ఈ కవిత్వం..
ఈ కవిత్వం సాంస్కృతిక వినోదం కోసం కాదు. దుఃఖితుల తరపున ఎవరిపైననో నెపం వేయటానికీ కాదు. జీవితం దుఃఖమయమని తమకి తాముగా గ్రహించిన వారికోసం. దుఃఖవిముక్తి కోసం తమలో తాము పెనుగులాడుతున్న వారి కోసం.
జీవిత పరమావధి దుఃఖమా, ఆనందమా అనే విచికిత్సకు లోనైనవారితో జరిపే సంభాషణ ఈ కవిత్వం. అందం, ఆనందం వెలుపలి వస్తువులా, లోపలి సత్యమా అనే చూపుతో వెదికేవారికోసం ఈ కవిత్వం.
నిజానికి, ఇది, కవిత్వమో, కాదో తెలియదు. ఒక భయ, దుఃఖ కంపిత హృదయపు వెదుకులాట ఈ మాటలు. ఒకడు తన విముక్తి కోసం, అవగాహన కోసం, తాను వెదికే తన లోపలికాంతి కోసం తడుముకొంటూ, తనకి తాను బోధించుకొంటున్నవి. తనని తాను ఓదార్చుకొనే యత్నం ఇవి.
జాతులుగా వేరు విలువలకు చెందినా, హృదయంగా మనుషులు ఒకటనే నమ్మకంతో, తన పెనుగులాటలే ప్రతి హృదయంలో ఉంటాయని భావించి, సాటి మానవులతో పంచుకున్న కన్నీళ్ళు, ఓదార్పులు, సౌందర్యాలు, స్వప్నాలు, తెలియరాని గమ్యాలకి అన్వేషణలు.
ముప్పై, నలభై ఏళ్ళుగా ఏం రాసుకుంటున్నాడో అదే, భిన్నమైన ఛాయల్లో, భిన్నమైన కాంతుల్లో, గాఢతలో, లోతుల్లో మళ్ళీ రాస్తున్నాడు.
పుస్తకం ఎక్కడో ఒకచోట తెరవండి. కొన్ని పంక్తులు చదవండి. ఆగి, లోనికి చూసుకొన్నపుడు, వాటి సారంలో మీకు మీరు కనిపిస్తే, లేదా, అవి మీకు ఊరట కలిగించి వుంటే, ఇవి మీ కోసం రాసినవి. కనబడలేదా, ఇవి మీ కోసం కాకపోవచ్చును, లేదా చదివే సమయం వేరే ఉండవచ్చును.
అందరికీ శుభం కోరుతూ..
బివివి ప్రసాద్
7.11.2025
తణుకు
సృష్టి : బివివి ప్రసాద్ కవిత్వం
144 కవితలు, 250 పేజీలు, 250 రూపాయలు
ప్రతులకు : అనేక బుక్స్, విజయవాడ ఫోన్ : 92472 53884 (అరసవిల్లి కృష్ణ)

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి