26 ఏప్రిల్ 2026

వ్యాసం : అనుభవ కవిత్వం

1
అనుభూతి కవిత్వం గురించి మీరు మాట్లాడాలి అన్నారు మిత్రులు చక్రధర్. నాకు ప్రసంగాలు చేయటం రాదు. పుస్తకాలు చదవటం మానేసి చాలా కాలమైంది. కనక నేనేమీ మాట్లాడలేనన్నాను. అని ఊరుకుంటే బావుండేది. కవిత్వం ఏదైనా అనుభూతే. కనక, అనుభూతి కవిత్వం అనే మాట సరైనది కాదు, దానికన్నా అనుభవ కవిత్వం అనటం సరైనది అన్నాను, ఇస్మాయిల్ గారు కూడా ఆ లేబిల్ ఒప్పుకోలేదు అని కూడా అన్నాను. మీడియావాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలన్నది అనుభవంలో లేక తొందరపడ్డాను. అయితే అనుభవ కవిత్వం మీద మీరు మాట్లాడుతున్నారు అన్నాడు.

సీరియస్ గా సాహిత్యం చదువుకుని రెండు దశాబ్దాలు దాటింది. ఎప్పుడైనా ఒకటీ, అరా పుస్తకాలు మినహా ఎలాంటి చదువూ లేని, ఈ మిత్రుని మాటలు మిత్రులు సీరియస్ గా తీసుకోనవసరం ఉండకపోవచ్చని ముందుగా సూచిస్తున్నాను.

చదవకుండా ఇంత కవిత్వం ఎలా రాస్తున్నారు, మీరు ఏదో చదువుతున్నారు అన్నారు చక్రధర్. అవును, చదువుతున్నాను. నా అస్తిత్వాన్నీ, నా అస్తిత్వం చుట్టూ విస్తరించిన అనంతమైన అస్తిత్వాలనీ, విశ్వం నాలోకి ప్రసరిస్తున్న ప్రతిఫలనాలనీ చేతనైనంత శ్రద్ధగా చదువుకుంటున్నాను. నా జీవితానుభవాన్ని వీలైనంత దగ్గరగా చదువుతూ, కదిలే సమస్తం వెనుక కదలని మూల ద్రవ్యం ఏదన్నా వెండితెరలా ఉందా అని వెదుకుతున్నాను. 

2
ఈ మౌలికమైన వెదుకులాట ఆధారంగా కవిత్వం ఏమై ఉంటుంది అని ఆలోచించినప్పుడు, కవిత్వం ప్రధానంగా మూడు శక్తుల కలయికగా తోస్తుంది. అవి ఆలోచన, ఉద్వేగం, అనుభూతి. ఒక వస్తువుకి సంబంధించిన సమాచారాన్ని ఆలోచన అనవచ్చును. ఉదాహరణకు అది మామిడిపండు అని తెలియటం ఆలోచన. ఆ వస్తువుతో సంబంధం కోసం మనస్సులో కలిగే చలనాన్ని ఉద్వేగం అనవచ్చును. మామిడిపండు తినాలి అనిపించటం ఉద్వేగం. వస్తువుతో సంబంధం ఏర్పడినపుడు మనసులో కలిగే సంవేదనను అనుభూతి లేదా అనుభవం అనవచ్చును. మామిడిపండు రుచి చూస్తున్నపుడు కలిగేది అనుభూతి లేదా అనుభవం. 

అయితే, అనుభూతి, అనుభవం ఒకటేనా అని అంటే, ఒకలానే కనిపిస్తాయి కానీ, కొంత సూక్ష్మమైన భేదం ఉన్నట్లు తోస్తుంది. అనుభూతిలో కొంత ఉద్వేగం పాలు కూడా ఉంటుంది. ఉద్వేగమూ, అనుభవమూ కలగలిసిన ఒకానొక చలనాన్ని అనుభూతి అనవచ్చును అనుకుంటాను. అనుభవంలో ఉద్వేగ సంబంధంలేని శుద్ధ సంవేదన మాత్రమే ఉంటుంది అనిపిస్తుంది. ఇస్మాయిల్ గారు ఏమన్నారని మళ్ళీ చదివి చూస్తే, ఆయన రెండిటినీ సమానంగానే చూసినట్లు కనిపించింది. అయితే పైన చెప్పిన సూక్ష్మ భేదం జోలికి పోనట్లయితే, అనుభూతి కవిత్వంగా స్థిరపడ్డ అభిప్రాయాన్ని కూడా కాదనలేము.  

3
ఇక ఒక కవితలో మూడు శక్తులూ ఉన్నట్లయితే, కవిత్వాన్ని ఆలోచనాత్మక, ఉద్వేగపూరిత, అనుభూతి కవిత్వాలని మూడు పాయలుగా చూడటం ఎలా కుదురుతుంది అన్నపుడు, దాని జవాబు తేలికగానే తడుతుంది. 

ఒక బలమైన లేదా సాంద్రమైన కవితలో మూడు శక్తులూ ఉన్నప్పటికీ, ఆ శక్తుల ప్రాధాన్యతను బట్టి, శాతాన్ని బట్టి వాటిని ఆలోచన, ఉద్వేగ, అనుభూతి కవితలుగా మనం గుర్తించవచ్చును. 

గురజాడ రాసిన 'మంచి, చెడ్డలు ఎంచి చూడగ రెండె కులముల లోకమందున, మంచి యన్నది మాల యైతే మాల నేనౌతాను' అన్న వాక్యాలు గానీ, బసవరాజు అప్పారావు రాసిన ' ప్రేమించు సుఖముకై, ప్రేమించు ముక్తికై, ప్రేమించు ప్రేమకై, ఏమింక వలయురా ' అన్న వాక్యాలు గానీ, ఆలోచన ప్రధానమైన కవిత్వంగా మనకి తోస్తాయి. 

టాగోర్  ' నక్షత్రాలన్నింటితో ఆకాశము, అంతులేని ఐశ్వర్యాలతో ప్రపంచమూ అన్నీ నాకు ఉన్నా నేనింకా కావాలని అడుగుతాను, కానీ ఈ ప్రపంచంలో మరీ మూల కాస్త చోటుంటే చాలు, ఆమె  నాదైతే ' అన్నపుడు మనకి ఒక కవి శుద్ధ ఉద్వేగంతో చలించటం కనిపిస్తుంది. 
ఎంకెవ్వరని లోకమెపుడైన అడిగితే, వెలుగునీడల వైపు వేలు చూపింతు అన్న నండూరి మాటలు కూడా నిండైన ఉద్వేగం నుండి ఉబికి వచ్చినట్లు కనిపిస్తాయి.

ఇక ఇస్మాయిల్ గారు రాసిన ' తరుచాపము వీడి దివిని గురి మరచిన బాణంలా తిరుగాడును పిట్ట ' అన్న వాక్యాలు కానీ, ' అంతా తెల్లకాగితం, ఒక మూలన నిలువుగా ఒక గీత, అడ్డంగా ఒకటి. తెరచాప ఎత్తిన పడవ. కిందిది నదీ, పైది ఆకాశమూ కావచ్చును ' అన్న వాక్యాలు కానీ చదివినపుడు, ఆలోచన, అనుభూతీ చెరిగిపోయి, కవి అనుభవించిన శుద్ధ ఇంద్రియానుభవం మనకి బదిలీ అవుతుంది.  

4
కవిత్వం ఏదైనా, కవి తనని వ్యక్తీకరించుకోవటానికీ, తనకి ఒక ఔట్ లెట్ గానూ భావించి, బలమైన వత్తిడి నుండి రాసినపుడు సాంద్రమైన అభివ్యక్తులు ప్రకటమవుతాయి.  అయితే ఈ ప్రకటమయ్యే క్రమంలో కవి తన పాఠకునికి ఇవ్వదలచిన అనుభవంలో స్పష్టత ఉన్నపుడు ఆయా కవులు బలమైన ఆలోచననో, ఉద్వేగాన్నో, అనుభవాన్నో ఇవ్వగలుగుతారు. 

వీటిలో ఆలోచనాత్మక కవిత్వం ఆలోచనల విస్తృతి పెంచితే, ఉద్వేగ కవిత్వం పాఠకుని ఉద్వేగాలను బలమైనవిగా తయారు చేస్తుంది. అనుభవ కవిత్వం వీటికి భిన్నంగా మనిషిని ఆలోచనల నుండీ, ఉద్వేగాల నుండీ ఉపశమింపచేసి, తన నిజమైన, సాత్వికమైన అస్తిత్వంలోకి మేలుకోలుపుతుంది. దేని ప్రయోజనం దానికి ఉంటూనే, మూడు పాయలూ కూడా చైతన్య పరిధిని విస్తరింప చేసేవి గా, పరస్పర పూరకాలుగా కూడా ఉంటాయి. 

మనం మన మానసిక స్థితిని బట్టి, అవగాహనని బట్టి, అవసరాన్ని బట్టి ఆయా కవిత్వాలని ప్రేమిస్తాము.

( మిత్రులు ముక్కామల చక్రధర్  ఏప్రిల్ 25, 26 తేదీలలో చిత్ఫలపాలెం లో నిర్వహించిన గోదావరి కోనసీమ సాహితీ సమాలోచన కోసం రాసుకున్న ప్రసంగ పాఠం. )

బివివి ప్రసాద్
22.4.26










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి