమైన పసిదనంలో, స్వేచ్ఛలో, భయరహిత క్షణాల్లో, ఏదీ గుర్తుండని కాంతిలో, చెల్లించి వెళిపోవా మిగిలిన బరువైన రోజుల్ని". ఇలా కవే తనను బ్రతిమాలుకుంటూ, సంవేదనను అనుభవిస్తూ, భారమైనా సరే మిగతా జీవితం గడపాలి అంటాడు. ఇదంతా భయావహ ప్రపంచం అంటాడు.

"జీవించడం అసౌకర్యమైన అనుభవం, పీడకలలవేళ దేహం కూడా కదిలినట్లు, జీవితం నుండి మరణంలోకి నిన్ను నీవు బ్రతిమాలుకుంటావు" అని తనను మరణంలోకి లాక్కొంటాడు. మనుష్యులతో తనకు సంబంధం లేని క్షణాల్లో ప్రపంచం తటాలున విశాలమవుతుంది అంటాడు. మనుషులు తనకేమీ కాని క్షణాలు, వారు తన చేతనలోకి చొరబడని క్షణాలు అద్భుతం అంటాడు. ఉన్నచోటును విడిచి లోపలికి వెళ్ళకుండా, బయటకి రాకుండా తనలోని భయమే తనను అడ్డుకుందని వాపోతాడు. దుఃఖపు తేనెపట్టు పిండి, జీవితం చప్పరించాలని చూశారట, కానీ చివరకు విషాదమే మిగిలింది అని వేదన చెందుతారు.

తెలియకపోవడంలోని హాయిని పసిపాప తేలికగా అనుభవిస్తుంది, తెలియటం కదా ఇంత దుఃఖానికి మొదలు అని విచారం వ్యక్తం చేస్తారు. రాత్రులు నిదురించే ముందు దైవాన్ని ఇది కడపటి నిద్ర కావాలని ప్రార్థిస్తారు కవి. "విసుగుపుట్టే రోజున తెలివిలేని సినిమాకు వెళ్ళినట్లు తీరికగా చేరుతావు ఈ లోకంలోకి, ఇది బాలేదు, అయినా వెళ్ళలేవు, అట్లాగని ఉండాలన్న ఉబలాటం లేదు” అని తన మనోస్థితిని ఆవిష్కరించుకుంటారు.

కవి బ్రతికి ఉన్న క్షణాలు, తన జీవితంలో తనకు హాయిని, ఆశ్చర్యాలను ఇచ్చిన అద్భుతాలని కూడా ఇలా వట్టుకుంటాడు :

పున్నమి చంద్రుడు నెమ్మదిగా ఎగురుతున్నపుడు, ఇంద్రధనువులు రంగులని విరజిమ్ముతున్నపుడు, ఉదయపు వెలుగు, పిట్టలు పాడడం, లేళ్ళు గెంతడం, పిల్లలు నవ్వడం, యవ్వనం ప్రేమించుకోవడం, సెలయేళ్ళు ప్రవహించడం, సూర్యుడు కాంతిని విరజిమ్మడం, అమ్మ బిడ్డతో దోబూచులాడడం, తనతో తాను హాయిగా నవ్వుకున్నపుడు, తన బిడ్డను కడుపారా కావలించుకున్నపుడు, ఆజన్మాంతం గాలిపటంలా ఎగిరే ఆకాశాన్ని చూసినపుడు, ఎండ పాడుకునే సన్నటి నేపథ్య సంగీతం విన్నపుడు, చేపల్లా ఈదే రాత్రులను, పగళ్ళను చూసినపుడు, ఇట్లాంటపుడు తాను మృత్యువును దాటాను అంటాడు.

వాన కురిసినప్పుడు తనకు తాను దక్కుతారట! ఎడతెగని వాన తనను కాగితపు పడవ చేసి ఎటైనా తీసుకపోతే బాగుంటుందని ఎదురుచూస్తాడు. ఉదయాలు బంగారాన్ని వెదజల్లింది తన ప్రశాంతమైన చూపు కోసమే కావచ్చు అంటాడు. ఉదయం గడ్డిపరకపై వాలిన మంచుబిందువు, దానిలో ఆడుకుంటున్న రంగులు, ఏవీ పట్టకుండా ఓ బైరాగిలా ఊరిలో, తన ఇంట్లో తిరుగాడే క్షణాలుంటే అద్భుతమంటారు. ఇలాంటివి తాను బతికున్న క్షణాలకు గుర్తులుగా ఉన్నాయంటాడు.

కవి తనను తాను ఓదార్చుకుంటున్న క్షణాలు :

నీలోంచి నవ్వు వస్తే రానివ్వాలి, భయం పుడితే పుట్టనివ్వాలి, పూలు రాలుతుంటే రాలనివ్వాలి, సీతాకోకలని ఎగరనివ్వాలి, గాలి వీచినట్లు సహజంగా, నీరు పారినట్టు సరళంగా జరగనివ్వాలి, వెళ్ళనివ్వాలి. తేలికగా ఉండాలి, తెలియనట్లు ఉండాలి, ప్రపంచాన్ని తన కల కననివ్వాలి, పెద్దగా గొడవపడేదేం లేదు ఇక్కడ, అంతగా నిలబెట్టుకోవాల్సింది కనరాదు, కాలం గడిచిందా లేదా అన్నట్లుండాలి, స్థలమొకటుందా లేదా అనుకోవాలి, ఊరికే కదలాలి, మాట్లాడాలి, అలసటతో హాయిగా నిద్రపోవాలి, కడపటిబిందువు ఎదురైనపుడు తృప్తిగా దానిలో లీనం కావాలి.

అనుకునేంత భయావహం కాదు, ఊరికే ఉండు కాలువలో నిశ్శబ్దంగా పారే నీటిలా, బ్రతకాలని చూడకు, పోవాలని కూడా, ఉండటమే చాలు, అంతకన్నా నీ నుండి ఈ గాలి కోరేదేమీ లేదు అని ఓదార్చుకుంటారు. మనమా బ్రతికేది, వెళ్లిపోయేది, జీవితం తనను తాను చూసుకుంటుంది, నమ్మకం లేకపోతే నీలాకాశం కిందికి వెళ్ళి చూడు విప్పారిన నేత్రంతో నిన్ను చూస్తూ నీకు నమ్మకాన్ని ఇస్తుంది అని తనకు తాను ఓదార్చుకుంటూ తేలిక పడతారు .

మృత్యువు గురించి ఇలా వివరిస్తారు :

“చూస్తూ ఉండగా కాలం చివరికొస్తుంది, పలుసంధ్యలు పూలలా రాలిపోతాయి, పలు చందమామలు ఉదయాల్లో కరిగిపోతాయి, ప్రేమ నిండిన నవ్వులు తడి నిండిన బంధాలు, చూస్తూ ఉండగా పొడిబారిపోతాయి, కాలం చివరికొస్తుంది, కలలు చివరికొస్తాయి, దుఃఖాలు చివరికొస్తాయి, బ్రతుకు భయం చివరికొస్తుంది, స్వర్గమో నరకమో తెలీని ప్రపంచానుభవం ముగింపుకొస్తుంది, చూస్తూ ఉండగా గాఢమైన దిగులులోంచి కాంతివంతమైన మృత్యుపుష్పం నీ ముందు దయగా విచ్చుకుంటుంది”. ఇంకోచోట “ఈ మృత్యువు ఇంత విశాలమైనది, శబ్దాల పక్షులూ, రంగుల చేపలూ సంచరించే జాడైనా లేని పరమ చల్లనిశాంతి గుండెలకి హత్తుకుంటుంది” మృత్యువుని ఇలా కాంతిగా, శాంతిగా వర్ణించడంలో కవి వైరాగ్యాన్ని కొత్త టోన్ లో ప్రకటిస్తున్నారు.

ఈ కావ్యంలోని కవితలన్నీ చదివాక, కవి తాను నిర్మించుకున్న ప్రత్యేకలోకంలోకి మనల్ని తన వెంట తీసుకెళ్లి, తన దుఃఖాన్ని, భయాల్ని, తన సంతోషాన్నీ, తాను బతికిన క్షణాలను, తన ప్రేమగీతాలను, తన ఆత్మను మనకి నిర్మొహమాటంగా విప్పి చెప్పి మనల్ని సహానుభూతికి లోను చేస్తారు .

5

కవి తనను తాను ఆవిష్కరించుకున్న కావ్యం ఇది. ఒకరకంగా ఇది కన్ఫెషన్ స్టేట్మెంట్. ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ జీవితేచ్ఛతో లేచే ప్రయత్నం. మనుష్యులు, మనసులేని మరోలోకంలో విహరించాలని కవికి బలంగా ఉంది. ఊగిసలాట నుండి స్థిరత్వానికి వెళ్ళిపోవాలనే కాంక్ష అంతర్లీనంగా బలంగా ఉంది. సాధారణంగా కవిత్వంలో తాత్వికత ఉంది అంటారు. కానీ, ఈ కవిలోని తాత్వికకాంక్షనే ఈ కవిత్వాన్ని ఓ నెపంగా ఎన్నుకుని కావ్యమై ప్రవహిస్తున్నది. 

అందుకే ఈ కవిత్వం మొత్తం ఈ కొస నుండి ఆ కొస వరకు ఏదో అశాంతి. ఆ అలజడిని తిరిగి శాంతిలోకి తీసుకువెళ్లాలనే తపన, ప్రయత్నం కనిపిస్తుంది. మళ్ళీ అశాంతి. ఇది పరంపరగా కొనసాగుతుంది. ఎప్పడికప్పుడు ఇలా తన మూడ్స్ రికార్డ్ చేయడం కవి నిజాయితీని చెబుతుంది.

ఎందుకు జారిపోతుంటాము?

లోపల ఉన్న వాసనలు (లేటెంట్ టెండెన్సీస్), అలవాట్లు, భయాలు, ఐడెంటిటీ, ఆలోచనలు, వ్యక్తిత్వకాంక్ష, కొనసాగాలనే ఇచ్ఛ ఇవన్నీ స్వేచ్ఛలోకి, విముక్తిలోకి దూకాలనే కాంక్షను అడ్డుకుంటాయి. స్వస్థితిని మరుపుకు లోను చేస్తాయి. కేవలం ఇక్కడ కవికే కాదు, అనేకానేక మహాసాధకులకి కూడా ఆ అనుభవం దొరికినట్లే దొరికి జారిపోతుంటుంది.

ఎందుకంటే, కన్స్ట్రక్టెడ్ ఇగో దట్ ఈస్ ద అప్పారెంట్ ఐ, విచ్ ఆల్వేస్ ట్రెస్ టు లివ్ ఇన్ సెపరేషన్, యాజ్ సపరేట్నెస్ ఈస్ ఇట్స్ డియరెస్ట్ ఫుడ్. ఇన్ సెపరేట్నెస్, ద ఫాల్స్ ఇగో ఎంజాయ్స్ ద టేస్ట్ ఆఫ్ డిఫరెన్స్ టు కంటిన్యూ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. నీవు, నేను; చావు, పుట్టుక; అహం, భయం; రాగద్వేషాలు; బంధం, విముక్తి. ఇలా పరంపర కొనసాగుతుంది. అయితే తపన, ఆర్తి కలిగినవాళ్ళు రెడీనెస్లో ఉన్నవాళ్ళు ఎన్నిసార్లు జారిపోయినా, కింద పడ్డా పట్టు వదలరు. తనలోని మలినాన్ని తొలగించుకోవడానికి, పదేపదే ప్రయత్నిస్తారు. తనను తాను లోలోపలికి చూసుకుంటారు. తనలోని శాంతిని అడ్డుకున్న తెరలను తొలగించుకుంటారు.

తనకు తాను తయారుచేసుకున్న ఈ నేను (ఇగో) అనే మనోనిర్మాణాన్ని కరిగించుకోవడం ఓ మహాతపస్సు. అది కరగడానికి ఇష్టపడదు. పోవడానికి అసలే ఇష్టపడదు. భయాన్ని, అభద్రతను ఎగదోస్తుంది. కళ్ళకు గంతలు కడుతుంది. మన అసలు తావును మరపులోకి తీసుకెళ్తుంది.

విముక్తి అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడడం. కన్ఫ్యూషన్ క్లారిటీగా మారడం. అహం మాయమవడం. దుఃఖానికి లోను కాకపోవడం. భయం నుండి విముక్తి చెందడం. ఎరుకతో ఆ అనుభవంలో ఉండడం. సదా వర్తమానం అనుభవంలోకి రావడం. విముక్తి అనేది ఎక్కడో లేదు, అది ఇపుడు ఇక్కడే నాలోనే ఉందని, నేనై ఉందని తెలుసుకోవడం.

ఇక అప్పుడు ఆలోచనలుండవా? ప్రపంచం ఉండదా? కుటుంబం ఉండదా? ఉన్నదంతా సత్యమే. ఎప్పటిలాగే అన్నీ ఉన్నట్లు ఉంటాయి. అందరూ ఉన్నట్లు ఉంటారు. కానీ ఏదీ నిన్ను అంటదు. చేయాల్సినవి అన్నీ చేస్తావు, కానీ నీవు చేసినట్లుగా ఉండవు. లేస్తావు, పొలానికెళ్తావు, పంట పండిస్తావు, తింటావు, పడుకుంటావు. ఎప్పటిలాగే కుటుంబంతో ఉంటావు, నవ్వుతావు, ఏడుస్తావు, అన్నీ చేసినట్లుగా ఉంటావు, కానీ ఏమీ చేయవు. పాత్రోచితధర్మం నిన్ను నడిపిస్తుంది. పాత్రోచిత రియాక్షన్ ఉంటుంది.

భేదం కేవలం ఉన్నట్లుగా ఉంటుంది, కానీ ఆ భేదం వల్ల దుఃఖం ఉండదు. ఎందుకంటే ఆ భేదం నాటకీయమైనది. ఏకత్వం అనే తెరమీద నటించే పాత్ర అది. కంటిన్యుటీ తాడు తెగిపోతుంది. కంటిన్యుటీ ఉన్నట్లుగా ఉంటుంది, కానీ కలలాగా ఉంటుంది. ఉన్నది నీవే, జరుగుతున్నట్లు అనిపిస్తున్నదంతా నీలోనే అని తెలుస్తుంది. మేలుకున్న తరువాత కల నిన్ను అంటనట్లుగా, ఏవీ నీకు అంటవు. ఎప్పుడూ ఏమీ జరగలేదు అనే అనుభవంలో ఉంటావు.

ఇది ఆలోచననో, ఊహనో కాదు, వాటి ప్రమేయం ఏమాత్రం లేని నీ ఉనికి. శరీరంలో నేను ఉన్నాను అన్న స్థితి నుండి నాలో శరీరం ఉంది అనే షిఫ్ట్ జరిగి శరీరానికి ఎడంగా అవుతావు. శరీరం మనస్సును సృష్టించదు, మనస్సే శరీరాన్ని సృష్టిస్తుంది అని అర్థమవుతుంది. ప్రపంచంలో నేను ఉన్నాను అనే స్థితి నుండి ప్రపంచం నాలో ఉంది అనే షిఫ్ట్ ను చూస్తావు. గతం కలలాగా ఉంటుంది. మూడు కాలాలు, స్థలాలు 'నేను' అనే తెర మీద వచ్చి పోతున్నట్లుగా ఉంటుంది. తేలిక. బరువు ఉండదు. ఇది నీకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని వివరించడానికి అవసరానికి పదాలు వాడుతావు గానీ, పదాలలో అది ఇమడదు అని తెలుస్తుంది. అందుకే నీలో నీవు నవ్వుకుంటావు. ఉంటాయి. కలగా నీవు ఎరుకతో ఉండడం కాదు, ఎరుక నీతో ఉంటుంది, నీవై

ఉంటుంది. నీలో పొంగే కరుణ, ప్రేమ నీ ప్రయత్నం లేకుండానే విప్పుకోవడం చూస్తావు. విముక్తి అంటే ఏదో కొత్తగా సాధించేది కాదు, అంతవరకు నిన్ను కప్పివేసిన మాలిన్యతెరలు ఏవో తొలగిపోవడం, హృదయం శాంతితో నిండడం. నీవు సదా మార్పు లేకుండా ఒక్కలాగే ఉన్నావని, మార్పు అంతా నీ మీద వచ్చి, పోతున్నది కానీ అది నీవు కాదని తెలుస్తుంది.

తన పైన ప్రవహిస్తున్న ప్రసాద్ అనే వ్యక్తిని తొలగించుకోవడానికి

అనేక ఎత్తుపల్లాలను, దుఃఖాలను, అనుభవాలను చూసిన కవి చివరకు "బోనులో సింహం ఆకలితో లొంగినట్టు, జీవితానికి లొంగి చూడు" అంటాడు. "సమస్తాన్ని దేవుడినీడలా ప్రేమిస్తున్నావు" అంటాడు. ఈ భావన గొప్పది. టోటల్ యాక్సెప్టెన్స్ అండ్ సరెండర్ అనేది గొప్పయోగం. అది జారకుండా ఉండాలని, ఆ కాన్స్టాంట్ అవేర్నెస్తో కవి ప్రయత్నం, జీవితం, సాధన సఫలం కావాలని, ఆ నిర్మలశాంతి తీరంలో ఆయన నిరంతరం సేద తీరాలని మనసార కాంక్షిస్తూ!

ఏ . గంగారెడ్డి
హైదరాబాద్
11.11.2025



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి