ప్రమూ పరిచయాలు
|ప్రేమతాత్విక జీవన సత్యం బివివి కవిత్వం|
“రంగూ, రుచీ, స్పర్శా, వాసనా లేని జీవితాన్ని తలచావా గుర్తించావా తమకంగా కౌగిలించుకున్నావా
ఊరకనే జీవితమైపోయావా ఎప్పుడైనా” (ఊరికే జీవితమై..)
ఎగ్జిస్టెన్షియలిజం అంటే ఇప్పుడు తెలుగులో వాడుకోలో ఉన్న అర్థం వేరు. ఇక్కడ దానికి కుల మత ప్రాంత లింగ భాషాపరమైన అస్తిత్వ వాదంగా అది స్థిరపడింది. వాస్తవానికి ప్రపంచ తత్వవేత్తలు నిహిలిజం, ఎగ్జిస్టెన్షియలిజం, అబ్సర్డిజమ్- ఇలాంటి ఇజాలకు చెప్పిన అర్థం వేరు. జీవితానికి అర్థం ఏమిటి అనే విషయాన్ని పట్టుకొని, దేవుడు దాకా వెళ్లి, తిరిగి జీవితం దాకా వచ్చి, మానవుడి ఈ అస్తిత్వానికి దేవుడికి సంబంధం లేదని నిర్ణయాలు చేసుకొని, ఇది అర్థం లేని జీవితం అని నిర్ధారించుకొని, అది నిజమే కానీ నిరాశ వద్దని, అర్థం లేని జీవితాన్ని అర్థవంతం చేసుకోవడం నీ చేతుల్లోనే ఉందని బుద్ధుడు మొదలుకొని నీషే, సార్త్రే దాకా చాలామంది తత్వవేత్తలు, కాఫ్కా, కామూ, దోస్తయేవ్ స్కీ లాంటి రచయితలు ఎగ్జిష్టియన్షియలిజానికి అసలైన నిర్వచనాన్ని చివరికి నిశ్చయించారు. దేవుడి మీద నమ్మకం ఉన్నవారు, కాస్త ఊగిసలాటలో ఉన్నవారు కూడా జీవితాన్ని అర్థవంతంగా జీవించాలనే విషయంలో ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. జీవితం పట్ల అపారమైన ప్రేమ, నమ్మకంతోనూ, అనేకానేక అంతుచిక్కని విషయాల పట్ల విస్మయంతోనూ ఉంటూనే జీవితాన్ని సహస్ర బాహువులతో ఆలింగనం చేసుకొని అపార లౌకిక అనుభవంతో ఈ జన్మను ధన్యం చేసుకోవాలన్న సందేశాన్ని మనకు ఇచ్చినదే అసలైన ఎగ్జిస్టెన్షియలిజం. దీనికి తెలుగులో సంపూర్ణంగా ఒక కవిని ఉదాహరించాలంటే బివివి ప్రసాద్ నే చూపించాలి.
చాలా రోజులుగా ఇతనితో నాకు స్నేహం ఉన్నా, ఇతని కవిత్వాన్ని స్వయంగా వింటూ లేదా చదువుతూ ఉన్నా, ప్రసాద్ కవిత్వంలోని మూల సూత్రం అంతుచిక్కకుండా కొంతకాలం నాతో ఆటలాడుతుంది. ఆ సూత్రం కొస దొరికిన తరువాత, దాన్ని లాగుతున్న కొద్దీ మనం పైన చెప్పుకున్న జీవితపు అసలైన అస్తిత్వవాదంలోని సౌందర్య రహస్యం ఇంకా ఇంకా బయటపడి నన్ను సిసలైన రసానుభూతికి లోను చేసింది. ఏ కవిత పట్టుకున్నా జీవితంతో మొదలై జీవితంతో నడుస్తూ జీవితం చుట్టూ తిప్పుతూ జీవనలాలస లోని రహస్య మూలాలను తడుముతూ జీవితం అంచులు దాకా తీసుకువెళ్లి అక్కడ నిలబెడుతుంది. ఇది కదా అస్తిత్వవాదం అంటే అనుకున్నాను.
“ ఒక్కరోజు గడిపి వెళ్లిపోతే చాలదా ఇక్కడ అనుకుంటావు చాలాసార్లు
మరల మరల ముఖాలు మార్చుకొని ఎదురవుతున్న అవే అనుభవాలను తలపోస్తూ
విశాలత్వమేదో నిన్ను పిలుస్తున్నట్టుంటుంది
వెలిసిపోయిన దృశ్యాల్లోంచీ, శబ్దాల్లోంచీ, దుమ్ము పట్టిన బంధాల్లోంచీ బయటకు రమ్మని”(ఆ దిగులు-ఊరికే జీవితమై)
ఇటీవల ప్రసాద్ ఫేస్బుక్లో వరుసగా పెడుతున్న కవితల పరంపరను చూసిన తర్వాత ఈ మధ్యనే ఇతను వెలువరించిన “ఊరికే జీవితమై..” అనే కవితా సంపుటిని మరోసారి చేతుల్లోకి తీసుకున్నాను. అది భౌతికంగా చూడడానికి ఒక కాగితాల కట్టే అయినా అది ఒక నదిలా మనల్ని తనలోకి లాక్కొని ఒక మహాసముద్రంలోకి తీసుకువెళ్లి ఆ అలల మీదుగా దిగంతాల వైపు నడిపించి ఇదే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడం అని మనకు చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఏ కవితను తడిమినా ఒక పసిపాపను ఎత్తుకున్నట్టో.. ఒక పూల మొక్కను పట్టుకున్నట్టో.. ఒక మబ్బు తునకను నెత్తి మీద పెట్టుకున్నట్టో.. జీవితం జీవితం.. కేవలం జీవితం తప్ప జీవితానికి మరొక అర్థం లేదనే పరమార్ధాన్ని తెలుసుకొని సంబరంగా ఎగిరినట్టు అనిపిస్తుంది.
“నీ చుట్టూ పసిపిల్లల్లా నిలిచిన
దృశ్యాల్ని, శబ్దాల్ని, స్పర్శల్ని
ఊరికే ఆగి, ఊరికే చూడు
కాసేపు జీవితాన్ని,
నువ్వు జీవించటాన్ని” (ఆగి చూడు-ఊరికే జీవితమై)
ఈ కవిత్వం, పైపైన చూస్తే ఇది కేవలం వ్యక్తిగతమైనదిగా, వ్యక్తుల విడివిడి జీవితాల ఆనందాలకు సంబంధించినదిగా కనిపిస్తుంది. దాంతో లోకంలోని ఘర్షణలు దోపిడీలు పోరాటాలు వగైరా వగైరాలతో సంబంధం లేని కేవలం వ్యక్తినిష్టమైన కవిత్వంగా దీన్ని కొట్టి పారేసే అవకాశం ఉంది. అందమైన జీవితం వెనక కాలమంతా సాగిన అనంత మానవ సంగ్రామాల చరిత్ర ఉందని, ఈ కవికి దానితో సంబంధం లేదనే తీర్మానాలు కూడా చేయవచ్చు. కానీ తర్కాన్ని పక్కనపెట్టి వాస్తవాన్ని చూస్తే, ఎవరి జీవితం వారిదే. జీవితం పట్ల ఎవరి అనుభవాలు వారివే. అనేకానేక దారుల్లో చీలిన మనుషులు తమవైన అనుభవాలతో జీవితాన్ని పండించుకోవాలనే పరమార్థం అవగతం చేసుకుంటే, బివివి కవితల్లోని అంతరార్థం మనకు బోధపడుతుంది. జీవితానికి ఏ అర్థమూ లేదు, దీన్ని ఇలా జీవించాల్సిందే అనే నిరాశవాదాన్ని ముందుకు తెచ్చిన షొపన్ హాయర్ లాంటి తత్వవేత్తలను చూశాం. వ్యక్తి నైతిక జీవనం, సామూహిక సమున్నత జీవన చైతన్యానికి దారులు తీయాలని దారి చూపిన బౌద్ధ ధర్మసారం చూశాం. పూర్వం ప్రసేనుడనే రాజు తన భార్య మల్లికను, నీకంటే అధికంగా నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతాడు. అప్పుడు ఆమె మహారాజా నాకంటే అధికంగా నేను ఎవరినీ ప్రేమించలేదు అని చెప్తుంది. దానికి ప్రసేనుడు నా విషయంలో కూడా ఇదే సత్యం అంటాడు. అంతేకాదు అదే విషయాన్ని బుద్ధుడుతో ప్రస్తావిస్తాడు. అప్పుడు బుద్ధుడు, ‘నిజమే, మనిషి తనకు తానే ప్రీతిపాత్రుడు. కావున తనపై తనకున్న ప్రేమనెరిగీ, మరొకరికి ఎవరికీ హాని తలపెట్టరాదు’ అంటాడు(బుద్ధ ధర్మసారం- పి. లక్ష్మీ నరసు). వ్యక్తి నైతికత, ఆచరణలో పరోపకారంగా రూపొందడం బౌద్ధంలోని అతి కీలకమైన అంశం. మన భారతీయ తాత్విక మూలాలున్న ఈ భౌద్ధ ధర్మసారంలోని ఏదో వెలుగు బివివి ప్రసాద్ కవిత్వంలో తొణికిసలాడుతోంది. తాను చూస్తున్న జీవన సౌందర్యాన్ని, జీవితంలో ఆ సౌందర్యం లేకున్నా దాన్ని మనం సృష్టించుకోవాలి అన్న జీవన సత్యాన్ని అందరితో పంచుకోవాలి అన్న అవ్యాజమైన ప్రేమతో ఇతను తన కవిత్వ ఆవరణను విస్తరించుకుంటూ వస్తున్నాడేమో. తర్కాలు విడిచి ఈయన కవిత్వంలో ‘ఉరికే జీవితమై..’ ఊగితే ఒక జీవితానికి సరిపడా ఊరట మనకు దొరుకుతుంది.
“జీవితం ఉందనిపిస్తే
చేతులు చాపి దగ్గరకు తీసుకుని అనుభవించు,
జీవితం ఏమిటనిపిస్తే
దాని భుజంపై చేయి వేసి నిశ్శబ్దంగా కూర్చో, జీవితం లేదనిపిస్తే ఊరికే ఖాళీగా ఉండు
చూడు పక్షులు ఎగురుతున్నాయి సూర్యుడు వాలుతున్నాడు
తూర్పు ఆకాశంలో కాసేపటికి
చంద్రోదయం కాబోతోంది”(సాధన-ఊరికే జీవితం)
విషయంలో వైవిధ్యం లేకపోతే కవిత్వంలో వైవిధ్యం ఉండదు అనే వాదన కూడా ఒకటి ముందుకు వస్తుంది. జీవితం ఒకటే అయినా జీవితంలోని వేలవేల షేడ్స్ ని వివిధ కవితల్లో ప్రతిఫలింప చేయడం వల్ల ఈ కవిత్వానికి వైవిధ్య లోపం లేదని కచ్చితంగా చెప్పవచ్చు. ఇదంతా పక్కన పెట్టి, ఎంత తత్వమైనా.. వ్యక్తిగతమో సామాజికమో అదేమైనా.. అందులో కవిత్వం మనల్ని తనలోకి లాక్కుంటుందా లేదా అనేది అంతిమంగా మనం తేల్చాల్సిన విషయం. కొన్నిచోట్ల ఇతడు ఏవేవో మీమాంసలలో కొట్టుకుపోతున్నట్టు కనిపిస్తుంది. కొన్ని వైరుధ్యాలుంటాయి. “మనుషులతో విలువలతో కాదు
ఊరికే కలిసి ఉండాలి జీవించటంతో” అంటాడు ఒకచోట. ఇదేమిటి అని అతన్ని కొంచెం ప్రశ్నార్థకంగా మనం చూస్తామో లేదో, అంతలోనే ఇలా అంటాడు-
“ చెట్లు జీవిస్తున్నాయి నీతో కలిసి
నీరు జీవిస్తోంది, గాలి జీవిస్తోంది, ఆకాశం జీవిస్తోంది, కాలం జీవిస్తోంది
నీవు కలిసిన వారిలోంచి,
విడివడిన వారిలోంచి,
జీవితం తనను తాను జీవిస్తోంది
కలలాగా నిన్ను తాకుతోంది”. ఈ మాటలతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం. ముందే చెప్పుకున్నాం కదా, జీవితాన్ని జీవితంగా కాకుండా, సమస్త ప్రకృతిలో భాగంగా జీవితాన్ని జీవించడంలోనే అర్థం పరమార్థం ఉంది. జీవితంలో ఉన్న వైరుధ్యాలు, మీమాంసలు, తర్కవితర్కాలూ వీటన్నింటికీ కవిత్వం ఏమీ అతీతం కాదు. ఏ విషయంలో ఎటు కొట్టుకు వెళ్ళినా, కవిత్వం విషయంలో మాత్రం ఇతను పట్టు తప్పడు. గోర్కీ, టాల్ స్టాయి గురించి చెబుతూ, ‘దేవుడి మీద నాకు నమ్మకం లేదు గాని టాల్ స్థాయి నాకు దేవుడిలా కనిపించాడు’ అంటాడు. దేవుడి మీద మరి నాకు కూడా నమ్మకం లేదు కానీ బివివి కవితా పంక్తులు అతని మాటల్లోనే చెప్పాలంటే ‘దేవుడు చినుకుల భాషలో మాట్లాడుతున్నట్టు, చల్లగా, నెమ్మదిగా, ఉల్లాసంగా ఉన్నాయి’. తెలుగులో తాత్వికతను కవితా స్థాయికి తీసుకువెళ్లిన సంపూర్ణ, సమర్ధ కవిగా బివివి నిలిచిపోతాడు. మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు.
……………….
ప్రసాదమూర్తి
8499866699