సీతాకోకఒకటిఎగురుతూ ఉంటుందిమనంఉన్నచోటే. దానిని పరికించే మనసు ఎంతమందికి ఉంటుంది. దానికి కొంత సున్నితత్వం కావాలి. ప్రకృతిని చూసి పరవశించే మెత్తదనం ఉండాలి.దానితో మమేకమయ్యే స్వభావం ఉండాలి. అదో ధ్యాన స్థితి.విషయీ విషయాల ఏకత. హైకూ కవిత్వానికి ఇదే మూలవనరు. దానిని దాటి,సీతాకోక రావడానికి ముందు శూన్యాకాసాన్ని అది వచ్చి వాలి తారాడిన క్షణాలను, ఎగిరిపోయిన తర్వాతి శూన్య సౌందర్యాన్ని అద్వైతాంశతో కవిత్వం చేస్తున్నారు బివివి ప్రసాద్.
వీరి కవిత్వం నిండా, కవి తనను తాను తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది. దానికి కవి నిర్మించుకున్న వాతావరణం మానవ జీవితం పట్ల అపారమైన శ్రద్ధ,అవ్యాజమైన ప్రేమ, అనంతమైన దయ మరి ఏమీ కాదు ఒట్టి ప్రేమ సారమీకవిత్వం.అందుకే వీరి నుండి నిసర్గమయ్యే ప్రతి వాక్యం తాజాగా అప్పుడే పూసిన గులాబీల్లా గుబాళిస్తుంది.మనసుని ఓ మత్తుకు గురిచేసి ప్రశాంతతనిస్తుంది.
ఇది మార్మిక కవిత్వం. నిజానికి కవిత్వం కళ అవుతుంది. మార్మికత కళకాదు. కానీ ఈ కవి మార్మికంగా కవిత్వం అల్లడం మనం గమనిస్తాం. ఇదో వినూత్న పంథా. ఆధ్యాత్మికత అంటే మన మూలాలను మనం తెలుసుకోవడం. ఎరుకతో జీవించడం ఆ అనుభూతి గాఢతలోనే ఈ కవిత్వమంతా సాగుతుంది.
వీరి భావనా ప్రపంచం మాటల కందేది కాదు. మరి కవి ఎలా పద సృష్టి చేస్తున్నారు. కవితా వాక్యాలను ఎలా నిర్వహిస్తున్నారు. అనేది ఆసక్తి కలిగించే విషయం. ఆశ్చర్యంగా కోకొల్లలుగా వచ్చి వాలే సుతిమెత్తని "కాయిన్డ్వర్డ్స్" ఈ కవిత్వ వాక్యాలకు పుష్టినివ్వడం మనం గమనిస్తాం. ఉదాహరణకు చీకటి వరద, రంగుల కాంతి, ఏకాంత సంగీతం, పరాయి శబ్దం, విసుగు పురుగు, ప్రేమ తునక, తెలికాంతి, జీవితేచ్చవిత్తనం, చీకటి ద్రవం, ఖాళీ వెలుతురు, లోకపు చిటికెన వేలు మొదలైనవి.
వీరి కవిత్వం చదివి ఒక అనుభూతి గాఢతకి గురికాని వారు లేరు చదివినా మళ్లీ చదవాలనిపించే కవిత్వం అంతేకాదు కొత్త వాక్యాల కోసం చకోరకాల్లా ఎదురు చూస్తాం. ఇప్పుడదే తారసపడింది .మన ముందు ఈ కవిత్వ వాక్యం పుష్టిగా రెక్కలు కట్టుకువాలింది "సృష్టి"గా.ఈ పుస్తకానికి “రమణ జీవి”వ్రాసిన అభిప్రాయం “గంగారెడ్డి” గారి మాటలు ఈ కవిత్వం పట్ల చాలా క్లారిటీ ఇస్తాయి. దీనిలో మొదటి కవిత "సృష్టి" అనే శీర్షికతోనే ప్రారంభమవుతుంది .
"ఖాళీ మనసులో కొన్ని రంగులు ఒంపు/ అవి ఆకాశమూ గాలీ నీరూ/ కాంతీ, చీకటిలో వెన్నెలా/ రంగుల పై కొన్ని గీతలు గీయి/ నదులూ, కొండలూ, మైదానాలూ/ఉదయాస్తమయ,మేఘాలూ, పాలపుంతలూ/
కదలికలలో ఉద్వేగాలు కలుపు/ చిక్కగా లేతగా తీవ్రంగా,తేలికగా/మంచీ,భయమూ,బాధా,ప్రేమా/
ఇంతకన్నా ఊహించేదేమీ లేదు/ నువ్వైనా దేవుడై నా/మళ్లీ మొదటికి రావాల్సిందే/నిద్రలోనో మరణంలోనో జ్ఞానంలోనో.
ఈ కవిత మొదటి పంక్తుల్లో ఖాళీ మనసు శూన్యానికి ప్రతీక సృష్టికి ముందు స్థితి. ఎత్తుగడలోని ఆ ఖాళీ మనసుతో కాసేపు రమిస్తాం.ఆ శూన్య సౌందర్య అనుభవంలో కాసేపు ఉండిపోతాం. కవిత మొత్తం చదివి మరలా రెండోసారి చదవడం మొదలుపెట్టినప్పుడు కలిగే అనుభవం ఇది.
ఇప్పుడు అందులో కొన్ని రంగులు ఒంపమన్నారు కవి. ఎంత అందంగా సరళంగా ప్రారంభమయ్యింది ఈ కవిత్వ “సృష్టి"అవే పంచభూతాలన్నమాట. భూమిని 'చీకటిలో వెన్నెల' అన్నారు. జ్ఞానానికి ప్రతీక కాబట్టి.రంగులపై గీతలు గీస్తే నదులూ కొండలూ, మొదలైన స్థావరాలు ఏర్పడ్డాయట.గీతల్ని కొంచెం కదిలిస్తే చెట్లు పిట్టలూ మనుషులూ మొదలైన జంగమ ప్రపంచం నిర్మాణమైందట. ఇప్పుడు వాటికి ఉద్వేగాలు కలిపారు కవి. అవి చిక్కగా లేతగా బాధ ప్రేమ అయ్యాయట.చివరి వాక్యాల్లో కవి నిద్ర,మరణం, జ్ఞానం మూడిటిలో కూడా మళ్లీ మొదటికి రావాల్సిందే మనమైనా దేవుడైన అంటారు. ఇక్కడ ఈ మూడూ లయానికి ప్రతీకలు. అత్యంత నేర్పుతో గిజిగాడి ఊయల గీము నిర్మాణాన్ని తలపించేలా కదలాడే భావ చిత్రాలను మన ముందు ఉంచారు కవి బివివి.
"రంగుల పిల్లలు" అనే కవితలో.. రంగులు అమాయకమైనవి/ నలుపూ తెలుపుల్లా కలలు రాలి పోయినవి కావు/ పసిపిల్లలు ఉల్లాసంగా మేల్కొన్నట్లు ఉదయాన గగనంలో మేలుకుంటాయి"
ఇంద్ర ధనువుల మీదుగా /సీతాకోకల రెక్కల మీదుగా పూలని చేరి/ నీ వైపు నవ్వుతూ దర్శనమిస్తాయి....
అని సాగే ఈ కవితలో కవి రంగులు మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, దుఃఖంలో మరలా నిలబడేట్టు వెన్ను తడతాయి. నలుపూ తెలుపూ అనే దుఃఖానందాల మధ్య ఆశని రగులుస్తాయి అంటారు. తర్వాత వాక్యాల్లో తెలియందేదో లోకంగా వికసించడం అని వేదాంతపరంగా లోకాన్ని నిర్వచించడం బాగుంది. ఆడింది చాలు, పడుకోండని అమ్మానాన్నల వంటి నలుపూ తెలుపులు పిలిచినపుడు, బొమ్మల్లాంటి మనని విసిరేసి ఏకైక మహాశాంతి లోకి జారిపోతాయి.
ఇక్కడ ఏకైక మహాశాంతి లోకి జారిపోయిన రంగులు మనల్ని ఏకైక శూన్యంలో తేలేలా చేసాయి. చివరి వాక్యాల్లో "ఇప్పుడు కలల్లోకి పాకుతూ వచ్చిన రంగులు/ నీతో ఏం మాట్లాడుతున్నాయి" అని ఉంటుంది
ఇక్కడ 'అందరి నిద్రా ఒక్కటే అది ఏకైక శూన్యం' అక్కడ రంగులు మీతో ఏం అంటున్నాయి అని ప్రశ్నిస్తారు కవి
నలుపూ తెలుపులు మన మూలాలకి, ఏకైక శాంతికి సంకేతాలు అక్కడి నుండి వచ్చిన మనం ప్రకృతికి అద్దిన రంగులనే ఆశల వలన జీవిస్తూ ఉంటాం. సత్యం బోధపడ్డాక వాటిని వాటిగానే యథార్థ స్థితిలో చూడగలుగుతాం.ఈ కవితా శిల్పం కవి ప్రతిభకు గీటురాయిగా చెప్పవచ్చు.
"పుట్టినరోజున"అనే కవిత లో
"ఇవాళ నీకు నువ్వే గుర్తుకొస్తుంటావు/ ఉదయం పూలూ చినుకులూ రాలినట్లు/ ఒకనాడు ఇక్కడకు రాలావు/వాటికి కరిగి మాయమైపోవడం తెలుసు/ మరి నీ సంగతి అంటారు ఎవరో?... అని సాగే ఈ కవితలో కవి ఎంత సున్నిత వాక్యాలతో ప్రారంభించారు కవితని. మనిషి పుట్టుకలోని సహజత్వాన్ని ఇంత మృదువుగా ఉత్ప్రేక్షించిన కవిని ఇంతకు మునిపెన్నడూ మనం చూడము.
సృష్టిలో ప్రతి జీవి ఎంత సహజంగా వచ్చిందో అంత సహజంగా జీవించి వెళ్ళిపోతుంది.మరి మానవుడు, ఇదే ప్రశ్న కవి వేశారు " మరి నీ సంగతి అంటారు ఎవరో? ఆ 'ఎవరో 'అనడంలోనే వాక్య బలం రెండింతలు అయింది.
ఈ కవితలో బతుకుని నైరూప్య చిత్రమనీ నిర్వచించి అర్ధాల ఇరుకునుండి ఎంత విముక్తమయితే అంత సారవంతం అవుతుందని ఎంత స్వేచ్ఛ లోకి మేలుకుంటే అంత ఆర్ద్రతలోకి వికసిస్తుందని జీవనమాధుర్యాన్ని ఎలా చవిచూడాలో పాఠకుడిని శిశువుగా చేసి మరీ కవిత్వపు ఉగ్గుపడుతున్నారీ కవి.
నైరూప్యఛాయాచిత్రణ లో చిక్కబడ్డ అద్వైతం ఈ కవిత్వం
"ప్రేమ ఉంటే" అనే కవితలో ప్రేమ ఉంటే పెద్దగా చెప్పడానికి ఏమీ ఉండదు/ మాటలన్నీ మంచు ముక్కల్లా ప్రేమలో కరిగిపోతాయి/పూలరంగులు వెలుగుతాయి/ నక్షత్రాలు అనంతాన్ని విరబూస్తాయి/ స్పర్శ జీవితాన్ని సారవంతం చేస్తుంది. కవి ఇక్కడ ఓ మాట అంటారు "జీవుల చూపుల సారం ప్రేమ కోసం ఎదురుచూపు. భయాలు కోరికలు ప్రేమ దక్కక చేసే వెర్రి పనులు" ఇది మానవాళికి అందాల్సిన ఓ అద్భుతమైన 'మోరల్ స్టేట్మెంట్'. నిజమే కదా లోకంలోని సమస్త సమస్యలకు దుఃఖాలకి సరిపడా ప్రేమ లేకపోవడమే కారణం. అనంతమైన ప్రేమలోకి ఒక్కసారి మేల్కొనగలిగితే బాధలు అన్నిటికీ ఉపశమనం దొరికినట్టే.
'అద్వైతం'అనే మరో కవితలో
సాంద్రమైన స్వచ్ఛమైన ఒక జీవితానుభవం చాలదా బ్రతుకంతా వెలగడానికి అంటారు. పాఠకుడు తాను కూడా లోతుగా మౌనంలోకంటూ మేల్కొంటే గాని ఈ కవిత్వం ఒంటపట్టదు.
"ఒకరికొకరు" అనే కవిత ఉంది.రెండవ భాగంలో
ఆమె ముఖంలోకి చూసేటపుడు/అతని ముఖంలో చలిమంట వెలుగుంటుంది/ చల్లని గాలుల పూతరేకుల శబ్దాలుంటాయి /వెన్నెలలో వినిపించి ఆగే పిట్ట పాట ఉంటుంది/చినుకుల్లో మాయమయ్యే ఇంద్ర ధనువులుంటాయి అంటారు.
ఇక్కడ పిట్ట పాట ఆగిన తర్వాత, ఇంద్రధనువు మాయమైన తర్వాత, కలిగే సౌందర్యానుభవం చాలా గాఢమైనది. కాలాల కావలి నిశ్శబ్దంలోకి మనల్ని జారిపోయేలా చేసే సుతి మెత్తని వాక్యం.
"ఉత్తప్రేమ" అనే కవితలో
పూవు విచ్చుకోక ముందు దానిలో దాగిన చీకటి/సీతాకోక రంగుల ఆటలకి ముందు దాగిన చిక్కని ఏకాంతం/మధుర గానానికి ముందు సవరించుకునే కంఠధ్వని/ జీవితం ఉత్త ప్రేమ/ దుఃఖమంతా రహస్యం రాల్చిన ఎండుటాకులు. అందుకే ఈ కవిత్వం ఉత్త ప్రేమ సారం
"లోపలికి" అనే కవిత లో
కొలతలకి లొంగకు లెక్కల నుండి ఎగిరిపో/లొంగనట్టు కనబడడానికి కూడా.... అప్పుడు మేలుకుంటావు/ నిశ్శబ్ద రహస్య ప్రశాంత తటాకం ఒడ్డున..... కొంచెం తడిగా ఉండటం మినహా/ ఇక్కడ వేరేది చేయదగింది లేనట్లుంది. మన అసలుని మనకు అప్పగించే మాటలు ఇవి. ఇంకా ఇంత ప్రపంచం అతనికి/ రాలుతున్న ఎండుటాకు పాటి కాకపోవచ్చు.
ఇక్కడ అవ్వచ్చు అనడానికి ఎలా నిర్ధారిస్తారు కవి అది కావచ్చు కాకపోవచ్చు కాబట్టి కాకపోవచ్చు వాడారు కవి. ఎంత సమయోచిత ఉపమానమిది. చివరిగా "బహుశా అతనే నీలా ఉన్నాడు/ ఇప్పుడు నువ్వు చేయాల్సింది/ ఏమైనా మిగిలి ఉందా ఇక్కడ.
ఏమి ప్రశ్న వేదాంతానికి పరాకాష్ట.మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అలవోకగా అత్యంత సహజంగా వచ్చి చేరే ఉపమానాలు అభివ్యక్తి కి మంచి బలాన్ని ఇచ్చాయి.
"వాన రాత్రి" కవిత
వాన చప్పుడు ఒడిలో వాలి మనుషులు సుఖంగా నిద్రిస్తున్నారు/ తమ వారు అనుకుంటున్నా వారి మధ్య భద్రంగా/ఎప్పటికీ ఇలానే ఉంటామని కలలు కంటూ.
మనిషి లౌకికలంపటంలో పడి అదే శాశ్వతం అన్న భ్రాంతిలో బతికి అలాగే వెళ్ళిపోతాడు.కానీ ఒంటరిగా ఈ లోకంలోకి వచ్చిన వాడు సమూహంలో జీవిస్తూ చివరికి ఒంటరిగా వెళ్లాల్సిందే. ఈ లోపులో సుఖాలు దుఃఖాలూ, వేదనలూ, ఆనందాలూ, ఉద్వేగాలూ వీటితో సహచర్యం చేస్తూ ఒక స్పష్టత లేక ఇంత విలువైన జీవితం నిస్సారంగా గడిపేస్తాడు.
జీవితానికి ఒక స్పష్టత అవసరం. కొన్ని మౌలిక ప్రశ్నలవసరం. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము?ఎందుకు జీవిస్తున్నాము? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఈ ప్రశ్నలకు ఊరట ఈ కవిత్వం. కవిత చివరి వాక్యాలను శిల్పించిన తీరు అమోఘం.
"కలలు కంటావు"
కొన్ని కలలు కంటావు ఉదయాన పూలపై వాలిన నీరెండవి అయినట్లు ఎంత చిక్కని వాక్యం అంతేనా ఆ వాలిన ఎండ ఎవరో కాదు మనమే, కలగంటూ ఆ తాజాదనపు ప్రశాంత అనుభవాన్ని మనకు ఇస్తుంది. ఇక్కడ కలనిజంగా నువ్వు కనాలి లేదా ఊహలోనైనా జీవించాలి.తాథాత్యము చెందాలి. అప్పుడే ఈ కవిత చదివిన పాఠకుడు ధ్యాన ఫలితాన్ని పొందినట్లు. సీతాకోక సృష్టించే కొత్త శూన్యమైనట్లు.
కవి ప్రయోగించిన వాక్యం పాఠకుని అనుభవంలోకి తేగలిగే వాతావరణాన్ని ఇవ్వగలగాలి.
"ఉద్వేగాల నుండి"
ఉద్వేగాలని అడవిలోని వృక్షాలుగా వృక్షాల నుండి జాలువారే కిరణాలుగా కిరణాల్లో మిల మిలలాడే సెలయేళ్లుగా సెలయేళ్లలో దప్పిక తీర్చుకునే కీటకాలూ పక్షులుగా ఉత్ప్రేక్షించడం సముచితంగా కొత్తగా ఉంది.
" దయ నుండి" ....
ముందుగా శబ్దం ఉందని వారంటారు కానీ ముందుగానే దయనుండి ఆకాశం పుట్టిందని దయగల ఆకాశం నుండి సమస్తము పుట్టాయని సృష్టికి కొత్త నిర్వచనం ఇచ్చారు బివివి ప్రసాద్. సృష్టి ఆవిర్భావం దయతో జరిగిందని అక్షరాల దయను వర్షింప చేస్తారీ కవి.
" జీవనోద్వేగం"
ఈ కవిత జీవితం పట్ల ఒక స్పష్టతను కలిగిస్తుంది. " ఇంత విశ్వం" అనే కవితలో ఇంత విశ్వం నిన్ను జీవితంలా చిలికి నీ నుండి శాంతి అనే వెన్న తీస్తుంది.అంటారు" కాస్త ఆశలోకి"...జీవితాన్ని గురించి కవి, ఈ కవితల వెలువరించిన తీరు అతి సరళంగా అత్యంత కవితాత్మకంగా ఉంటుంది మనలో ఆశని మేల్కొల్పే కవిత ఇది. మెత్తని పూలరేకులు లాంటి శబ్దాలు,చక్కటి ఊహలు ఈ "సృష్టి" కవిత్వం.
"ప్రాతః కాలపు పొగ మంచును చూసావా/ సాలె గూటి పై పొందికగా ముత్యాలు పేర్చుతుంది/ అవి ఎండలోకి రంగులు చల్లుతూ మాయమవుతాయి/ ఊరికే మంచు బిందువులా నిలిచి మాయం కావాలి" అంటున్నారు ఎంత నిర్మలం ఎంత కోమలం చెట్ల ఆకుల వెనుక ఆకాశాన్ని గుర్తించటం కవి దార్శనికత కి నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి ఊహలు కోకొల్లలు ఈ పుస్తకం నిండా.
“మోహం”అనే కవితలో
జీవితం మీద ఇంత మోహం ఏమిటి అంటారు ఏ రోజైనా వెళ్లిపోయే విరక్తి ఉంది గనుక అంటావు.
చివరి వాక్యాల్లో “నువ్వు ప్రేమించేది దేనినో చెప్పమంటారు/ దేనిని ప్రేమిస్తున్నానో నాకు తెలియదు/బహుశా ఈ వెలుగునీడల కదలికల్లో/ నన్ను నేనే పొందుతున్నాను/ దాచుకుంటున్నాను/ జీవితం ప్రియురాలు రూపంలో/నన్నే చూసుకుని ఆశ్చర్యపోతూ, ప్రేమిస్తున్నాను”.
ఈ కవితలో ప్రేమ అయితే ఉంది గాని అది దేని మీద తెలియదు అంటారు అవును హృదయంలో ప్రేమ ఉండటం ప్రధానం దేని మీదో చెప్పగలిగితే అది పరిమితం అయిపోతుంది. అది అవధులు దాటాలి, పరిధి విస్తరించి విశ్వవ్యాపితం అవ్వాలి.
"జాగ్రత్త" అనే కవితలో 'మృత్యువు లోపలి కరుణ' అని కవి చేసిన వాక్య ప్రయోగం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మృత్యువును దయారహితంగా భావిస్తాం. కానీ కవి మాత్రం మృత్యువు లోపలి కరుణను దర్శించే అరుదైన నూతన సంస్కారాన్ని మనలో మేల్కొలుపుతున్నారు.
"సృష్టి"కవిత్వం విసిరిన సౌందర్యపు చెణుకులు కొన్ని..
1. కవి జీవితం రహస్యాలు ఎంతకీ అర్థం కావని చెబుతూ 'ఎంతకీ పగలని కొబ్బరికాయలా' అని చమత్కరిస్తారు.
2. మిత్రుడు వెళ్ళ వలసిన రైలు లేటుగా టైముకే వచ్చి నిలబడింది.
3. కలలో అందమైన మొహాన్ని మెలకువలో వెతకబోయినట్లు
4. సాయంత్రపు గగనంలో చివరి రంగులు ఆగి, ఇంకెవరైనా చూసేవారు ఉన్నారా అని అడిగినట్లు
5. పాత ఉద్యోగుల్లా వచ్చి వెళ్ళే ఋతువులు
6. మీట నొక్కినట్లు వెలిగి ఆరే ప్రేమలు ఉద్వేగాలు
7. నీడలు సంధ్యలో దీర్ఘమవుతూ మధ్యాహ్నాలు దాక్కుంటాయి
8. టీ కప్పులో లేచే ఆవిరి లాంటిది జీవితం.
9. తలపై బుడగలా ఎగురుతోంది గగనం
10. రాలిపోయే ఎండుటాకు మరో క్షణం ఆగినట్లు
11. కదలాడే నీటి బుడగపై తిరుగాడే బొమ్మ లాంటిది ప్రపంచం
12. గోడలపై బొమ్మల రంగులు గతకాలపు పిల్లల్లా శాంతిగా చూస్తున్నాయి.
ఇలాంటి 'ఎపిగ్రమేటిక్ అభివ్యక్తి' తో కూడిన వాక్యాలు కవిత్వం చదవాలనే ఆసక్తిని కలిగిస్తాయి.
వారు చెప్పినట్లుగానే ఈ కవిత్వం మనల్ని మహా శాంతి లోకి జారిపోయేటట్టు చేస్తుంది. మరేమీ కాదు ఒట్టి ప్రేమ సారమీ కవిత్వం.
మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్
పార్ట్ టైం పరిశోధక విద్యార్థి
ఆంధ్ర విశ్వ కళా పరిషత్, విశాఖపట్నం
9441350260
sriram9441350260@gmail.com
ప్రచురణ : సాహిత్య ప్రస్థానం జూన్ 2026

