బి.వి.వి.ప్రసాద్ కవిత్వ పరిశీలన : మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్
వ్యాససంగ్రహం :-
ఈ వ్యాసం "మానవ జీవితం అనేక జీవితాలుగా కాక ఒకే జీవితంగా, ఉన్నదంతా ఒకే సారంగా భావించి కవిత్వం చేయడం బి.వి.వి. ప్రసాద్ కవిత్వ దృక్పథంగా గుర్తిస్తుంది". మనలో "ఎరుక/ఇంటెన్షనాలిటీ" ఒకటి ఉంటుంది. అది మన మూలాలకు చెందినది. దాని మూలకాలు ప్రేమ, దయ, శాంతి, ఓర్పు, మొదలైన మౌలిక భావనలు. ఇవే మనలను పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దేవి అని ఈ కవిత్వం ద్వారా స్పష్టం చేస్తుంది ఈ వ్యాసం. కవి వ్యక్తిత్వం లోని సున్నితత్వం, వినూత్న ధోరణితో కవిత్వం అల్లడానికి నిర్మించుకున్న వాతావరణం మరియు సహజ అనలంకారిక శైలి, అభివ్యక్తి నవ్యత మొదలైన విషయాలను ఆధునికత కలిగిన కవితా రీతిగా వివరిస్తుంది ఈ వ్యాసం, ఆధ్యాత్మికత లో వుండే సమర్పణ భావం విశ్వచైతన్యం పట్ల హైకూ ఏవిధంగా పాఠకుడిలో మెలకువ కలిగిస్తుందో చెబుతుంది ఈ వ్యాసం. "నేనే ఈ క్షణం" సంపుటిలో కవి మెటానమీ టెక్నిక్/పద చిత్రాలద్వారా ఏవిధంగా జీవన సారం, ప్రాకృతిక సౌందర్యం కవిత్వం చేసారో వివరిస్తుంది. 'ఆకాశం', 'నీలో కొన్ని సార్లు', 'ఊరికే జీవితమై', 'సృష్టి' సంపుటులు అందించిన తాత్వికానుభూతిని లోతుగా విశ్లేషిస్తుంది ఈ వ్యాసం. ఈ కవి కవిత్వాన్ని తమ సమకాలీన ప్రసిద్ధకవులు ఎలా ఆదరించారో రికార్డు చేయడం ద్వారా కవిత్వ పరిశీలనద్వారా బి.వి.వి. ప్రసాద్ కవిత్వంలోని నవ్యతను వివరిస్తుంది. విశ్లేషణాత్మక, వర్ణనాత్మక పద్ధతిలో ఈ పరిశోధన సాగింది. తాత్విక నేపథ్యమున్న భవిష్యత్ పరిశోధకులకు ఈ వ్యాసం ఉపకరిస్తుంది.
కీలక పదాలు :- మౌలిక భావనలు, తాత్వికానుభూతి, నూతన దృక్పథం, హైకూ, మెటానమీ టెక్నిక్, ఆకాశం, కొత్తదైన మెలకువ, ఎరుక, ఒక ఫిల్టర్. ప్రధాన స్రవంతి కి భిన్నంగా, అద్వైతాంశ.
2 :
బి.వి.వి. ప్రసాద్ కవిత్వ దృక్పథం
ఆధునికత/నవ్యత :
ఆధునికత :- "కవిత్వంలో ఆధునికత్వం అనగా స్వభావమును బట్టి ఆధునికత్వమే గాని కాలమును బట్టినది కానేకాదు" డా॥ సి.నారె. ఈ నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని బి.వి.వి. ప్రసాద్ కవిత్వంలోని నవ్యతను వివరిస్తుంది ఈ వ్యాసం.
సాహిత్య ప్రయోజనం సమాజ హితమే. అది ఏదో ఒక వాదమునకు పరిమితమైతే ఆ సమస్య మాత్రమే పరిష్కరించబడుతుంది. అది కూడా మంచిదే. కాని పరిపుష్టమైన, సమగ్రమైన సమాజనిర్మాణానికి మార్పు అనేది ముందు నీ నుండి రావాలని అంటారు బి.వి.వి. ప్రసాద్. మనలో తేలికదనము ఉండాలి, సరళత ఉండాలి. ఏ పని చేసిన ఏమి ఆలోచించినా దయ, ప్రేమ నింపుకొని చేయాలి అనే నూతన దృక్పథంతో వీరి కవిత్వం పరిమళిస్తుంది.
నువ్వు చెప్పేది ఏదైనా నీ అనుభవంలోంచి పలకాలి అన్న ఆర్.ఎస్.సుదర్శనం గారి మాటలు తూచా తప్పకుండా పలికాడు ఈ కవి.
ఐతే ఇతని భావజాలం, కవితా వస్తువులు, భావ చిత్రాలు, మర్మంగా లోతుగా అనుభవంలోంచి చెప్పడం ఒక నూతన కవితా రీతిని కలిగి ఉన్నాయి.
1) సహజ అనలంకారిక శైలి :
ఇప్పటి వరకూ ఫిగరేటివ్ లాంగ్వేజ్ / అర్నేట్ స్టైల్ చదవడానికి అలవాటు పడిన పాఠకుడు
ఒక్కసారిగా ఈ సహజ అనలంకారిక రచనా విధానాన్ని తీసుకోవడం కొంత కష్టమే కానీ ఇదే మన అసలు సహజ స్థితిని ఎరుక చేసే శైలి అని తెలుసుకున్నాక పాఠకుడు సాంత్వన పొందుతాడు. అంతే కాకుండా ఈ కవిత్వానికి అంకిత మయిపోతాడు.
ఈ కవిత్వం మనకు అందించేది ఒక్కటే హాయిగా జీవించడమెలానో నేర్పుతుంది. ఏ పేచీ లేకుండా శాంతంగా ఎలా మనవచ్చో తెలుపుతుంది. ఊరికే జీవితమై అన్నంతగా, ఇదే బి.వి.వి.ప్రసాద్ కవిత్వం మనకందించే గొప్ప కవిత్వ కానుక.
2) వ్యక్తిత్వం లోని సున్నితత్వం
బి.వి.వి.ప్రసాద్ స్వభావ రీత్యా సున్నితస్థుడు, లోతైన అన్వేషి, తగినంత ఆర్ద్రత, నిజాయితీ, చేసే పనిపట్ల ప్రాణం పెట్టి చేయడం నచ్చని వాటికి దూరంగా ఉండడం, ఇతరుల్లో మానవీయ విలువలు ఆశించి తరచూ నిస్పృహకు గురికావడం తన వ్యక్తిత్వంగా గమనించి. తన లోపలి వెలితి ఒకటి తన జీవిత గమనాన్ని శాసిస్తుందని భావించి ఆ వెలితిని నింపే ప్రయత్నంగా కవిత్వాన్ని ఆవిష్కరించారు.
3) కవిత్వం కోసం నిర్మించుకున్న వాతావరణం
వైరుధ్య భావాలతో జీవించే మానవ లోకంలో మనందరి మనస్సు ఉపశమించే మంత్రనగరి ఒకటి కావాలి. అక్కడ అందరం కలసి చెట్టపట్టాలేసుకుని హాయిగా తిరగాలి, బిగ్గరగా నవ్వుకోవాలి.
3:
మనస్పూర్తిగా ఏడవాలి. అదో పరమ శాంతిమయ లోకం కావాలి. ఈ విశ్వంలో చెలరేగుతున్న మనో మాలిన్యపు రాశులను బూడిద చేయగలగాలి. ఆ పరమ శాంతి ధామమే ఈ కవిత్వం.
II మొదటి వచన సంపుటి "ఆరాధన" సమర్పణ భావన
బి.వి.వి.ప్రసాద్ తన 23 ఏళ్ళ వయస్సులో మొదటి కవితా సంపుటి 'ఆరాధన' వేసారు. దీని నిండా సమర్పణ భావన వుంటుంది. దీనికి ముందుమాటలో కవి తనను తాను వెతుక్కునే ప్రయత్నమే ఇందులో వుంది. అంతేకాక ఇతరులలో తను గుర్తించడాన్ని ప్రేమ అంటారనుకుంటాను. ప్రేమను తెలియజేయడంలో 'ఆరాధన' ఒక పద్ధతి అంటారు.
మానవ జీవితం అనేక జీవితాలుగా కాక ఒకే జీవితంగా ఉన్నదంతా ఒకే సారంగా భావించి కవిత్వం చేయడం వీరి దృక్పథంగా కనిపిస్తుంది.
నిన్ను సేవించుదామని / ఎన్నో సుందర పుష్పాలు ఏరి తెచ్చి తుదకు / వాటి సౌందర్యం పై మోహంతో / నిన్నే విస్మరించాను అంటారు.
(ఆరాధన వచన కవిత్వం- 1989)
మనం చేసేదిదే. ఈ లోకంలోకి ఎందుకొచ్చామో మరచిపోయి ఇతర వ్యామోహాల్లో పడిపోతాము. అంటే మన అసలుని మరిచి పోవడం, అదే మాయ. అలాంటి మాయలో పడవద్దని కవిపిలుపు. సాధారణంగా మనందరికీ మృత్యు భయం వుంటుంది. ఏ రమణ భగవానో, ఓషో లాంటి తాత్వికులను మినహాయిస్తే. ఈ కవి తన కవిత్వంలో చాలా విరివిగా మృత్యువును గురించిన కవితలు అల్లారు. మృత్యువనేది జీవితంలో తప్పని సరి భాగం అయినప్పుడు దాన్ని సానుకూలంగా ఎలా తీసుకోవాలో మరింత ఎరుకతో జీవితాన్ని ఎంత చక్కగా పండించుకోవచ్చునో తెలుసుకోవడమే కాక సాంత్వన పొందుతాము.
మృత్యుస్పృహ / మన మనస్సులో / ప్రధానమైన అంతర్వాహిని అయ్యే కొలదీ// మన జీవితాలలో అనుబంధాలలో/ లాలిత్యమూ, ప్రేమా ఉన్నతంగా దర్శనమిస్తాయి//
(ఆరాధన- 1989- మృత్యుస్పృహ)
III హైకూ కవిత్వం తాత్విక సాంద్రత
తెలుగు హైకూకి వెలుగులద్దిన ప్రసిద్ధ హైకూ కవిగా బి.వి.వి. ప్రసాద్ సుపరిచితులు. తెలుగు హైకూని పరిపుష్టం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. హైకూ అనేది ఒక పదచిత్రం. కవి ఇస్మాయిల్ గారన్నట్లు చంద్రుణ్ణి చూపించే వేలు, చంద్రుణ్ణి చూపించాక వేలు అవసరం లేనట్లు హైకూను చదివాక అనుభూతి మాత్రమే మిగలాలి. క్లుప్తత, సాంద్రత, గాఢమైన తాత్విక చింతన, సౌందర్యాత్మకత ప్రకృతిలో మమేక మయ్యే స్వభావముండాలి. తేలిక దనం వుండాలి. ఇవన్నీ స్వభావరీత్యా బి.వి.వి. ప్రసాద్ లో సహజంగా వుండడం వలన హైకూ పేరు చెబితే బి.వి.వి. హైకూలు గుర్తుకొచ్చేట్లుగా హైకూలు రాసారు. బివివి మూడు హైకూ సంపుటాలు తీసుకొచ్చారు.
1.దృశ్యాదృశ్యం,(1995), 2. హైకూ (1997). 3. పూలు రాలాయి (1999) వీరు 'బషో' హైకూలను స్వేచ్ఛానువాదం కూడా చేసారు. రెండు ప్రసిద్ధ హైకూ వ్యాసాలు 1. ప్రకృతీ, జీవితం హైకూల మయమే, 2. హైకూ అంటే జీవన స్పృహ రచించారు. ఇవి సాహితీ లోకంలో చిరస్థాయిగా నిలిచిపోయే రచనలు.
4:
వర్షం / క్షణం పూచే నీటి పూలతో / ఊరు నిండిపోయింది// ఈ హైకూని వినగానే ఓ గొప్ప సౌందర్యానుభూతికి గురవుతాము. వర్షపు చినుకులను క్షణం పూచే నీటి పూలు అనడం ఎంత బాగుంది. పాఠకుడు ఒక అవ్యాజమైన అనుభూతికి గురవుతాడు. సౌందర్యం క్షణికమనే అవగాహన నుండి పుట్టిన ఒక వైరాగ్య వీచిక ఈ హైకూ ఈ అనుభూతిని 'అవారే' అంటారు.
మరో హైకూ :
పధికుని పలకరింపుకై / చూసి, నవ్వి, చిన్న బోయిన /వీధి దీపం//
(దృశ్యాదృశ్యం,(1995).
హైకూ పరిభాషలో దీనిని "సతోరి" అంటారు. మనం ప్రకృతిలోని చరాచరములనుండిఎంతో మేలు పొందుతాము. కానీ కనీసం ఆ స్పృహ కూడా మనకుండదు. అంత సున్నిత విషయాలపట్ల కృతజ్ఞతను మేల్కొల్పడం ఇక్కడ హైకూ కవి ఉద్ధేశ్యం. ఇంత సున్నిత విషయాలపట్ల స్పృహ ఉంటే మనం జీవించే తీరు ఇంకా ఉన్నతంగా వుంటుంది కదా!
రాత్రి తారలు / నదినిండా కురిసాయేమో / తీరమంతా ఇనుకమయం//
దృశ్యాదృశ్యం,(1995)
నదీ తీరమంతా ఇసుక మేటలతో నిండి వుంటుంది. మనం అంతవరకే గమనిస్తాం. కానీ హైకూ కవి ఆ ఇసుక రేణువులు సూర్యకాంతికి మెరవడం ఎలా ఉందంటున్నాడంటే అది చిన్ని చిన్ని తారలు చిన్ని రేణువులుగా కుప్ప బోసినట్లుందట. అది రాత్రంతా తారలు కురవడం వలన అలా అయిందట ఏమీ సౌందర్యం. ఇది ఒక అమోఘమైన అనుభూతి చిత్రం కదా!
IV "నేనే ఈ క్షణం" అనుభూతి సౌందర్యం
వీరు 2006లో 'నేనే ఈ క్షణం' అనే కవితా సంపుటి వేసారు. ప్రాకృతిక సౌందర్యాన్ని, జీవనతత్వాన్ని పెనవేసుకొని అద్భుత భావచిత్రాలుగా ఆవిష్కరించబడ్డ కవితా సుగంధం "నేనే ఈ క్షణం"
ఎండకురిస్తే / చెట్టునిండా / ఆకు పచ్చని చినుకులు//
చీకటి కురిస్తే / చెట్టు నిండా / నల్లని మబ్బులు //
మబ్బుల్లోని చినుకుల్ని కురుస్తూంది చెట్టు //
ఈ కవితలో కవిగీసిన పదచిత్రాలు "మెటానమీ" టెక్నిక్ లో వుండడం వల్ల పాఠకుణ్ణి చురుకుగా ఆలోచింపజేసి, సమాధాన పడ్డాక చక్కటి ఆనందానుభూతిని కలిగిస్తాయి.
V "ఆకాశం" ఓ మార్మిక పరిమళం
ఒక దశాబ్ద కాలంపాటు కవిత్వానికి దూరంగా వున్న ప్రసాద్ గారు ఆ సమయంలో చేసిన అంతర్ముఖ సాధన, జీవనానుభవాలను దగ్గరగా దర్శించడం అదే కవిత్వంగా ఒక వినూత్న ధోరణితో మూడు, నాలుగు నెలల వ్యవధిలో 100 ప్రసిద్ధ కవితలుగా 'ఆకాశం' వెలువడడం గమనార్హం. హైకూ కవిగా సుపరిచితులైన బివివిని 'ఆకాశం' కవితా సంపుటి వచనకవిగా సమున్నత సాహితీ శిఖరంపై కూర్చోబెట్టింది.
"ఆకాశం" వ్రాసేటప్పుడు వారు పెట్టుకున్న నియమాలు తూచా తప్పకుండా పాటించడం మనం చూస్తాము.
5:
ఏ భావం పలికినా మార్దవంగా, తాత్వికానుభూతిని, సౌందర్యాన్ని రంగరించి 'దయ' అంతర్లీనంగా వుండేట్టు కవిత్వీకరించడం మనం గమనిస్తాము.
పుట్టగానే పిల్లలు నవ్వరెందుకని వాళ్ళు ఏ వెలుతురులో ఈది వచ్చారు/ ఏ ఆనందాలు దాటి వచ్చారు/ ఏ హద్దుల్లేని దేశాలు ఎగిరి వచ్చారు/ పుట్టగానే పిల్లలు నవ్వలేరెందుకని ఏ పవిత్ర సీమలు విడిచి వచ్చారు/ ఏ దయాపూర్ణ హస్తాలు విడిచి పెట్టారు / ఏ కపటం లేని లోకాలు పోగొట్టుకున్నారు//
పుట్టగానే పిల్లలు ఎప్పుడూ ఏడుస్తారు ఎందుకని / దుఃఖమయ ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తారెందుకని// (పుట్టగానే పిల్లలు ఆకాశం - 2011)
పిల్లల్ని గురించిన మరోకవిత:-
పిల్లల్ని ప్రేమించడం నేర్చుకుంటే చాలు/ పిల్లల్ని ప్రేమిస్తే చాలు వారికోసం ఒక మంచి ప్రపంచాన్ని వారే సృష్టించుకుంటారు (ఆకాశం 2011)
ఈ వాక్యం మనం మరవకుండా వుండగలిగితే చాలు. నేటి సమాజంలో పిల్లల్ని ప్రభావితం చేయడంలో పెద్దలు విఫల యత్నం చేస్తున్నారు. దీని వలన పిల్లలు ఒత్తిడికి గురయి వారి సహజత్వాన్ని, సృజనని కోల్పోతున్నారు. పిల్లల్ని వారి మానాన్న వారిని ఎదగనిస్తే చాలు అద్భుతాలు సృష్టిస్తారు. వారి స్వచ్ఛమైన లేత మనసుల్ని కలుషితం చేయకుండా వుండగలిగితే చాలు. సినారె. అంటారు. "పాపాలను కడిగి వేస్తుందిలే పాల నవ్వుల నురుగు" అని
VI "నీలో కొన్ని సార్లు" లోతైన మౌనం పలికే వాక్యాలు
బి.వి.వి.ప్రసాద్ కవి "నీలో కొన్ని సార్లు" అనే కవిత్వ సంపుటిని 2015 లో వేసారు. ఇది ''ఇతను' అనే కవిత తో ప్రారంభమవుతుంది. మానుష ప్రపంచం మరీ అంత భయావహమైంది కాదని/ నీ కలలోని భూతమే నిన్ను మ్రింగ బోయినట్లు / నువ్వు విలువిస్తే బ్రతికే సముహం నిన్ను కమ్ముకుంటుందని/ సమూహాన్ని చెరిపేస్తూ నిన్ను గుర్తు చేయాలనే ఇతను మాట్లాడుతున్నాడు... ఎప్పుడూ పాతదైన నిద్రలోంచి, ఎప్పటికీ కొత్తదైన మెలకువలోకి/ మెలకువలాంటి పూలలోకి, గాలిలోకి, మౌనంలోకి, కాంతిలోకి / జీవితం పంపిన దూతలా పిలుస్తున్నాడు.
ఈ కవితలో ఎప్పటికి కొత్తదైన మెలకువలోకి అనే మాట పాఠకుడు చాలా పట్టుకోవాల్సిన మాట. ఆదమరిచిన నిద్ర అనడంలో భౌతిక సుఖాల్లో పడి మనతో పాటున్న తోటి చరాచరాలకి ఇవ్వాల్సినంత విలువ ఇవ్వడం మరచిపోయిన మనకి మన మూలాల్ని పరిచయం చేస్తూ అక్కడి లోతైన దయాప్రేమలతో నిండిన సూక్ష్మ ప్రపంచాన్ని మనలో జాగృతం చేస్తున్నాడీ కవి. దీనిని ఇంటెన్షనాలిటీ/ ఎరుక అని అంటాం.
మరో కవిత:-
తోటి వారిని గాజులానో, పూలలానో / కదలని నీటిపై నిదురించే చంద్రుని బింబంలానో చూడలేమా/ బహుశా ఏ గ్రహాంతరాలలో ఏకాకులమై ఎదురైతే / అద్దంలో ప్రతి బింబంలా మృదువుగా చూసుకుంటాం ఒకరినొకరం ... అని సాగే ఈ కవితలో కవి ఇతరులతో మనం మెలగాల్సిన తీరు పట్ల ఒక అపురూపమయిన కొత్త సంస్కారాన్ని మనకందిస్తున్నారు.
:6:
VII "ఊరికే జీవితమై" - అన్నంతగా
బి.వి.వి. ప్రసాద్ కవితా సంపుటి "ఊరికే జీవితమై" (2023) నుండి
నిద్రలో ఎక్కడుంటావు నువ్వు/ మెలకువలో నీ దేహాన్ని మోసీ మోసీ అలసి పోయాక / దానిని ఎక్కడకు విసిరేసి, ఎటు వెళ్ళిపోతావు// సృష్టికి పూర్వం వున్న ఏ శీతల నిశ్శబ్ద ప్రశాంతతలోకి నిదురించేవేళల రహస్యంగా ప్రవేశిస్తావు/
అని సాగే ఈ కవితలో మనము నిద్రపోయేటప్పుడు ఏ లోపలి సీమలోంచి విహరిస్తామో అక్కడి మెలకువడి సంబంధించిన అనుభూతిని కవిత్వంగా పలకాల్సివుంటుంది. ఇది ఒక దార్శనికునికో, యోగికో, తాత్వికునికో సాధ్యమయ్యేపని.
ఈ కవి కవిత్వం పరిశీలించాక "అనుభూతి వాదం" భూమికగా కనబడుతుంది. నువు చెప్పేదేదయినా నీ అనుభవంలోంచి పలకాలి అన్నది అనుభూతి వాదం ప్రాధమిక సూత్రం.
VIII "సృష్టి" ఒట్టి ప్రేమసారం ఈ కవిత్వం
ఇటీవల వెలువరించబడిన బి.వి.వి. ప్రసాద్ గారి కొత్త పుస్తకం "సృష్టి" నుండి "ప్రేమ ఉంటే" అనే కవితలో
ప్రేమ ఉంటే పెద్దగా చెప్పడానికి ఏమీ ఉండదు/మాటలన్నీ మంచు ముక్కల్లా ప్రేమలో కరిగి పోతాయి/పూలరంగులు వెలుగుతాయి./ నక్షత్రాలు అనంతాన్ని విరబూస్తాయి./ స్పర్శ జీవితాన్ని సారవంతం చేస్తుంది..
కవి ఇక్కడ ఒక మాట అంటారు. "జీవుల చూపుల సారం ప్రేమకోసం ఎదురుచూపు/భయాలు, కోరికలు ప్రేమ దక్కక చేసే వెర్రి పనులు". ఇది మానవాళికి అందాల్సిన అద్భుతమైన "మోరల్ స్టేట్మెంట్" నిజమే కదా లోకంలోని సమస్త సమస్యలకు దుఃఖాలకు సరిపడా ప్రేమలేక పోవడమే కారణం. అనంతమైన ప్రేమలోకి ఒక్కసారి మేల్కొనగలిగితే బాధలన్నిటికి ఉపశమనం దొరికినట్టే.
శుద్ధవేదనా జగత్తునుండి వెలువడ్డ నిర్మల స్వచ్ఛగంగాజలం వీరి వాక్యం.
మరో పద చిత్రాన్ని చూద్దాం.
నల్లని కాన్వాసు పై / మరింత నల్లని చిత్రాలయి/ ఇళ్ళూ చెట్లూ// (దృశ్యా దృశ్యం - 1995)
ఇదొక రంగుల పద చిత్రం నల్లని రంగుపైన మరింత నల్లని రంగుని పులమడం ఎంతో
రమ్యమైన శిల్పం ఆవిష్కరించబడింది.
డా||అద్దేపల్లి వారన్నట్లు ఆలోచనలోనే వినూత్నత వుండడం వీరి శైలికి బలం. (నీలో కొన్ని సార్లు 144 పేజీ ఉత్తరాల నుండి)
వీరి కవిత్వం పైపై ఉద్వేగల అణచివేతకాదు. లోలోపల జరిగే మధనం ఒక విచికిత్స. నీ మూలాలతో నీవు శృతి చేసుకుంటేగాని ఈ కవిత్వం నీకు కనెక్ట్ అవ్వదు. పాశ్చాత్య విమర్శకుడు 'కెబుల్' చెప్పినట్లు "వెంట్ ఫర్ ఓవర్ చార్జుడ్ ఫీలింగ్/ ఉప్పొంగు అనుభూతుల అభివ్యక్తి" వీరి కవిత్వం.
:7:
వీరి ఉపమానాలు, రూపకాలు అప్పుడే పుట్టిన పిట్ట కూనల్లా పాఠకుణ్ణి అబ్బుర పరుస్తాయి.
ఉదా|| భూమి వంటి అమ్మమ్మ, ఆకు పచ్చని చెట్లు బడి పిల్లల్లా, కాలంనది, చినుకు శిశువు నీడల కాలువలు, వెల్తురు పుప్పొడి, పడవ చంద్రుడు, తారల ఇసుకమైదానం మొదలైనవి.
ఒక విధంగా ఈ కవిత్వం ఒక ఫిల్టర్ వంటిది. మనం చదివే ప్రతి వాక్యం మనల్ని ప్యూరిఫై చేయడమే తప్ప కొత్తగా మనకేదో నేర్పాలనే ప్రయత్నం చేయదు. మన మానసిక స్థౌల్యతని కరిగించి తేలిక పరచి స్వస్థత కలిగించి మన అసలుని మనకు అప్పగించే ప్రయత్నం చేస్తుంది.
వీరి కవిత్వం పై సమకాలీన ప్రముఖ కవుల అభిప్రాయాలు
అందుకే సమకాలీన కవులంతా వీరి కవిత్వాన్ని అత్యంతగా ఇష్టపడతారు దీనికి కారణం వారు కూడా ఈ కవిత్వంలో ఉపశమనం పొందడమే
ఆకాశం కవితాసంపుటిని గురించి డా॥ రెంటాల వారు ఇది 'ప్రొఫెట్' తరువాత పుస్తకం. ఇది ఆంగ్లంలోకి అనువాదమైతే భారతీయ ఖలీల్ జీబ్రాన్ ఇలా వుంటాడని అందరికీ తెలుస్తుంది. అని అంటారు.
ఆకెళ్ళ రవిప్రకాష్ గారు తన వ్యాసంలో బి.వి.వి.ప్రసాద్ గారిని యువచలం అన్నారు. (ఆంధ్రజ్యోతి దినపత్రిక, వివిధ 18/05/2020)
నాకనిపిస్తారు వీరు శ్రమణకుల ఆర్తిని తీర్చిన గౌతమ మునిలా
కళ్ళలో దయా స్పర్శలో నిర్మలత్వం
మాటలో నిజాయితీ, మనిషిలా స్పందించడం మరచిపోకుండా ఉంటే చాలు
హాయిగా నవ్వడమూ, హాయిగా ఏడవటమూ పోగొట్టుకోకుండా ఉంటే చాలు
(ఆకాశం - 2011 చాలు)
ముగింపు :-
బి.వి.వి. ప్రసాద్ కవిత్వంలో శాంతి, కరుణ, ప్రేమ, క్షమ, వంటి మౌలిక భావనలు ఎంతో లోతుగా అనుభూతి ప్రధానంగా అద్వైతాంశతో దర్శనమిస్తాయి.
మానసిక కాలుష్యంతో, వైషమ్యాలతో కొట్టు మిట్టాడుతున్న మానవ లోకం ఉపశమించే పరమశాంతి ధామమీకవిత్వం.
నేటి ప్రథాన స్రవంతికన్నా భిన్నమైన ఆధునిక ధోరణితో వెలువడుతున్న ఈ కవిత్వం తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
8:
ఆధార గ్రంథాలు :
1. ఆరాధన, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, రవి ప్రింటర్స్, తణుకు, 1989.
2. బి.వి.వి. ప్రసాద్, హైకూలు (దృశ్యాదృశ్యం 1995, హైకూ 1997, పూలు రాలాయి 1999) బి.వి.వి. ప్రసాద్, శ్రీ శ్రీ ప్రింటర్స్ విజయవాడ.
3. నేనే ఈ క్షణం, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, శ్రీ రత్న ప్రింటర్స్, రాజమండ్రి. 2006
4. ఆకాశం, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, పాలపిట్ట బుక్స్, హైదరాబాద్, 2011.
5. నీలో కొన్నిసార్లు, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, వాసిరెడ్డి పబ్లికేషన్స్, హైదరాబాద్, 2015.
6. ఊరికే జీవితమై, బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, ప్రేమలేఖ ప్రచురుణలు, 2023.
7. సృష్టి బి.వి.వి. ప్రసాద్, వచన కవిత్వం, స్వేచ్ఛా ప్రచురణ, తణుకు. 2026.
8. ఒలుపు సాహిత్య వ్యాసాలు, డా॥ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, చినుకు పబ్లికేషన్స్, విజయవాడ, 2017.
9. ఆలోచన, సాహిత్య వ్యాసాలు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ M.A.I Books, సికింద్రాబాద్, 2014.
10. ఆధునిక ఆంధ్రకవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు. డా॥ సి.నా.రె. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
మల్లవెల్లి శ్రీరామ నాగ వర ప్రసాద్,
పి.జి.టి. (తెలుగు)
ప్రభుత్వ పోస్ట్ బేసిక్ పాఠశాల ప్లస్, పెంటపాడు
పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
(ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్టణం, తెలుగు శాఖ, పార్ట్ టైం పి. హెచ్. డి. రీసెర్చి స్కాలర్)
9441350260, 7013543732, sriram9441350260@gmail.com
ప్రచురణ :
భావ వీణ - ప్రత్యేక సంచిక 28.2.26
ప్రభుత్వ డిగ్రీ కాలేజి, రాజోలు, డా॥ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ తెలుగు విభాగం
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి