02 నవంబర్ 2025

కవిత : ఏకాంతంలో..

స్నేహితులతో గడిపిన తర్వాత
నీదైన ఏకాంతాన్ని చేరుకుంటావు,
అప్పటి వరకూ ఎదురుచూస్తున్న
దుఃఖశాంతి మృదువుగా సమీపిస్తుంది 

ఒక్కడిగా ఉన్నపుడు నువ్వేమీ కావు,
మంచివీ, చెడ్డవీ, బలశాలివీ, దుర్బలుడివీ 
ఏమీ కావు, కనీసం ఎవరివో తెలీదు

రెండవ మనిషి రాగానే తయారవుతావు 
యుద్ధానికి సిద్ధపడే సైనికుడిలా,
పులిని చూసిన జింకలానో, జింకని చూసిన పులిలానో 
నిన్ను నువు క్షణంలో తీర్చిదిద్దుకుంటావు

చాలాకాలం గడిపావు ఈ నేలపై
ఈ నక్షత్రాల క్రింద, సూర్యకాంతి క్రింద,
రెండవది దుఃఖమని ఇంకా తెలియరాలేదు

ఇతరులతో గడిపాక, నిన్ను పలకరిస్తావు,
సముద్రగర్భంలోని, నీలిగగనాని కావలి 
ప్రశాంత గంభీరమైన నీ సన్నిధికి మేలుకుంటావు

ఇప్పుడు చూడు సుమా,
ఇంత ప్రపంచాన్ని పిండితే
నీకు నువ్వు మాత్రమే సారాంశమై తగులుతావా
ఇతరమేమైనా మిగులుతుందా

ప్రపంచంలో గడిపాక,
ఈత చాలించిన దేహంలా
పరమ ఏకాంతంలో మునిగినపుడు

ఏది సత్యం, ఏ దసత్యం
ఏది నువ్వు, ఏది నేను
ఏది జీవిత మేది మృత్యువు

బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి