08 ఏప్రిల్ 2023

ఊరికే కవిత్వమై.. ముక్కామల చక్రధర్





"తెలియటం నుండి తెలియకపోవటంలోకి దూకాలి
ఏదో ఒకటి కావటం నుండి ఏదీ కాకపోవటంలోకి "

అవును... ఒడ్డున కూర్చుని నదిలో స్నానమాడుతున్న వారిని కాదు చూడడమంటే. నది లోతులు కొలిచేందుకు అందులోకి దూకాలి. అదే జీవితమంటే. అలాంటి జీవితమే కావాలంటూ ఊరికే జీవితమై బతకాలి అంటున్నాడు ఈ శుద్ధ కవిత్వ ప్రేమికుడు బి.వి.వి.ప్రసాద్‌. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్న కవి తిలక్‌ పుట్టిన ఊరు తణుకు నుంచి వచ్చాడు ఈ కవి బి.వి.వి. ప్రసాద్‌. మహాకవులు, మంచి కవులు పుట్టిన ఊరు నుంచి కనీసం ఒక మంచి కవైనా రావడం తెలుగు సాహిత్య "ఊరు వారసత్వం". అలా తిలక్‌ కు వారసుడు ఈ బి.వి.వి. ప్రసాద్‌ అనిపించింది అతని ఊరికే జీవితమై కొత్త సంకలనం చదువుతూంటే...

"జీవితంలోకి దూకకుండా ఉత్త జీవితాన్ని చూసావా" అని నిలదీస్తున్నాడు ఈ కవి సమస్తలోకాన్ని. బహుశా అలా జీవితంలోకి చూడలేని కాలం ప్రారంభమై చాలా కాలమే అయ్యింది. నిజానికి ఈ బిజీ బతుకుల్లో ఎలాగోలా జీవించడం తప్ప జీవితాన్ని ఉత్త జీవితంలా చూసిన వాళ్లు కానరాని లోకం ఇది. అలా చూస్తే... చూడగలిగితే ఇక ఏ జీవితమూ మిగలకపోవచ్చు. ఆ ఏరుకలో ఉన్నారు కనుకనే మానవులంతా పక్క వారి జీవితాలనే కాదు.... తమ జీవితాలను చూసుకునే స్ధితిలో లేకుండా పోయారు. అలా చూడండర్రా అంటున్నాడు ఈ అమాయకపు కవి. చూడలేరని తెలిసి కూడా.

ప్రపంచ సాహిత్యాన్ని పరికిస్తే కవులంతా అమాయకులే. అదేంటో తెలుగు నీళ్లో.... అతి తెలివితేటలో చెప్పలేం కాని తెలుగు కవులు మాత్రం మాయకులు. కవిత్వం కాని దాన్ని కవిత్వంగా చెలామణి చేసేస్తారు. లేదూ చేయిస్తారు. అలా తెలుగు కవిత్వంలో అకవుల సంఖ్య నానాటికి పెరిగిపోయింది. నిత్యం పెరిగిపోతోంది కూడా. మనం రోజూ చూసే మనిషే... నిత్యం మనకు ఎక్కడో ఒకచోట తారసపడే వారే ఉగాది పండుగ రాగానే కవుల్లా కనిపిస్తారు. వీరిని పోల్చుకుందుకు గతంలో వారి చేతిలో కవిలికట్టలు ఉండేవి. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లే కనుక ఎవరు కవో, ఎవరు సాధారణ మానవుడో తెలుసుకోవడం చాలా కష్టం.

తామరతంపగా పెరిగిపోతున్న కవుల సంఖ్యలో శుద్ధ కవిత్వాన్ని వెతుక్కోవడం, ఆ కవిత్వాన్ని ఆస్వాదించడం ఈ రోజుల్లో చాలా కష్టం. అందుకే ఎవరైనా నేను కవిని అంటే భయపడే రోజులు వచ్చాయి. అలా అన్న వారి నుంచి కాసింత దూరం జరగడం కవిత్వం చేసుకున్న ప్రారబ్దం. కానీ, ఈ కవి బి.వి.వి. ప్రసాద్‌ కవిత్వం అందుకు మినహాయింపే కాదు కవిత్వాభిమానులకు ఓ ఊరడింపు. విద్యార్ధి దశ నుంచే కవిత్వాన్ని ప్రేమించిన బి.వి.వి. ప్రసాద్‌ కవిత్వం కోసం చిక్కటి వెలుగు నీడలు చూశాడు. తన వెంట తరిమిన వియోగాల్ని అనుభవించాడు. అందుకేనేమో ఊరికే కవిత్వమై మిగిలాడేమో.

" అనేక క్షణాలుగా కనపడే ఒకే ఒక్క క్షణం ఇది
దానిని అనుభవిస్తున్నట్లు ఉంటుంది గానీ
అది నిన్నూ, నన్నూ, లోకాన్ని
అనుభవిస్తూ, పలవరిస్తూ చలిస్తోంది "

అంటాడు. ఇదిగో ఇలా చలించడం కోసమే మహాకవి శ్రీశ్రీ ఒక్కడై శ్రుక్కిన రోజులు అనుభవించాడు. అందుకే చలం కూడా అనుభవించి పలవరించమన్నాడు. ఎవరి జీవితాలను వారు పుటం పెట్టుకుంటే తప్ప ఊరికే జీవితమై బతకలేమని తెలుస్తుంది. బహుశా తన ఇంటి పక్కనే ఉన్న గోదావరి అలలు అలలుగా తనలోకి ప్రవేశించడం.... రోజుకు పది గంటలకు పైగా కోళ్ల మందుల వాసన కొట్లో కూర్చునే ప్రసాద్‌ కు జీవితపు మట్టి వాసన తెలియడమే ఇదిగో ఇలా కవిత్వమై పరిమళించింది.

నా ఇష్ట కవి ఇస్మాయిల్‌ వెళ్లిపోయిన తర్వాత ఆ బెంగను గాలి నాసరరెడ్డి కాసింత తీర్చాడు. కాని తర్వాత కాలంలో ఉద్యోగమో, జీవికో తీసుకొచ్చిన కష్టాల కారణంగా కవిత్వ "గాలి" తగ్గింది. ఇస్మాయిల్ కవిత్వాన్ని పట్టుకున్నామన్న కవులు తెలుగులో చాలా మందే ఉన్నారు. కాని చాలాకాలం తర్వాత ఆ కవిత్వ ఆత్మను రుచి చూపించిన కవి బహుశా బి.వి.వి. ప్రసాద్ మాత్రమే. లేత అరటాకు చివర మెరుస్తున్న మంచు బిందువులా ఉంటుంది ప్రసాద్‌ కవిత్వం. " ఎన్ని రాస్తే సీతాకోక ఎగిరిపోయిన ఖాళీలవుతాయి" ఇదే కదా కవిత్వమంటే. ప్రసాద్‌కి కవిత్వ రహస్యం తెలుసు. ముఖ్యంగా పదాలను ఎంత వొద్దికగా రాయాలో, వాడాలో తెలుసు. చలం అన్నట్లు ఎకానమీ ఆఫ్‌ థాట్స్ కంటే ఎకానమీ ఆఫ్‌ వర్డ్స్ లేకపోవడం దేశభక్తి కంటే హీనమైన పాపమనే ఎరుక బి.వి.వి.లో శుద్ధ కవిత్వమంత ఉంది. పెదాల తడి తాను కాల్చే సిగరెట్ కు ఎక్కడ అతిగా అంటుకుంటుందో అనే భయమే ప్రసాద్‌ కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తుంది. కవిత్వ ప్రేమికులకు ఈ ఏడాది దొరికిన ఓ మంచి కవిత్వ సంకలనం ఊరికే జీవితమై.....

( ఆదివారం ఖమ్మంలో కవి బి.వి.వి.ప్రసాద్ కవిత్వ సంకలనం ఊరికే జీవితమై ఆవిష్కరణ సందర్భంగా)

- ముక్కామల చక్రధర్‌. 99120 19929

ప్రచురణ: చక్రవాకం, విశాలాంధ్ర 8.4.2023

ఊరికే జీవితమై.. Dr LK సుధాకర్



తాత్విక చింతన తనకు తానుగా ఈ కవిని ఆలింగనం చేసుకుందా....లేక ఈయనే తాత్వికతను నేననే వెదుకులాట లో భాగంగా తన సహచర మిత్రుడి గానో మిత్రురాలిగానో మార్చేసుకుని, మనలాంటి సహజ మానవుడికి మల్లే మన మధ్య మామూలుగా తిరిగేస్తున్నాడా!!??....

మొత్తం కవిత్వమంతా నేను లోంచి పుట్టిన అన్వేషణ. ఏ ఖండిక కి ఆ ఖండిక, జీవిత వాచకం లో దాచుకున్న నె మలీక. ఇదిగో ఇన్నేళ్ళ వయసొచ్చాక....ఇల్లు సద్దుకుంటుంటే, దొరికిన చిన్నప్పటి వాచకాన్ని చాచుకున్న కాళ్ళమీద పెట్టుకుని మురిసిపోతూ చూసుకుంటున్నాడీ కవి.

'తోచిన మాటలేవో వడబోత లేకుండా మాట్లాడుతున్నాడు' అదొక అపురూపమైన కవిత్వ శకల మై మన చుట్టూ విరబూసిన శూన్యం లా పరుచుకుంటూంది.

మాట్లాడుకోవడం చేత కాక యుధ్ధాలు చేసుకునే మనుషుల గురించిన మెలకువ ఉన్నవాడు....కనుకనే ఆకాశం నుంచి ఆకాశాన్ని తీసేసినా ఆకాశమే మిగులుతుందని గుర్తు చేయగలుగుతున్నాడు. ఇదీ మళ్ళీ తనకు తానే గుర్తు చేసుకునే ఒకానొక భావన. కానీ అది విశ్వజనీన భావోద్వేగం కావడం తో నువ్వూ నేనూ సైతం పాలుపంచుకుంటాం.

మోయాల్సిన సంపదలు లేక కావచ్చు... వాళ్ళ తీరిక నిండా తేలిక దనం. ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం కవిత్వపు పదును తెలుసుకోవడానికి.

గొప్ప వాక్యం ముందు మోకరిల్లే మనుషులు గా పాఠకుల్ని , వారిలోని తాత్విక ప్రపంచాన్ని తట్టి లేపే శుభ్రమైన వాక్యాల కవితా సంపుటి ఈ....ఊరికే జీవితమై....

"దూడని నాకే తల్లి"....ప్రతీక రెండు సార్లు వేర్వేరు కవితల్లో ఉండడం తప్ప....పలుకు రాళ్ళు లేని స్వచ్ఛమైన కవిత్వ పుస్తకం ఇది

'మనుషులు కాలవలో నీటిలా వెళ్లిపోతూ ఉంటారు
ఈ కవి మాత్రం ఒడ్డున నిలబడి
నీటిపైకి నీడని పరుచిన చెట్టుకి మల్లే'
తన కవిత్వ పలవరింతలతో....

జీవితాన్ని తాత్విక దర్పణం లో ఎప్పటికప్పుడు నూతనం గా దర్శిస్తూ ఉంటాడు.....రండి ...మనమూ అందులో కి తొంగి చూసుకుందాం.....మన జీవితం మనకి మళ్ళీ పరిచయం అవుతుంది.

ప్రచురించిన 'ప్రేమలేఖ'కి మరోసారి కృతజ్ఞతలు....

Dr LK Sudhakar 

ప్రచురణ : కవితా 72. ఏప్రిల్ 2023

27 మార్చి 2023

ఊరికే జీవితమై ఆవిష్కరణ

ఊరికే జీవితమై ఆవిష్కరణ సభ 9.4.23 సాయంత్రం ఖమ్మం లో జరగనుంది. 

ఆసక్తి ఉన్న మిత్రులు తప్పక రాగలరు.



06 మార్చి 2023

ఉద్వేగాల లోతుల్లోని ప్రశాంతతని కవిత్వం చేస్తాను : బివివి ప్రసాద్ . పలకరింపు

 

    'నేను' అనే సముద్రం లోంచి పుట్టిన అలల ఉధృతి లాగా ఈ ప్రపంచం నీ చుట్టూ పరచుకుంటుంది. స్వరూపం వేరైనా స్వభావం ఒక్కటే అని అనాది సత్యం హోరుమని కాలపు అంచుదాకా ఎగసిపడుతుంటుంది. ఉల్లిపాయ పొరల్లాగా ప్రశ్నని వొలుచుకుంటూ పోతే, అది బయల్దేరిన మూలం లోనే సమాధానమూ దొరుకుతుంది. ఇంత గొప్ప జీవితానుభవమూ మనిషి లోని ద్వంద్వాలను కలిపి ఏకం చెయ్యలేకపోతుంది. ఉన్నది ఏది, లేకున్నా ఉన్నట్టు భ్రమింపజేసేది ఏది, ఉనికికి ఆధారం ఏది అనే వెదుకులాట ఒక్కోసారి వాక్యాలుగా బహిర్గతం ఔతుంది. 'ఊరికే జీవితమై' పాఠకుల ఎదురుగా కవిత్వమై ప్రత్యక్షం ఔతుంది. అంతశ్శోధనా ధోరణిలో సాగిన ఈ కవిత్వం గురించి కవి బివివి ప్రసాద్ నుండే మరికొంత తెలుసుకుందాం.
 
- స్వాతికుమారి బండ్లమూడి

ఈ కవితల్లో చాలావరకు ఒక అంతర్లీనమైన తాత్విక ధోరణి కనిపిస్తుంది. ఇది కవి స్వభావంలో నుంచి సహజంగా వచ్చి చేరినదా లేక ముందే అనుకున్న కొన్ని అంశాలను కవిత్వ పరంగా చూపించే ప్రయత్నం కొంత ఉందా?

    కవి స్వభావం నుండే కవిత మొదలవుతుంది. స్వభావం పైన తాను అనుకునే వాటి ప్రభావం ఉంటుంది. అందువల్ల రాసే క్రమంలో కొన్నిసార్లు అనుకునేవి కూడా పాయలుగా కలవవచ్చు.

    కవితని అలావుంచి, తర్వాత వాక్యాన్నే ముందుగా ఊహించటం అరుదు. తోసుకువచ్చే ఒక వాక్యం కవిత రాబోతోందని తెలియచేస్తుంది. వీలులేక, రాయటానికి సిద్ధపడనపుడు అది మాయమైపోతుంది కూడా.

    కవితని ఓపెన్ చేసిన ఉద్వేగం, తనంత తానే వికసిస్తూ, తన ముగింపు వరకూ ప్రయాణిస్తుంది. తొలి పాఠకుడిలా దానిని చూస్తూ ఉంటాను.

    కొన్ని కవితలని edit లేదా rewrite చేస్తాను. లోపలి పాఠకుడికి బావుంది అనిపించే వరకూ, లోపలి కవి కవితని దిద్దుతూ ఉంటాడు. బావుంది అనిపించటం ముఖ్యం, ఏం రాయదలిచాను కన్నా. నమ్మనిదీ, కాంతిని ఇవ్వనిదీ ఎట్లాగూ రాయదలచలేదు గనక.

నేనెవరు అనే ప్రశ్న, ఏ వస్తువుకి తనదైన ఉనికి లేదనే సమాధానం, ఏదైనా ఉండటానికి వెనక, లేకపోవడానికి తర్వాత ఉన్నదేమిటి అనే సత్యాన్వేషణ.. ఇవన్నీ మీ కవిత్వం లో వచ్చి చేరడం వెనక నేపథ్యం ఏమిటి?

    జన్మతః introspection బలమైన అంతర్భాగం కావటం వల్ల, ఊహ తెలిసిన నాటినుండీ, నాకు నాదైన ఉనికి లేదా అనే దిగులో, నిండుదనం లోపించిన వెలితో లోలోపల సాంద్రంగా పనిచేసి ఉంటుంది. ఆ వెలితి నుండి బయటపడే ప్రయత్నంలో భాగంగా శ్రీ రమణమహర్షి మాటలు చదివినపుడు, నేనెవరు అనే ప్రశ్న తప్పించుకోలేనిదిగా ఎదురైంది.

    రూపాలకి అతీతమైన substance రూపాలని తెరమీది బొమ్మల్లా చూపిస్తుందని లీలగా తెలుస్తూ వుంటుంది. నేను రూపాన్ని కానా, ఆ substance నేనా, అసలు ఉన్నది నేను మాత్రమేనా అనేది అన్వేషణ.

    కవిత్వంలో అన్వేషణ చేరిందా, అన్వేషణలోనే కవిత్వం చేరిందా. రెండూ ఒకే సారానికి భిన్న రూపాలా. చూడాలి.

రోజువారీ సమస్యలను, ఉద్వేగాలను, సంఘర్షణలను దాటి మీరు చూపించిన ఈ భావనలు ఒక స్థాయి/ తరహా పాఠకులకు మాత్రమే ఉద్దేశించినవి అనుకోవచ్చా?

    వాటిని దాటి కంటే కూడా, వాటి లోపలి కంటా చూసి అనవచ్చునేమో. ఏ వాక్యమూ సార్వజనీనం కాదు, అలా తోచేవి కూడా అంతిమంగా వైయక్తిక స్థితి, స్థాయిని బట్టి అవగాహనకీ, అనుభవానికీ వస్తాయి. ఏ కవి అయినా, అటూ ఇటుగా తనలాంటి పాఠకులనే ఉద్దేశించి రాస్తాడేమో. రాసేటపుడు నాకూ నాలాంటి మనిషితో మాట్లాడుతున్న భావమే ఉంటుంది.

ఈ తరహా కవిత్వం రాయడానికి ప్రేరణ ఏమిటి? ఈ పద్ధతిలో/ ఇటువంటి అంశాలపై మీరు చదివిన ఇతర కవితలు ఏవైనా ఉన్నాయా?

    లోచూపుకి తోచే విషయాల్ని రికార్డ్ చేసుకోవాలనిపించటమే ఈ తరహా కవిత్వానికి దారి తీసింది. చదువుకున్న కవిత్వం తక్కువ. తొలినాళ్ళలో టాగోర్, ఖలీల్ జిబ్రాన్ లని చదివాక ఇలా రాసుకోవచ్చు అనే స్పష్టత వచ్చింది. ఇస్మాయిల్ని చదవటం అభివ్యక్తికి మరికొంత దోహదం చేసింది. హైకూని శ్రద్ధగా సాధన చేసిన ప్రభావం ఉంది. 'ఆకాశం' సంపుటి నాటి నుండి రాస్తున్నవి ఎవరి ఛాయల్లేని నావైన వాక్యాలు అనుకుంటాను.

    సాధారణంగా కవులు ఉద్వేగాలని తట్టడానికీ, మేల్కొల్పడానికీ కవిత్వం రాస్తారు. నాకది discomfort గా తోస్తుంది. ఉద్వేగం లేనిది కవిత్వం లేదు. అయితే, నాకు ఉద్వేగాల లోతుల్లోని ప్రశాంతతని కవిత్వం చేయటం ఇష్టం. సాంద్రమైన ఉద్వేగంతో నిండుగా ఉన్నపుడే ఆ ప్రశాంతత తెలుస్తుంది. తొలి సంపుటి ఆరాధన నుండి ఈనాటికీ అలాంటి మూడ్ లో నుండే కవిత్వం రాయటం అలవాటైంది.

చేపలా

సముద్రంలోని చేప
ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి
మళ్ళీ సముద్రంలో పడినట్టు
ఒక్కొక్కసారి అనంతంలోకి ఎగిరి
మళ్ళీ ప్రపంచంలో పడతావు

గాల్లోకి ఎగిరినపుడు
గాలి అందని చేపలాంటి నువ్వు
ఊపిరిపీల్చే ఆటలో పడి
ఊపిరాడట్లేదంటావు

జీవితావసరా లేవీ వద్దు,
ఉత్త జీవితం కావాలని విలపిస్తావు.

కలలో అమ్మ లేక ఏడుస్తున్న
ఒడిలోని బిడ్డని తల్లి తట్టి లేపినట్టు
నిన్నెవరో ఇప్పుడు జీవితంలోకి తట్టిలేపాలి

(బివివి ప్రసాద్ 'ఊరికే జీవితమై' సంపుటిలోంచి ఒక కవిత)

(ప్రచురణ : వివిధ, ఆంధ్ర జ్యోతి దినపత్రిక 13.02.2023)


#BVV Prasad, #Telugu Poetry, #oorike jeevitamai, #బి‌వి‌వి ప్రసాద్, #తెలుగు కవిత్వం, #ఊరికే జీవితమై

మరికొన్ని మాటలు..

    నలభై యేళ్ళ స్నేహం కవిత్వంతో. ఇక ఇది ముగింపుకు వచ్చిందేమో తెలీదు. కవిత మళ్ళీ పలుకుతుందో, లేదో తెలీదు. కాలేజీ కాలపు ఉద్రేకాలతో నా మీదికి దూకి, ఉక్కిరిబిక్కిరి చేసాక, తెలియరాని వెలితి వల్ల లోచూపులోకి మలుపు తిరిగాక, తెలియని సత్యాన్నీ, తెలిసీ, తెలియని జీవితాన్నీ, తెలుసనుకొంటున్న మనిషినీ తడుముకుంటూ, గ్రహిస్తూ, విస్మరిస్తూ, నేర్చుకుంటూ, విడిచిపెడుతూ పట్టరాని ఆనందమో, దుఃఖమో, దిగులో, భయమో, వెలితో, నిరాశో, ప్రేమో, ఆశ్చర్యమో కమ్మినపుడల్లా, వాటి నీడలేవో ఇక ఊరికే కూర్చోనీయని క్షణాల్లో రాయడం మొదలు పెట్టి, రాయడంలోంచి లోలోతుల్లోకి మునుగుతూ, కవిత ముగింపుతో పైకి తేలుతూ, రాసింది సరిచూసుకుంటూ, నన్ను నేనే మనిషిగా, కవిగా చెక్కుకుంటూ, ఇస్మాయిల్‌ అన్నట్టు, దీన్ని నేను నడిపిస్తున్నానో, నన్ను ఇది నడిపిస్తుందో తెలియకుండా సాగిన విభ్రాంత సమయాల కవిత్వ స్నేహం ఇక ముగిసిందేమో, తెలీదు. ముగిసిందనుకోవటంలో తోసుకువచ్చే ప్రేమ వుంటుంది, కొనసాగుతుందనుకోవటంలో భరోసా ఇచ్చే ఉదాశీనత ఉంటుంది.
. . .
    చాలాసార్లు ఆగాను, మళ్ళీ చాలాసార్లు నడిచాను ఈ స్నేహంలోకి. ఆగినపుడల్లా నేర్చుకుంటూనే ఉన్నాను, బహుశా, తెలియకుండానే. కవిత్వం అంటే ఏమిటో, వస్తువు ఏదో, శిల్పమేదో, మనిషి ఏమిటో, మనస్సు అలజడి ఏమిటో, జీవితమంటే ఏమిటో, ఈశ్వరుడంటే ఎవరో, సత్యమంటే ఏమిటో, సౌందర్యం ఏం చేస్తుందో తడుముకుంటూనే, వేసట పడుతూనే, మరింత సాంద్రతలోకి, లోతులోకి, విశాలత్వంలోకి నన్ను నేను విడిచిపెట్టుకుంటూనే ఉన్నాను. నేను అంటే మనసు, మనసు అంటే భయం, వెలితి, దుఃఖం, ఆరాటం. మనసు అంటే ఎక్కడుందో తెలియకనే, నేనుగా ఆవహించి, నన్ను ఉక్కిరిబిక్కిరి చేసే మృగతృష్ణ. దీనినుండి బయటపడాలి. దీని ఉపకరణాల నుండి విడుదల పొందాలి. గొప్ప శాంతిలోకి, తేజస్సులోకి, ప్రేమలోకి మేలుకోవాలి. ఇలాంటి లోలోపలి వత్తిడి ఏదో నన్ను ఇంత దూరం నడిపింది. దూరం నిజంగా ఉందా. దూరమంతా ఊహ మాత్రమేనా. కాలమైనా నిజమేనా, కల మాత్రమేనా. ప్రశ్నలు, జవాబులు, సందిగ్దతలు. ఇవన్నీ నిజమా, కల్పనా. ఇవన్నీ ఎవరికి నిజం లేదా ఎవరి కల్పన.
. . .
    కొన్ని చదివి ఆశ్చర్య పడ్డాను, కొందర్ని చూసి కూడా. ఈ రాతలు, ఈ జ్ఞానులు నిజమేనా. బహుశా, నిజమనే నమ్మాను. బహుశా, నిజం కావాలని నమ్మాను. ఏదో ఒకటి నిజం కాకపోతే ఏదీ ఆలంబన. దేనికి ఆలంబన, ఎందుకోసం. మనస్సే తనని తాను మెడపట్టి గెంటలేదని అర్థమైంది అనుకొన్నాను తొలినాటి రాతల్లో. నిజంగా అర్థమైందా. అర్థం కాలేదా నిజంగా. ఇన్ని రాతల తర్వాత, నేను మొదలైనచోటనే ఉన్నానా, మొదలే లేనిచోటికి చేరుకున్నానా. ఒక తెలియనితనం కమ్ముతోంది. కమ్ముతోందా, దానికి నేను లొంగుతున్నానా. తెలియనితనంలోని హాయి మాత్రమే, నిశ్చింత మాత్రమే నిజమా. తెలుసు నుండి విడుదల పొందటానికే ఇంత వేసట పడ్డానా. బాల్యం అమృతకాలం. దేవుడు ఊరుకోక తనని జీవిగా చేసుకొన్న తొలి వేకువ సమయం. మళ్ళీ బాల్యంలోకి, మళ్ళీ ఏమీలేనితనంలోకి వెళ్ళటానికి ఎంత దుఃఖం, ఆరాటం, అలసట, ఘర్షణ. ఎన్ని భ్రమావరణాల సంతోషాల, బాంధవ్యాల, అభిరుచుల, అలవాట్ల, నమ్మకాల మొరటుదనాల నుండి బయటపడాలి దీనికి. ఎంత భాషనీ, సమాచారాన్నీ, సంస్కృతినీ వదిలించుకోవాలి, ఎన్ని భయాలని ప్రేమలోకి డీకోడ్‌ చేసుకోవాలి. అన్నీ వదిలించుకుని వచ్చి, ఎంత అమాయకత్వంలోకి ఊపిరి పీల్చుకోవాలి.
. . .
     భాషకి విరుగుడుగా రాసుకొన్న భాష ఈ కవిత్వం. శబ్దాలనుండి నుండి నిశ్శబ్దంలోకి జారిపోవటానికి చెక్కుకున్న మాటలు ఈ కవిత్వం. మనస్సునేను నుండి లేనినేనుకి లేదా ఉన్ననేనుకి చేసే దీర్ఘయాత్ర ఈ కవిత్వం. ఇది నాలోంచి పలికినప్పుడు, బహుశా, కేవలం నాకోసమే పలికిందేమో తెలీదు. ప్రియమైనవారెవరో చెవిలో చెప్పిన మాటల్ని, బజారులో పంచుకొన్న వెర్రివాడిలా, ఈ మాటల్ని లోకంలోకి జారవిడుచుకున్నానేమో తెలీదు. మీకు జీవితం అర్థం కాకపోతే మీ కవిత్వం చదువుకోండి అని స్నేహితురాలు అన్నట్టు, నాకైన మాటల్ని నేను వినటం మాని, ఇలా పలుకుతున్నానేమో తెలీదు. పలికానా, పలికాయా. ఏ శక్తులో అత్యల్పమైన మనస్సుని వెదికి, వశం చేసుకుని, దానిద్వారా ఈ మాటలన్నిటినీ పలుకుతుందేమో. చాలాకాలం తర్వాత, నా రాతలు నేనే చదువుకుని, ఇతను ఇలా ఎలా ఊహించాడు అని ఆశ్చర్యపడే క్షణాల్లో, రాసింది నేను కాదనిపించడంలో నిజముందేమో తెలీదు.
. . .
    నేనే రాశాననుకొంటే, బడాయిగానో, బేలగానో, ఇవి దేశ, కాలాంతరాల్లో ఉన్న నాలాంటి వాళ్ళకి రాసుకొన్న ప్రేమలేఖలు అని చెప్పవచ్చును. చదివినవారూ అక్కడే ఆగి, కవిత్వానికి అటువైపు నుండి ఇటు వున్న కవితో స్నేహం చేయబోతారు కూడా. కానీ, ఒక గొప్పవాక్యం ముందు మోకరిల్లే మనుషులుంటారు. రాసినవారో, చదివినవారో. వారికి మాత్రమే ఆ వాక్యంలోకి, దాని అర్థమిచ్చే వెలుగులోకి ప్రవేశించటం తెలుస్తుంది. వారికోసం ఈ గాలి నిండా, ఆకాశం నిండా శుభ్రమైన వాక్యాలు పసిదేవతల్లా ఆడుకొంటూనే, వెదుకుతుంటాయి. అవి కొన్నిసార్లు అనుకోని మలుపులో అక్షరాలుగా కనబడవచ్చు, అనుకోని క్షణంలో అంతరంగంలోనే మెరవవచ్చు. వారు ఆ మెరుపులోంచి అనంతంలోకి మాయంకావచ్చు.

    ఇంత అద్భుతమైన మెరిసే మాయవస్త్రాల తెరల లోంచి చిరునవ్వే జీవితానికి నమస్కరిస్తూ..

బివివి ప్రసాద్‌, తణుకు
2.2.23 10.15 రాత్రి

(ఊరికే జీవితమై.. కి ముందుమాట)


#BVV Prasad, #Telugu Poetry, #oorike jeevitamai, #బి‌వి‌వి ప్రసాద్, #తెలుగు కవిత్వం, #ఊరికే జీవితమై

ఊరికే జీవితమై.. బివివి ప్రసాద్ కవిత్వ సంపుటి

ఊరికే జీవితమై.. 

బివివి ప్రసాద్ 2016 - 2022 మధ్య రాసిన 75 కవితల సంపుటి వచ్చింది.

జీవితం పట్ల లోచూపుని కలిగిస్తూ, 

సాంద్రమైన నిశ్శబ్దాన్ని అనుభవానికి తెచ్చే, 

ఊరట నిచ్చే కవిత్వం కోసం తప్పక చదవండి.



పేజీలు : 134, వెల : రూ. 150 

ప్రతులకు :

బివివి ప్రసాద్ : 90320 75415

నవోదయ, హైదరాబాద్ : 92474 71362 

అనేక, విజయవాడ : 92472 53884 

నామాడి శ్రీధర్ : 93968 07070 

https://www.telugubooks.in/products/oorike-jeevitamai

https://logilitelugubooks.com/book/oorike-jeevitamai-b-v-v-prasad


#BVV Prasad, #Telugu Poetry, #oorike jeevitamai, #బి‌వి‌వి ప్రసాద్, #తెలుగు కవిత్వం, #ఊరికే జీవితమై