25 జూన్ 2026

మరేమీ కాదు ఒట్టి ప్రేమ సారమీ కవిత్వం : మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్

సీతాకోకఒకటిఎగురుతూ ఉంటుందిమనంఉన్నచోటే. దానిని పరికించే మనసు ఎంతమందికి ఉంటుంది. దానికి కొంత సున్నితత్వం కావాలి. ప్రకృతిని చూసి పరవశించే మెత్తదనం ఉండాలి.దానితో మమేకమయ్యే స్వభావం ఉండాలి. అదో ధ్యాన స్థితి.విషయీ విషయాల ఏకత. హైకూ కవిత్వానికి ఇదే మూలవనరు. దానిని దాటి,సీతాకోక రావడానికి ముందు శూన్యాకాసాన్ని అది వచ్చి వాలి తారాడిన క్షణాలను, ఎగిరిపోయిన తర్వాతి శూన్య సౌందర్యాన్ని అద్వైతాంశతో కవిత్వం చేస్తున్నారు బివివి ప్రసాద్.

వీరి కవిత్వం నిండా, కవి తనను తాను తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది. దానికి కవి నిర్మించుకున్న వాతావరణం మానవ జీవితం పట్ల అపారమైన శ్రద్ధ,అవ్యాజమైన ప్రేమ, అనంతమైన దయ మరి ఏమీ కాదు ఒట్టి ప్రేమ సారమీకవిత్వం.అందుకే వీరి నుండి నిసర్గమయ్యే ప్రతి వాక్యం తాజాగా అప్పుడే పూసిన గులాబీల్లా గుబాళిస్తుంది.మనసుని ఓ మత్తుకు గురిచేసి ప్రశాంతతనిస్తుంది.

 ఇది మార్మిక కవిత్వం. నిజానికి కవిత్వం కళ అవుతుంది. మార్మికత కళకాదు. కానీ ఈ కవి మార్మికంగా కవిత్వం అల్లడం మనం గమనిస్తాం. ఇదో వినూత్న పంథా. ఆధ్యాత్మికత అంటే మన మూలాలను మనం తెలుసుకోవడం. ఎరుకతో జీవించడం ఆ అనుభూతి గాఢతలోనే ఈ కవిత్వమంతా సాగుతుంది. 

వీరి భావనా ప్రపంచం మాటల కందేది కాదు. మరి కవి ఎలా పద సృష్టి చేస్తున్నారు. కవితా వాక్యాలను ఎలా నిర్వహిస్తున్నారు. అనేది ఆసక్తి కలిగించే విషయం. ఆశ్చర్యంగా కోకొల్లలుగా వచ్చి వాలే సుతిమెత్తని "కాయిన్డ్వర్డ్స్" ఈ కవిత్వ వాక్యాలకు పుష్టినివ్వడం మనం గమనిస్తాం. ఉదాహరణకు చీకటి వరద, రంగుల కాంతి, ఏకాంత సంగీతం, పరాయి శబ్దం, విసుగు పురుగు, ప్రేమ తునక, తెలికాంతి, జీవితేచ్చవిత్తనం, చీకటి ద్రవం, ఖాళీ వెలుతురు, లోకపు చిటికెన వేలు మొదలైనవి.

వీరి కవిత్వం చదివి ఒక అనుభూతి గాఢతకి గురికాని వారు లేరు చదివినా మళ్లీ చదవాలనిపించే కవిత్వం అంతేకాదు కొత్త వాక్యాల కోసం చకోరకాల్లా ఎదురు చూస్తాం. ఇప్పుడదే తారసపడింది .మన ముందు ఈ కవిత్వ వాక్యం పుష్టిగా రెక్కలు కట్టుకువాలింది "సృష్టి"గా.ఈ పుస్తకానికి “రమణ జీవి”వ్రాసిన అభిప్రాయం “గంగారెడ్డి” గారి మాటలు ఈ కవిత్వం పట్ల చాలా క్లారిటీ ఇస్తాయి. దీనిలో మొదటి కవిత "సృష్టి" అనే శీర్షికతోనే ప్రారంభమవుతుంది .

"ఖాళీ మనసులో కొన్ని రంగులు ఒంపు/ అవి ఆకాశమూ గాలీ నీరూ/ కాంతీ, చీకటిలో వెన్నెలా/ రంగుల పై కొన్ని గీతలు గీయి/ నదులూ, కొండలూ, మైదానాలూ/ఉదయాస్తమయ,మేఘాలూ, పాలపుంతలూ/
కదలికలలో ఉద్వేగాలు కలుపు/ చిక్కగా లేతగా తీవ్రంగా,తేలికగా/మంచీ,భయమూ,బాధా,ప్రేమా/
ఇంతకన్నా ఊహించేదేమీ లేదు/ నువ్వైనా దేవుడై నా/మళ్లీ మొదటికి రావాల్సిందే/నిద్రలోనో మరణంలోనో జ్ఞానంలోనో.

ఈ కవిత మొదటి పంక్తుల్లో ఖాళీ మనసు శూన్యానికి ప్రతీక సృష్టికి ముందు స్థితి. ఎత్తుగడలోని ఆ ఖాళీ మనసుతో కాసేపు రమిస్తాం.ఆ శూన్య సౌందర్య అనుభవంలో కాసేపు ఉండిపోతాం. కవిత మొత్తం చదివి మరలా రెండోసారి చదవడం మొదలుపెట్టినప్పుడు కలిగే అనుభవం ఇది.

ఇప్పుడు అందులో కొన్ని రంగులు ఒంపమన్నారు కవి. ఎంత అందంగా సరళంగా ప్రారంభమయ్యింది ఈ కవిత్వ “సృష్టి"అవే పంచభూతాలన్నమాట. భూమిని 'చీకటిలో వెన్నెల' అన్నారు. జ్ఞానానికి ప్రతీక కాబట్టి.రంగులపై గీతలు గీస్తే నదులూ కొండలూ, మొదలైన స్థావరాలు ఏర్పడ్డాయట.గీతల్ని కొంచెం కదిలిస్తే చెట్లు పిట్టలూ మనుషులూ మొదలైన జంగమ ప్రపంచం నిర్మాణమైందట. ఇప్పుడు వాటికి ఉద్వేగాలు కలిపారు కవి. అవి చిక్కగా లేతగా బాధ ప్రేమ అయ్యాయట.చివరి వాక్యాల్లో కవి నిద్ర,మరణం, జ్ఞానం మూడిటిలో కూడా మళ్లీ మొదటికి రావాల్సిందే మనమైనా దేవుడైన అంటారు. ఇక్కడ ఈ మూడూ లయానికి ప్రతీకలు. అత్యంత నేర్పుతో గిజిగాడి ఊయల గీము నిర్మాణాన్ని తలపించేలా కదలాడే భావ చిత్రాలను మన ముందు ఉంచారు కవి బివివి.
 
"రంగుల పిల్లలు" అనే కవితలో.. రంగులు అమాయకమైనవి/ నలుపూ తెలుపుల్లా కలలు రాలి పోయినవి కావు/ పసిపిల్లలు ఉల్లాసంగా మేల్కొన్నట్లు ఉదయాన గగనంలో మేలుకుంటాయి"
 ఇంద్ర ధనువుల మీదుగా /సీతాకోకల రెక్కల మీదుగా పూలని చేరి/ నీ వైపు నవ్వుతూ దర్శనమిస్తాయి....
అని సాగే ఈ కవితలో కవి రంగులు మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, దుఃఖంలో మరలా నిలబడేట్టు వెన్ను తడతాయి. నలుపూ తెలుపూ అనే దుఃఖానందాల మధ్య ఆశని రగులుస్తాయి అంటారు. తర్వాత వాక్యాల్లో తెలియందేదో లోకంగా వికసించడం అని వేదాంతపరంగా లోకాన్ని నిర్వచించడం బాగుంది. ఆడింది చాలు, పడుకోండని అమ్మానాన్నల వంటి నలుపూ తెలుపులు పిలిచినపుడు, బొమ్మల్లాంటి మనని విసిరేసి ఏకైక మహాశాంతి లోకి జారిపోతాయి.
ఇక్కడ ఏకైక మహాశాంతి లోకి జారిపోయిన రంగులు మనల్ని ఏకైక శూన్యంలో తేలేలా చేసాయి. చివరి వాక్యాల్లో "ఇప్పుడు కలల్లోకి పాకుతూ వచ్చిన రంగులు/ నీతో ఏం మాట్లాడుతున్నాయి" అని ఉంటుంది 
ఇక్కడ 'అందరి నిద్రా ఒక్కటే అది ఏకైక శూన్యం' అక్కడ రంగులు మీతో ఏం అంటున్నాయి అని ప్రశ్నిస్తారు కవి 
నలుపూ తెలుపులు మన మూలాలకి, ఏకైక శాంతికి సంకేతాలు అక్కడి నుండి వచ్చిన మనం ప్రకృతికి అద్దిన రంగులనే ఆశల వలన జీవిస్తూ ఉంటాం. సత్యం బోధపడ్డాక వాటిని వాటిగానే యథార్థ స్థితిలో చూడగలుగుతాం.ఈ కవితా శిల్పం కవి ప్రతిభకు గీటురాయిగా చెప్పవచ్చు. 

"పుట్టినరోజున"అనే కవిత లో 
     "ఇవాళ నీకు నువ్వే గుర్తుకొస్తుంటావు/ ఉదయం పూలూ చినుకులూ రాలినట్లు/ ఒకనాడు ఇక్కడకు రాలావు/వాటికి కరిగి మాయమైపోవడం తెలుసు/ మరి నీ సంగతి అంటారు ఎవరో?... అని సాగే ఈ కవితలో కవి ఎంత సున్నిత వాక్యాలతో ప్రారంభించారు కవితని. మనిషి పుట్టుకలోని సహజత్వాన్ని ఇంత మృదువుగా ఉత్ప్రేక్షించిన కవిని ఇంతకు మునిపెన్నడూ మనం చూడము.

సృష్టిలో ప్రతి జీవి ఎంత సహజంగా వచ్చిందో అంత సహజంగా జీవించి వెళ్ళిపోతుంది.మరి మానవుడు, ఇదే ప్రశ్న కవి వేశారు " మరి నీ సంగతి అంటారు ఎవరో? ఆ 'ఎవరో 'అనడంలోనే వాక్య బలం రెండింతలు అయింది.
ఈ కవితలో బతుకుని నైరూప్య చిత్రమనీ నిర్వచించి అర్ధాల ఇరుకునుండి ఎంత విముక్తమయితే అంత సారవంతం అవుతుందని ఎంత స్వేచ్ఛ లోకి మేలుకుంటే అంత ఆర్ద్రతలోకి వికసిస్తుందని జీవనమాధుర్యాన్ని ఎలా చవిచూడాలో పాఠకుడిని శిశువుగా చేసి మరీ కవిత్వపు ఉగ్గుపడుతున్నారీ కవి. 

నైరూప్యఛాయాచిత్రణ లో చిక్కబడ్డ అద్వైతం ఈ కవిత్వం
"ప్రేమ ఉంటే" అనే కవితలో ప్రేమ ఉంటే పెద్దగా చెప్పడానికి ఏమీ ఉండదు/ మాటలన్నీ మంచు ముక్కల్లా ప్రేమలో కరిగిపోతాయి/పూలరంగులు వెలుగుతాయి/ నక్షత్రాలు అనంతాన్ని విరబూస్తాయి/ స్పర్శ జీవితాన్ని సారవంతం చేస్తుంది. కవి ఇక్కడ ఓ మాట అంటారు "జీవుల చూపుల సారం ప్రేమ కోసం ఎదురుచూపు. భయాలు కోరికలు ప్రేమ దక్కక చేసే వెర్రి పనులు" ఇది మానవాళికి అందాల్సిన ఓ అద్భుతమైన 'మోరల్ స్టేట్మెంట్'. నిజమే కదా లోకంలోని సమస్త సమస్యలకు దుఃఖాలకి సరిపడా ప్రేమ లేకపోవడమే కారణం. అనంతమైన ప్రేమలోకి ఒక్కసారి మేల్కొనగలిగితే బాధలు అన్నిటికీ ఉపశమనం దొరికినట్టే.      
 
'అద్వైతం'అనే మరో కవితలో 
సాంద్రమైన స్వచ్ఛమైన ఒక జీవితానుభవం చాలదా బ్రతుకంతా వెలగడానికి అంటారు. పాఠకుడు తాను కూడా లోతుగా మౌనంలోకంటూ మేల్కొంటే గాని ఈ కవిత్వం ఒంటపట్టదు.
 
"ఒకరికొకరు" అనే కవిత ఉంది.రెండవ భాగంలో
 ఆమె ముఖంలోకి చూసేటపుడు/అతని ముఖంలో చలిమంట వెలుగుంటుంది/ చల్లని గాలుల పూతరేకుల శబ్దాలుంటాయి /వెన్నెలలో వినిపించి ఆగే పిట్ట పాట ఉంటుంది/చినుకుల్లో మాయమయ్యే ఇంద్ర ధనువులుంటాయి అంటారు.

ఇక్కడ పిట్ట పాట ఆగిన తర్వాత, ఇంద్రధనువు మాయమైన తర్వాత, కలిగే సౌందర్యానుభవం చాలా గాఢమైనది. కాలాల కావలి నిశ్శబ్దంలోకి మనల్ని జారిపోయేలా చేసే సుతి మెత్తని వాక్యం. 

"ఉత్తప్రేమ" అనే కవితలో 
పూవు విచ్చుకోక ముందు దానిలో దాగిన చీకటి/సీతాకోక రంగుల ఆటలకి ముందు దాగిన చిక్కని ఏకాంతం/మధుర గానానికి ముందు సవరించుకునే కంఠధ్వని/ జీవితం ఉత్త ప్రేమ/ దుఃఖమంతా రహస్యం రాల్చిన ఎండుటాకులు. అందుకే ఈ కవిత్వం ఉత్త ప్రేమ సారం 

"లోపలికి" అనే కవిత లో 
కొలతలకి లొంగకు లెక్కల నుండి ఎగిరిపో/లొంగనట్టు కనబడడానికి కూడా.... అప్పుడు మేలుకుంటావు/ నిశ్శబ్ద రహస్య ప్రశాంత తటాకం ఒడ్డున..... కొంచెం తడిగా ఉండటం మినహా/ ఇక్కడ వేరేది చేయదగింది లేనట్లుంది. మన అసలుని మనకు అప్పగించే మాటలు ఇవి. ఇంకా ఇంత ప్రపంచం అతనికి/ రాలుతున్న ఎండుటాకు పాటి కాకపోవచ్చు. 
ఇక్కడ అవ్వచ్చు అనడానికి ఎలా నిర్ధారిస్తారు కవి అది కావచ్చు కాకపోవచ్చు కాబట్టి కాకపోవచ్చు వాడారు కవి. ఎంత సమయోచిత ఉపమానమిది. చివరిగా "బహుశా అతనే నీలా ఉన్నాడు/ ఇప్పుడు నువ్వు చేయాల్సింది/ ఏమైనా మిగిలి ఉందా ఇక్కడ.
 ఏమి ప్రశ్న వేదాంతానికి పరాకాష్ట.మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అలవోకగా అత్యంత సహజంగా వచ్చి చేరే ఉపమానాలు అభివ్యక్తి కి మంచి బలాన్ని ఇచ్చాయి.

"వాన రాత్రి" కవిత 
వాన చప్పుడు ఒడిలో వాలి మనుషులు సుఖంగా నిద్రిస్తున్నారు/ తమ వారు అనుకుంటున్నా వారి మధ్య భద్రంగా/ఎప్పటికీ ఇలానే ఉంటామని కలలు కంటూ.

మనిషి లౌకికలంపటంలో పడి అదే శాశ్వతం అన్న భ్రాంతిలో బతికి అలాగే వెళ్ళిపోతాడు.కానీ ఒంటరిగా ఈ లోకంలోకి వచ్చిన వాడు సమూహంలో జీవిస్తూ చివరికి ఒంటరిగా వెళ్లాల్సిందే. ఈ లోపులో సుఖాలు దుఃఖాలూ, వేదనలూ, ఆనందాలూ, ఉద్వేగాలూ వీటితో సహచర్యం చేస్తూ ఒక స్పష్టత లేక ఇంత విలువైన జీవితం నిస్సారంగా గడిపేస్తాడు.  

జీవితానికి ఒక స్పష్టత అవసరం. కొన్ని మౌలిక ప్రశ్నలవసరం. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము?ఎందుకు జీవిస్తున్నాము? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఈ ప్రశ్నలకు ఊరట ఈ కవిత్వం. కవిత చివరి వాక్యాలను శిల్పించిన తీరు అమోఘం.

"కలలు కంటావు"
 కొన్ని కలలు కంటావు ఉదయాన పూలపై వాలిన నీరెండవి అయినట్లు ఎంత చిక్కని వాక్యం అంతేనా ఆ వాలిన ఎండ ఎవరో కాదు మనమే, కలగంటూ ఆ తాజాదనపు ప్రశాంత అనుభవాన్ని మనకు ఇస్తుంది. ఇక్కడ కలనిజంగా నువ్వు కనాలి లేదా ఊహలోనైనా జీవించాలి.తాథాత్యము చెందాలి. అప్పుడే ఈ కవిత చదివిన పాఠకుడు ధ్యాన ఫలితాన్ని పొందినట్లు. సీతాకోక సృష్టించే కొత్త శూన్యమైనట్లు. 
కవి ప్రయోగించిన వాక్యం పాఠకుని అనుభవంలోకి తేగలిగే వాతావరణాన్ని ఇవ్వగలగాలి. 

"ఉద్వేగాల నుండి"
ఉద్వేగాలని అడవిలోని వృక్షాలుగా వృక్షాల నుండి జాలువారే కిరణాలుగా కిరణాల్లో మిల మిలలాడే సెలయేళ్లుగా సెలయేళ్లలో దప్పిక తీర్చుకునే కీటకాలూ పక్షులుగా ఉత్ప్రేక్షించడం సముచితంగా కొత్తగా ఉంది. 

" దయ నుండి" ....
ముందుగా శబ్దం ఉందని వారంటారు కానీ ముందుగానే దయనుండి ఆకాశం పుట్టిందని దయగల ఆకాశం నుండి సమస్తము పుట్టాయని సృష్టికి కొత్త నిర్వచనం ఇచ్చారు బివివి ప్రసాద్. సృష్టి ఆవిర్భావం దయతో జరిగిందని అక్షరాల దయను వర్షింప చేస్తారీ కవి.

" జీవనోద్వేగం" 
   ఈ కవిత జీవితం పట్ల ఒక స్పష్టతను కలిగిస్తుంది. " ఇంత విశ్వం" అనే కవితలో ఇంత విశ్వం నిన్ను జీవితంలా చిలికి నీ నుండి శాంతి అనే వెన్న తీస్తుంది.అంటారు" కాస్త ఆశలోకి"...జీవితాన్ని గురించి కవి, ఈ కవితల వెలువరించిన తీరు అతి సరళంగా అత్యంత కవితాత్మకంగా ఉంటుంది మనలో ఆశని మేల్కొల్పే కవిత ఇది. మెత్తని పూలరేకులు లాంటి శబ్దాలు,చక్కటి ఊహలు ఈ "సృష్టి" కవిత్వం.
"ప్రాతః కాలపు పొగ మంచును చూసావా/ సాలె గూటి పై పొందికగా ముత్యాలు పేర్చుతుంది/ అవి ఎండలోకి రంగులు చల్లుతూ మాయమవుతాయి/ ఊరికే మంచు బిందువులా నిలిచి మాయం కావాలి" అంటున్నారు ఎంత నిర్మలం ఎంత కోమలం చెట్ల ఆకుల వెనుక ఆకాశాన్ని గుర్తించటం కవి దార్శనికత కి నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి ఊహలు కోకొల్లలు ఈ పుస్తకం నిండా.

“మోహం”అనే కవితలో 
జీవితం మీద ఇంత మోహం ఏమిటి అంటారు ఏ రోజైనా వెళ్లిపోయే విరక్తి ఉంది గనుక అంటావు.
చివరి వాక్యాల్లో “నువ్వు ప్రేమించేది దేనినో చెప్పమంటారు/ దేనిని ప్రేమిస్తున్నానో నాకు తెలియదు/బహుశా ఈ వెలుగునీడల కదలికల్లో/ నన్ను నేనే పొందుతున్నాను/ దాచుకుంటున్నాను/ జీవితం ప్రియురాలు రూపంలో/నన్నే చూసుకుని ఆశ్చర్యపోతూ, ప్రేమిస్తున్నాను”.
ఈ కవితలో ప్రేమ అయితే ఉంది గాని అది దేని మీద తెలియదు అంటారు అవును హృదయంలో ప్రేమ ఉండటం ప్రధానం దేని మీదో చెప్పగలిగితే అది పరిమితం అయిపోతుంది. అది అవధులు దాటాలి, పరిధి విస్తరించి విశ్వవ్యాపితం అవ్వాలి.

"జాగ్రత్త" అనే కవితలో 'మృత్యువు లోపలి కరుణ' అని కవి చేసిన వాక్య ప్రయోగం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మృత్యువును దయారహితంగా భావిస్తాం. కానీ కవి మాత్రం మృత్యువు లోపలి కరుణను దర్శించే అరుదైన నూతన సంస్కారాన్ని మనలో మేల్కొలుపుతున్నారు. 

"సృష్టి"కవిత్వం విసిరిన సౌందర్యపు చెణుకులు కొన్ని.. 
1. కవి జీవితం రహస్యాలు ఎంతకీ అర్థం కావని చెబుతూ 'ఎంతకీ పగలని కొబ్బరికాయలా' అని చమత్కరిస్తారు. 
2. మిత్రుడు వెళ్ళ వలసిన రైలు లేటుగా టైముకే వచ్చి నిలబడింది. 
3. కలలో అందమైన మొహాన్ని మెలకువలో వెతకబోయినట్లు 
4. సాయంత్రపు గగనంలో చివరి రంగులు ఆగి, ఇంకెవరైనా చూసేవారు ఉన్నారా అని అడిగినట్లు 
5. పాత ఉద్యోగుల్లా వచ్చి వెళ్ళే ఋతువులు 
6. మీట నొక్కినట్లు వెలిగి ఆరే ప్రేమలు ఉద్వేగాలు 
7. నీడలు సంధ్యలో దీర్ఘమవుతూ మధ్యాహ్నాలు దాక్కుంటాయి 
8. టీ కప్పులో లేచే ఆవిరి లాంటిది జీవితం. 
9. తలపై బుడగలా ఎగురుతోంది గగనం 
10. రాలిపోయే ఎండుటాకు మరో క్షణం ఆగినట్లు 
11. కదలాడే నీటి బుడగపై తిరుగాడే బొమ్మ లాంటిది ప్రపంచం 
12. గోడలపై బొమ్మల రంగులు గతకాలపు పిల్లల్లా శాంతిగా చూస్తున్నాయి. 

ఇలాంటి 'ఎపిగ్రమేటిక్ అభివ్యక్తి' తో కూడిన వాక్యాలు కవిత్వం చదవాలనే ఆసక్తిని కలిగిస్తాయి. 
వారు చెప్పినట్లుగానే ఈ కవిత్వం మనల్ని మహా శాంతి లోకి జారిపోయేటట్టు చేస్తుంది. మరేమీ కాదు ఒట్టి ప్రేమ సారమీ కవిత్వం.

మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్ 
పార్ట్ టైం పరిశోధక విద్యార్థి 
ఆంధ్ర విశ్వ కళా పరిషత్, విశాఖపట్నం 
9441350260 
sriram9441350260@gmail.com

ప్రచురణ : సాహిత్య ప్రస్థానం జూన్ 2026

బి.వి.వి.ప్రసాద్ కవిత్వ పరిశీలన : మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్

 బి.వి.వి.ప్రసాద్ కవిత్వ పరిశీలన : మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్

వ్యాససంగ్రహం :-

ఈ వ్యాసం "మానవ జీవితం అనేక జీవితాలుగా కాక ఒకే జీవితంగా, ఉన్నదంతా ఒకే సారంగా భావించి కవిత్వం చేయడం బి.వి.వి. ప్రసాద్ కవిత్వ దృక్పథంగా గుర్తిస్తుంది". మనలో "ఎరుక/ఇంటెన్షనాలిటీ" ఒకటి ఉంటుంది. అది మన మూలాలకు చెందినది. దాని మూలకాలు ప్రేమ, దయ, శాంతి, ఓర్పు, మొదలైన మౌలిక భావనలు. ఇవే మనలను పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దేవి అని ఈ కవిత్వం ద్వారా స్పష్టం చేస్తుంది ఈ వ్యాసం. కవి వ్యక్తిత్వం లోని సున్నితత్వం, వినూత్న ధోరణితో కవిత్వం అల్లడానికి నిర్మించుకున్న వాతావరణం మరియు సహజ అనలంకారిక శైలి, అభివ్యక్తి నవ్యత మొదలైన విషయాలను ఆధునికత కలిగిన కవితా రీతిగా వివరిస్తుంది ఈ వ్యాసం, ఆధ్యాత్మికత లో వుండే సమర్పణ భావం విశ్వచైతన్యం పట్ల హైకూ ఏవిధంగా పాఠకుడిలో మెలకువ కలిగిస్తుందో చెబుతుంది ఈ వ్యాసం. "నేనే ఈ క్షణం" సంపుటిలో కవి మెటానమీ టెక్నిక్/పద చిత్రాలద్వారా ఏవిధంగా జీవన సారం, ప్రాకృతిక సౌందర్యం కవిత్వం చేసారో వివరిస్తుంది. 'ఆకాశం', 'నీలో కొన్ని సార్లు', 'ఊరికే జీవితమై', 'సృష్టి' సంపుటులు అందించిన తాత్వికానుభూతిని లోతుగా విశ్లేషిస్తుంది ఈ వ్యాసం. ఈ కవి కవిత్వాన్ని తమ సమకాలీన ప్రసిద్ధకవులు ఎలా ఆదరించారో రికార్డు చేయడం ద్వారా కవిత్వ పరిశీలనద్వారా బి.వి.వి. ప్రసాద్ కవిత్వంలోని నవ్యతను వివరిస్తుంది. విశ్లేషణాత్మక, వర్ణనాత్మక పద్ధతిలో ఈ పరిశోధన సాగింది. తాత్విక నేపథ్యమున్న భవిష్యత్ పరిశోధకులకు ఈ వ్యాసం ఉపకరిస్తుంది.

కీలక పదాలు :- మౌలిక భావనలు, తాత్వికానుభూతి, నూతన దృక్పథం, హైకూ, మెటానమీ టెక్నిక్, ఆకాశం, కొత్తదైన మెలకువ, ఎరుక, ఒక ఫిల్టర్. ప్రధాన స్రవంతి కి భిన్నంగా, అద్వైతాంశ.

2 :

బి.వి.వి. ప్రసాద్ కవిత్వ దృక్పథం

ఆధునికత/నవ్యత :
ఆధునికత :- "కవిత్వంలో ఆధునికత్వం అనగా స్వభావమును బట్టి ఆధునికత్వమే గాని కాలమును బట్టినది కానేకాదు" డా॥ సి.నారె. ఈ నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని బి.వి.వి. ప్రసాద్ కవిత్వంలోని నవ్యతను వివరిస్తుంది ఈ వ్యాసం.

సాహిత్య ప్రయోజనం సమాజ హితమే. అది ఏదో ఒక వాదమునకు పరిమితమైతే ఆ సమస్య మాత్రమే పరిష్కరించబడుతుంది. అది కూడా మంచిదే. కాని పరిపుష్టమైన, సమగ్రమైన సమాజనిర్మాణానికి మార్పు అనేది ముందు నీ నుండి రావాలని అంటారు బి.వి.వి. ప్రసాద్. మనలో తేలికదనము ఉండాలి, సరళత ఉండాలి. ఏ పని చేసిన ఏమి ఆలోచించినా దయ, ప్రేమ నింపుకొని చేయాలి అనే నూతన దృక్పథంతో వీరి కవిత్వం పరిమళిస్తుంది.

నువ్వు చెప్పేది ఏదైనా నీ అనుభవంలోంచి పలకాలి అన్న ఆర్.ఎస్.సుదర్శనం గారి మాటలు తూచా తప్పకుండా పలికాడు ఈ కవి.

ఐతే ఇతని భావజాలం, కవితా వస్తువులు, భావ చిత్రాలు, మర్మంగా లోతుగా అనుభవంలోంచి చెప్పడం ఒక నూతన కవితా రీతిని కలిగి ఉన్నాయి.

1) సహజ అనలంకారిక శైలి :
ఇప్పటి వరకూ ఫిగరేటివ్ లాంగ్వేజ్ / అర్నేట్ స్టైల్ చదవడానికి అలవాటు పడిన పాఠకుడు
ఒక్కసారిగా ఈ సహజ అనలంకారిక రచనా విధానాన్ని తీసుకోవడం కొంత కష్టమే కానీ ఇదే మన అసలు సహజ స్థితిని ఎరుక చేసే శైలి అని తెలుసుకున్నాక పాఠకుడు సాంత్వన పొందుతాడు. అంతే కాకుండా ఈ కవిత్వానికి అంకిత మయిపోతాడు.
ఈ కవిత్వం మనకు అందించేది ఒక్కటే హాయిగా జీవించడమెలానో నేర్పుతుంది. ఏ పేచీ లేకుండా శాంతంగా ఎలా మనవచ్చో తెలుపుతుంది. ఊరికే జీవితమై అన్నంతగా, ఇదే బి.వి.వి.ప్రసాద్ కవిత్వం మనకందించే గొప్ప కవిత్వ కానుక.

2) వ్యక్తిత్వం లోని సున్నితత్వం
బి.వి.వి.ప్రసాద్ స్వభావ రీత్యా సున్నితస్థుడు, లోతైన అన్వేషి, తగినంత ఆర్ద్రత, నిజాయితీ, చేసే పనిపట్ల ప్రాణం పెట్టి చేయడం నచ్చని వాటికి దూరంగా ఉండడం, ఇతరుల్లో మానవీయ విలువలు ఆశించి తరచూ నిస్పృహకు గురికావడం తన వ్యక్తిత్వంగా గమనించి. తన లోపలి వెలితి ఒకటి తన జీవిత గమనాన్ని శాసిస్తుందని భావించి ఆ వెలితిని నింపే ప్రయత్నంగా కవిత్వాన్ని ఆవిష్కరించారు.

3) కవిత్వం కోసం నిర్మించుకున్న వాతావరణం
వైరుధ్య భావాలతో జీవించే మానవ లోకంలో మనందరి మనస్సు ఉపశమించే మంత్రనగరి ఒకటి కావాలి. అక్కడ అందరం కలసి చెట్టపట్టాలేసుకుని హాయిగా తిరగాలి, బిగ్గరగా నవ్వుకోవాలి.

3:
మనస్పూర్తిగా ఏడవాలి. అదో పరమ శాంతిమయ లోకం కావాలి. ఈ విశ్వంలో చెలరేగుతున్న మనో మాలిన్యపు రాశులను బూడిద చేయగలగాలి. ఆ పరమ శాంతి ధామమే ఈ కవిత్వం.

II మొదటి వచన సంపుటి "ఆరాధన" సమర్పణ భావన

బి.వి.వి.ప్రసాద్ తన 23 ఏళ్ళ వయస్సులో మొదటి కవితా సంపుటి 'ఆరాధన' వేసారు. దీని నిండా సమర్పణ భావన వుంటుంది. దీనికి ముందుమాటలో కవి తనను తాను వెతుక్కునే ప్రయత్నమే ఇందులో వుంది. అంతేకాక ఇతరులలో తను గుర్తించడాన్ని ప్రేమ అంటారనుకుంటాను. ప్రేమను తెలియజేయడంలో 'ఆరాధన' ఒక పద్ధతి అంటారు.

మానవ జీవితం అనేక జీవితాలుగా కాక ఒకే జీవితంగా ఉన్నదంతా ఒకే సారంగా భావించి కవిత్వం చేయడం వీరి దృక్పథంగా కనిపిస్తుంది.

నిన్ను సేవించుదామని / ఎన్నో సుందర పుష్పాలు ఏరి తెచ్చి తుదకు / వాటి సౌందర్యం పై మోహంతో / నిన్నే విస్మరించాను అంటారు. 
(ఆరాధన వచన కవిత్వం- 1989)

మనం చేసేదిదే. ఈ లోకంలోకి ఎందుకొచ్చామో మరచిపోయి ఇతర వ్యామోహాల్లో పడిపోతాము. అంటే మన అసలుని మరిచి పోవడం, అదే మాయ. అలాంటి మాయలో పడవద్దని కవిపిలుపు. సాధారణంగా మనందరికీ మృత్యు భయం వుంటుంది. ఏ రమణ భగవానో, ఓషో లాంటి తాత్వికులను మినహాయిస్తే. ఈ కవి తన కవిత్వంలో చాలా విరివిగా మృత్యువును గురించిన కవితలు అల్లారు. మృత్యువనేది జీవితంలో తప్పని సరి భాగం అయినప్పుడు దాన్ని సానుకూలంగా ఎలా తీసుకోవాలో మరింత ఎరుకతో జీవితాన్ని ఎంత చక్కగా పండించుకోవచ్చునో తెలుసుకోవడమే కాక సాంత్వన పొందుతాము.

మృత్యుస్పృహ / మన మనస్సులో / ప్రధానమైన అంతర్వాహిని అయ్యే కొలదీ// మన జీవితాలలో అనుబంధాలలో/ లాలిత్యమూ, ప్రేమా ఉన్నతంగా దర్శనమిస్తాయి// 
(ఆరాధన- 1989- మృత్యుస్పృహ)

III హైకూ కవిత్వం తాత్విక సాంద్రత

తెలుగు హైకూకి వెలుగులద్దిన ప్రసిద్ధ హైకూ కవిగా బి.వి.వి. ప్రసాద్ సుపరిచితులు. తెలుగు హైకూని పరిపుష్టం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. హైకూ అనేది ఒక పదచిత్రం. కవి ఇస్మాయిల్ గారన్నట్లు చంద్రుణ్ణి చూపించే వేలు, చంద్రుణ్ణి చూపించాక వేలు అవసరం లేనట్లు హైకూను చదివాక అనుభూతి మాత్రమే మిగలాలి. క్లుప్తత, సాంద్రత, గాఢమైన తాత్విక చింతన, సౌందర్యాత్మకత ప్రకృతిలో మమేక మయ్యే స్వభావముండాలి. తేలిక దనం వుండాలి. ఇవన్నీ స్వభావరీత్యా బి.వి.వి. ప్రసాద్ లో సహజంగా వుండడం వలన హైకూ పేరు చెబితే బి.వి.వి. హైకూలు గుర్తుకొచ్చేట్లుగా హైకూలు రాసారు. బివివి మూడు హైకూ సంపుటాలు తీసుకొచ్చారు.

1.దృశ్యాదృశ్యం,(1995), 2. హైకూ (1997). 3. పూలు రాలాయి (1999) వీరు 'బషో' హైకూలను స్వేచ్ఛానువాదం కూడా చేసారు. రెండు ప్రసిద్ధ హైకూ వ్యాసాలు 1. ప్రకృతీ, జీవితం హైకూల మయమే, 2. హైకూ అంటే జీవన స్పృహ రచించారు. ఇవి సాహితీ లోకంలో చిరస్థాయిగా నిలిచిపోయే రచనలు.

4:

వర్షం / క్షణం పూచే నీటి పూలతో / ఊరు నిండిపోయింది// ఈ హైకూని వినగానే ఓ గొప్ప సౌందర్యానుభూతికి గురవుతాము. వర్షపు చినుకులను క్షణం పూచే నీటి పూలు అనడం ఎంత బాగుంది. పాఠకుడు ఒక అవ్యాజమైన అనుభూతికి గురవుతాడు. సౌందర్యం క్షణికమనే అవగాహన నుండి పుట్టిన ఒక వైరాగ్య వీచిక ఈ హైకూ ఈ అనుభూతిని 'అవారే' అంటారు.

మరో హైకూ :
పధికుని పలకరింపుకై / చూసి, నవ్వి, చిన్న బోయిన /వీధి దీపం//
(దృశ్యాదృశ్యం,(1995).

హైకూ పరిభాషలో దీనిని "సతోరి" అంటారు. మనం ప్రకృతిలోని చరాచరములనుండిఎంతో మేలు పొందుతాము. కానీ కనీసం ఆ స్పృహ కూడా మనకుండదు. అంత సున్నిత విషయాలపట్ల కృతజ్ఞతను మేల్కొల్పడం ఇక్కడ హైకూ కవి ఉద్ధేశ్యం. ఇంత సున్నిత విషయాలపట్ల స్పృహ ఉంటే మనం జీవించే తీరు ఇంకా ఉన్నతంగా వుంటుంది కదా!

రాత్రి తారలు / నదినిండా కురిసాయేమో / తీరమంతా ఇనుకమయం//
దృశ్యాదృశ్యం,(1995)

నదీ తీరమంతా ఇసుక మేటలతో నిండి వుంటుంది. మనం అంతవరకే గమనిస్తాం. కానీ హైకూ కవి ఆ ఇసుక రేణువులు సూర్యకాంతికి మెరవడం ఎలా ఉందంటున్నాడంటే అది చిన్ని చిన్ని తారలు చిన్ని రేణువులుగా కుప్ప బోసినట్లుందట. అది రాత్రంతా తారలు కురవడం వలన అలా అయిందట ఏమీ సౌందర్యం. ఇది ఒక అమోఘమైన అనుభూతి చిత్రం కదా!

IV "నేనే ఈ క్షణం" అనుభూతి సౌందర్యం

వీరు 2006లో 'నేనే ఈ క్షణం' అనే కవితా సంపుటి వేసారు. ప్రాకృతిక సౌందర్యాన్ని, జీవనతత్వాన్ని పెనవేసుకొని అద్భుత భావచిత్రాలుగా ఆవిష్కరించబడ్డ కవితా సుగంధం "నేనే ఈ క్షణం"

ఎండకురిస్తే / చెట్టునిండా / ఆకు పచ్చని చినుకులు//
చీకటి కురిస్తే / చెట్టు నిండా / నల్లని మబ్బులు //
మబ్బుల్లోని చినుకుల్ని కురుస్తూంది చెట్టు //

ఈ కవితలో కవిగీసిన పదచిత్రాలు "మెటానమీ" టెక్నిక్ లో వుండడం వల్ల పాఠకుణ్ణి చురుకుగా ఆలోచింపజేసి, సమాధాన పడ్డాక చక్కటి ఆనందానుభూతిని కలిగిస్తాయి.

V "ఆకాశం" ఓ మార్మిక పరిమళం

ఒక దశాబ్ద కాలంపాటు కవిత్వానికి దూరంగా వున్న ప్రసాద్ గారు ఆ సమయంలో చేసిన అంతర్ముఖ సాధన, జీవనానుభవాలను దగ్గరగా దర్శించడం అదే కవిత్వంగా ఒక వినూత్న ధోరణితో మూడు, నాలుగు నెలల వ్యవధిలో 100 ప్రసిద్ధ కవితలుగా 'ఆకాశం' వెలువడడం గమనార్హం. హైకూ కవిగా సుపరిచితులైన బివివిని 'ఆకాశం' కవితా సంపుటి వచనకవిగా సమున్నత సాహితీ శిఖరంపై కూర్చోబెట్టింది.

"ఆకాశం" వ్రాసేటప్పుడు వారు పెట్టుకున్న నియమాలు తూచా తప్పకుండా పాటించడం మనం చూస్తాము.

5:

ఏ భావం పలికినా మార్దవంగా, తాత్వికానుభూతిని, సౌందర్యాన్ని రంగరించి 'దయ' అంతర్లీనంగా వుండేట్టు కవిత్వీకరించడం మనం గమనిస్తాము.

పుట్టగానే పిల్లలు నవ్వరెందుకని వాళ్ళు ఏ వెలుతురులో ఈది వచ్చారు/ ఏ ఆనందాలు దాటి వచ్చారు/ ఏ హద్దుల్లేని దేశాలు ఎగిరి వచ్చారు/ పుట్టగానే పిల్లలు నవ్వలేరెందుకని ఏ పవిత్ర సీమలు విడిచి వచ్చారు/ ఏ దయాపూర్ణ హస్తాలు విడిచి పెట్టారు / ఏ కపటం లేని లోకాలు పోగొట్టుకున్నారు//

పుట్టగానే పిల్లలు ఎప్పుడూ ఏడుస్తారు ఎందుకని / దుఃఖమయ ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తారెందుకని// (పుట్టగానే పిల్లలు ఆకాశం - 2011)

పిల్లల్ని గురించిన మరోకవిత:-
పిల్లల్ని ప్రేమించడం నేర్చుకుంటే చాలు/ పిల్లల్ని ప్రేమిస్తే చాలు వారికోసం ఒక మంచి ప్రపంచాన్ని వారే సృష్టించుకుంటారు (ఆకాశం 2011)

ఈ వాక్యం మనం మరవకుండా వుండగలిగితే చాలు. నేటి సమాజంలో పిల్లల్ని ప్రభావితం చేయడంలో పెద్దలు విఫల యత్నం చేస్తున్నారు. దీని వలన పిల్లలు ఒత్తిడికి గురయి వారి సహజత్వాన్ని, సృజనని కోల్పోతున్నారు. పిల్లల్ని వారి మానాన్న వారిని ఎదగనిస్తే చాలు అద్భుతాలు సృష్టిస్తారు. వారి స్వచ్ఛమైన లేత మనసుల్ని కలుషితం చేయకుండా వుండగలిగితే చాలు. సినారె. అంటారు. "పాపాలను కడిగి వేస్తుందిలే పాల నవ్వుల నురుగు" అని

VI "నీలో కొన్ని సార్లు" లోతైన మౌనం పలికే వాక్యాలు

బి.వి.వి.ప్రసాద్ కవి "నీలో కొన్ని సార్లు" అనే కవిత్వ సంపుటిని 2015 లో వేసారు. ఇది ''ఇతను' అనే కవిత తో ప్రారంభమవుతుంది. మానుష ప్రపంచం మరీ అంత భయావహమైంది కాదని/ నీ కలలోని భూతమే నిన్ను మ్రింగ బోయినట్లు / నువ్వు విలువిస్తే బ్రతికే సముహం నిన్ను కమ్ముకుంటుందని/ సమూహాన్ని చెరిపేస్తూ నిన్ను గుర్తు చేయాలనే ఇతను మాట్లాడుతున్నాడు... ఎప్పుడూ పాతదైన నిద్రలోంచి, ఎప్పటికీ కొత్తదైన మెలకువలోకి/ మెలకువలాంటి పూలలోకి, గాలిలోకి, మౌనంలోకి, కాంతిలోకి / జీవితం పంపిన దూతలా పిలుస్తున్నాడు.

ఈ కవితలో ఎప్పటికి కొత్తదైన మెలకువలోకి అనే మాట పాఠకుడు చాలా పట్టుకోవాల్సిన మాట. ఆదమరిచిన నిద్ర అనడంలో భౌతిక సుఖాల్లో పడి మనతో పాటున్న తోటి చరాచరాలకి ఇవ్వాల్సినంత విలువ ఇవ్వడం మరచిపోయిన మనకి మన మూలాల్ని పరిచయం చేస్తూ అక్కడి లోతైన దయాప్రేమలతో నిండిన సూక్ష్మ ప్రపంచాన్ని మనలో జాగృతం చేస్తున్నాడీ కవి. దీనిని ఇంటెన్షనాలిటీ/ ఎరుక అని అంటాం. 

మరో కవిత:-
తోటి వారిని గాజులానో, పూలలానో / కదలని నీటిపై నిదురించే చంద్రుని బింబంలానో చూడలేమా/ బహుశా ఏ గ్రహాంతరాలలో ఏకాకులమై ఎదురైతే / అద్దంలో ప్రతి బింబంలా మృదువుగా చూసుకుంటాం ఒకరినొకరం ... అని సాగే ఈ కవితలో కవి ఇతరులతో మనం మెలగాల్సిన తీరు పట్ల ఒక అపురూపమయిన కొత్త సంస్కారాన్ని మనకందిస్తున్నారు.

:6:

VII "ఊరికే జీవితమై" - అన్నంతగా

బి.వి.వి. ప్రసాద్ కవితా సంపుటి "ఊరికే జీవితమై" (2023) నుండి

నిద్రలో ఎక్కడుంటావు నువ్వు/ మెలకువలో నీ దేహాన్ని మోసీ మోసీ అలసి పోయాక / దానిని ఎక్కడకు విసిరేసి, ఎటు వెళ్ళిపోతావు// సృష్టికి పూర్వం వున్న ఏ శీతల నిశ్శబ్ద ప్రశాంతతలోకి నిదురించేవేళల రహస్యంగా ప్రవేశిస్తావు/

అని సాగే ఈ కవితలో మనము నిద్రపోయేటప్పుడు ఏ లోపలి సీమలోంచి విహరిస్తామో అక్కడి మెలకువడి సంబంధించిన అనుభూతిని కవిత్వంగా పలకాల్సివుంటుంది. ఇది ఒక దార్శనికునికో, యోగికో, తాత్వికునికో సాధ్యమయ్యేపని.

ఈ కవి కవిత్వం పరిశీలించాక "అనుభూతి వాదం" భూమికగా కనబడుతుంది. నువు చెప్పేదేదయినా నీ అనుభవంలోంచి పలకాలి అన్నది అనుభూతి వాదం ప్రాధమిక సూత్రం.

VIII "సృష్టి" ఒట్టి ప్రేమసారం ఈ కవిత్వం

ఇటీవల వెలువరించబడిన బి.వి.వి. ప్రసాద్ గారి కొత్త పుస్తకం "సృష్టి" నుండి "ప్రేమ ఉంటే" అనే కవితలో

ప్రేమ ఉంటే పెద్దగా చెప్పడానికి ఏమీ ఉండదు/మాటలన్నీ మంచు ముక్కల్లా ప్రేమలో కరిగి పోతాయి/పూలరంగులు వెలుగుతాయి./ నక్షత్రాలు అనంతాన్ని విరబూస్తాయి./ స్పర్శ జీవితాన్ని సారవంతం చేస్తుంది..

కవి ఇక్కడ ఒక మాట అంటారు. "జీవుల చూపుల సారం ప్రేమకోసం ఎదురుచూపు/భయాలు, కోరికలు ప్రేమ దక్కక చేసే వెర్రి పనులు". ఇది మానవాళికి అందాల్సిన అద్భుతమైన "మోరల్ స్టేట్మెంట్" నిజమే కదా లోకంలోని సమస్త సమస్యలకు దుఃఖాలకు సరిపడా ప్రేమలేక పోవడమే కారణం. అనంతమైన ప్రేమలోకి ఒక్కసారి మేల్కొనగలిగితే బాధలన్నిటికి ఉపశమనం దొరికినట్టే.

శుద్ధవేదనా జగత్తునుండి వెలువడ్డ నిర్మల స్వచ్ఛగంగాజలం వీరి వాక్యం.

మరో పద చిత్రాన్ని చూద్దాం.

నల్లని కాన్వాసు పై / మరింత నల్లని చిత్రాలయి/ ఇళ్ళూ చెట్లూ// (దృశ్యా దృశ్యం - 1995)

ఇదొక రంగుల పద చిత్రం నల్లని రంగుపైన మరింత నల్లని రంగుని పులమడం ఎంతో

రమ్యమైన శిల్పం ఆవిష్కరించబడింది.

డా||అద్దేపల్లి వారన్నట్లు ఆలోచనలోనే వినూత్నత వుండడం వీరి శైలికి బలం. (నీలో కొన్ని సార్లు 144 పేజీ ఉత్తరాల నుండి)

వీరి కవిత్వం పైపై ఉద్వేగల అణచివేతకాదు. లోలోపల జరిగే మధనం ఒక విచికిత్స. నీ మూలాలతో నీవు శృతి చేసుకుంటేగాని ఈ కవిత్వం నీకు కనెక్ట్ అవ్వదు. పాశ్చాత్య విమర్శకుడు 'కెబుల్' చెప్పినట్లు "వెంట్ ఫర్ ఓవర్ చార్జుడ్ ఫీలింగ్/ ఉప్పొంగు అనుభూతుల అభివ్యక్తి" వీరి కవిత్వం.

:7:

వీరి ఉపమానాలు, రూపకాలు అప్పుడే పుట్టిన పిట్ట కూనల్లా పాఠకుణ్ణి అబ్బుర పరుస్తాయి.

ఉదా|| భూమి వంటి అమ్మమ్మ, ఆకు పచ్చని చెట్లు బడి పిల్లల్లా, కాలంనది, చినుకు శిశువు నీడల కాలువలు, వెల్తురు పుప్పొడి, పడవ చంద్రుడు, తారల ఇసుకమైదానం మొదలైనవి.

ఒక విధంగా ఈ కవిత్వం ఒక ఫిల్టర్ వంటిది. మనం చదివే ప్రతి వాక్యం మనల్ని ప్యూరిఫై చేయడమే తప్ప కొత్తగా మనకేదో నేర్పాలనే ప్రయత్నం చేయదు. మన మానసిక స్థౌల్యతని కరిగించి తేలిక పరచి స్వస్థత కలిగించి మన అసలుని మనకు అప్పగించే ప్రయత్నం చేస్తుంది.

వీరి కవిత్వం పై సమకాలీన ప్రముఖ కవుల అభిప్రాయాలు

అందుకే సమకాలీన కవులంతా వీరి కవిత్వాన్ని అత్యంతగా ఇష్టపడతారు దీనికి కారణం వారు కూడా ఈ కవిత్వంలో ఉపశమనం పొందడమే

ఆకాశం కవితాసంపుటిని గురించి డా॥ రెంటాల వారు ఇది 'ప్రొఫెట్' తరువాత పుస్తకం. ఇది ఆంగ్లంలోకి అనువాదమైతే భారతీయ ఖలీల్ జీబ్రాన్ ఇలా వుంటాడని అందరికీ తెలుస్తుంది. అని అంటారు.

ఆకెళ్ళ రవిప్రకాష్ గారు తన వ్యాసంలో బి.వి.వి.ప్రసాద్ గారిని యువచలం అన్నారు. (ఆంధ్రజ్యోతి దినపత్రిక, వివిధ 18/05/2020)

నాకనిపిస్తారు వీరు శ్రమణకుల ఆర్తిని తీర్చిన గౌతమ మునిలా

కళ్ళలో దయా స్పర్శలో నిర్మలత్వం
మాటలో నిజాయితీ, మనిషిలా స్పందించడం మరచిపోకుండా ఉంటే చాలు

హాయిగా నవ్వడమూ, హాయిగా ఏడవటమూ పోగొట్టుకోకుండా ఉంటే చాలు 
(ఆకాశం - 2011 చాలు)

ముగింపు :-

బి.వి.వి. ప్రసాద్ కవిత్వంలో శాంతి, కరుణ, ప్రేమ, క్షమ, వంటి మౌలిక భావనలు ఎంతో లోతుగా అనుభూతి ప్రధానంగా అద్వైతాంశతో దర్శనమిస్తాయి.

మానసిక కాలుష్యంతో, వైషమ్యాలతో కొట్టు మిట్టాడుతున్న మానవ లోకం ఉపశమించే పరమశాంతి ధామమీకవిత్వం.

నేటి ప్రథాన స్రవంతికన్నా భిన్నమైన ఆధునిక ధోరణితో వెలువడుతున్న ఈ కవిత్వం తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

8:

ఆధార గ్రంథాలు :

1. ఆరాధన, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, రవి ప్రింటర్స్, తణుకు, 1989.

2. బి.వి.వి. ప్రసాద్, హైకూలు (దృశ్యాదృశ్యం 1995, హైకూ 1997, పూలు రాలాయి 1999) బి.వి.వి. ప్రసాద్, శ్రీ శ్రీ ప్రింటర్స్ విజయవాడ.

3. నేనే ఈ క్షణం, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, శ్రీ రత్న ప్రింటర్స్, రాజమండ్రి. 2006

4. ఆకాశం, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, పాలపిట్ట బుక్స్, హైదరాబాద్, 2011.

5. నీలో కొన్నిసార్లు, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, వాసిరెడ్డి పబ్లికేషన్స్, హైదరాబాద్, 2015.

6. ఊరికే జీవితమై, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, ప్రేమలేఖ ప్రచురుణలు, 2023.

7. సృష్టి బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, స్వేచ్ఛా ప్రచురణ, తణుకు. 2026.

8. ఒలుపు సాహిత్య వ్యాసాలు, డా॥ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, చినుకు పబ్లికేషన్స్, విజయవాడ, 2017.

9. ఆలోచన, సాహిత్య వ్యాసాలు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ M.A.I Books, సికింద్రాబాద్, 2014.

10. ఆధునిక ఆంధ్రకవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు. డా॥ సి.నా.రె. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.

మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్, 
పి.జి.టి. (తెలుగు)
ప్రభుత్వ పోస్ట్ బేసిక్ పాఠశాల ప్లస్, పెంటపాడు
పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
(ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్టణం, తెలుగు శాఖ, పార్ట్ టైం పి. హెచ్. డి. రీసెర్చి స్కాలర్)
9441350260, 7013543732, sriram9441350260@gmail.com

ప్రచురణ : 
భావ వీణ - ప్రత్యేక సంచిక 28.2.26
ప్రభుత్వ డిగ్రీ కాలేజి, రాజోలు, డా॥ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ తెలుగు విభాగం

24 జూన్ 2026

కవిత : వారూ - వీరూ

చాలా చెబుతారు 
తెలివైనవాళ్ళం, బ్రతక నేర్చినవాళ్ళం 
అనుకొనేవాళ్ళు 
కానీ, జీవితం అమాయకుల స్వర్గం

రాత్రి నీమీద వాలినపుడు
రాత్రి లోంచి కొన్ని దీపాల కాంతులు
నిన్ను తడిపినపుడు,
వాటి నీడలు దృశ్యాలనుండి 
ధారలు కట్టినపుడు,
నువు కాంతుల్లోకీ, నీడల్లోకీ తప్పిపోకుండా 
ఒడ్డున తచ్చాడితే, తెలివైన బుద్ధిహీనుడివి
తప్పిపోతే, అమాయకంలోకి మేలుకొన్నవాడివి

పగలు మనుషుల ముఖాలపై తేలే
భయాలనీ, వెలితినీ చూస్తే 
తెలివిలో ఇరుక్కున్నవాడివి
ముఖాలపై వాలే ఎండనీ, నీడనీ చూస్తే
అమాయకంలోకి రెక్కలు విప్పినవాడివి 

ఎవరు జీవితాన్ని జయించామనుకొంటారో
వాళ్ళు జీవితానికి బానిసలు,
ఎవరు జీవితానికి లొంగిపోయారో 
వాళ్ళు జీవితం పసిపాపలు 

చివరిరోజున నీ ముఖం పై
చిరునవ్వు తారాడకపోతే నీ జీవితం ఉత్త డొల్ల,
నీ కనుకొలకుల్లో ఆనందాశ్రువులు మొలకెత్తితే
నీ జీవితం సారవంతం

ఏమీ చెప్పరు 
అమాయకులం, నిర్బలులం అని తలచేవాళ్ళు
కానీ, వాళ్ళ శ్వాసలో అనేకలోకాలు వికసిస్తాయి

బివివి ప్రసాద్
ప్రచురణ : సారంగ 15.6.26

21 జూన్ 2026

కవిత : సందిగ్ధ స్వప్నం

నిన్ను మనుషులు కాదన్నపుడు
నువు ఎక్కడికి చేరుతావు

మలిసంధ్యలోని చివరికాంతులలోనికా, 
మండువేసవిలో వెలిగే నీడల్లోనికా,
ఎడారి కడుపున పండే ఖర్జూరపు రుచిలోనికా,
దైవం దయగా పంచే చిరునవ్వులోనికా 

ఏ మూలన నువు దాక్కోవాలని చూస్తావు
జనన, మరణాల సరిహద్దులోనా,
నవ్వుకీ, కన్నీటికీ నడుమ తేలే రేఖలోనా,
చలికీ, వేసవికీ నడుమ నలిగే రోజుల్లోనా

ఇదంతా అద్భుతం, అసంబద్ధం కూడా

నీ ఆలోచన పొట్లిన కాగితం కానున్నపుడు, 
నీ ఊహ పచ్చదనం నుండి 
ఎండిపోవటంలోకి తిరుగుతున్నపుడు,
నువు నవ్వుకీ, ఏడ్పుకీ నడుమ పరుగెడుతున్నపుడు

నీకు నిజంగా బ్రతకాలనిపిస్తుందా, ఇక చాలనా
శ్వాస ఆగిపోవాలనుంటుందా, కొనసాగాలనా

జీవితం సందిగ్ధ స్వప్నం
సూర్యకాంతినీ, మంచిచెడ్డల మీమాంసనీ
నీ కలలకి వదిలి 
నిన్ను నిన్నుగా కావలించుకునే ప్రేమ, ఆర్తి

కొనసాగమని మినహా జీవితమేమీ అడగదు నిన్ను,
భయం లేని లోకం మినహా 
జీవితాన్ని ఏమీ అడగబుద్ది కాదు నీకు

ఒక సందిగ్ధం నీలోకి నిన్ను నెడుతుంది,
నీ తలుపులు తెరవమంటుంది
సందిగ్ధ సాయంవేళ 
నీతో నువు కాసేపు గడుపుతావు

బివివి ప్రసాద్
ప్రచురణ : స్నేహ, ప్రజాశక్తి 21.6.26



17 జూన్ 2026

కవిత : అక్కడ ఉంటావు

ఆటలాడీ, ఆడీ పరుగున వచ్చి
అమ్మని కావలించుకుంటావు చూసావా
అక్కడ నువ్వు నువ్వుగా ఉంటావు

యవ్వనంలో స్నేహితుని భుజం మీది చేయిలోనో,
ప్రియురాలి చూపులోనో కరిగిపోయినపుడూ,
జీవననేస్తం తొలి కౌగిళ్ల నమ్మకమైన స్పర్శలో,
బిడ్డల అమాయకపు లేత చూపుల్లో,
వాళ్ళు నీ కొనసాగింపనే ఉద్వేగంలోనూ 
నువ్వుగా ఉంటావు 

స్థిమితంగా ఉన్నపుడు
దయగా నీలోపలికి చేరే బంగారు ఎండలోనో,
వెండి వెన్నెల లోనో, కాటుక కన్నుల వంటి చీకటిలోనో,
ఉండి ఉండి, నేనున్నాను కదా అని వీచే గాలితెరలోనో,
వేగిన గాలిలోంచి పసిపాప చిరునవ్వులా జారే 
చల్లని వాన చినుకులోనో,
వానచినుకు పుష్పించే ఇంద్రధనువులోనో,
వాన తరువాత నేలలోంచి పూచే ఇంద్రధనువులలోనో
నువు మెల్లగా, సముద్రంలోకి మరలిపోయే అలలా కరిగిపోతున్నపుడు నీకు నువు ఉంటావు

వేసవి నీడలోనూ, దుఃఖార్తుడి తృప్తిలోనూ,
కఠినులలో కలిగే పశ్చాత్తాపపు కదలికలోనూ,
సమస్తాన్నీ ప్రేమించే మహనీయుల చూపులోనూ,
చెట్ల ఆకుల్ని కదలీ, కదలించని మెల్లని గాలితెరలోనూ,
వాసంత కోయిల మధ్యాహ్నపు బద్దకపు పాటలోనూ,
ఇంకా, అనేక మృదువైన సమయాల,
జీవితం ఊరికే గాలితెరలా తాకిపోయే వేళల
నువు అక్కడే మెలకువగా,
కెరటం అంచున మెరిసే వెన్నెలలా నిలిచి ఉంటావు

ఇవన్నీ సరే,
నువు నువ్వుగా ఎప్పుడూ ఉన్నావు కదా,
వీటన్నిటికీ ఇక్కడేం పని అంటారెవరో
ఎవరా అని వెనుతిరిగి చూస్తే తాకుతుంది 
ఏదో మృదువైన, బలమైన, లోతైన నిశ్శబ్దం
బహుశా, నువ్వు

బివివి ప్రసాద్
ప్రచురణ : ఈ మాట జూన్ 2026

16 జూన్ 2026

కవిత : పండిన ప్రేమ

నువు కూర్చున్నపుడు
నారింజ మేఘాలు నీ ప్రక్కన కూర్చుంటాయి

కనురెప్పలు పైకెత్తినపుడు
నీ చూపులు సీతాకోకలయి ఎగురుతాయి

మాటలకై పెదవులు తెరిచినపుడు
తేలికగాలులలో పరిమళాలు మునకలేస్తాయి

లోపలినుండి చిరునవ్వు నవ్వినపుడు
ఎవరం పోటీ పడదామని
నక్షత్రాలూ, సూర్యుడూ తడబడతారు

ప్రపంచం మీద ప్రేమతో 
నీ హృదయం నిండినపుడు
చంద్రుడు తృప్తిగా బెంగ విడుస్తాడు 
ఇవాళొక హృదయం ఆశ్రయం ఇచ్చిందని

ఇంతకూ నువు ఏ ఒకర్నీ ప్రేమించలేదు
నీలో ఇంత అందానికి

జీవితాన్ని ప్రేమించి, ప్రేమించి
జీవితానివీ, ప్రేమవీ అయిపోయావు
కదులుతున్న రాత్రిలో రాత్రిలా కరిగిపోయావు

బివివి ప్రసాద్
ప్రచురణ : మహా పత్రిక 15.06.26