26 జూన్ 2026

కవిత : సాయంత్రపు నీడలు

వాళ్ళ పొడవైన సాయంత్రపు నీడలు,
నేలనీ, నీటినీ, నీటిమీది మెరుపులనీ 
గడ్డిమైదానంపై కదలాడే నీడలనీ 
తడుపుతూ, ఆర్పుతూ కదిలే
ఇద్దరి నడకల నీడలు

వాళ్ళ మాటల్లో 
ఏ స్వప్నాలు మేలుకొంటున్నాయో,
ఏ నిరాశల చీకట్లు కమ్ముతున్నాయో,
ఏ ఆనందాల వేకువలు 
సుదూర పర్వతాలలో ఉదయిస్తున్నాయో
మనకైతే తెలీదు, బహుశా వారికి కూడా

నీడలు నడుస్తున్నాయి,
వాటి మానవులని నడిపిస్తున్నాయి,
వాటి చెట్లకి శాంతినిస్తున్నాయి,
నీడలపై వాలే చీకటిని 
త్వరగా రమ్మని, నెమ్మదిగా పిలుస్తున్నాయి

సాయంకాలపు నీడలు,
నీడల్లోకి ఒదుగుతున్న సాయంకాలపు జీవితం
నిన్ను ఈ క్షణానికి 
తమతో ఉండిపొమ్మని బ్రతిమాలుతున్నాయి

బహుశా, ప్రతి క్షణమూ 
పేదవాని ప్రేమ నిండిన పూరి గుడిశ 
అన్నీ విడిచి లోనికి రమ్మంటుంది,
ఏదీ విడువలేని నిన్ను
దీనంగా, కరుణతో చూస్తూ వుంటుంది

బివివి ప్రసాద్
ప్రచురణ : ఉదయిని 15.6.26

25 జూన్ 2026

మరేమీ కాదు ఒట్టి ప్రేమ సారమీ కవిత్వం : మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్

సీతాకోకఒకటిఎగురుతూ ఉంటుందిమనంఉన్నచోటే. దానిని పరికించే మనసు ఎంతమందికి ఉంటుంది. దానికి కొంత సున్నితత్వం కావాలి. ప్రకృతిని చూసి పరవశించే మెత్తదనం ఉండాలి.దానితో మమేకమయ్యే స్వభావం ఉండాలి. అదో ధ్యాన స్థితి.విషయీ విషయాల ఏకత. హైకూ కవిత్వానికి ఇదే మూలవనరు. దానిని దాటి,సీతాకోక రావడానికి ముందు శూన్యాకాసాన్ని అది వచ్చి వాలి తారాడిన క్షణాలను, ఎగిరిపోయిన తర్వాతి శూన్య సౌందర్యాన్ని అద్వైతాంశతో కవిత్వం చేస్తున్నారు బివివి ప్రసాద్.

వీరి కవిత్వం నిండా, కవి తనను తాను తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది. దానికి కవి నిర్మించుకున్న వాతావరణం మానవ జీవితం పట్ల అపారమైన శ్రద్ధ,అవ్యాజమైన ప్రేమ, అనంతమైన దయ మరి ఏమీ కాదు ఒట్టి ప్రేమ సారమీకవిత్వం.అందుకే వీరి నుండి నిసర్గమయ్యే ప్రతి వాక్యం తాజాగా అప్పుడే పూసిన గులాబీల్లా గుబాళిస్తుంది.మనసుని ఓ మత్తుకు గురిచేసి ప్రశాంతతనిస్తుంది.

 ఇది మార్మిక కవిత్వం. నిజానికి కవిత్వం కళ అవుతుంది. మార్మికత కళకాదు. కానీ ఈ కవి మార్మికంగా కవిత్వం అల్లడం మనం గమనిస్తాం. ఇదో వినూత్న పంథా. ఆధ్యాత్మికత అంటే మన మూలాలను మనం తెలుసుకోవడం. ఎరుకతో జీవించడం ఆ అనుభూతి గాఢతలోనే ఈ కవిత్వమంతా సాగుతుంది. 

వీరి భావనా ప్రపంచం మాటల కందేది కాదు. మరి కవి ఎలా పద సృష్టి చేస్తున్నారు. కవితా వాక్యాలను ఎలా నిర్వహిస్తున్నారు. అనేది ఆసక్తి కలిగించే విషయం. ఆశ్చర్యంగా కోకొల్లలుగా వచ్చి వాలే సుతిమెత్తని "కాయిన్డ్వర్డ్స్" ఈ కవిత్వ వాక్యాలకు పుష్టినివ్వడం మనం గమనిస్తాం. ఉదాహరణకు చీకటి వరద, రంగుల కాంతి, ఏకాంత సంగీతం, పరాయి శబ్దం, విసుగు పురుగు, ప్రేమ తునక, తెలికాంతి, జీవితేచ్చవిత్తనం, చీకటి ద్రవం, ఖాళీ వెలుతురు, లోకపు చిటికెన వేలు మొదలైనవి.

వీరి కవిత్వం చదివి ఒక అనుభూతి గాఢతకి గురికాని వారు లేరు చదివినా మళ్లీ చదవాలనిపించే కవిత్వం అంతేకాదు కొత్త వాక్యాల కోసం చకోరకాల్లా ఎదురు చూస్తాం. ఇప్పుడదే తారసపడింది .మన ముందు ఈ కవిత్వ వాక్యం పుష్టిగా రెక్కలు కట్టుకువాలింది "సృష్టి"గా.ఈ పుస్తకానికి “రమణ జీవి”వ్రాసిన అభిప్రాయం “గంగారెడ్డి” గారి మాటలు ఈ కవిత్వం పట్ల చాలా క్లారిటీ ఇస్తాయి. దీనిలో మొదటి కవిత "సృష్టి" అనే శీర్షికతోనే ప్రారంభమవుతుంది .

"ఖాళీ మనసులో కొన్ని రంగులు ఒంపు/ అవి ఆకాశమూ గాలీ నీరూ/ కాంతీ, చీకటిలో వెన్నెలా/ రంగుల పై కొన్ని గీతలు గీయి/ నదులూ, కొండలూ, మైదానాలూ/ఉదయాస్తమయ,మేఘాలూ, పాలపుంతలూ/
కదలికలలో ఉద్వేగాలు కలుపు/ చిక్కగా లేతగా తీవ్రంగా,తేలికగా/మంచీ,భయమూ,బాధా,ప్రేమా/
ఇంతకన్నా ఊహించేదేమీ లేదు/ నువ్వైనా దేవుడై నా/మళ్లీ మొదటికి రావాల్సిందే/నిద్రలోనో మరణంలోనో జ్ఞానంలోనో.

ఈ కవిత మొదటి పంక్తుల్లో ఖాళీ మనసు శూన్యానికి ప్రతీక సృష్టికి ముందు స్థితి. ఎత్తుగడలోని ఆ ఖాళీ మనసుతో కాసేపు రమిస్తాం.ఆ శూన్య సౌందర్య అనుభవంలో కాసేపు ఉండిపోతాం. కవిత మొత్తం చదివి మరలా రెండోసారి చదవడం మొదలుపెట్టినప్పుడు కలిగే అనుభవం ఇది.

ఇప్పుడు అందులో కొన్ని రంగులు ఒంపమన్నారు కవి. ఎంత అందంగా సరళంగా ప్రారంభమయ్యింది ఈ కవిత్వ “సృష్టి"అవే పంచభూతాలన్నమాట. భూమిని 'చీకటిలో వెన్నెల' అన్నారు. జ్ఞానానికి ప్రతీక కాబట్టి.రంగులపై గీతలు గీస్తే నదులూ కొండలూ, మొదలైన స్థావరాలు ఏర్పడ్డాయట.గీతల్ని కొంచెం కదిలిస్తే చెట్లు పిట్టలూ మనుషులూ మొదలైన జంగమ ప్రపంచం నిర్మాణమైందట. ఇప్పుడు వాటికి ఉద్వేగాలు కలిపారు కవి. అవి చిక్కగా లేతగా బాధ ప్రేమ అయ్యాయట.చివరి వాక్యాల్లో కవి నిద్ర,మరణం, జ్ఞానం మూడిటిలో కూడా మళ్లీ మొదటికి రావాల్సిందే మనమైనా దేవుడైన అంటారు. ఇక్కడ ఈ మూడూ లయానికి ప్రతీకలు. అత్యంత నేర్పుతో గిజిగాడి ఊయల గీము నిర్మాణాన్ని తలపించేలా కదలాడే భావ చిత్రాలను మన ముందు ఉంచారు కవి బివివి.
 
"రంగుల పిల్లలు" అనే కవితలో.. రంగులు అమాయకమైనవి/ నలుపూ తెలుపుల్లా కలలు రాలి పోయినవి కావు/ పసిపిల్లలు ఉల్లాసంగా మేల్కొన్నట్లు ఉదయాన గగనంలో మేలుకుంటాయి"
 ఇంద్ర ధనువుల మీదుగా /సీతాకోకల రెక్కల మీదుగా పూలని చేరి/ నీ వైపు నవ్వుతూ దర్శనమిస్తాయి....
అని సాగే ఈ కవితలో కవి రంగులు మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, దుఃఖంలో మరలా నిలబడేట్టు వెన్ను తడతాయి. నలుపూ తెలుపూ అనే దుఃఖానందాల మధ్య ఆశని రగులుస్తాయి అంటారు. తర్వాత వాక్యాల్లో తెలియందేదో లోకంగా వికసించడం అని వేదాంతపరంగా లోకాన్ని నిర్వచించడం బాగుంది. ఆడింది చాలు, పడుకోండని అమ్మానాన్నల వంటి నలుపూ తెలుపులు పిలిచినపుడు, బొమ్మల్లాంటి మనని విసిరేసి ఏకైక మహాశాంతి లోకి జారిపోతాయి.
ఇక్కడ ఏకైక మహాశాంతి లోకి జారిపోయిన రంగులు మనల్ని ఏకైక శూన్యంలో తేలేలా చేసాయి. చివరి వాక్యాల్లో "ఇప్పుడు కలల్లోకి పాకుతూ వచ్చిన రంగులు/ నీతో ఏం మాట్లాడుతున్నాయి" అని ఉంటుంది 
ఇక్కడ 'అందరి నిద్రా ఒక్కటే అది ఏకైక శూన్యం' అక్కడ రంగులు మీతో ఏం అంటున్నాయి అని ప్రశ్నిస్తారు కవి 
నలుపూ తెలుపులు మన మూలాలకి, ఏకైక శాంతికి సంకేతాలు అక్కడి నుండి వచ్చిన మనం ప్రకృతికి అద్దిన రంగులనే ఆశల వలన జీవిస్తూ ఉంటాం. సత్యం బోధపడ్డాక వాటిని వాటిగానే యథార్థ స్థితిలో చూడగలుగుతాం.ఈ కవితా శిల్పం కవి ప్రతిభకు గీటురాయిగా చెప్పవచ్చు. 

"పుట్టినరోజున"అనే కవిత లో 
     "ఇవాళ నీకు నువ్వే గుర్తుకొస్తుంటావు/ ఉదయం పూలూ చినుకులూ రాలినట్లు/ ఒకనాడు ఇక్కడకు రాలావు/వాటికి కరిగి మాయమైపోవడం తెలుసు/ మరి నీ సంగతి అంటారు ఎవరో?... అని సాగే ఈ కవితలో కవి ఎంత సున్నిత వాక్యాలతో ప్రారంభించారు కవితని. మనిషి పుట్టుకలోని సహజత్వాన్ని ఇంత మృదువుగా ఉత్ప్రేక్షించిన కవిని ఇంతకు మునిపెన్నడూ మనం చూడము.

సృష్టిలో ప్రతి జీవి ఎంత సహజంగా వచ్చిందో అంత సహజంగా జీవించి వెళ్ళిపోతుంది.మరి మానవుడు, ఇదే ప్రశ్న కవి వేశారు " మరి నీ సంగతి అంటారు ఎవరో? ఆ 'ఎవరో 'అనడంలోనే వాక్య బలం రెండింతలు అయింది.
ఈ కవితలో బతుకుని నైరూప్య చిత్రమనీ నిర్వచించి అర్ధాల ఇరుకునుండి ఎంత విముక్తమయితే అంత సారవంతం అవుతుందని ఎంత స్వేచ్ఛ లోకి మేలుకుంటే అంత ఆర్ద్రతలోకి వికసిస్తుందని జీవనమాధుర్యాన్ని ఎలా చవిచూడాలో పాఠకుడిని శిశువుగా చేసి మరీ కవిత్వపు ఉగ్గుపడుతున్నారీ కవి. 

నైరూప్యఛాయాచిత్రణ లో చిక్కబడ్డ అద్వైతం ఈ కవిత్వం
"ప్రేమ ఉంటే" అనే కవితలో ప్రేమ ఉంటే పెద్దగా చెప్పడానికి ఏమీ ఉండదు/ మాటలన్నీ మంచు ముక్కల్లా ప్రేమలో కరిగిపోతాయి/పూలరంగులు వెలుగుతాయి/ నక్షత్రాలు అనంతాన్ని విరబూస్తాయి/ స్పర్శ జీవితాన్ని సారవంతం చేస్తుంది. కవి ఇక్కడ ఓ మాట అంటారు "జీవుల చూపుల సారం ప్రేమ కోసం ఎదురుచూపు. భయాలు కోరికలు ప్రేమ దక్కక చేసే వెర్రి పనులు" ఇది మానవాళికి అందాల్సిన ఓ అద్భుతమైన 'మోరల్ స్టేట్మెంట్'. నిజమే కదా లోకంలోని సమస్త సమస్యలకు దుఃఖాలకి సరిపడా ప్రేమ లేకపోవడమే కారణం. అనంతమైన ప్రేమలోకి ఒక్కసారి మేల్కొనగలిగితే బాధలు అన్నిటికీ ఉపశమనం దొరికినట్టే.      
 
'అద్వైతం'అనే మరో కవితలో 
సాంద్రమైన స్వచ్ఛమైన ఒక జీవితానుభవం చాలదా బ్రతుకంతా వెలగడానికి అంటారు. పాఠకుడు తాను కూడా లోతుగా మౌనంలోకంటూ మేల్కొంటే గాని ఈ కవిత్వం ఒంటపట్టదు.
 
"ఒకరికొకరు" అనే కవిత ఉంది.రెండవ భాగంలో
 ఆమె ముఖంలోకి చూసేటపుడు/అతని ముఖంలో చలిమంట వెలుగుంటుంది/ చల్లని గాలుల పూతరేకుల శబ్దాలుంటాయి /వెన్నెలలో వినిపించి ఆగే పిట్ట పాట ఉంటుంది/చినుకుల్లో మాయమయ్యే ఇంద్ర ధనువులుంటాయి అంటారు.

ఇక్కడ పిట్ట పాట ఆగిన తర్వాత, ఇంద్రధనువు మాయమైన తర్వాత, కలిగే సౌందర్యానుభవం చాలా గాఢమైనది. కాలాల కావలి నిశ్శబ్దంలోకి మనల్ని జారిపోయేలా చేసే సుతి మెత్తని వాక్యం. 

"ఉత్తప్రేమ" అనే కవితలో 
పూవు విచ్చుకోక ముందు దానిలో దాగిన చీకటి/సీతాకోక రంగుల ఆటలకి ముందు దాగిన చిక్కని ఏకాంతం/మధుర గానానికి ముందు సవరించుకునే కంఠధ్వని/ జీవితం ఉత్త ప్రేమ/ దుఃఖమంతా రహస్యం రాల్చిన ఎండుటాకులు. అందుకే ఈ కవిత్వం ఉత్త ప్రేమ సారం 

"లోపలికి" అనే కవిత లో 
కొలతలకి లొంగకు లెక్కల నుండి ఎగిరిపో/లొంగనట్టు కనబడడానికి కూడా.... అప్పుడు మేలుకుంటావు/ నిశ్శబ్ద రహస్య ప్రశాంత తటాకం ఒడ్డున..... కొంచెం తడిగా ఉండటం మినహా/ ఇక్కడ వేరేది చేయదగింది లేనట్లుంది. మన అసలుని మనకు అప్పగించే మాటలు ఇవి. ఇంకా ఇంత ప్రపంచం అతనికి/ రాలుతున్న ఎండుటాకు పాటి కాకపోవచ్చు. 
ఇక్కడ అవ్వచ్చు అనడానికి ఎలా నిర్ధారిస్తారు కవి అది కావచ్చు కాకపోవచ్చు కాబట్టి కాకపోవచ్చు వాడారు కవి. ఎంత సమయోచిత ఉపమానమిది. చివరిగా "బహుశా అతనే నీలా ఉన్నాడు/ ఇప్పుడు నువ్వు చేయాల్సింది/ ఏమైనా మిగిలి ఉందా ఇక్కడ.
 ఏమి ప్రశ్న వేదాంతానికి పరాకాష్ట.మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అలవోకగా అత్యంత సహజంగా వచ్చి చేరే ఉపమానాలు అభివ్యక్తి కి మంచి బలాన్ని ఇచ్చాయి.

"వాన రాత్రి" కవిత 
వాన చప్పుడు ఒడిలో వాలి మనుషులు సుఖంగా నిద్రిస్తున్నారు/ తమ వారు అనుకుంటున్నా వారి మధ్య భద్రంగా/ఎప్పటికీ ఇలానే ఉంటామని కలలు కంటూ.

మనిషి లౌకికలంపటంలో పడి అదే శాశ్వతం అన్న భ్రాంతిలో బతికి అలాగే వెళ్ళిపోతాడు.కానీ ఒంటరిగా ఈ లోకంలోకి వచ్చిన వాడు సమూహంలో జీవిస్తూ చివరికి ఒంటరిగా వెళ్లాల్సిందే. ఈ లోపులో సుఖాలు దుఃఖాలూ, వేదనలూ, ఆనందాలూ, ఉద్వేగాలూ వీటితో సహచర్యం చేస్తూ ఒక స్పష్టత లేక ఇంత విలువైన జీవితం నిస్సారంగా గడిపేస్తాడు.  

జీవితానికి ఒక స్పష్టత అవసరం. కొన్ని మౌలిక ప్రశ్నలవసరం. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము?ఎందుకు జీవిస్తున్నాము? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఈ ప్రశ్నలకు ఊరట ఈ కవిత్వం. కవిత చివరి వాక్యాలను శిల్పించిన తీరు అమోఘం.

"కలలు కంటావు"
 కొన్ని కలలు కంటావు ఉదయాన పూలపై వాలిన నీరెండవి అయినట్లు ఎంత చిక్కని వాక్యం అంతేనా ఆ వాలిన ఎండ ఎవరో కాదు మనమే, కలగంటూ ఆ తాజాదనపు ప్రశాంత అనుభవాన్ని మనకు ఇస్తుంది. ఇక్కడ కలనిజంగా నువ్వు కనాలి లేదా ఊహలోనైనా జీవించాలి.తాథాత్యము చెందాలి. అప్పుడే ఈ కవిత చదివిన పాఠకుడు ధ్యాన ఫలితాన్ని పొందినట్లు. సీతాకోక సృష్టించే కొత్త శూన్యమైనట్లు. 
కవి ప్రయోగించిన వాక్యం పాఠకుని అనుభవంలోకి తేగలిగే వాతావరణాన్ని ఇవ్వగలగాలి. 

"ఉద్వేగాల నుండి"
ఉద్వేగాలని అడవిలోని వృక్షాలుగా వృక్షాల నుండి జాలువారే కిరణాలుగా కిరణాల్లో మిల మిలలాడే సెలయేళ్లుగా సెలయేళ్లలో దప్పిక తీర్చుకునే కీటకాలూ పక్షులుగా ఉత్ప్రేక్షించడం సముచితంగా కొత్తగా ఉంది. 

" దయ నుండి" ....
ముందుగా శబ్దం ఉందని వారంటారు కానీ ముందుగానే దయనుండి ఆకాశం పుట్టిందని దయగల ఆకాశం నుండి సమస్తము పుట్టాయని సృష్టికి కొత్త నిర్వచనం ఇచ్చారు బివివి ప్రసాద్. సృష్టి ఆవిర్భావం దయతో జరిగిందని అక్షరాల దయను వర్షింప చేస్తారీ కవి.

" జీవనోద్వేగం" 
   ఈ కవిత జీవితం పట్ల ఒక స్పష్టతను కలిగిస్తుంది. " ఇంత విశ్వం" అనే కవితలో ఇంత విశ్వం నిన్ను జీవితంలా చిలికి నీ నుండి శాంతి అనే వెన్న తీస్తుంది.అంటారు" కాస్త ఆశలోకి"...జీవితాన్ని గురించి కవి, ఈ కవితల వెలువరించిన తీరు అతి సరళంగా అత్యంత కవితాత్మకంగా ఉంటుంది మనలో ఆశని మేల్కొల్పే కవిత ఇది. మెత్తని పూలరేకులు లాంటి శబ్దాలు,చక్కటి ఊహలు ఈ "సృష్టి" కవిత్వం.
"ప్రాతః కాలపు పొగ మంచును చూసావా/ సాలె గూటి పై పొందికగా ముత్యాలు పేర్చుతుంది/ అవి ఎండలోకి రంగులు చల్లుతూ మాయమవుతాయి/ ఊరికే మంచు బిందువులా నిలిచి మాయం కావాలి" అంటున్నారు ఎంత నిర్మలం ఎంత కోమలం చెట్ల ఆకుల వెనుక ఆకాశాన్ని గుర్తించటం కవి దార్శనికత కి నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి ఊహలు కోకొల్లలు ఈ పుస్తకం నిండా.

“మోహం”అనే కవితలో 
జీవితం మీద ఇంత మోహం ఏమిటి అంటారు ఏ రోజైనా వెళ్లిపోయే విరక్తి ఉంది గనుక అంటావు.
చివరి వాక్యాల్లో “నువ్వు ప్రేమించేది దేనినో చెప్పమంటారు/ దేనిని ప్రేమిస్తున్నానో నాకు తెలియదు/బహుశా ఈ వెలుగునీడల కదలికల్లో/ నన్ను నేనే పొందుతున్నాను/ దాచుకుంటున్నాను/ జీవితం ప్రియురాలు రూపంలో/నన్నే చూసుకుని ఆశ్చర్యపోతూ, ప్రేమిస్తున్నాను”.
ఈ కవితలో ప్రేమ అయితే ఉంది గాని అది దేని మీద తెలియదు అంటారు అవును హృదయంలో ప్రేమ ఉండటం ప్రధానం దేని మీదో చెప్పగలిగితే అది పరిమితం అయిపోతుంది. అది అవధులు దాటాలి, పరిధి విస్తరించి విశ్వవ్యాపితం అవ్వాలి.

"జాగ్రత్త" అనే కవితలో 'మృత్యువు లోపలి కరుణ' అని కవి చేసిన వాక్య ప్రయోగం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మృత్యువును దయారహితంగా భావిస్తాం. కానీ కవి మాత్రం మృత్యువు లోపలి కరుణను దర్శించే అరుదైన నూతన సంస్కారాన్ని మనలో మేల్కొలుపుతున్నారు. 

"సృష్టి"కవిత్వం విసిరిన సౌందర్యపు చెణుకులు కొన్ని.. 
1. కవి జీవితం రహస్యాలు ఎంతకీ అర్థం కావని చెబుతూ 'ఎంతకీ పగలని కొబ్బరికాయలా' అని చమత్కరిస్తారు. 
2. మిత్రుడు వెళ్ళ వలసిన రైలు లేటుగా టైముకే వచ్చి నిలబడింది. 
3. కలలో అందమైన మొహాన్ని మెలకువలో వెతకబోయినట్లు 
4. సాయంత్రపు గగనంలో చివరి రంగులు ఆగి, ఇంకెవరైనా చూసేవారు ఉన్నారా అని అడిగినట్లు 
5. పాత ఉద్యోగుల్లా వచ్చి వెళ్ళే ఋతువులు 
6. మీట నొక్కినట్లు వెలిగి ఆరే ప్రేమలు ఉద్వేగాలు 
7. నీడలు సంధ్యలో దీర్ఘమవుతూ మధ్యాహ్నాలు దాక్కుంటాయి 
8. టీ కప్పులో లేచే ఆవిరి లాంటిది జీవితం. 
9. తలపై బుడగలా ఎగురుతోంది గగనం 
10. రాలిపోయే ఎండుటాకు మరో క్షణం ఆగినట్లు 
11. కదలాడే నీటి బుడగపై తిరుగాడే బొమ్మ లాంటిది ప్రపంచం 
12. గోడలపై బొమ్మల రంగులు గతకాలపు పిల్లల్లా శాంతిగా చూస్తున్నాయి. 

ఇలాంటి 'ఎపిగ్రమేటిక్ అభివ్యక్తి' తో కూడిన వాక్యాలు కవిత్వం చదవాలనే ఆసక్తిని కలిగిస్తాయి. 
వారు చెప్పినట్లుగానే ఈ కవిత్వం మనల్ని మహా శాంతి లోకి జారిపోయేటట్టు చేస్తుంది. మరేమీ కాదు ఒట్టి ప్రేమ సారమీ కవిత్వం.

మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్ 
పార్ట్ టైం పరిశోధక విద్యార్థి 
ఆంధ్ర విశ్వ కళా పరిషత్, విశాఖపట్నం 
9441350260 
sriram9441350260@gmail.com

ప్రచురణ : సాహిత్య ప్రస్థానం జూన్ 2026

బి.వి.వి.ప్రసాద్ కవిత్వ పరిశీలన : మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్

 బి.వి.వి.ప్రసాద్ కవిత్వ పరిశీలన : మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్

వ్యాససంగ్రహం :-

ఈ వ్యాసం "మానవ జీవితం అనేక జీవితాలుగా కాక ఒకే జీవితంగా, ఉన్నదంతా ఒకే సారంగా భావించి కవిత్వం చేయడం బి.వి.వి. ప్రసాద్ కవిత్వ దృక్పథంగా గుర్తిస్తుంది". మనలో "ఎరుక/ఇంటెన్షనాలిటీ" ఒకటి ఉంటుంది. అది మన మూలాలకు చెందినది. దాని మూలకాలు ప్రేమ, దయ, శాంతి, ఓర్పు, మొదలైన మౌలిక భావనలు. ఇవే మనలను పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దేవి అని ఈ కవిత్వం ద్వారా స్పష్టం చేస్తుంది ఈ వ్యాసం. కవి వ్యక్తిత్వం లోని సున్నితత్వం, వినూత్న ధోరణితో కవిత్వం అల్లడానికి నిర్మించుకున్న వాతావరణం మరియు సహజ అనలంకారిక శైలి, అభివ్యక్తి నవ్యత మొదలైన విషయాలను ఆధునికత కలిగిన కవితా రీతిగా వివరిస్తుంది ఈ వ్యాసం, ఆధ్యాత్మికత లో వుండే సమర్పణ భావం విశ్వచైతన్యం పట్ల హైకూ ఏవిధంగా పాఠకుడిలో మెలకువ కలిగిస్తుందో చెబుతుంది ఈ వ్యాసం. "నేనే ఈ క్షణం" సంపుటిలో కవి మెటానమీ టెక్నిక్/పద చిత్రాలద్వారా ఏవిధంగా జీవన సారం, ప్రాకృతిక సౌందర్యం కవిత్వం చేసారో వివరిస్తుంది. 'ఆకాశం', 'నీలో కొన్ని సార్లు', 'ఊరికే జీవితమై', 'సృష్టి' సంపుటులు అందించిన తాత్వికానుభూతిని లోతుగా విశ్లేషిస్తుంది ఈ వ్యాసం. ఈ కవి కవిత్వాన్ని తమ సమకాలీన ప్రసిద్ధకవులు ఎలా ఆదరించారో రికార్డు చేయడం ద్వారా కవిత్వ పరిశీలనద్వారా బి.వి.వి. ప్రసాద్ కవిత్వంలోని నవ్యతను వివరిస్తుంది. విశ్లేషణాత్మక, వర్ణనాత్మక పద్ధతిలో ఈ పరిశోధన సాగింది. తాత్విక నేపథ్యమున్న భవిష్యత్ పరిశోధకులకు ఈ వ్యాసం ఉపకరిస్తుంది.

కీలక పదాలు :- మౌలిక భావనలు, తాత్వికానుభూతి, నూతన దృక్పథం, హైకూ, మెటానమీ టెక్నిక్, ఆకాశం, కొత్తదైన మెలకువ, ఎరుక, ఒక ఫిల్టర్. ప్రధాన స్రవంతి కి భిన్నంగా, అద్వైతాంశ.

2 :

బి.వి.వి. ప్రసాద్ కవిత్వ దృక్పథం

ఆధునికత/నవ్యత :
ఆధునికత :- "కవిత్వంలో ఆధునికత్వం అనగా స్వభావమును బట్టి ఆధునికత్వమే గాని కాలమును బట్టినది కానేకాదు" డా॥ సి.నారె. ఈ నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని బి.వి.వి. ప్రసాద్ కవిత్వంలోని నవ్యతను వివరిస్తుంది ఈ వ్యాసం.

సాహిత్య ప్రయోజనం సమాజ హితమే. అది ఏదో ఒక వాదమునకు పరిమితమైతే ఆ సమస్య మాత్రమే పరిష్కరించబడుతుంది. అది కూడా మంచిదే. కాని పరిపుష్టమైన, సమగ్రమైన సమాజనిర్మాణానికి మార్పు అనేది ముందు నీ నుండి రావాలని అంటారు బి.వి.వి. ప్రసాద్. మనలో తేలికదనము ఉండాలి, సరళత ఉండాలి. ఏ పని చేసిన ఏమి ఆలోచించినా దయ, ప్రేమ నింపుకొని చేయాలి అనే నూతన దృక్పథంతో వీరి కవిత్వం పరిమళిస్తుంది.

నువ్వు చెప్పేది ఏదైనా నీ అనుభవంలోంచి పలకాలి అన్న ఆర్.ఎస్.సుదర్శనం గారి మాటలు తూచా తప్పకుండా పలికాడు ఈ కవి.

ఐతే ఇతని భావజాలం, కవితా వస్తువులు, భావ చిత్రాలు, మర్మంగా లోతుగా అనుభవంలోంచి చెప్పడం ఒక నూతన కవితా రీతిని కలిగి ఉన్నాయి.

1) సహజ అనలంకారిక శైలి :
ఇప్పటి వరకూ ఫిగరేటివ్ లాంగ్వేజ్ / అర్నేట్ స్టైల్ చదవడానికి అలవాటు పడిన పాఠకుడు
ఒక్కసారిగా ఈ సహజ అనలంకారిక రచనా విధానాన్ని తీసుకోవడం కొంత కష్టమే కానీ ఇదే మన అసలు సహజ స్థితిని ఎరుక చేసే శైలి అని తెలుసుకున్నాక పాఠకుడు సాంత్వన పొందుతాడు. అంతే కాకుండా ఈ కవిత్వానికి అంకిత మయిపోతాడు.
ఈ కవిత్వం మనకు అందించేది ఒక్కటే హాయిగా జీవించడమెలానో నేర్పుతుంది. ఏ పేచీ లేకుండా శాంతంగా ఎలా మనవచ్చో తెలుపుతుంది. ఊరికే జీవితమై అన్నంతగా, ఇదే బి.వి.వి.ప్రసాద్ కవిత్వం మనకందించే గొప్ప కవిత్వ కానుక.

2) వ్యక్తిత్వం లోని సున్నితత్వం
బి.వి.వి.ప్రసాద్ స్వభావ రీత్యా సున్నితస్థుడు, లోతైన అన్వేషి, తగినంత ఆర్ద్రత, నిజాయితీ, చేసే పనిపట్ల ప్రాణం పెట్టి చేయడం నచ్చని వాటికి దూరంగా ఉండడం, ఇతరుల్లో మానవీయ విలువలు ఆశించి తరచూ నిస్పృహకు గురికావడం తన వ్యక్తిత్వంగా గమనించి. తన లోపలి వెలితి ఒకటి తన జీవిత గమనాన్ని శాసిస్తుందని భావించి ఆ వెలితిని నింపే ప్రయత్నంగా కవిత్వాన్ని ఆవిష్కరించారు.

3) కవిత్వం కోసం నిర్మించుకున్న వాతావరణం
వైరుధ్య భావాలతో జీవించే మానవ లోకంలో మనందరి మనస్సు ఉపశమించే మంత్రనగరి ఒకటి కావాలి. అక్కడ అందరం కలసి చెట్టపట్టాలేసుకుని హాయిగా తిరగాలి, బిగ్గరగా నవ్వుకోవాలి.

3:
మనస్పూర్తిగా ఏడవాలి. అదో పరమ శాంతిమయ లోకం కావాలి. ఈ విశ్వంలో చెలరేగుతున్న మనో మాలిన్యపు రాశులను బూడిద చేయగలగాలి. ఆ పరమ శాంతి ధామమే ఈ కవిత్వం.

II మొదటి వచన సంపుటి "ఆరాధన" సమర్పణ భావన

బి.వి.వి.ప్రసాద్ తన 23 ఏళ్ళ వయస్సులో మొదటి కవితా సంపుటి 'ఆరాధన' వేసారు. దీని నిండా సమర్పణ భావన వుంటుంది. దీనికి ముందుమాటలో కవి తనను తాను వెతుక్కునే ప్రయత్నమే ఇందులో వుంది. అంతేకాక ఇతరులలో తను గుర్తించడాన్ని ప్రేమ అంటారనుకుంటాను. ప్రేమను తెలియజేయడంలో 'ఆరాధన' ఒక పద్ధతి అంటారు.

మానవ జీవితం అనేక జీవితాలుగా కాక ఒకే జీవితంగా ఉన్నదంతా ఒకే సారంగా భావించి కవిత్వం చేయడం వీరి దృక్పథంగా కనిపిస్తుంది.

నిన్ను సేవించుదామని / ఎన్నో సుందర పుష్పాలు ఏరి తెచ్చి తుదకు / వాటి సౌందర్యం పై మోహంతో / నిన్నే విస్మరించాను అంటారు. 
(ఆరాధన వచన కవిత్వం- 1989)

మనం చేసేదిదే. ఈ లోకంలోకి ఎందుకొచ్చామో మరచిపోయి ఇతర వ్యామోహాల్లో పడిపోతాము. అంటే మన అసలుని మరిచి పోవడం, అదే మాయ. అలాంటి మాయలో పడవద్దని కవిపిలుపు. సాధారణంగా మనందరికీ మృత్యు భయం వుంటుంది. ఏ రమణ భగవానో, ఓషో లాంటి తాత్వికులను మినహాయిస్తే. ఈ కవి తన కవిత్వంలో చాలా విరివిగా మృత్యువును గురించిన కవితలు అల్లారు. మృత్యువనేది జీవితంలో తప్పని సరి భాగం అయినప్పుడు దాన్ని సానుకూలంగా ఎలా తీసుకోవాలో మరింత ఎరుకతో జీవితాన్ని ఎంత చక్కగా పండించుకోవచ్చునో తెలుసుకోవడమే కాక సాంత్వన పొందుతాము.

మృత్యుస్పృహ / మన మనస్సులో / ప్రధానమైన అంతర్వాహిని అయ్యే కొలదీ// మన జీవితాలలో అనుబంధాలలో/ లాలిత్యమూ, ప్రేమా ఉన్నతంగా దర్శనమిస్తాయి// 
(ఆరాధన- 1989- మృత్యుస్పృహ)

III హైకూ కవిత్వం తాత్విక సాంద్రత

తెలుగు హైకూకి వెలుగులద్దిన ప్రసిద్ధ హైకూ కవిగా బి.వి.వి. ప్రసాద్ సుపరిచితులు. తెలుగు హైకూని పరిపుష్టం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. హైకూ అనేది ఒక పదచిత్రం. కవి ఇస్మాయిల్ గారన్నట్లు చంద్రుణ్ణి చూపించే వేలు, చంద్రుణ్ణి చూపించాక వేలు అవసరం లేనట్లు హైకూను చదివాక అనుభూతి మాత్రమే మిగలాలి. క్లుప్తత, సాంద్రత, గాఢమైన తాత్విక చింతన, సౌందర్యాత్మకత ప్రకృతిలో మమేక మయ్యే స్వభావముండాలి. తేలిక దనం వుండాలి. ఇవన్నీ స్వభావరీత్యా బి.వి.వి. ప్రసాద్ లో సహజంగా వుండడం వలన హైకూ పేరు చెబితే బి.వి.వి. హైకూలు గుర్తుకొచ్చేట్లుగా హైకూలు రాసారు. బివివి మూడు హైకూ సంపుటాలు తీసుకొచ్చారు.

1.దృశ్యాదృశ్యం,(1995), 2. హైకూ (1997). 3. పూలు రాలాయి (1999) వీరు 'బషో' హైకూలను స్వేచ్ఛానువాదం కూడా చేసారు. రెండు ప్రసిద్ధ హైకూ వ్యాసాలు 1. ప్రకృతీ, జీవితం హైకూల మయమే, 2. హైకూ అంటే జీవన స్పృహ రచించారు. ఇవి సాహితీ లోకంలో చిరస్థాయిగా నిలిచిపోయే రచనలు.

4:

వర్షం / క్షణం పూచే నీటి పూలతో / ఊరు నిండిపోయింది// ఈ హైకూని వినగానే ఓ గొప్ప సౌందర్యానుభూతికి గురవుతాము. వర్షపు చినుకులను క్షణం పూచే నీటి పూలు అనడం ఎంత బాగుంది. పాఠకుడు ఒక అవ్యాజమైన అనుభూతికి గురవుతాడు. సౌందర్యం క్షణికమనే అవగాహన నుండి పుట్టిన ఒక వైరాగ్య వీచిక ఈ హైకూ ఈ అనుభూతిని 'అవారే' అంటారు.

మరో హైకూ :
పధికుని పలకరింపుకై / చూసి, నవ్వి, చిన్న బోయిన /వీధి దీపం//
(దృశ్యాదృశ్యం,(1995).

హైకూ పరిభాషలో దీనిని "సతోరి" అంటారు. మనం ప్రకృతిలోని చరాచరములనుండిఎంతో మేలు పొందుతాము. కానీ కనీసం ఆ స్పృహ కూడా మనకుండదు. అంత సున్నిత విషయాలపట్ల కృతజ్ఞతను మేల్కొల్పడం ఇక్కడ హైకూ కవి ఉద్ధేశ్యం. ఇంత సున్నిత విషయాలపట్ల స్పృహ ఉంటే మనం జీవించే తీరు ఇంకా ఉన్నతంగా వుంటుంది కదా!

రాత్రి తారలు / నదినిండా కురిసాయేమో / తీరమంతా ఇనుకమయం//
దృశ్యాదృశ్యం,(1995)

నదీ తీరమంతా ఇసుక మేటలతో నిండి వుంటుంది. మనం అంతవరకే గమనిస్తాం. కానీ హైకూ కవి ఆ ఇసుక రేణువులు సూర్యకాంతికి మెరవడం ఎలా ఉందంటున్నాడంటే అది చిన్ని చిన్ని తారలు చిన్ని రేణువులుగా కుప్ప బోసినట్లుందట. అది రాత్రంతా తారలు కురవడం వలన అలా అయిందట ఏమీ సౌందర్యం. ఇది ఒక అమోఘమైన అనుభూతి చిత్రం కదా!

IV "నేనే ఈ క్షణం" అనుభూతి సౌందర్యం

వీరు 2006లో 'నేనే ఈ క్షణం' అనే కవితా సంపుటి వేసారు. ప్రాకృతిక సౌందర్యాన్ని, జీవనతత్వాన్ని పెనవేసుకొని అద్భుత భావచిత్రాలుగా ఆవిష్కరించబడ్డ కవితా సుగంధం "నేనే ఈ క్షణం"

ఎండకురిస్తే / చెట్టునిండా / ఆకు పచ్చని చినుకులు//
చీకటి కురిస్తే / చెట్టు నిండా / నల్లని మబ్బులు //
మబ్బుల్లోని చినుకుల్ని కురుస్తూంది చెట్టు //

ఈ కవితలో కవిగీసిన పదచిత్రాలు "మెటానమీ" టెక్నిక్ లో వుండడం వల్ల పాఠకుణ్ణి చురుకుగా ఆలోచింపజేసి, సమాధాన పడ్డాక చక్కటి ఆనందానుభూతిని కలిగిస్తాయి.

V "ఆకాశం" ఓ మార్మిక పరిమళం

ఒక దశాబ్ద కాలంపాటు కవిత్వానికి దూరంగా వున్న ప్రసాద్ గారు ఆ సమయంలో చేసిన అంతర్ముఖ సాధన, జీవనానుభవాలను దగ్గరగా దర్శించడం అదే కవిత్వంగా ఒక వినూత్న ధోరణితో మూడు, నాలుగు నెలల వ్యవధిలో 100 ప్రసిద్ధ కవితలుగా 'ఆకాశం' వెలువడడం గమనార్హం. హైకూ కవిగా సుపరిచితులైన బివివిని 'ఆకాశం' కవితా సంపుటి వచనకవిగా సమున్నత సాహితీ శిఖరంపై కూర్చోబెట్టింది.

"ఆకాశం" వ్రాసేటప్పుడు వారు పెట్టుకున్న నియమాలు తూచా తప్పకుండా పాటించడం మనం చూస్తాము.

5:

ఏ భావం పలికినా మార్దవంగా, తాత్వికానుభూతిని, సౌందర్యాన్ని రంగరించి 'దయ' అంతర్లీనంగా వుండేట్టు కవిత్వీకరించడం మనం గమనిస్తాము.

పుట్టగానే పిల్లలు నవ్వరెందుకని వాళ్ళు ఏ వెలుతురులో ఈది వచ్చారు/ ఏ ఆనందాలు దాటి వచ్చారు/ ఏ హద్దుల్లేని దేశాలు ఎగిరి వచ్చారు/ పుట్టగానే పిల్లలు నవ్వలేరెందుకని ఏ పవిత్ర సీమలు విడిచి వచ్చారు/ ఏ దయాపూర్ణ హస్తాలు విడిచి పెట్టారు / ఏ కపటం లేని లోకాలు పోగొట్టుకున్నారు//

పుట్టగానే పిల్లలు ఎప్పుడూ ఏడుస్తారు ఎందుకని / దుఃఖమయ ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తారెందుకని// (పుట్టగానే పిల్లలు ఆకాశం - 2011)

పిల్లల్ని గురించిన మరోకవిత:-
పిల్లల్ని ప్రేమించడం నేర్చుకుంటే చాలు/ పిల్లల్ని ప్రేమిస్తే చాలు వారికోసం ఒక మంచి ప్రపంచాన్ని వారే సృష్టించుకుంటారు (ఆకాశం 2011)

ఈ వాక్యం మనం మరవకుండా వుండగలిగితే చాలు. నేటి సమాజంలో పిల్లల్ని ప్రభావితం చేయడంలో పెద్దలు విఫల యత్నం చేస్తున్నారు. దీని వలన పిల్లలు ఒత్తిడికి గురయి వారి సహజత్వాన్ని, సృజనని కోల్పోతున్నారు. పిల్లల్ని వారి మానాన్న వారిని ఎదగనిస్తే చాలు అద్భుతాలు సృష్టిస్తారు. వారి స్వచ్ఛమైన లేత మనసుల్ని కలుషితం చేయకుండా వుండగలిగితే చాలు. సినారె. అంటారు. "పాపాలను కడిగి వేస్తుందిలే పాల నవ్వుల నురుగు" అని

VI "నీలో కొన్ని సార్లు" లోతైన మౌనం పలికే వాక్యాలు

బి.వి.వి.ప్రసాద్ కవి "నీలో కొన్ని సార్లు" అనే కవిత్వ సంపుటిని 2015 లో వేసారు. ఇది ''ఇతను' అనే కవిత తో ప్రారంభమవుతుంది. మానుష ప్రపంచం మరీ అంత భయావహమైంది కాదని/ నీ కలలోని భూతమే నిన్ను మ్రింగ బోయినట్లు / నువ్వు విలువిస్తే బ్రతికే సముహం నిన్ను కమ్ముకుంటుందని/ సమూహాన్ని చెరిపేస్తూ నిన్ను గుర్తు చేయాలనే ఇతను మాట్లాడుతున్నాడు... ఎప్పుడూ పాతదైన నిద్రలోంచి, ఎప్పటికీ కొత్తదైన మెలకువలోకి/ మెలకువలాంటి పూలలోకి, గాలిలోకి, మౌనంలోకి, కాంతిలోకి / జీవితం పంపిన దూతలా పిలుస్తున్నాడు.

ఈ కవితలో ఎప్పటికి కొత్తదైన మెలకువలోకి అనే మాట పాఠకుడు చాలా పట్టుకోవాల్సిన మాట. ఆదమరిచిన నిద్ర అనడంలో భౌతిక సుఖాల్లో పడి మనతో పాటున్న తోటి చరాచరాలకి ఇవ్వాల్సినంత విలువ ఇవ్వడం మరచిపోయిన మనకి మన మూలాల్ని పరిచయం చేస్తూ అక్కడి లోతైన దయాప్రేమలతో నిండిన సూక్ష్మ ప్రపంచాన్ని మనలో జాగృతం చేస్తున్నాడీ కవి. దీనిని ఇంటెన్షనాలిటీ/ ఎరుక అని అంటాం. 

మరో కవిత:-
తోటి వారిని గాజులానో, పూలలానో / కదలని నీటిపై నిదురించే చంద్రుని బింబంలానో చూడలేమా/ బహుశా ఏ గ్రహాంతరాలలో ఏకాకులమై ఎదురైతే / అద్దంలో ప్రతి బింబంలా మృదువుగా చూసుకుంటాం ఒకరినొకరం ... అని సాగే ఈ కవితలో కవి ఇతరులతో మనం మెలగాల్సిన తీరు పట్ల ఒక అపురూపమయిన కొత్త సంస్కారాన్ని మనకందిస్తున్నారు.

:6:

VII "ఊరికే జీవితమై" - అన్నంతగా

బి.వి.వి. ప్రసాద్ కవితా సంపుటి "ఊరికే జీవితమై" (2023) నుండి

నిద్రలో ఎక్కడుంటావు నువ్వు/ మెలకువలో నీ దేహాన్ని మోసీ మోసీ అలసి పోయాక / దానిని ఎక్కడకు విసిరేసి, ఎటు వెళ్ళిపోతావు// సృష్టికి పూర్వం వున్న ఏ శీతల నిశ్శబ్ద ప్రశాంతతలోకి నిదురించేవేళల రహస్యంగా ప్రవేశిస్తావు/

అని సాగే ఈ కవితలో మనము నిద్రపోయేటప్పుడు ఏ లోపలి సీమలోంచి విహరిస్తామో అక్కడి మెలకువడి సంబంధించిన అనుభూతిని కవిత్వంగా పలకాల్సివుంటుంది. ఇది ఒక దార్శనికునికో, యోగికో, తాత్వికునికో సాధ్యమయ్యేపని.

ఈ కవి కవిత్వం పరిశీలించాక "అనుభూతి వాదం" భూమికగా కనబడుతుంది. నువు చెప్పేదేదయినా నీ అనుభవంలోంచి పలకాలి అన్నది అనుభూతి వాదం ప్రాధమిక సూత్రం.

VIII "సృష్టి" ఒట్టి ప్రేమసారం ఈ కవిత్వం

ఇటీవల వెలువరించబడిన బి.వి.వి. ప్రసాద్ గారి కొత్త పుస్తకం "సృష్టి" నుండి "ప్రేమ ఉంటే" అనే కవితలో

ప్రేమ ఉంటే పెద్దగా చెప్పడానికి ఏమీ ఉండదు/మాటలన్నీ మంచు ముక్కల్లా ప్రేమలో కరిగి పోతాయి/పూలరంగులు వెలుగుతాయి./ నక్షత్రాలు అనంతాన్ని విరబూస్తాయి./ స్పర్శ జీవితాన్ని సారవంతం చేస్తుంది..

కవి ఇక్కడ ఒక మాట అంటారు. "జీవుల చూపుల సారం ప్రేమకోసం ఎదురుచూపు/భయాలు, కోరికలు ప్రేమ దక్కక చేసే వెర్రి పనులు". ఇది మానవాళికి అందాల్సిన అద్భుతమైన "మోరల్ స్టేట్మెంట్" నిజమే కదా లోకంలోని సమస్త సమస్యలకు దుఃఖాలకు సరిపడా ప్రేమలేక పోవడమే కారణం. అనంతమైన ప్రేమలోకి ఒక్కసారి మేల్కొనగలిగితే బాధలన్నిటికి ఉపశమనం దొరికినట్టే.

శుద్ధవేదనా జగత్తునుండి వెలువడ్డ నిర్మల స్వచ్ఛగంగాజలం వీరి వాక్యం.

మరో పద చిత్రాన్ని చూద్దాం.

నల్లని కాన్వాసు పై / మరింత నల్లని చిత్రాలయి/ ఇళ్ళూ చెట్లూ// (దృశ్యా దృశ్యం - 1995)

ఇదొక రంగుల పద చిత్రం నల్లని రంగుపైన మరింత నల్లని రంగుని పులమడం ఎంతో

రమ్యమైన శిల్పం ఆవిష్కరించబడింది.

డా||అద్దేపల్లి వారన్నట్లు ఆలోచనలోనే వినూత్నత వుండడం వీరి శైలికి బలం. (నీలో కొన్ని సార్లు 144 పేజీ ఉత్తరాల నుండి)

వీరి కవిత్వం పైపై ఉద్వేగల అణచివేతకాదు. లోలోపల జరిగే మధనం ఒక విచికిత్స. నీ మూలాలతో నీవు శృతి చేసుకుంటేగాని ఈ కవిత్వం నీకు కనెక్ట్ అవ్వదు. పాశ్చాత్య విమర్శకుడు 'కెబుల్' చెప్పినట్లు "వెంట్ ఫర్ ఓవర్ చార్జుడ్ ఫీలింగ్/ ఉప్పొంగు అనుభూతుల అభివ్యక్తి" వీరి కవిత్వం.

:7:

వీరి ఉపమానాలు, రూపకాలు అప్పుడే పుట్టిన పిట్ట కూనల్లా పాఠకుణ్ణి అబ్బుర పరుస్తాయి.

ఉదా|| భూమి వంటి అమ్మమ్మ, ఆకు పచ్చని చెట్లు బడి పిల్లల్లా, కాలంనది, చినుకు శిశువు నీడల కాలువలు, వెల్తురు పుప్పొడి, పడవ చంద్రుడు, తారల ఇసుకమైదానం మొదలైనవి.

ఒక విధంగా ఈ కవిత్వం ఒక ఫిల్టర్ వంటిది. మనం చదివే ప్రతి వాక్యం మనల్ని ప్యూరిఫై చేయడమే తప్ప కొత్తగా మనకేదో నేర్పాలనే ప్రయత్నం చేయదు. మన మానసిక స్థౌల్యతని కరిగించి తేలిక పరచి స్వస్థత కలిగించి మన అసలుని మనకు అప్పగించే ప్రయత్నం చేస్తుంది.

వీరి కవిత్వం పై సమకాలీన ప్రముఖ కవుల అభిప్రాయాలు

అందుకే సమకాలీన కవులంతా వీరి కవిత్వాన్ని అత్యంతగా ఇష్టపడతారు దీనికి కారణం వారు కూడా ఈ కవిత్వంలో ఉపశమనం పొందడమే

ఆకాశం కవితాసంపుటిని గురించి డా॥ రెంటాల వారు ఇది 'ప్రొఫెట్' తరువాత పుస్తకం. ఇది ఆంగ్లంలోకి అనువాదమైతే భారతీయ ఖలీల్ జీబ్రాన్ ఇలా వుంటాడని అందరికీ తెలుస్తుంది. అని అంటారు.

ఆకెళ్ళ రవిప్రకాష్ గారు తన వ్యాసంలో బి.వి.వి.ప్రసాద్ గారిని యువచలం అన్నారు. (ఆంధ్రజ్యోతి దినపత్రిక, వివిధ 18/05/2020)

నాకనిపిస్తారు వీరు శ్రమణకుల ఆర్తిని తీర్చిన గౌతమ మునిలా

కళ్ళలో దయా స్పర్శలో నిర్మలత్వం
మాటలో నిజాయితీ, మనిషిలా స్పందించడం మరచిపోకుండా ఉంటే చాలు

హాయిగా నవ్వడమూ, హాయిగా ఏడవటమూ పోగొట్టుకోకుండా ఉంటే చాలు 
(ఆకాశం - 2011 చాలు)

ముగింపు :-

బి.వి.వి. ప్రసాద్ కవిత్వంలో శాంతి, కరుణ, ప్రేమ, క్షమ, వంటి మౌలిక భావనలు ఎంతో లోతుగా అనుభూతి ప్రధానంగా అద్వైతాంశతో దర్శనమిస్తాయి.

మానసిక కాలుష్యంతో, వైషమ్యాలతో కొట్టు మిట్టాడుతున్న మానవ లోకం ఉపశమించే పరమశాంతి ధామమీకవిత్వం.

నేటి ప్రథాన స్రవంతికన్నా భిన్నమైన ఆధునిక ధోరణితో వెలువడుతున్న ఈ కవిత్వం తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

8:

ఆధార గ్రంథాలు :

1. ఆరాధన, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, రవి ప్రింటర్స్, తణుకు, 1989.

2. బి.వి.వి. ప్రసాద్, హైకూలు (దృశ్యాదృశ్యం 1995, హైకూ 1997, పూలు రాలాయి 1999) బి.వి.వి. ప్రసాద్, శ్రీ శ్రీ ప్రింటర్స్ విజయవాడ.

3. నేనే ఈ క్షణం, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, శ్రీ రత్న ప్రింటర్స్, రాజమండ్రి. 2006

4. ఆకాశం, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, పాలపిట్ట బుక్స్, హైదరాబాద్, 2011.

5. నీలో కొన్నిసార్లు, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, వాసిరెడ్డి పబ్లికేషన్స్, హైదరాబాద్, 2015.

6. ఊరికే జీవితమై, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, ప్రేమలేఖ ప్రచురుణలు, 2023.

7. సృష్టి బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, స్వేచ్ఛా ప్రచురణ, తణుకు. 2026.

8. ఒలుపు సాహిత్య వ్యాసాలు, డా॥ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, చినుకు పబ్లికేషన్స్, విజయవాడ, 2017.

9. ఆలోచన, సాహిత్య వ్యాసాలు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ M.A.I Books, సికింద్రాబాద్, 2014.

10. ఆధునిక ఆంధ్రకవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు. డా॥ సి.నా.రె. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.

మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్, 
పి.జి.టి. (తెలుగు)
ప్రభుత్వ పోస్ట్ బేసిక్ పాఠశాల ప్లస్, పెంటపాడు
పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
(ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్టణం, తెలుగు శాఖ, పార్ట్ టైం పి. హెచ్. డి. రీసెర్చి స్కాలర్)
9441350260, 7013543732, sriram9441350260@gmail.com

ప్రచురణ : 
భావ వీణ - ప్రత్యేక సంచిక 28.2.26
ప్రభుత్వ డిగ్రీ కాలేజి, రాజోలు, డా॥ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ తెలుగు విభాగం

24 జూన్ 2026

కవిత : వారూ - వీరూ

చాలా చెబుతారు 
తెలివైనవాళ్ళం, బ్రతక నేర్చినవాళ్ళం 
అనుకొనేవాళ్ళు 
కానీ, జీవితం అమాయకుల స్వర్గం

రాత్రి నీమీద వాలినపుడు
రాత్రి లోంచి కొన్ని దీపాల కాంతులు
నిన్ను తడిపినపుడు,
వాటి నీడలు దృశ్యాలనుండి 
ధారలు కట్టినపుడు,
నువు కాంతుల్లోకీ, నీడల్లోకీ తప్పిపోకుండా 
ఒడ్డున తచ్చాడితే, తెలివైన బుద్ధిహీనుడివి
తప్పిపోతే, అమాయకంలోకి మేలుకొన్నవాడివి

పగలు మనుషుల ముఖాలపై తేలే
భయాలనీ, వెలితినీ చూస్తే 
తెలివిలో ఇరుక్కున్నవాడివి
ముఖాలపై వాలే ఎండనీ, నీడనీ చూస్తే
అమాయకంలోకి రెక్కలు విప్పినవాడివి 

ఎవరు జీవితాన్ని జయించామనుకొంటారో
వాళ్ళు జీవితానికి బానిసలు,
ఎవరు జీవితానికి లొంగిపోయారో 
వాళ్ళు జీవితం పసిపాపలు 

చివరిరోజున నీ ముఖం పై
చిరునవ్వు తారాడకపోతే నీ జీవితం ఉత్త డొల్ల,
నీ కనుకొలకుల్లో ఆనందాశ్రువులు మొలకెత్తితే
నీ జీవితం సారవంతం

ఏమీ చెప్పరు 
అమాయకులం, నిర్బలులం అని తలచేవాళ్ళు
కానీ, వాళ్ళ శ్వాసలో అనేకలోకాలు వికసిస్తాయి

బివివి ప్రసాద్
ప్రచురణ : సారంగ 15.6.26

21 జూన్ 2026

కవిత : సందిగ్ధ స్వప్నం

నిన్ను మనుషులు కాదన్నపుడు
నువు ఎక్కడికి చేరుతావు

మలిసంధ్యలోని చివరికాంతులలోనికా, 
మండువేసవిలో వెలిగే నీడల్లోనికా,
ఎడారి కడుపున పండే ఖర్జూరపు రుచిలోనికా,
దైవం దయగా పంచే చిరునవ్వులోనికా 

ఏ మూలన నువు దాక్కోవాలని చూస్తావు
జనన, మరణాల సరిహద్దులోనా,
నవ్వుకీ, కన్నీటికీ నడుమ తేలే రేఖలోనా,
చలికీ, వేసవికీ నడుమ నలిగే రోజుల్లోనా

ఇదంతా అద్భుతం, అసంబద్ధం కూడా

నీ ఆలోచన పొట్లిన కాగితం కానున్నపుడు, 
నీ ఊహ పచ్చదనం నుండి 
ఎండిపోవటంలోకి తిరుగుతున్నపుడు,
నువు నవ్వుకీ, ఏడ్పుకీ నడుమ పరుగెడుతున్నపుడు

నీకు నిజంగా బ్రతకాలనిపిస్తుందా, ఇక చాలనా
శ్వాస ఆగిపోవాలనుంటుందా, కొనసాగాలనా

జీవితం సందిగ్ధ స్వప్నం
సూర్యకాంతినీ, మంచిచెడ్డల మీమాంసనీ
నీ కలలకి వదిలి 
నిన్ను నిన్నుగా కావలించుకునే ప్రేమ, ఆర్తి

కొనసాగమని మినహా జీవితమేమీ అడగదు నిన్ను,
భయం లేని లోకం మినహా 
జీవితాన్ని ఏమీ అడగబుద్ది కాదు నీకు

ఒక సందిగ్ధం నీలోకి నిన్ను నెడుతుంది,
నీ తలుపులు తెరవమంటుంది
సందిగ్ధ సాయంవేళ 
నీతో నువు కాసేపు గడుపుతావు

బివివి ప్రసాద్
ప్రచురణ : స్నేహ, ప్రజాశక్తి 21.6.26



17 జూన్ 2026

కవిత : అక్కడ ఉంటావు

ఆటలాడీ, ఆడీ పరుగున వచ్చి
అమ్మని కావలించుకుంటావు చూసావా
అక్కడ నువ్వు నువ్వుగా ఉంటావు

యవ్వనంలో స్నేహితుని భుజం మీది చేయిలోనో,
ప్రియురాలి చూపులోనో కరిగిపోయినపుడూ,
జీవననేస్తం తొలి కౌగిళ్ల నమ్మకమైన స్పర్శలో,
బిడ్డల అమాయకపు లేత చూపుల్లో,
వాళ్ళు నీ కొనసాగింపనే ఉద్వేగంలోనూ 
నువ్వుగా ఉంటావు 

స్థిమితంగా ఉన్నపుడు
దయగా నీలోపలికి చేరే బంగారు ఎండలోనో,
వెండి వెన్నెల లోనో, కాటుక కన్నుల వంటి చీకటిలోనో,
ఉండి ఉండి, నేనున్నాను కదా అని వీచే గాలితెరలోనో,
వేగిన గాలిలోంచి పసిపాప చిరునవ్వులా జారే 
చల్లని వాన చినుకులోనో,
వానచినుకు పుష్పించే ఇంద్రధనువులోనో,
వాన తరువాత నేలలోంచి పూచే ఇంద్రధనువులలోనో
నువు మెల్లగా, సముద్రంలోకి మరలిపోయే అలలా కరిగిపోతున్నపుడు నీకు నువు ఉంటావు

వేసవి నీడలోనూ, దుఃఖార్తుడి తృప్తిలోనూ,
కఠినులలో కలిగే పశ్చాత్తాపపు కదలికలోనూ,
సమస్తాన్నీ ప్రేమించే మహనీయుల చూపులోనూ,
చెట్ల ఆకుల్ని కదలీ, కదలించని మెల్లని గాలితెరలోనూ,
వాసంత కోయిల మధ్యాహ్నపు బద్దకపు పాటలోనూ,
ఇంకా, అనేక మృదువైన సమయాల,
జీవితం ఊరికే గాలితెరలా తాకిపోయే వేళల
నువు అక్కడే మెలకువగా,
కెరటం అంచున మెరిసే వెన్నెలలా నిలిచి ఉంటావు

ఇవన్నీ సరే,
నువు నువ్వుగా ఎప్పుడూ ఉన్నావు కదా,
వీటన్నిటికీ ఇక్కడేం పని అంటారెవరో
ఎవరా అని వెనుతిరిగి చూస్తే తాకుతుంది 
ఏదో మృదువైన, బలమైన, లోతైన నిశ్శబ్దం
బహుశా, నువ్వు

బివివి ప్రసాద్
ప్రచురణ : ఈ మాట జూన్ 2026

16 జూన్ 2026

కవిత : పండిన ప్రేమ

నువు కూర్చున్నపుడు
నారింజ మేఘాలు నీ ప్రక్కన కూర్చుంటాయి

కనురెప్పలు పైకెత్తినపుడు
నీ చూపులు సీతాకోకలయి ఎగురుతాయి

మాటలకై పెదవులు తెరిచినపుడు
తేలికగాలులలో పరిమళాలు మునకలేస్తాయి

లోపలినుండి చిరునవ్వు నవ్వినపుడు
ఎవరం పోటీ పడదామని
నక్షత్రాలూ, సూర్యుడూ తడబడతారు

ప్రపంచం మీద ప్రేమతో 
నీ హృదయం నిండినపుడు
చంద్రుడు తృప్తిగా బెంగ విడుస్తాడు 
ఇవాళొక హృదయం ఆశ్రయం ఇచ్చిందని

ఇంతకూ నువు ఏ ఒకర్నీ ప్రేమించలేదు
నీలో ఇంత అందానికి

జీవితాన్ని ప్రేమించి, ప్రేమించి
జీవితానివీ, ప్రేమవీ అయిపోయావు
కదులుతున్న రాత్రిలో రాత్రిలా కరిగిపోయావు

బివివి ప్రసాద్
ప్రచురణ : మహా పత్రిక 15.06.26



10 మే 2026

కవిత : కొంచెం ప్రేమలోంచి

కొద్దిగా ప్రేమించు
గదిలో వాలిన బంగారు కిరణాన్ని,
కిటికీ బయట తలలూపే పూల మొక్కలని, 
మొక్కలపై కనబడని ఆటలాడే పసిగాలి తరగలని,
గాలికి ఊగే ఆకాశాన్ని,
ఊగే ఆకాశంలాంటి మనసుని,
మనసులో ఊగే జీవితాన్ని

కొద్దిగా ప్రేమించు 
ఇక్కడ ఉండటాన్ని, 
ఒకనాడు ఇక లేకపోవడాన్ని,
నువు లేని కాలంలోంచి నువు రావటాన్ని,
కాలం మళ్ళీ చెరిగిపోవటాన్ని

కొద్దిగా ప్రేమించు,
కొద్దిగా హృదయాన్ని తెరువు,
నీటిబిందువులాంటి హృదయం తెరిచి
జీవితానుభవమనే సముద్రంలో కరుగు

ఇపుడు నువు కదా జీవితానివి 
ఇక దుఃఖం ఎక్కడుంది, భయం ఎటు పోయింది
ఇపుడు నువు ఏకకాలంలో
ఇంద్రధనువువి, దానిలోని రంగురంగుల అణువువి

బివివి ప్రసాద్
ప్రచురణ : తొలివెలుగు 10.5.2026



27 ఏప్రిల్ 2026

కవిత : ఆ క్షణాలు

 ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నపుడు
కాసేపు ఆ క్షణాల్లో మునిగి ఉండు
వేకువ బంగారు కాంతిలో మునిగినట్లు
సీతాకోక రెక్కల నిశ్శబ్దంలోనో,
పూల మెల్లని వికాసంలోనో,
పసిపాప తెరుచుకునే చిరునవ్వులోనో మునిగినట్లు

దేనినైనా హృదయపూర్వకంగా ప్రేమించేవేళ
కాసేపు ఆ క్షణాలని పట్టుకొని ఉండు
చేతిలో కరుగుతున్న మంచుముక్కనో,
దుప్పటిలో మాయమవుతున్న నిదురనో,
చేయి విడిచే ప్రేమ నిండిన స్పర్శనో పట్టుకొన్నట్లు 

మరి ఒకటి, రెండు క్షణాలు
మరి ఒకటి, రెండు యుగాలు

మళ్ళీ, నీకు దొరకక పోవచ్చును
ఆ నమ్మకం, ఆ ప్రేమ, ఆ స్పర్శ
ఆ అమాయకత్వం, ఆ బేలతనం, ఆ లాలన

ఇంత జీవితానికి సారంలాంటి ఆ క్షణాలు
మళ్ళీ జీవితంలో ఎదురు కాకపోవచ్చును

కాసేపు, గాఢంగా ఊపిరి వదిలి
నువు ప్రేమించిన క్షణాలని,
నిన్ను ప్రేమించిన క్షణాలని
ఊపిరినిండా తీసుకొని, నిలుపుకో

తరువాత, జీవితం ఏ మలుపు తిరగనీ 
ఆ ప్రేమకాంతిని నీ బాట నిండా పరుచుకోనివ్వు 

బివివి ప్రసాద్
ప్రచురణ : వివిధ, ఆంధ్రజ్యోతి 27.4.26



26 ఏప్రిల్ 2026

వ్యాసం : అనుభవ కవిత్వం

1
అనుభూతి కవిత్వం గురించి మీరు మాట్లాడాలి అన్నారు మిత్రులు చక్రధర్. నాకు ప్రసంగాలు చేయటం రాదు. పుస్తకాలు చదవటం మానేసి చాలా కాలమైంది. కనక నేనేమీ మాట్లాడలేనన్నాను. అని ఊరుకుంటే బావుండేది. కవిత్వం ఏదైనా అనుభూతే. కనక, అనుభూతి కవిత్వం అనే మాట సరైనది కాదు, దానికన్నా అనుభవ కవిత్వం అనటం సరైనది అన్నాను, ఇస్మాయిల్ గారు కూడా ఆ లేబిల్ ఒప్పుకోలేదు అని కూడా అన్నాను. మీడియావాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలన్నది అనుభవంలో లేక తొందరపడ్డాను. అయితే అనుభవ కవిత్వం మీద మీరు మాట్లాడుతున్నారు అన్నాడు.

సీరియస్ గా సాహిత్యం చదువుకుని రెండు దశాబ్దాలు దాటింది. ఎప్పుడైనా ఒకటీ, అరా పుస్తకాలు మినహా ఎలాంటి చదువూ లేని, ఈ మిత్రుని మాటలు మిత్రులు సీరియస్ గా తీసుకోనవసరం ఉండకపోవచ్చని ముందుగా సూచిస్తున్నాను.

చదవకుండా ఇంత కవిత్వం ఎలా రాస్తున్నారు, మీరు ఏదో చదువుతున్నారు అన్నారు చక్రధర్. అవును, చదువుతున్నాను. నా అస్తిత్వాన్నీ, నా అస్తిత్వం చుట్టూ విస్తరించిన అనంతమైన అస్తిత్వాలనీ, విశ్వం నాలోకి ప్రసరిస్తున్న ప్రతిఫలనాలనీ చేతనైనంత శ్రద్ధగా చదువుకుంటున్నాను. నా జీవితానుభవాన్ని వీలైనంత దగ్గరగా చదువుతూ, కదిలే సమస్తం వెనుక కదలని మూల ద్రవ్యం ఏదన్నా వెండితెరలా ఉందా అని వెదుకుతున్నాను. 

2
ఈ మౌలికమైన వెదుకులాట ఆధారంగా కవిత్వం ఏమై ఉంటుంది అని ఆలోచించినప్పుడు, కవిత్వం ప్రధానంగా మూడు శక్తుల కలయికగా తోస్తుంది. అవి ఆలోచన, ఉద్వేగం, అనుభూతి. ఒక వస్తువుకి సంబంధించిన సమాచారాన్ని ఆలోచన అనవచ్చును. ఉదాహరణకు అది మామిడిపండు అని తెలియటం ఆలోచన. ఆ వస్తువుతో సంబంధం కోసం మనస్సులో కలిగే చలనాన్ని ఉద్వేగం అనవచ్చును. మామిడిపండు తినాలి అనిపించటం ఉద్వేగం. వస్తువుతో సంబంధం ఏర్పడినపుడు మనసులో కలిగే సంవేదనను అనుభూతి లేదా అనుభవం అనవచ్చును. మామిడిపండు రుచి చూస్తున్నపుడు కలిగేది అనుభూతి లేదా అనుభవం. 

అయితే, అనుభూతి, అనుభవం ఒకటేనా అని అంటే, ఒకలానే కనిపిస్తాయి కానీ, కొంత సూక్ష్మమైన భేదం ఉన్నట్లు తోస్తుంది. అనుభూతిలో కొంత ఉద్వేగం పాలు కూడా ఉంటుంది. ఉద్వేగమూ, అనుభవమూ కలగలిసిన ఒకానొక చలనాన్ని అనుభూతి అనవచ్చును అనుకుంటాను. అనుభవంలో ఉద్వేగ సంబంధంలేని శుద్ధ సంవేదన మాత్రమే ఉంటుంది అనిపిస్తుంది. ఇస్మాయిల్ గారు ఏమన్నారని మళ్ళీ చదివి చూస్తే, ఆయన రెండిటినీ సమానంగానే చూసినట్లు కనిపించింది. అయితే పైన చెప్పిన సూక్ష్మ భేదం జోలికి పోనట్లయితే, అనుభూతి కవిత్వంగా స్థిరపడ్డ అభిప్రాయాన్ని కూడా కాదనలేము.  

3
ఇక ఒక కవితలో మూడు శక్తులూ ఉన్నట్లయితే, కవిత్వాన్ని ఆలోచనాత్మక, ఉద్వేగపూరిత, అనుభూతి కవిత్వాలని మూడు పాయలుగా చూడటం ఎలా కుదురుతుంది అన్నపుడు, దాని జవాబు తేలికగానే తడుతుంది. 

ఒక బలమైన లేదా సాంద్రమైన కవితలో మూడు శక్తులూ ఉన్నప్పటికీ, ఆ శక్తుల ప్రాధాన్యతను బట్టి, శాతాన్ని బట్టి వాటిని ఆలోచన, ఉద్వేగ, అనుభూతి కవితలుగా మనం గుర్తించవచ్చును. 

గురజాడ రాసిన 'మంచి, చెడ్డలు ఎంచి చూడగ రెండె కులముల లోకమందున, మంచి యన్నది మాల యైతే మాల నేనౌతాను' అన్న వాక్యాలు గానీ, బసవరాజు అప్పారావు రాసిన ' ప్రేమించు సుఖముకై, ప్రేమించు ముక్తికై, ప్రేమించు ప్రేమకై, ఏమింక వలయురా ' అన్న వాక్యాలు గానీ, ఆలోచన ప్రధానమైన కవిత్వంగా మనకి తోస్తాయి. 

టాగోర్  ' నక్షత్రాలన్నింటితో ఆకాశము, అంతులేని ఐశ్వర్యాలతో ప్రపంచమూ అన్నీ నాకు ఉన్నా నేనింకా కావాలని అడుగుతాను, కానీ ఈ ప్రపంచంలో మరీ మూల కాస్త చోటుంటే చాలు, ఆమె  నాదైతే ' అన్నపుడు మనకి ఒక కవి శుద్ధ ఉద్వేగంతో చలించటం కనిపిస్తుంది. 
ఎంకెవ్వరని లోకమెపుడైన అడిగితే, వెలుగునీడల వైపు వేలు చూపింతు అన్న నండూరి మాటలు కూడా నిండైన ఉద్వేగం నుండి ఉబికి వచ్చినట్లు కనిపిస్తాయి.

ఇక ఇస్మాయిల్ గారు రాసిన ' తరుచాపము వీడి దివిని గురి మరచిన బాణంలా తిరుగాడును పిట్ట ' అన్న వాక్యాలు కానీ, ' అంతా తెల్లకాగితం, ఒక మూలన నిలువుగా ఒక గీత, అడ్డంగా ఒకటి. తెరచాప ఎత్తిన పడవ. కిందిది నదీ, పైది ఆకాశమూ కావచ్చును ' అన్న వాక్యాలు కానీ చదివినపుడు, ఆలోచన, అనుభూతీ చెరిగిపోయి, కవి అనుభవించిన శుద్ధ ఇంద్రియానుభవం మనకి బదిలీ అవుతుంది.  

4
కవిత్వం ఏదైనా, కవి తనని వ్యక్తీకరించుకోవటానికీ, తనకి ఒక ఔట్ లెట్ గానూ భావించి, బలమైన వత్తిడి నుండి రాసినపుడు సాంద్రమైన అభివ్యక్తులు ప్రకటమవుతాయి.  అయితే ఈ ప్రకటమయ్యే క్రమంలో కవి తన పాఠకునికి ఇవ్వదలచిన అనుభవంలో స్పష్టత ఉన్నపుడు ఆయా కవులు బలమైన ఆలోచననో, ఉద్వేగాన్నో, అనుభవాన్నో ఇవ్వగలుగుతారు. 

వీటిలో ఆలోచనాత్మక కవిత్వం ఆలోచనల విస్తృతి పెంచితే, ఉద్వేగ కవిత్వం పాఠకుని ఉద్వేగాలను బలమైనవిగా తయారు చేస్తుంది. అనుభవ కవిత్వం వీటికి భిన్నంగా మనిషిని ఆలోచనల నుండీ, ఉద్వేగాల నుండీ ఉపశమింపచేసి, తన నిజమైన, సాత్వికమైన అస్తిత్వంలోకి మేలుకోలుపుతుంది. దేని ప్రయోజనం దానికి ఉంటూనే, మూడు పాయలూ కూడా చైతన్య పరిధిని విస్తరింప చేసేవి గా, పరస్పర పూరకాలుగా కూడా ఉంటాయి. 

మనం మన మానసిక స్థితిని బట్టి, అవగాహనని బట్టి, అవసరాన్ని బట్టి ఆయా కవిత్వాలని ప్రేమిస్తాము.

( మిత్రులు ముక్కామల చక్రధర్  ఏప్రిల్ 25, 26 తేదీలలో చిత్ఫలపాలెం లో నిర్వహించిన గోదావరి కోనసీమ సాహితీ సమాలోచన కోసం రాసుకున్న ప్రసంగ పాఠం. )

బివివి ప్రసాద్
22.4.26










14 ఏప్రిల్ 2026

ఒక దృక్పథం నుండి ప్రేమ, స్నేహం, ఆకర్షణ:

ఒక దృక్పథం నుండి ప్రేమ, స్నేహం, ఆకర్షణ:

తానూ, నేనూ ఒకటే అనిపించటం ప్రేమ,
తానూ, నేనూ ఒకలాంటివాళ్ళం అనిపించటం స్నేహం,
తాను నాకు కావాలి అనిపించటం ఆకర్షణ

ప్రేమలో అహంకారాలు కరిగిపోయి, సన్నిధి మాత్రమే మిగులుతుంది. తాను నా సమీపంలో ఉంటే చాలనిపిస్తుంది. దూరంగా ఉన్నా తనతోనే ఉన్నట్లనిపిస్తుంది. 

స్నేహంలో అహంకారాలు వెలుగునీడల్లా దోబూచులాడతాయి. కొంత ప్రేమ వెలుతురు ప్రసరించినా, కొంత ఆకర్షణ ఉన్నా, తాము సములం అనిపిస్తుందే గానీ, తానే నేను అనిపించకపోవచ్చు.

ఆకర్షణ (మోహం, ముదిరితే కామం) లో అహంకారాలు బలపడతాయి. తాను నాకే దక్కాలి అనిపిస్తుంది. దక్కకపోతే తనని నశింపచేయాలని కూడా. నాకు పూర్తిగా లొంగి, నా మనో, దేహాలకి కావలసిన అనుభవాలు ఇస్తూ ఉండాలి అనిపిస్తుంది.

ప్రేమలో కొంత స్నేహం, కొంత ఆకర్షణ ఉంటాయి.
స్నేహంలో కొంత ప్రేమ, కొంత ఆకర్షణ ఉంటాయి. 
ఉత్త ఆకర్షణలో ప్రేమ, స్నేహం ఉన్నట్లు కనిపిస్తాయి కానీ ఉండవు. ఉండలేవు. 

బివివి ప్రసాద్

09 ఏప్రిల్ 2026

కవిత : ఒకమాట

ఒకమాట నువు మాట్లాడలేవు
దూరాలని, కాలాలని, భారాలని 
చెరపగల ఒకమాట 
హృదయం నుండి బయలుదేరి 
ఎందుకనో ఆగిపోతుంది శబ్దంగా మారకుండా,
చేరవలసిన చెవిని చేరకుండా

దూరాలు పెరుగుతాయి,
కాలాలు మారుతూ వెళతాయి,
భారాలు మిగులుతాయి

సమయానికి ఆ ఒక్కమాట మాత్రం
ఎందుకనో పక్షిలా ఎగరదు,
పూవులా వికసించదు, 
ఉదయకాంతిలా ఆకాశాన్ని తెరవదు

ఎవరు ఆపారు ఆ మాట రాకుండా
ఏ ప్రేమ లోతులు, ఏ దుఃఖపు రాగాలు,
జన్మమూలాల్లోని ఏ జీవన ధాతువులు,
ఏ అనుభవాలకై ఎదురుచూపులు

ఆ మాట నీ నోట పలికించకుండా ఆపుతాయి,
ఆ క్షణాన చూపులకి రెప్పల తెరలు వాలుస్తాయి,
నీ విలువైన వ్యక్తికీ, నీకూ నడుమ
మంచుద్వీపాలు కలలాగా తేలుతాయి,
కాలం గాలి తాకని ఆకులా నిలబడిపోతుంది,
ఆ మాట ఎందుకు గడ్డకట్టుకు ఉండిపోతుంది

బివివి ప్రసాద్

21 మార్చి 2026

బివివి ప్రసాద్ సృష్టి కవిత్వం పీడీఎఫ్

కవిత్వ ప్రేమికులకు ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు!
బివివి ప్రసాద్ తొమ్మిదవ కవితా సంపుటి సృష్టి పీడీఎఫ్ కాపీ అందుబాటులో ఉంచుతున్నాను. 
ఆసక్తి గలవారు.. ఈ లింక్స్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చును. 

ప్రింట్ కాపీ కావలసినవారు 
అనేక బుక్స్, విజయవాడ 92472 53884 వారిని సంప్రదించగలరు

Archive.org నుండి డౌన్లోడ్ కి ఇక్కడ క్లిక్ చేయండి.

గూగుల్ డ్రైవ్ నుండి డౌన్లోడ్ కి ఇక్కడ క్లిక్ చేయండి.

ధన్యవాదాలతో..




11 మార్చి 2026

ఫోన్ కాల్ అను పర్సనల్ స్పేస్ లేదా నిశ్శబ్దం కథ

 ఫోన్ కాల్ అను పర్సనల్ స్పేస్ లేదా నిశ్శబ్దం కథ

ఫోన్ కాల్ మాట్లాడటమంటే తలమీద రాయిపెట్టినట్లు ఉంటుంది. ఫోన్ సంభాషణలో నిశ్శబ్దానికి అవకాశం ఉండదు. పర్సనల్ స్పేస్ వీలుకాదు. అవతలి మాట ఆగగానే అందుకోవాలి. ఒకోసారి అవతలివాళ్లు కాల్ చేసి, ఏమిటి కబుర్లు అన్నారా రాయి మరింత బరువెక్కుతుంది. ఊరికే వినమంటే, పోనీలే అని వినిపెట్టవచ్చు. ఎక్కువగా ఊ కొట్టినా తప్పే.. స్పందించాలి. ఆ సమయానికి మనం ఏ మూడ్ లో ఉన్నామో, పనిలో ఉన్నామో, వత్తిడిలో ఉన్నామో, ఏ ఆలోచనల్లో, ఊహల్లో దారులు వెదుకుతూ ఉన్నామో అవతలివారికి సంబంధం ఉండదు. 

ఒక బాల్యమిత్రుడు కాల్ చేసి, చెప్పరా అని మొదలు పెట్టేవాడు. నువు కాల్ చేస్తావని, కబుర్లు పోగేసుకుని, ఏ పనీ లేకుండా, ఎదురుచూస్తున్నారా.. అనేవాడిని.. వాడు గనక ఆ మాత్రం స్వేచ్చ ఉండేది.. మరొకరైతే.. కనక, ఫోన్ కాల్ రాగానే, పులిబోను గేటు తెరిచి పట్టుకున్నట్టు, నన్ను లోనికి రమ్మన్నట్టు ఉంటుంది. 

కనకనే, ఫోన్ కాల్స్ చేయను, ఎవరన్నా చేసినా ఇబ్బందిపడతాను. ఫోన్లలో హాయిగా కబుర్లు చెప్పుకొనేవాళ్ళని చూస్తే ఆశ్చర్యం. ఇన్ని కబుర్లు కామా లేకుండా ఎలా పొంగుకువస్తాయా అని. నా వరకూ ఫోన్ కాల్ షెడ్యూల్స్ చెప్పుకోవటానికి, పనుల పురమాయింపులకి. కాల్ రెండు నిముషాలు దాటకుండా పూర్తవుతుంది. అరుదుగా కొందరు హృదయానికి దగ్గర వారు చేస్తే బాగానే ఉంటుంది. వాళ్ళైనా నువు మాట్లాడు అనకపోతేనే. వాళ్ళు చెప్పేది ఆసక్తిగా వినటం వరకే. 

టెక్స్ట్, వీడియో కాల్స్ నా పాలిటి వరాల్లా వచ్చాయి. టెక్స్ట్ లో స్పేస్ ఉంటుంది, అవతలి వాళ్ళు మాట్లాడాక మనం ఎప్పుడైనా చదివి, ఎప్పుడైనా జవాబు ఇవ్వవచ్చు. మనం మాట్లాడితే అవతలి వాళ్ళు కూడా అంతే. అంటే, సంభాషణ నిండా స్వేచ్ఛ పరుచుకుని ఉంటుంది. స్వేచ్ఛ ముఖ్యం కదా.

వీడియో కాల్ మనుషులు దూరంగా ఉన్న బెంగ పోగొడుతుంది, చూడవచ్చు. వెంటవెంటనే మాట్లాడనక్కరలేదు. మనం ఎలా, ఏ పరిస్థితిలో ఉన్నామో అవతలివారికి, అలానే వారి గురించి మనకి తెలుస్తూ ఉంటుంది. మాటల్లేని సంభాషణ కొనసాగుతుంది. ముఖ్యం కళ్ళు మాట్లాడుకుంటాయి, చిరునవ్వులు మాట్లాడుకుంటాయి, ముఖాల్లోని వెలుగునీడలు మాట్లాడుకుంటాయి. మాటల అవసరం వెనుకబడుతుంది. కనిపిస్తూ ఉంటారు గనక, అవతలివారి నిశ్శబ్దంలోకి మాటలతో దూరిపోవాల్సిన పని ఉండదు.

మనుషుల్ని సరాసరి కలవటం ఇష్టం. గుంపులుగా కాదు. మహా అయితే నలుగురైదుగురి వరకూ. ఆ సంఖ్యదాటితే చిరునవ్వుకు పరిమితమైన ప్రేక్షకుడి పాత్రలోకి జారిపోతాను. కలిసి మాట్లాడటం కన్నా, ఊరికే నిశ్శబ్దంలోకి కలిసి ప్రయాణించటం మరీ ఇష్టం. ఎవరిమీదనైనా ఎక్కువ ఆత్మీయత కలిగినప్పుడు వారితో కలిసి నెమ్మదిగా, నిశ్శబ్దంగా, ఏ లోతైన, గంభీరమైన విషయం పైనో హృదయం విప్పుకొని మాట్లాడుకోవాలని ఉంటుంది. ఒకానొక కాలంలో అలాంటి ఒకానొక మిత్రుడితో గడపగలిగాను కొన్నేళ్లపాటు.

లోకం ఎలా ఉందో తెలీదు గానీ, నా వరకూ, పర్సనల్ స్పేస్ లేని, తగినంత నిశ్శబ్దం లేని మానవ సంబంధాలు చాలా వరకూ మొరటుగా, కృతకంగా తోస్తున్నాయి. ఇటీవల మరింతగా. ఒకరి స్వేచ్ఛని ఒకరు గౌరవించే, ఒకరి స్థలాన్ని ఒకరు గౌరవించే, ఒకరి నిశ్శబ్ద భాషణని ఒకరు గ్రహించే సున్నితమైన సమాజాన్ని కలగంటూ, మనుషులకి దూరం అవుతున్నానేమో కూడా తెలీదు. కానీ, నా స్పేస్ లో, ఏకాంతంలో నేను నిండే కొద్దీ, మనుషులూ, జీవితమూ ఇంకా లోతుగా తెలుస్తూ, ప్రేమాస్పదంగా మారుతూ ఉండటం గమనిస్తున్నాను.

బివివి ప్రసాద్
11.3.26 6.15 సాయంత్రం

10 మార్చి 2026

ఒకే రూపమెత్తిన కవీ - తత్వవేత్త

 తత్వశాస్త్ర సారం కవిత్వ ప్రక్రియలో ఒదుగుతుందా? నిజానికి కవీ, తత్వవేత్తా ఒకే పాత్ర పోషించగలరా? హృదయాన్ని గిలిగింతలు పెట్టే మహోద్వేగ జలపాతానికీ, మెదడుని అగ్నిపర్వతం వలే విస్ఫోటనానికి గురి చేసే సత్యాన్వేషణకీ లంకె వేయడం ఎప్పుడూ దుస్సాధ్యచర్య. 'కనబడని ఆనందంలోకి తిరిగిరాకుండా తప్పిపోవాలి'; 'వాక్యాలకవతల ఖాళీ ఆకాశం ఉంటుంది'; 'జీవితం గాజుకన్నా అల్ప'మని .. బివివి ఒక్కో కవితా వాక్యం ఘనసముద్రమంత లోతుగా ఉంటుంది. పాఠకుడికి అసంకల్పితంగా ప్రతి కవితలో ఒక మూర్తిమత్వం కదలాడుతుంది. కవి మానవీయస్వరంలో ఆరాధనా భావం సున్నితమైనది. అంతమాత్రాన దీన్నేమీ భక్తి కవిత్వం అనకూడదు. పోనీ జ్ఞానదాహంలానూ తోచలేదు. 144 కవితలున్నప్పటికీ ఇందులో విముక్తకాంక్షతో పలికే సారాంశ ధ్వని ఉంది. చెబుతున్నదెవరు, చెవి ఒగ్గి వింటున్నదెవరూ అన్న వ్యత్యాసం లేదు. అది తనని తాను తెలుసుకునే ఒక మనిషి ఆరాటమే. ఈ సౌందర్యం భిన్నమైనది. పరిణితి గలది. కవి తనలో అణచిపెట్టుకోలేని జీవన రహస్యాలన్నీ వెల్లువగా ప్రవహించిన కవిత్వ ధార ఇది.

- పుప్పాల శ్రీరామ్
ప్రతులకు : అనేక బుక్స్, విజయవాడ 92472 53884

ఆదివారం ఆంధ్రజ్యోతి 8.3.2026


28 ఫిబ్రవరి 2026

కవిత : నీ ఏకాంతం

నీదైన ఏకాంతం అపురూపం
నీకు మాత్రమే చెందిన ద్వీపం అది
ఇతరుల్ని రానీయటం, వద్దనటం
పూర్తిగా నీ హక్కు

మనుషులు మినహా మరేవైనా 
ప్రవేశించగల చోటు అది
రాత్రుల చీకటీ, దీపాల కాంతులూ 
రాత్రుల నిశ్శబ్దం, పలకరించి, పోయే శబ్దాలూ
రాత్రి లాంటి ప్రపంచం, ఎదురై, మాయమయే ప్రేమలూ 

నీదైన ఏకాంతం
నీకు నువు నిండుగా దొరికే చోటు
ఏకాంతంలోకి రాలే కాంతులూ, చీకటులూ 
శబ్దాలూ, నిశ్శబ్దాలూ, నమ్మకాలూ, స్వేచ్ఛలూ

వీటికి ఎడంగా,
దేనికీ దొరకని, అంతా నీవైన 
ఖాళీ గాలి లాంటి నీ ఉనికి

ఏకాంతంలో 
నీతో నిండుతూ నువ్వు
నీతో నిండుతూ నీ ప్రపంచం
నీ ప్రపంచంలో నిండుతూ నీ ప్రేమ

ఇప్పుడిక ఇది 
రాత్రయితే ఏమిటి, పగలైతే ఏమిటి
నవ్వులైతే ఏమిటి, దుఃఖమైతే ఏమిటి
జీవితమైతే ఏమిటి, మరణమైతే ఏమిటి

ఏకాంతం లాంటి నువ్వు
నీలాంటి ఏకాంతం
నీతోనే నిండిపోయిన నీ అనుభవం

బివివి ప్రసాద్

31 జనవరి 2026

జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నమే నా కవిత్వం : బివివి ప్రసాద్‌తో మానస చామర్తి ఇంటర్వ్యూ

మనుష్యులు తమతమ రోజువారీ యుద్ధాలను దాటడానికి పోరాటం ఎంత ముఖ్యమో పోనివ్వాలనే చూపూ అంతే ముఖ్యమని తెలిసిన కవి బివివి ప్రసాద్. అందుకే “గెలుపు జ్వరం పట్టిన లోకంలో, ఓడిపోవడానికే ఎక్కువ ధైర్యం కావా”లని ఇప్పటికి ఎన్నో యేళ్ళ క్రితమే తన కవిత్వంలో చెప్పగలిగారు. గగనమూ లోయలూ ఒకేసారి పిలిచినప్పుడు శిలలాంటి వర్తమానంలోకి ఉలికిపడే మనిషిని హత్తుకుని నెమ్మదింపజేసే స్వరం వీరి కవిత్వానిది. లోపలి ప్రపంచంతో నిజాయితీగా సాగే సంభాషణల్లో, కొంత ఆనందమూ, కొంత దిగులూ, కొంత ఆశా కొంత వెలితీ అన్నీ తెరలు తెరలుగా తనలోనే వచ్చిపోవడం మనిషికి తెలుస్తూంటుంది. ఆ ఉద్వేగాల ఉద్ధృతిని అర్థం చేసుకునేందుకు ఉపకరించే తాత్త్విక అన్వేషణతో కూడిన కవిత్వం బివివి గారిది. ఎంతో లోతుల్లోకి దిగితే కానీ, మనుషులు ప్రేమించడానికి భయపడతారనే గమనింపు దొరకదు. “భయంలో కాపాడేదేదో ఉందనిపించి ఊరికే భయపడతాం”లాంటి మాటలు ఈ కవిత్వంలో తారసపడినప్పుడు తెలుస్తుంది, ఎదురెళ్ళి అర్థం చేసుకోవాలసిన ఉద్వేగాలను ఏవో తెలీని భయాలతో తొక్కిపెడుతున్నామని; భయాన్నే ధైర్యమని భ్రమించి హత్తుకుంటున్నామని. లోపలి మనిషిపట్లా, లోకంపట్లా, దయాపూరితమైన చూపును, ఆలోచనను, మెలకువను ఈ కవిత్వంలో నేను చూశాను. సీతాకోకచిలుక రెక్కల్లోని ఆశను, వర్షపు చినుకుల సంగీతాన్ని, వెన్నెల రాత్రుల నిశ్శబ్దంలోని గాఢమైన శాంతిని ఈ పదాల్లోనుండి అందుకున్నాను. బివివి కవిత్వం జీవితాన్ని అర్థం చేసుకోవడమే లక్ష్యంగా సాగిన ఆంతరంగిక సంభాషణ. కన్నులు మూసుకుని ధ్యానంలోకి జారుకున్నాక, వచ్చే పోయే ఉద్వేగాలను నిర్మోహంగా చూసే చూపు. సుతిమెత్తని జీవనానందపు కౌగిలి.

కొత్త కవిత్వ సంపుటి ‘సృష్టి’ విడుదలైన సందర్భంగా, బివివి ప్రసాద్‌గారితో ఈమాట తరఫున మానస చామర్తిగారు చేసిన చిన్న ఇంటర్వ్యూ:

‘ఆకాశం’ మొదలు మీ కవిత్వ సంపుటుల్లో మీదైన శైలి ప్రస్ఫుటంగా కనపడుతూ వస్తోంది. దీని వెనుక ఉన్న సాధన, ప్రభావాలను చెప్పండి.

బివివి: ‘ఆకాశం’ రాసేనాటికి, శిల్పపరమైన ఎలాంటి కండిషన్ లేకుండా, నన్ను నేను వాక్యాల్లోకి తెరుచుకోవటం కొంత చాతనైంది అనుకుంటాను.

అయితే నా వాక్యం నేను కనుగొనడానికి సహాయపడినవారు ముఖ్యంగా టాగోర్, ఖలీల్ జిబ్రాన్. పరమ ఉదాత్తమైన దాన్నే కవితా సమయంలో తాకాలని నేర్పారు వారు. తర్వాత ఇస్మాయిల్. కవిత్వంలోకి అనుభవాన్ని అనువదించడం, ప్రధానంగా, ఆయననుండి వచ్చిందనుకుంటాను.

మొదటి సంపుటి ‘ఆరాధన’లో టాగోర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ‘నేనే ఈ క్షణం’లో ఇస్మాయిల్ , జిబ్రాన్, కొందరు తాత్త్వికుల ప్రభావాలు, సమకాలీన తెలుగు కవుల ప్రభావాలు కనిపిస్తాయి. ఆ కవితలలో ఏకరూప్యత లేకపోవటం గమనిస్తే, నాదైన వాక్యం కోసం తపనపడటం తెలుస్తుంది.

‘నేనే ఈ క్షణం’ కవితల కాలంలోనే, విస్తృతంగా సాధన చేసిన హైకూ ప్రక్రియ brevity, effect, ease లను నేర్పింది. కనుక జపనీయ కవుల ప్రభావం కూడా నా వాక్యాల్లో ఉండవచ్చును.

మీ దృష్టిలో కవిత్వం ఎందుకు, దాని పరమావధి ఏమిటి?

బివివి: కవిత్వం కానీ, మరే రచన, కళ గానీ మానవ చేతనని సున్నితపరచాలి, మానసిక ఆవరణలను విస్తరింపచేయాలి అని నమ్ముతాను. కేవల వినోద ప్రధానమైన కళ కాలక్షేపానికి మినహా, లోతైన ప్రయోజనమేదీ కలిగి ఉండదనిపిస్తుంది. కేవల సందేశ ప్రధానమైన కళ కూడా కొన్ని ఉపరితల ప్రయోజనాలు కలిగించవచ్చేమో కానీ, ఆంతరిక వికాసానికి అంతగా దోహదపడదు అనుకుంటాను. సౌందర్యాన్నీ , ప్రయోజనాన్నీ కలుపుకొంటూ సత్యసీమలకి ప్రయాణించటం కళ లక్ష్యం అని నమ్ముతాను.

మీ కవిత్వం ప్రధానంగా తాత్త్విక అన్వేషణతో సాగుతుంది. మీపై ఉన్న తాత్విక ప్రభావాలేమిటి?

బివివి: శ్రీ రమణమహర్షి బోధించిన ప్రశ్న”నేనెవరు” నా తాత్త్విక అన్వేషణకి మూలం. ఆ “నేను”ను గురించి విస్తృతంగా, లోతుగా వివరించిన నిసర్గదత్త మహరాజ్ ని చదవటం స్పష్టత నిచ్చింది. “నేను”ను మరింత సూక్ష్మంగా బోధించినవారు శ్రీ కాళహస్తిలోని సుబ్రహ్మణ్యంగారు. పూర్వ ఋషుల బోధలు, ఎకార్ట్ టోలీ వంటి ఆధునిక ద్రష్టల సూచనలు కూడా నా వెదుకులాటకి సహాయ పడుతున్నాయి అనుకుంటాను.

అయితే, అంతిమంగా ఎవరైనా తమదైన స్పష్టత, వెలుగు తామే పొందాల్సి ఉందనిపిస్తుంది.

రూమి, టాగోర్ లాంటి తాత్త్వికకవుల్లో దైవం కోసం, ఆయన అనుగ్రహం కోసం, సన్నిధి కోసం వెదుకులాట ఉంటుంది. మీ అన్వేషణకు కేంద్రం దైవంగా కనిపించదు. ఎందువలన?

బివివి: పూర్వ తాత్త్వికకవులు సత్యాన్ని దైవంగా, object గా, చూడబడేదిగా తలచటం ఎక్కువ, కొన్నిసార్లు మినహాయింపులున్నా.

సత్యం subject అని, చూసేవాడు అని, నేనే సత్యమని జ్ఞానులు చెబుతారు. కనక, నా ప్రయత్నమంతా నన్ను నేను తెలుసుకోవటం వైపే, నేను నేనుగా ఉండటం వైపే ఉంటుంది. రమణమహర్షి తనలో తాను సంస్థితం కావటం అంటారు. తెలియటం కూడా కాదు, అదిగా ఉండటం. అది సర్వదర్శనాల లక్ష్యంగా తోచింది.

ఒక ఆబ్జెక్ట్ ని కవిత్వం చేయటంలో వెసులుబాటు ఉంటుంది. ‘నేను’కి, ఆ వస్తువుకి మధ్యనున్న ఖాళీలో ఎన్ని ఊహలైనా, నాటకీయత అయినా, ఎంత రసమైనా చొప్పించవచ్చును. ‘నేను’ను కవిత్వం చేయటం దుస్సాధ్యం.

కానీ, ప్రసాద్ నేను, ఏమీకాని నేనుగా ఉండాలనుకున్నపుడు ఆ ప్రయత్నం, వెదుకులాట, దుఃఖం, ఆనందం కవిత్వంగా మారే వీలు కలుగుతుంది. ఆ చలనాలు కేవలం బౌద్ధికం (intellectual) కాకుండా, హృదయగతం అయినప్పుడు అది కవిత్వంగా పండుతుంది.

‘ఆకాశం’తో మొదలైనట్టు కనబడే ఈ రసాయనచర్యకి మూలాలు అంతకు పూర్వం రాసుకున్న ‘ఆరాధన’, ‘నేనే ఈ క్షణం’ సంపుటాలలోనూ, హైకూ సంపుటాలలో కూడా కనిపిస్తాయి.

మీ కవితల్లో అధికభాగం “నువ్వు” ని సంబోధిస్తూ రాస్తారు. దీనికేమైనా ప్రత్యేకమైన కారణం ఉందా?

బివివి: కవితల్లో కవి సంబోధించేది తనని తానే. నా కవిత్వం నాతో నేను జరిపే సంభాషణ. కవిగా ఉన్న తాను, ఒంటరి తనతో జరిపే సంభాషణలో, కవి, ఒంటరి మనిషిని ఉద్దేశించి చెబుతుంటాడు. ఈ ధోరణి ఉద్దేశపూర్వకంగా కాకుండా, సహజంగా నాలో ఏర్పడిందనుకుంటాను.

గాఢమైన అనుభవంతో నిండిన ఒక మనిషి సాంత్వనగా పలుకుతున్న మాటల్లా వినపడుతుంది మీ కవిత్వం, అదే సమయంలో వాక్యాలు బోధ చేస్తున్నట్లు కూడా ఉండవు. ఇది ఎలా నిర్వహిస్తారు?

నా కవిత్వం, ముఖ్యంగా ‘ఆకాశం’ మొదలుపెట్టి, నన్ను నేను కన్విన్స్ చేసుకునే ప్రయత్నం – జీవితాన్నీ, మనుషుల్నీ, నన్నూ ప్రేమించటానికి, మరింత లోతుగా గ్రహించటానికి. చాలాసార్లు జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నం కూడా. నాకు నేనే ఔట్ సైడర్ గా ఒక బోధకుడిలా, తండ్రిలా, మిత్రునిలా, కౌన్సిలర్ లా ఉంటూ నాకు చెప్పుకోవటం. చెప్పే నేను, వినే నేను ఒకరే గనుక ఒకరు ఎక్కువా, ఒకరు తక్కువా కారు గనక, బోధ ఉన్నా అది ఆజ్ఞలా కాక, మృదువుగా, భుజం మీద చేయి వేసి మాట్లాడినట్లు వస్తుంది.

ఒక కవిత మీలో ఎలా తయారవుతుంది? ఎలా వ్యక్తమవుతుంది? కవిత రాయటంలో మీకేదైనా ప్రణాళిక ఉంటుందా?

బివివి: కవిత్వం నా జీవితానుభవంనుండి, చూపునుండి, ఆర్తినుండి పుడుతుంది. అది ఆకాశంలో మేఘాలు పుట్టినట్టు, సాంద్రమైన భావాలుగా రూపు దిద్దుకొంటూ ఉంటుంది. మేఘం బరువెక్కినపుడు ఇక కురవబోతుంది అని మనకి తెలిసినట్లే, భావసాంద్రత ఏదో ఒక సమయంలో ఒక ఊహ ద్వారానో, వాక్యం ద్వారానో, ఉపమ ద్వారానో పదాల్లోకి కురవబోతుంది అనిపిస్తుంది. మొదటివాక్యం పూర్తవుతూ ఉండగా, రెండవ వాక్యం తెరుచుకుంటుంది. ముగింపువరకూ అలానే నడుస్తుంది. వాన వెలుస్తుంది. కవిత్వం రాయటం అయిదు, పదినిమిషాల పని. కానీ ఆ కవితకి తయారుకావటం వెనక జీవితమంతా ఉంటుంది అనుకుంటాను.

మీ కవిత్వం మొత్తం మానసిక ప్రపంచం చుట్టూ తిరుగుతుంది. నిర్దిష్ట వస్తువుల మీదా, సమస్యల మీదా కవితలు కనపడవు. ఎందువల్ల?

బివివి: జీవితంలోని విషయాల కన్నా, అన్నిటినీ కలుపుకున్న జీవితమనే అనుభవం గురించి రాయటమే, కాలక్రమేణా ఇష్టంగా, సహజంగా మారింది. మారాల్సింది విషయాలు కాదు, చూపు అని జ్ఞానులు చెప్పటం వల్ల కూడా కావచ్చును, మొత్తం జీవితాన్ని చూసే చూపు మార్చుకొనే సాధనలోనే నా కవిత్వం భాగమవుతూ వచ్చింది. కనుకనే నిర్దిష్ట వస్తువులు, సమస్యలు నా కవితల్లో కనిపించవు. ఇది కాగితం మీది బొమ్మల గురించిగాక, బొమ్మలకు ఆధారమైన కాగితం గురించి మాట్లాడటం వంటిది.

మీ కవిత్వంలో కష్టమైన సంధులుండవు, పరుష పదాలుండవు. పొడుగైన పదబంధాలు కూడా ఉండవు. ఒత్తులు, ద్విత్వాక్షరాలూ కూడా అరుదు. ఎందుచేత మీ భాషను ఇట్లా నిర్మించుకున్నారు?

బివివి: నేను అనుభవిస్తున్న, అర్థం చేసుకొంటున్న లోతైన, సున్నితమైన విషయాలు స్పష్టంగా, తేలికగా తెలియచేయటానికి చాలా సరళమైన మీడియం అవసరం అనిపించింది. అందువలన భాష ఎక్కడా అడ్డు పడకుండా చూసుకుంటాను. నా కవిత్వంలో భాష, ‘ఇదిగో నేనున్నాను’ అనదు. తానున్నానా, లేనా అన్నంత నిశ్శబ్దంగా, నిరాడంబరంగా భావాల్ని, కవినుండి పాఠకుడికి చేరవేస్తుంది.

పూలు, సీతాకోకచిలుకలు, వాన, ఆకాశం వంటివి తరచూ మీ కవిత్వంలో కనిపిస్తాయి. దీనికేదైనా ప్రత్యేక కారణం ఉందా?

బివివి: ప్రాకృతిక దృశ్యాలు మనం జీవితమని భ్రమపడుతున్న దానినుండి జీవించటంలోకి మేల్కొలుపుతాయి. మానవుల్ని ఆశలూ, భయాలతో నిండిన మానసిక ఉద్వేగాల నుండి, విముక్తం చేసి, సంతోషమూ, నిండుదనమూ, కనికరమూ వంటి హృదయ స్పందనలలోకి తీసుకువెళతాయి. ప్రాకృతిక పదాలు సహజంగానే కవిత్వ పరిమళాన్ని కలిగి ఉంటాయి గనుక, అవి ఉపయోగించటం ఇష్టంగా ఉంటుంది.

రంగుల్ని చూసి విభ్రాంతికి లోనయే పసిదనమేదో లోపల సాంద్రంగా ఉండి వుంటుంది గనుక, వర్ణ ప్రధాన ప్రాకృతిక దృశ్యాలైన సీతాకోకలు, పూలు, ఇంద్రధనువులు పదేపదే వాక్యాల్లోకి వాలుతాయి. విస్తృతినీ, విముక్తినీ కంటి ముందు నిలిపే ఆకాశమూ, హృదయధర్మానికి సమీపంగా ఉండే వానా తేలికగా కవిత్వంలో కరిగిపోతాయి.

‘ఈ లోకం చిటికెన వేలు పట్టుకుని ఇక్కడ ఉండటానికి భయమేమిటి, బాధేమిటి’ అంటారు ‘సృష్టి’లో. “చాలు అన్న మాట చివర ఏముందో ఎప్పుడన్నా చూసావా” అని ‘ఊరికే జీవితమై’లో అంటారు. ‘ఆకాశం’లో ‘నిశ్శబ్దంగా బ్రతికితే ఏమిటి? నిరాడంబరంగా వెళ్ళిపోతే ఏమిటి?’ అంటారు. ఈ పరుగుల ప్రపంచంలో ఇంత తృప్తికి, నెమ్మదికి చోటెక్కడుంది? “పోనీలే” అన్న మీ మాటతో పక్కకు తప్పుకుంటే ఈ పోటీ ప్రపంచపు నిజాన్ని ఎదుర్కోవడమెట్లా?

బివివి: పరుగుల ప్రపంచం లోకమోహంలో మనసు కల్పించేది. తృప్తి మనసు తనతో తాను నిండినపుడు కలిగేది. మొదటిదానిలో పడి కొట్టుకుపోతున్నాం, గనకే రెండవది నొక్కి చెప్పటం. అనుభవాలా, శాంతా ఏది చివరిది అనే చూపు నివ్వటానికి ప్రయత్నమేమో, నా రాతలన్నీ.

జీవం నిండిన మెలకువతో పగలు గడపటానికి, రాత్రులు గాఢమైన నిద్ర అవసరం. పగటికి రాత్రి వ్యతిరేకం కాదు, పూరకం. అలానే, ఘర్షణతో నిండిన జీవితంలో ఉత్సాహంగా పాల్గొనటానికి శాంతి నిండిన మనసు అవసరం. ఆ శాంతిని కలిగించే మౌలిక విలువలలో, ‘పోనివ్వు’ కూడా ఒకటి. ఆశలలో కొట్టుకుపోయే మనసుకి, చాలు అనే భావన అమృతబిందువు. అది నిరాశని, చేతకానితనాన్ని ఇచ్చే చాలు కాదు, నిండుదనాన్ని, వివేకాన్ని ఇచ్చే చాలు.

‘ఆకాశం’లో గొప్ప సానుకూల దృక్పథం (positive outlook) ఉంటుంది. ఉత్సాహభరితమైన గొంతు, ఆశావహ దృక్పథం కనపడతాయి. ఇప్పుడు ‘సృష్టి’ సంపుటిలో, “ఒక భయ దుఃఖ కంపిత హృదయపు వెదుకులాట ఈ మాటలు” అంటారు. ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

బివివి: ‘ఆకాశం’ నుండి ‘నీలో కొన్నిసార్లు’, ‘ఊరికే జీవితమై’ మీదుగా ఇప్పటి ‘సృష్టి’ వరకూ, నా ఆంతరిక ప్రయాణం ఏకసూత్రతతోనే ఉందనుకుంటాను. లోపలున్నది ఒకే ఆనందం, దుఃఖం, ఒకే భయం, ప్రేమ, ఒకే వెదుకులాట, తృప్తి. మానవ మౌలిక సంవేదనలతోనే కవి వ్యవహరిస్తూ వచ్చాడు. ఆయా జీవన సందర్భాల నేపథ్యం వలన పైకి కొన్నిసార్లు ఆనందదాయకంగా ఉన్నట్లు, కొన్నిసార్లు వేదనతో రాసినట్లు కనిపిస్తాయి గానీ, మౌలిక చలనంలో రెండిటినీ గాఢంగా హత్తుకొంటూనే, మరలా రెండిటినీ దాటి వెళ్ళిపోవాలనే ఆరాటమూ, ఆర్తీ కూడా వెలుగునీడల్లా ఆ వాక్యాలపై వాలి గోచరిస్తూ ఉంటాయి.

ప్రచురణ : 
ఎడిటెడ్ : 'వివిధ' ఆంధ్రజ్యోతి 15.12.2025
పూర్తి పాఠం : ఈమాట, జనవరి 2026

02 జనవరి 2026

జీవనోద్వేగం వైపు ... - డాక్టర్ సుంకర గోపాల్

బివివి ప్రసాద్ మొదటి పుస్తకం ఆరాధన నుండి ఇప్పటి సృష్టి వరకు వచ్చిన కవిత్వంలో తన తాత్విక ధారను కొనసాగిస్తున్నారు. మొత్తం మీద వారి సారాంశం అద్వైత భావన. జీవితంలో ఆయన జీవితేచ్చ వెతుకుతున్నాడు. జీవితంలో ఉండే సుఖ, దుఃఖాలను జీవితంలో ఉండే ద్వంద్వాలను అనేకమార్లు బివివి గుర్తించాడు. ఈ జీవితాన్ని ఎట్లా దాటాలో, ఎందుకు దాటలేమో దాని అంతు చూడాలనేది ప్రసాద్ గారి బలమైన కాంక్ష. ప్రకృతికి ,కాలానికి మనిషి అతీతుడు కాదు. శూన్యం నుండి మొదలై భావోద్వేగాల ద్వారా పరిపూర్ణత చెంది, తిరిగి శూన్యం వైపు అనగా అది నిద్ర కావచ్చు, మరణం వైపు కావచ్చు. మానవ జీవితం శూన్యం నుండి శూన్యం వైపు వెళుతుంది అనే భావనను ప్రసాద్ గారు గాఢంగా నమ్మారు. సరళపదాలలో తాత్వికతను పలికించారు. జీవితం తనని తాను ఎట్లా జీవిస్తుందో పసిగడుతున్నారు

వారు రాసిన సృష్టి అనే కవితని పరిశీలిస్తే ఈ సృష్టిని చిత్రకారుడు నైపుణ్యంతో పోలుస్తూ మానవ ఉనికిలోని తాత్విక కోణాన్ని చూపుతారు. సృష్టి కవిత మూడు మూడు పాదాలుగా ఉంటూ చివర నాలుగు పాదాలతో ముగుస్తుంది. ఇందులో వారు మొదట కవితకి పునాది వేస్తారు.

"ఖాళీ మనసులో కొన్ని రంగులు ఒంపు
అవి ఆకాశమూ, గాలీ, నీరూ
కాంతీ, చీకటిలో వెన్నెలా"

ఈ మూడు పాదాలను చిత్రకారుని నైపుణ్యంతో పోలుస్తూ కవితకి పునాది వేస్తారు.

"రంగులపై కొన్ని గీతలు గీయి 
నదులూ, కొండలూ, మైదానాలూ 
ఉదయాస్తమయ మేఘాలూ, పాలపుంతలూ"

ఈ పాదం మనకు ఒక ఆకృతిని ఆకారాన్ని తెలియజేస్తుంది. తరువాతి మూడు పాదాలలో ప్రకృతికి చైతన్యాన్ని ఇచ్చే ప్రతీకలను చెప్తారు.

"గీతలను కొంచెం కదిలించి చూడు
చెట్లు, పిట్టలూ, చేపలూ
చీమలూ, ఏనుగులూ, మనుషులూ"

ఆ తర్వాతి మూడు పాదాలలో ఖాళీ మనసులోని భావోద్వేగాలను చెప్తారు.

"కదలికలలో ఉద్వేగాలు కలుపు 
చిక్కగా, లేతగా ,తీవ్రంగా, తేలికగా 
మంచీ, భయమూ, బాధా, ప్రేమా"

చివరి నాలుగు పాదాలలో శూన్యం నుండి శూన్యం వైపు వెళ్ళడం గురించి చెప్తారు.

"ఇంతకన్నా ఊహించేదేమీ లేదు 
నువ్వైనా, దేవుడైనా 
మళ్లీ మొదటికి రావాల్సిందే 
నిద్రలోనో, మరణంలోనో, జ్ఞానంలోనో" అంటారు.

బివివి ప్రసాద్ చాలా కవితలలో ప్రకృతిలోని వైవిధ్యానికి జీవన ఉత్సాహమే కారణం అనే భావన కనిపిస్తుంది. ఆయన రచించిన మరో కవిత రంగుల పిల్లలు, ఇందులో రంగులు ఆశకి, అస్తిత్వానికి గుర్తుగా చెప్పారు. జీవితంలోని సుఖ, దుఃఖాలను ఓదార్పుగా బతుకుపై ఆశను కలిగించే పసిపిల్లలలాంటి శక్తులుగా కవి అభివర్ణిస్తాడు. ఈ కవిత చదివాక పాఠకుడు తన అంతరంగాన్ని తానే చూసుకోవాలి.

ప్రసాద్ గారికి ఉన్న గొప్ప శక్తి దృశ్య చిత్రణ, అది అన్ని కవితల్లో కనిపిస్తుంది.

"అస్తమయబింబం ఆకాశంలోకి విసిరే 
చివరి నారింజ కాంతిలా

అట్లా నలుపు, తెలుపుల
దుఃఖానందాల కెరటాల మధ్య
రంగులు నీకు ఆశ కల్పిస్తాయి అమాయకంగా 
ఇక్కడింకా ఏదో ఉందని"

ఇక్కడ కవివాడిన నలుపు, తెలుపులు వాస్తవానికి, నిశ్శబ్దానికి సూచికలు.
 
ఇందులో ఉన్న మరొక కవిత మోహం. ఈ కవిత ద్వారా బ్రతికే క్షణాల విలువను కవి చెప్తారు. బాహ్య ప్రపంచానికి అంతరంగ ప్రపంచానికి మధ్య ఉన్న విభజనను గుర్తించమంటారు. జీవితాన్ని అనుభవించాలి అనే తహతహ అడుగడుగునా కనిపిస్తుంది. రెండున్నర గంటల సినిమా అయిపోతుందని జాగ్రత్తగా చూసినట్లు జీవితాన్ని చాలా విలువగా చూడాలని ఈ కవితలో కవి
గుర్తించమంటాడు. మోహం జీవితం పట్ల ఉన్న లేదా ఉండాల్సిన ప్రేమకి సూచిక.

"జీవితమ్మీద ఇంత మోహమేమిటి అంటారు 
ఏ రోజైనావెళ్ళిపోయే విరక్తి ఉంది గనుక అంటావు

ఆ దీపం వెలుతురు, బాటపై మనుషులు 
ఇళ్లపై వెలుగునీడల దోబూచులాట 
ఉండి ఉండి తగిలే గాలి తెరలు
కురవలేక బేలగా నిలబడిన మబ్బులు 
మానుష ప్రపంచపు వింత శబ్దాలు 
చనిపోతే ఇక దొరకవు కదా అని కూడా

జీవించటం ఇంత అపురూపమైన సంగతా అంటారు".

పై వాక్యాలలో కవి నిర్మాణాన్ని పరిశీలిస్తే
చాలా తేలికైన వాక్యాలుగా అనిపిస్తాయి. కానీ ఇందులో కవి జీవితంలోని దృశ్య, స్పర్శ, శబ్ద సన్నివేశాలను చెప్పాడు.

ఇక ఇదే కవితా సంపుటిలో సీతాకోకల కథ
కవిత ఉంది. అందులో కవిత చాలా మామూలుగా 

"రెండు తెల్లటి ప్లాస్టిక్ సీతాకోకల్ని
తలలో తురుముకుంది ఆ అమ్మాయి"
అంటూ ప్రారంభం అవుతుంది.

ఆ కవితలో 
"మాకు రెక్కలున్నాయి, ఊహల్లేవు, 
నీకు ఊహలున్నాయి, రెక్కల్లేవు"
వాక్యాలు మనిషి ఉనికిలోని వెలితిని సూచిస్తాయి. మనిషికి ఎగరాలనే కోరిక ఉంటుంది కానీ పరిమితులు ఉంటాయి. ఈ రెండింటి కలయికతో కళాసృష్టి జరుగుతుందని కవి సీతాకోకల కథ అనే కవితలో చెప్తాడు.

ఈ కవిత, వస్తువు రీత్యా సామాన్యంగా అనిపించినా, దాని వెనుక ఉన్న తాత్వికత చాలా లోతైనది. ఒక చిన్న దృశ్యాన్ని (అమ్మాయి తలలోని ప్లాస్టిక్ సీతాకోక చిలకలు) తీసుకుని, దాన్ని కవిత్వం, ఊహ మరియు జీవిత సత్యాల మధ్య సంఘర్షణగా మార్చిన తీరు గొప్పగా ఉంది.
 
కవి నిరంతరం బాహ్య ప్రపంచాన్ని తన ఊహలతో నింపేయాలని చూస్తుంటాడు, కానీ జీవితం దానికంటే బరువైనదని ఇక్కడ గుర్తు చేస్తారు.
 
"మాతోపాటు సూర్యకాంతినీ, ఆకాశాన్నీ, భూమినీ
అంతటినీ దాచుకునే, పంచిపెట్టే 
జీవితం బరువునీ నువు మోస్తూనే ఉండాలి" అని అంటారు.

"జీవితం బరువునీ నువు మోస్తూనే ఉండాలి" - ఊహల్లో విహరించడం సులభమే కానీ, సూర్యకాంతిని, ఆకాశాన్ని, భూమిని మోయడం కష్టమని కవి అంటారు. కవి కేవలం అందాన్ని మాత్రమే కాదు, ఆ అందం వెనుక ఉన్న జీవిత పాఠాన్ని కూడా వెతుకుతున్నారు.

అమ్మాయి వెళ్ళిపోయాక, అక్కడ మిగిలిన 'నీరెండ'
సీతాకోకలా ఎగరడం అనేది కవితకు ఒక గొప్ప దృశ్యాత్మక ముగింపునిచ్చింది. అమ్మాయి వెళ్ళిపోయినా, కవి ఆలోచనల్లో ఆ అనుభూతి ఇంకా మిగిలే ఉంది.

ఈ కవిత కేవలం ఒక అమ్మాయి తలలోని పిన్నుల గురించి కాదు; ఇది కవిత్వానికీ - జీవితానికీ, ఊహకూ - వాస్తవానికీ మధ్య జరిగే నిరంతర సంవాదం. లోకాన్ని పరిశీలించే క్రమంలో కవి తనని తాను ఎట్లా విశ్లేషించుకుంటారో ఈ కవిత ప్రతిబింబిస్తుంది.

"భూమి ఇంకా ఎడారి కాలేదు
సముద్రం ఎండిపోలేదు 
వెన్నెల మసకగానైనా కనిపిస్తూ ఉంది 
ఎందుకు బ్రతకకూడదు"

అంటూ మరొక కవితలో ఆత్మహత్యలు చేసుకునేవారికి క్షణాల విలువ, ఊపిరి విలువ, జీవితం విలువ, సారహీనమైన జీవితాన్ని వెలిగించుకోవడానికి ఏమేమి చేయాలో, మనకు ఏది భరోసాగా నిలుస్తుందో చాలదా అనే కవితలో చెప్తారు. ప్రసాద్ గారు ఉదయం కిరణాలు, గాలి, మధ్యాహ్నపు ఎండ నీడ, సాయంత్రం దిగులు ఆకాశం పైన కనిపించే రంగులు, చీకటి వచ్చిన సమయాల్లో ఆకాశంలో మెరిసే నక్షత్రాలు.. ఇవన్నీ మనల్ని బతికిస్తాయని, కొంచెం ప్రేమ మిగిలి ఉన్న చాలు ద్వేషాలు, అపనమ్మకాల మధ్య ఒక్క తడి చూపు చాలు ఈ లోకం చాలా ఏళ్లు బతుకుతుందని తన కవిత్వం ద్వారా భరోసా ఇస్తాడు. 

ఈ లోకంలో మనం ఏమన్నా బతికితే చిన్నప్పుడు మాత్రమే బతికామని మిగిలిన జీవితం అంతా కేవలం బదులు చెల్లించడం వలే గడిపేస్తున్నామని వాపోతాడు. జీవితాన్ని సాహసంగా స్వీకరించడం ఎలానో సృష్టి కవితా సంకలనంలోని చాలా కవితలు ఒక తడి హృదయం తో చెప్తాయి. బీవీవీ కవిత్వంలో ఆకాశము, సముద్రం, క్షణాలు, జీవితం, పూలు, సీతాకోకలు, ప్రేమ, దయ, దుఃఖం వంటి పదాలతో చేసే ఊహలు సరికొత్తగా ఉంటాయి. ఇక ఆయన వాక్యాలు మృదువైన స్పర్శతో సున్నితంగా, లాలనగా ఉంటాయి. ప్రపంచం పట్ల, ఈ ప్రపంచంలోని మనుషులు పట్ల అపారమైన ప్రేమ కలిగిన కవి బివివి ప్రసాద్. ప్రపంచాన్ని లేదా జీవితాన్ని చిన్నారిపాపలా దగ్గరకు తీసుకోవడం ఎట్లాగో ఈ కవిని చదివాక తెలుస్తుంది. ఆయన ఓ కవితలో ముగింపువాక్యం చూడండి.

"జీవితం నీ ప్రేమ కోసం ఏడుస్తున్న 
నీ తప్పిపోయిన శిశువు"

సృష్టి కవిత సంపుటి కోసం బీవీవీ ప్రసాద్ గారిని సంప్రదించవచ్చు.

- డాక్టర్ సుంకర గోపాల్
8555971630

(కవిసంగమం గ్రూప్ లోని కవిత్వ కాంతి శీర్షిక కోసం రాసిన 44వ వ్యాసం)