24 జనవరి 2012

మీరు కవిత్వ ప్రేమికులై, మనశ్శాంతిని కలిగించగల కవిత్వం కావాలనుకొంటే ఆకాశం చదవండి.





'ఆకాశం' కవిత్వం అతి సున్నితమైన జీవన స్పర్శ నుండీ, ప్రగాఢమైన తాత్విక చింతన నుండీ వ్యక్తమైంది. దీనిని నేను పాఠకుడికి కేవలం కావ్యానందం ఇవ్వటం కోసం కాని, ఈ కాలం సాహిత్య వాతావరణం లో బాగా ప్రచారం లో ఉన్న సామాజిక, రాజకీయ స్పృహ తో కానీ రాయలేదు. వాటికి పైనున్న ఒక ఉదాత్త లక్ష్యంతో రాసాను.

ఇటువంటి కవిత్వం రాయటానికి కవికి జీవితంపట్ల ఎటువంటి  గౌరవమూ, శ్రద్ధా  కావాలో, తనలోకి తాను నిష్కపటంగా పరిశీలించుకోగల శుభ్రమైన దృష్టి కావాలో, పాఠకునికీ అటువంటి శ్రద్ధా, దృష్టీ కావాలి. అటువంటివారు ఏ దేశకాలాలకీ, జీవన విధానాలకీ చెందినవారైనా, మాయపొరల వెనకాల ఉన్న తమ స్వచ్ఛమైన ప్రతిబింబాన్ని ఈ కవిత్వంలో దర్శించి ఆశ్చర్యపడతారు.  

ఇటువంటి కవిత్వాన్ని మార్మిక కవిత్వం గా పిలవటం సాహిత్య ప్రపంచం లో వాడుక. అంటే జీవన మౌలిక సత్యాలను వెదికేది, అనుభవం లోకి తెచ్చే ప్రయత్నం చేసేది అని. టాగోర్, సూఫీ కవులు, కన్నడ శివకవులు, కొన్ని సందర్భాలలో మన అన్నమయ్య, వేమన, పోతన లు, ఖలీల్ జిబ్రాన్ ఈ తరహా కవిత్వం రాసిన వారిలో కొందరు. జపాన్ కు చెందిన హైకూ కూడా ఇటువంటి కవిత్వమే.

ధ్యానమంటే సమగ్రమైన, సంపూర్ణమైన స్పందన అని అనుకొంటే, దీనిని ధ్యానకవిత్వంగా కూడా భావించవచ్చు.

కవినో, కవిత్వాన్నో తెలుసుకోవటం కోసమో, కాలక్షేపం కోసమో కాకుండా, మీ హృదయం నిజంగా జీవితానుభవాల వల్ల బరువెక్కి ఉంటే, మీ మనసే మీకు అర్థంలేని గీతలతో, మరకలతో నిండిన కాగితంలా కనిపిస్తూ, అసహనానికి గురి చేస్తుంటే, జీవితం ఏమిటి, ఎందుకు వంటి ప్రశ్నలు లోలోపల ఎక్కడో ముల్లులా గుచ్చుతూ ఉంటే, ఈ కవిత్వం తప్పక చదవమని చెబుతాను.

ఇది తప్పక మీలో ఒక ప్రశాంతమైన వెలుతురునీ, నెమ్మదినీ, నిజమైన వివేకంతో నిండిన ఆలోచనా శక్తినీ, అతి సహజమైన జీవనానందాన్నీ మేలుకొలుపుతుందని నమ్ముతున్నాను.


ఆకాశం కవితాసంపుటి దొరికేచోట్లు:
హైదరాబాద్: నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ
విజయవాడ: మైత్రి బుక్స్, ఏలూరు రోడ్ 
కర్నూలు: విశాలాంధ్ర బుక్ సెంటర్
నిజామాబాద్: కీర్తి బుక్‌స్టాల్, బస్‌స్టాండ్
పోస్టులో కావలసిన వారు: పాలపిట్ట బుక్స్, 040-27678430
ఇంటర్నెట్ ద్వారా కావలసినవారు: kinige.com 

18 జనవరి 2012

బుద్ధుడు స్థల కాలాలను దాటిన నేల, బుద్ధగయ

నాకు తెలిసినంత వరకూ, ఏ నమ్మకాలతోనూ, భయాలతోనూ సంబంధం లేకుండా సత్యాన్వేషణ ను ప్రపంచానికి పరిచయం చేసినవారు గౌతమ బుద్ధుడు.

సత్యం ఒకటే అయినా, అది అనేక దేశ కాలాలో అన్వేషకుల చేత, జ్ఞానుల చేత అనేక రకాలుగా వర్ణించబడింది. సత్యం వర్ణనకూ, ఆ మాటకు వస్తే మనస్సుకీ అందనిదని వారే చెబుతుంటారు. నాకు అర్ధమైనంత వరకూ, సత్యానుభవం లేదా సత్యస్ఫురణ అత్యంత నిర్మలమైన, ప్రశాంతమైన మనస్సుకి తెలుస్తుంది. స్వచ్చమైన నీటికి రంగు లేనట్లు, స్వచ్చమైన సత్యానుభవానికీ ఏ భావనా స్థితీ ఉండదు. అయితే ఇందరు జ్ఞానులు ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పారు. చెప్పినవన్నీ భావాలనుండి విముక్తి పొందటానికే కాని, క్రొత్త భావాలను కల్పించు కోవటానికి కాదు. మనస్సు అమనస్సు కావటానికి, ఎన్ని ఉపాయాలు అవసరమో అన్నీ ఎవరో ఒకరు, ఏదో ఒక కాలంలో చెబుతూ వచ్చారు.

మనలో చాలామందికి మతానికి, సత్యాన్వేషణ కూ భేదం తెలీదు. మతం ఏదైనా కొన్ని భయాల, నమ్మకాల, అలవాట్ల సమాహారం. సత్యాన్వేషణ, జీవితం పట్ల తీవ్రమైన శ్రద్ధ గలవారి మార్గం. మతం సామాన్యులకు జీవితం సాఫీగా సాగేందుకు అవసరమైన కొన్ని పద్ధతులను నేర్పుతుంది. కాని మతం నమ్మమంటుంది, భయపడమంటుంది. సత్యాన్వేషణ ప్రశ్నించమంటుంది, మరింత కాంతివంతమైన ప్రేమలోకి మేలుకోమంటుంది. ప్రతి మతం లోనూ, సామాన్యులూ, అన్వేషకులూ ఎవరిదారిన వారు నడుస్తూ ఉంటారు.

నిన్ను నువ్వు అత్యంత సన్నిహితంగా పరిశీలించుకో, నీ లోపలి ప్రపంచాన్ని నిజాయితీగా, భయం లేకుండా గమనించు. నిన్ను నువ్వు సరిగా పరిశీలించుకొంటే చాలు, క్రమంగా నీ లోపలి సంక్లిష్టత అంతా మాయ మౌతుంది. నువ్వు నీ లోతుల్లోకంటా భయరహితంగా ఉన్నపుడు, జీవితం పట్ల నువ్వు ఉదాత్తంగా స్పందించ గలుగుతావు. నువ్వు సజీవమైన ప్రేమతో నిండుతావు. అప్పుడు నీవలన ప్రపంచానికి నిజమైన మేలు జరుగుతుంది, నువ్వు ఉండటమే ప్రపంచానికి దీవెన అవుతుంది. దీనినే ఉపనిషత్తులూ, బుద్దుడూ, జీసస్ ఇంకా అనేక మహాత్ములు చెప్పారని, నాకు అనిపించింది.

అటువంటి మహాత్ముడు ఒకప్పుడు సంచరించాడని, నమ్ముతున్న నేల బుద్ధగయ. వారికి ఇక్కడే సత్యస్పురణ కలిగిందని ప్రజల నమ్మకం. స్థల కాలాతీతమైన సత్యాన్ని, దర్శించిన వారిని, అటువంటి సత్యం లో తమను లీనం చేసుకొన్నవారిని, స్థలకాలాలకు లోబడిన మనం, వాటి ద్వారానే గుర్తిస్తాం, గుర్తుపెట్టుకొంటాం. ఇది ఒక విరోధాభాస లా ఉన్నప్పటికీ, మనలో వారిపట్ల నిజమైన ప్రేమ ఉంటె, వారు సంచరించిన ప్రదేశాలలో, ఇంకా వారి ప్రేమపూర్వక శ్వాస ఏదో చరిస్తున్నట్లు అనిపిస్తుంది. వారి పిలుపు మరింత గాఢంగా వినిపిస్తున్నట్లుంటుంది.

అన్ని ఫొటోలనూ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.