02 జనవరి 2026

జీవనోద్వేగం వైపు ... - డాక్టర్ సుంకర గోపాల్

బివివి ప్రసాద్ మొదటి పుస్తకం ఆరాధన నుండి ఇప్పటి సృష్టి వరకు వచ్చిన కవిత్వంలో తన తాత్విక ధారను కొనసాగిస్తున్నారు. మొత్తం మీద వారి సారాంశం అద్వైత భావన. జీవితంలో ఆయన జీవితేచ్చ వెతుకుతున్నాడు. జీవితంలో ఉండే సుఖ, దుఃఖాలను జీవితంలో ఉండే ద్వంద్వాలను అనేకమార్లు బివివి గుర్తించాడు. ఈ జీవితాన్ని ఎట్లా దాటాలో, ఎందుకు దాటలేమో దాని అంతు చూడాలనేది ప్రసాద్ గారి బలమైన కాంక్ష. ప్రకృతికి ,కాలానికి మనిషి అతీతుడు కాదు. శూన్యం నుండి మొదలై భావోద్వేగాల ద్వారా పరిపూర్ణత చెంది, తిరిగి శూన్యం వైపు అనగా అది నిద్ర కావచ్చు, మరణం వైపు కావచ్చు. మానవ జీవితం శూన్యం నుండి శూన్యం వైపు వెళుతుంది అనే భావనను ప్రసాద్ గారు గాఢంగా నమ్మారు. సరళపదాలలో తాత్వికతను పలికించారు. జీవితం తనని తాను ఎట్లా జీవిస్తుందో పసిగడుతున్నారు

వారు రాసిన సృష్టి అనే కవితని పరిశీలిస్తే ఈ సృష్టిని చిత్రకారుడు నైపుణ్యంతో పోలుస్తూ మానవ ఉనికిలోని తాత్విక కోణాన్ని చూపుతారు. సృష్టి కవిత మూడు మూడు పాదాలుగా ఉంటూ చివర నాలుగు పాదాలతో ముగుస్తుంది. ఇందులో వారు మొదట కవితకి పునాది వేస్తారు.

"ఖాళీ మనసులో కొన్ని రంగులు ఒంపు
అవి ఆకాశమూ, గాలీ, నీరూ
కాంతీ, చీకటిలో వెన్నెలా"

ఈ మూడు పాదాలను చిత్రకారుని నైపుణ్యంతో పోలుస్తూ కవితకి పునాది వేస్తారు.

"రంగులపై కొన్ని గీతలు గీయి 
నదులూ, కొండలూ, మైదానాలూ 
ఉదయాస్తమయ మేఘాలూ, పాలపుంతలూ"

ఈ పాదం మనకు ఒక ఆకృతిని ఆకారాన్ని తెలియజేస్తుంది. తరువాతి మూడు పాదాలలో ప్రకృతికి చైతన్యాన్ని ఇచ్చే ప్రతీకలను చెప్తారు.

"గీతలను కొంచెం కదిలించి చూడు
చెట్లు, పిట్టలూ, చేపలూ
చీమలూ, ఏనుగులూ, మనుషులూ"

ఆ తర్వాతి మూడు పాదాలలో ఖాళీ మనసులోని భావోద్వేగాలను చెప్తారు.

"కదలికలలో ఉద్వేగాలు కలుపు 
చిక్కగా, లేతగా ,తీవ్రంగా, తేలికగా 
మంచీ, భయమూ, బాధా, ప్రేమా"

చివరి నాలుగు పాదాలలో శూన్యం నుండి శూన్యం వైపు వెళ్ళడం గురించి చెప్తారు.

"ఇంతకన్నా ఊహించేదేమీ లేదు 
నువ్వైనా, దేవుడైనా 
మళ్లీ మొదటికి రావాల్సిందే 
నిద్రలోనో, మరణంలోనో, జ్ఞానంలోనో" అంటారు.

బివివి ప్రసాద్ చాలా కవితలలో ప్రకృతిలోని వైవిధ్యానికి జీవన ఉత్సాహమే కారణం అనే భావన కనిపిస్తుంది. ఆయన రచించిన మరో కవిత రంగుల పిల్లలు, ఇందులో రంగులు ఆశకి, అస్తిత్వానికి గుర్తుగా చెప్పారు. జీవితంలోని సుఖ, దుఃఖాలను ఓదార్పుగా బతుకుపై ఆశను కలిగించే పసిపిల్లలలాంటి శక్తులుగా కవి అభివర్ణిస్తాడు. ఈ కవిత చదివాక పాఠకుడు తన అంతరంగాన్ని తానే చూసుకోవాలి.

ప్రసాద్ గారికి ఉన్న గొప్ప శక్తి దృశ్య చిత్రణ, అది అన్ని కవితల్లో కనిపిస్తుంది.

"అస్తమయబింబం ఆకాశంలోకి విసిరే 
చివరి నారింజ కాంతిలా

అట్లా నలుపు, తెలుపుల
దుఃఖానందాల కెరటాల మధ్య
రంగులు నీకు ఆశ కల్పిస్తాయి అమాయకంగా 
ఇక్కడింకా ఏదో ఉందని"

ఇక్కడ కవివాడిన నలుపు, తెలుపులు వాస్తవానికి, నిశ్శబ్దానికి సూచికలు.
 
ఇందులో ఉన్న మరొక కవిత మోహం. ఈ కవిత ద్వారా బ్రతికే క్షణాల విలువను కవి చెప్తారు. బాహ్య ప్రపంచానికి అంతరంగ ప్రపంచానికి మధ్య ఉన్న విభజనను గుర్తించమంటారు. జీవితాన్ని అనుభవించాలి అనే తహతహ అడుగడుగునా కనిపిస్తుంది. రెండున్నర గంటల సినిమా అయిపోతుందని జాగ్రత్తగా చూసినట్లు జీవితాన్ని చాలా విలువగా చూడాలని ఈ కవితలో కవి
గుర్తించమంటాడు. మోహం జీవితం పట్ల ఉన్న లేదా ఉండాల్సిన ప్రేమకి సూచిక.

"జీవితమ్మీద ఇంత మోహమేమిటి అంటారు 
ఏ రోజైనావెళ్ళిపోయే విరక్తి ఉంది గనుక అంటావు

ఆ దీపం వెలుతురు, బాటపై మనుషులు 
ఇళ్లపై వెలుగునీడల దోబూచులాట 
ఉండి ఉండి తగిలే గాలి తెరలు
కురవలేక బేలగా నిలబడిన మబ్బులు 
మానుష ప్రపంచపు వింత శబ్దాలు 
చనిపోతే ఇక దొరకవు కదా అని కూడా

జీవించటం ఇంత అపురూపమైన సంగతా అంటారు".

పై వాక్యాలలో కవి నిర్మాణాన్ని పరిశీలిస్తే
చాలా తేలికైన వాక్యాలుగా అనిపిస్తాయి. కానీ ఇందులో కవి జీవితంలోని దృశ్య, స్పర్శ, శబ్ద సన్నివేశాలను చెప్పాడు.

ఇక ఇదే కవితా సంపుటిలో సీతాకోకల కథ
కవిత ఉంది. అందులో కవిత చాలా మామూలుగా 

"రెండు తెల్లటి ప్లాస్టిక్ సీతాకోకల్ని
తలలో తురుముకుంది ఆ అమ్మాయి"
అంటూ ప్రారంభం అవుతుంది.

ఆ కవితలో 
"మాకు రెక్కలున్నాయి, ఊహల్లేవు, 
నీకు ఊహలున్నాయి, రెక్కల్లేవు"
వాక్యాలు మనిషి ఉనికిలోని వెలితిని సూచిస్తాయి. మనిషికి ఎగరాలనే కోరిక ఉంటుంది కానీ పరిమితులు ఉంటాయి. ఈ రెండింటి కలయికతో కళాసృష్టి జరుగుతుందని కవి సీతాకోకల కథ అనే కవితలో చెప్తాడు.

ఈ కవిత, వస్తువు రీత్యా సామాన్యంగా అనిపించినా, దాని వెనుక ఉన్న తాత్వికత చాలా లోతైనది. ఒక చిన్న దృశ్యాన్ని (అమ్మాయి తలలోని ప్లాస్టిక్ సీతాకోక చిలకలు) తీసుకుని, దాన్ని కవిత్వం, ఊహ మరియు జీవిత సత్యాల మధ్య సంఘర్షణగా మార్చిన తీరు గొప్పగా ఉంది.
 
కవి నిరంతరం బాహ్య ప్రపంచాన్ని తన ఊహలతో నింపేయాలని చూస్తుంటాడు, కానీ జీవితం దానికంటే బరువైనదని ఇక్కడ గుర్తు చేస్తారు.
 
"మాతోపాటు సూర్యకాంతినీ, ఆకాశాన్నీ, భూమినీ
అంతటినీ దాచుకునే, పంచిపెట్టే 
జీవితం బరువునీ నువు మోస్తూనే ఉండాలి" అని అంటారు.

"జీవితం బరువునీ నువు మోస్తూనే ఉండాలి" - ఊహల్లో విహరించడం సులభమే కానీ, సూర్యకాంతిని, ఆకాశాన్ని, భూమిని మోయడం కష్టమని కవి అంటారు. కవి కేవలం అందాన్ని మాత్రమే కాదు, ఆ అందం వెనుక ఉన్న జీవిత పాఠాన్ని కూడా వెతుకుతున్నారు.

అమ్మాయి వెళ్ళిపోయాక, అక్కడ మిగిలిన 'నీరెండ'
సీతాకోకలా ఎగరడం అనేది కవితకు ఒక గొప్ప దృశ్యాత్మక ముగింపునిచ్చింది. అమ్మాయి వెళ్ళిపోయినా, కవి ఆలోచనల్లో ఆ అనుభూతి ఇంకా మిగిలే ఉంది.

ఈ కవిత కేవలం ఒక అమ్మాయి తలలోని పిన్నుల గురించి కాదు; ఇది కవిత్వానికీ - జీవితానికీ, ఊహకూ - వాస్తవానికీ మధ్య జరిగే నిరంతర సంవాదం. లోకాన్ని పరిశీలించే క్రమంలో కవి తనని తాను ఎట్లా విశ్లేషించుకుంటారో ఈ కవిత ప్రతిబింబిస్తుంది.

"భూమి ఇంకా ఎడారి కాలేదు
సముద్రం ఎండిపోలేదు 
వెన్నెల మసకగానైనా కనిపిస్తూ ఉంది 
ఎందుకు బ్రతకకూడదు"

అంటూ మరొక కవితలో ఆత్మహత్యలు చేసుకునేవారికి క్షణాల విలువ, ఊపిరి విలువ, జీవితం విలువ, సారహీనమైన జీవితాన్ని వెలిగించుకోవడానికి ఏమేమి చేయాలో, మనకు ఏది భరోసాగా నిలుస్తుందో చాలదా అనే కవితలో చెప్తారు. ప్రసాద్ గారు ఉదయం కిరణాలు, గాలి, మధ్యాహ్నపు ఎండ నీడ, సాయంత్రం దిగులు ఆకాశం పైన కనిపించే రంగులు, చీకటి వచ్చిన సమయాల్లో ఆకాశంలో మెరిసే నక్షత్రాలు.. ఇవన్నీ మనల్ని బతికిస్తాయని, కొంచెం ప్రేమ మిగిలి ఉన్న చాలు ద్వేషాలు, అపనమ్మకాల మధ్య ఒక్క తడి చూపు చాలు ఈ లోకం చాలా ఏళ్లు బతుకుతుందని తన కవిత్వం ద్వారా భరోసా ఇస్తాడు. 

ఈ లోకంలో మనం ఏమన్నా బతికితే చిన్నప్పుడు మాత్రమే బతికామని మిగిలిన జీవితం అంతా కేవలం బదులు చెల్లించడం వలే గడిపేస్తున్నామని వాపోతాడు. జీవితాన్ని సాహసంగా స్వీకరించడం ఎలానో సృష్టి కవితా సంకలనంలోని చాలా కవితలు ఒక తడి హృదయం తో చెప్తాయి. బీవీవీ కవిత్వంలో ఆకాశము, సముద్రం, క్షణాలు, జీవితం, పూలు, సీతాకోకలు, ప్రేమ, దయ, దుఃఖం వంటి పదాలతో చేసే ఊహలు సరికొత్తగా ఉంటాయి. ఇక ఆయన వాక్యాలు మృదువైన స్పర్శతో సున్నితంగా, లాలనగా ఉంటాయి. ప్రపంచం పట్ల, ఈ ప్రపంచంలోని మనుషులు పట్ల అపారమైన ప్రేమ కలిగిన కవి బివివి ప్రసాద్. ప్రపంచాన్ని లేదా జీవితాన్ని చిన్నారిపాపలా దగ్గరకు తీసుకోవడం ఎట్లాగో ఈ కవిని చదివాక తెలుస్తుంది. ఆయన ఓ కవితలో ముగింపువాక్యం చూడండి.

"జీవితం నీ ప్రేమ కోసం ఏడుస్తున్న 
నీ తప్పిపోయిన శిశువు"

సృష్టి కవిత సంపుటి కోసం బీవీవీ ప్రసాద్ గారిని సంప్రదించవచ్చు.

- డాక్టర్ సుంకర గోపాల్
8555971630

(కవిసంగమం గ్రూప్ లోని కవిత్వ కాంతి శీర్షిక కోసం రాసిన 44వ వ్యాసం)



22 డిసెంబర్ 2025

"సృష్టి" First look , first impression. - CV Ramana

Bvv Prasad గారి కవితాసంకలనం, 'సృష్టి' అందింది . కృతజ్ఞతలు! కవితలు చదివి, పాఠకుని గా ప్రతిస్పందన చెప్పమన్నారు. ఆయన కవితల్లో లోతు తెలిసినవారు, అలా చెప్పడానికి చాలా టైం పడుతుంది అని వొప్పుకుంటారు . 

వీటిలో అధిక భాగం, 2023-25 సంవత్సరాల మధ్య రాసినవి లాగ ఉన్నాయి. మొత్తం 144 కవితలు. 250 పేజీలు. Rs 250/- 

Very rarely he has written so profusely and prolifically ever since I knew him .

ఆయన "రాయాలి"  అనుకుని Will Power తో రాశారా ? లేక ఏదైనా శక్తి పూని ఆయన చేత రాయించిందా ? 

ఆయనే రాశారా? లేకా ఆయన ద్వారా, ప్రసాద్ గారు 'వాహకం' గా, కవిత్వమే ఆయనను పూని రాయిపించిందా? అనేది, ఆయన కవిత్వం, BVV Prasad's Poetry రెగ్యులర్ గా చదివే పాఠకులు అర్ధం చేసుకో గలరు. 

గంగారెడ్డిగారు, స్వాతికుమారిగార్లు ఎపిలోగ్ లు అనగా, పుస్తకం చివరిమాటలు రాశారు. 

Most of his earlier poetry too, was deeply philosophical. నాకు ఆయన అలానే పరిచయం, 2010 నుంచి, due to deep philosophy in his writing. Profound feel. 

2012 లోనో, ఏమో, ఒక కవిత చదివాను. From BVV Prasad sir. కూతురిని కాలేజి హాస్టల్ లో వదిలి, కాస్త దిగులు తో ఇంటికి వచ్చిన తండ్రికి, phone call from his daughter.  

"బెంగ గా ఉంది నాన్నా, ఇక్కడ, ఈ రాత్రి!" అంటూ. 

It made such a profound impact on me that I still remember it today. I could resonate with it deeply. I wish he reproduces it sometime or it's already published in one of his poetry books.

***

"ఎన్నో దుఃఖాలు ఈది, భయాలు దాటి 
ఏళ్ళకి ఏళ్ళు నడిచి
ఈ ప్రశాంతమైన ఉదయానికి చేరుకున్నావు 
ఈ క్షణం స్వచ్ఛ స్ఫటికంలా 
నిలిచిపోతే బావుండుననిపిస్తుందా 
ఇక మెల్లగా మంచులా చెదురుతుంది ప్రశాంతత"

ఈ పీసు, ఒక కవిత లో ని ఈ మొదటి పద్యం , దానిలోని చివరి 2 పాదాలు చదివాక, 30 నిముషాలు, కళ్ళు మూసుకుని ఉండి పోయాను. Reflecting, brooding. 

"ఈ క్షణం, స్వచ్ఛస్ఫటికంలా ఇలానే నిలిచిపోతే బాగుండును అనిపిస్తుందా? 
ఇక మెల్లగా, మంచులా చెందుతుంది ప్రశాంతత!" 

నా మనసు జిడ్డు కృష్ణమూర్తి దగ్గరకు వెళ్ళిపోయింది . 
ఆయన దగ్గరికి వచ్చిన ఒకరు అడిగారు "ఒక్కసారి వచ్చింది ఆ ప్రశాంతమైన ఫీలింగ్. వచ్చి అలా వెళ్ళిపోయింది. మళ్ళీ ఎంత ధ్యానం చేసినా, ఎంత అన్వేషించినా, దొరక లేదు! దాన్నీ మళ్ళీ వెదికి పట్టుకోవడం ఎలా?' అని అడిగారు, కళ్ళల్లో నీటిపొరలతో. దుఃఖంతో.  

JK said, with the compassion of a surgeon's knife "The very demand for continuation or continuity is the denial of it! It will spoil the beauty of it. Besides, demand for continuity will become the genesis for fear of death (మృత్యు భయం), desire, fear and all the rest of it.  What ever happens, let it happen. What ever leaves you , let it leave" అని. 

ఈ పద్యం లో చివరి 2 పాదాలు చదివాక, నన్ను జిడ్డు కృష్ణమూర్తి ఆవహించారు.

18 డిసెంబర్ 2025

మనలో ఒక ఖలీల్ జిబ్రాన్ : రఘు శేషభట్టర్

రాత్రుల్లో విందు చేసే మిణుగురు పుష్పాల్ని ఎండలోకి రమ్మని ఎవరూ అడగరు. చేతుల్లోకి తీసుకున్న బంతిపూల దండ నుండి జాజుల మత్తు కోసం ఎవరూ వెతకరు. వాటి సహజ గుణాలు తెలుసు కనుక గౌరవించి తప్పుకుంటాం. Bvv Prasad కూడా అంతే. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేని అలౌకిక ప్రపంచం తనకుంది. అది దాటి కవిత చెప్పమని అడిగితే కృతకంగా ఉంటుంది..

జీవితం పట్ల తనకున్న ప్రేమను వ్యాకులతను పలు పార్శ్వాల్లో మననం చేసే BVV బహుశా ఖలీల్ జిబ్రాన్ స్థాయి కవి. ఆయన లీనమయ్యే విషయాలేవన్నది పక్కన పెడితే తనను చదువుతున్నప్పుడు, చదివి ఆపినప్పుడు ఒక తల నెరిసిన మనిషి జీవిత సత్యాలేవో చెబుతున్నట్టుంటుంది. ఒక ప్రశాంత గంభీరత తట్టి కుదుపుతుంది.

   ' ప్రేమ ఉంటే పెద్దగా చెప్పేందుకు ఏమీ ఉండదు
     మాటలన్నీ మంచు ముక్కల్లా కరిగిపోతాయి '

   ' లోకాన్ని నువ్వు, నిన్ను లోకమూ చేయగలిగిందేమీ లేదు
     ఒకేచోట తిరిగే గాలిదీ కాంతిదీ వేరు వేరు ప్రపంచాలైనట్టు
     ఒకదానినొకటి ఏమీ చేయలేనట్టు '

     ' ప్రపంచంలో గడిపాక
      ఈత చాలించిన దేహంలా ఏకాంతంలో మునిగినప్పుడు'

ఈ తరహా మాటలు అతి సహజంగా ఉబికి వస్తాయి తన తాజా సంపుటి ' సృష్టి' లో. దిగులు పడినప్పుడు, విడిపోతున్నప్పుడు పొగిలి పోయే మనిషి సృష్టితో చేసే సంభాషణ పుస్తకం నిండా ఆవిరించి ఉంటుంది. ఎన్నో వెతుకులాటలు, దూది అద్దిన భాషణలు సీతాకోకల్లా తాకిపోతాయి.

'ఎవరైనా నిష్కపటంగా ఒక జీవిని ప్రేమించటం చూస్తే ముఖం ప్రసన్నమౌతుంది' అని BVV చెప్పిన మాటల్ని అతని కవిత్వానికి కూడా అన్వయించ వచ్చు.

Thank you Raghu Seshabhattar garu 🙏❤️

16 డిసెంబర్ 2025

సమకాలీన వచన కవులు భక్తికవిత్వాన్ని ఎలా చూస్తున్నారు? : బివివి ప్రసాద్ తో శ్రీవల్లి రాధిక ముఖాముఖి

సమకాలీన వచన కవులలో బి.వి.వి. ప్రసాద్ గారికి తాత్త్వికతను, సత్యాన్వేషణను అందించే కవిగా పేరుంది. వారు కూడా జయంతి పత్రికలో పంచుకున్న అభిప్రాయాలలో తన కవిత్వ లక్ష్యం అదేనని చెప్పడం, భక్తి కవిత్వాన్ని గురించి కూడా ఒకటి రెండు వ్యాఖ్యలు చేయడం గమనించాను. కనుక వారిని కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా సమాకాలీన కవులు భక్తికవిత్వాన్ని ఎలా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చుననిపించింది. 17 జూన్ 2021 నాడు వారితో ఒక ముఖాముఖి నిర్వహించాను. ఆ ప్రశ్నలను, వాటికి వారిచ్చిన సమాధానాలను ఇక్కడ అందిస్తున్నాను.

ప్రశ్న : సమకాలీన కవులలో మీకు తాత్త్విక కవులని పేరు. మీ కవిత్వం తాత్త్విక విషయాలతో నిండి ఉంటుందని మీ అభిమానులు, సహకవులు అనడం విన్నాను.

జవాబు : అవును. తాత్వికత, సౌందర్యస్పృహ నా అభిమాన విషయాలు. అన్నిసార్లూ కాదు గాని, చాలా కవితల్లో నిరపేక్షసత్యం గురించి నాకు అర్థమైన విషయాలు కవిత్వంలో చెప్పే ప్రయత్నం చేస్తాను.

నాకు అర్థమైనంతలో, అద్వైతతత్వమూ, బౌద్ధమూ కూడా అంతిమంగా ఒకటే సత్యాన్ని బోధిస్తున్నట్లు తోస్తోంది. బుద్ధుని శూన్యమూ, శంకరుని పూర్ణమూ ఒకే సత్యానికి రెండు ముఖాలు అనిపిస్తాయి. సత్యాన్ని దృశ్యంగా చూస్తే శూన్యం, ద్రష్టగా అనుభవిస్తే పూర్ణం అని నా నమ్మకం.

ఆ అంతిమసత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకునేందుకు లేదా దానిలో కరిగిపోయేందుకు చేసే సాధనని కవిత్వంగా రాస్తూ వుంటాను.

ప్రశ్న : భక్తి కూడా ఉంటుందా మీ కవిత్వంలో? భక్తి పట్ల మీ దృక్పథం ఏమిటి?

జవాబు : కవిత్వంలో ఉండదు. వ్యక్తిగతంగా నాకు భక్తి ఉంది. కానీ, కవిత్వంలో భక్తిని కాక, జ్ఞానమార్గాన్ని చెప్పాలనిపిస్తుంది.

ప్రశ్న : భక్తీ, జ్ఞానం ఒకటి కాదా?

జవాబు : కాదు, వేర్వేరు. భక్తి అంటే హృదయస్వచ్ఛత. ఉద్వేగసంబంధి. జ్ఞానం అంటే ఉన్నది ఒక్కటేననే అవగాహన. మేథోసంబంధి. భక్తిలో ద్వైతం ఉంటుంది. జ్ఞానం అంటే అద్వైతస్థితి. దానిలో భగవంతుడు, భక్తుడు అని ఇద్దరు ఉండరు.

ప్రశ్న : సిద్ధస్థితిలో భక్తికీ, జ్ఞానానికీ భేదం ఉండదంటారు కదా! అద్వైత గురువులయిన శంకరాచార్యులు, రమణమహర్షీ కూడా భక్తి రచనలు చేశారు కదా!

జవాబు : వారి స్థాయికి వచ్చినపుడు భక్తికి, జ్ఞానానికి భేదం ఉండదు. సాధన స్థితిలో భేదం ఉంటుంది. భక్తికి విశ్వాసం ప్రధానం. జ్ఞానానికి హేతుదృక్పథం ముఖ్యం.

అయితే భక్తి ద్వారా కూడా అద్వైతస్థితిని చేరవచ్చు ననుకొంటాను. భక్తి వలన హృదయశుద్ధి, దానివల్ల బుద్ధి సూక్ష్మత్వం, దానివల్ల అద్వైతానుభవమూ కలిగే వీలుందనిపిస్తుంది.

ప్రాచీనులు భక్తినీ, జ్ఞానాన్నీ అభిన్నంగా చూసినట్లు కనిపిస్తుంది. కానీ వర్తమానంలో ఆ దృష్టి మారుతోంది. ఇప్పుడు భక్తితో సంబంధం లేకుండానే, అద్వైతస్థితికి చేరినవారు కనిపిస్తున్నారు.

ప్రశ్న : సాహిత్యానికి సంబంధించినంతవరకు భక్తి, జ్ఞానాలకు భేదం ఎలా ఉంటుందంటారు?

జవాబు : సాహిత్యంలో భక్తిని చెప్తున్నపుడు సౌందర్య స్పృహ ఉంటుంది. ఒక రూపం గురించి చెప్పడం ఉంటుంది. ఉద్వేగం ఉంటుంది. ఆర్తి ఉంటుంది.

జ్ఞానం అన్నపుడు తాత్వికస్పృహ, నిర్గుణతత్త్వాన్ని చెప్పటం వుంటాయి.

నా మొదటి కవితాసంపుటి ఆరాధనలో భక్తిపరమైన కవితలు కొన్ని ఉన్నాయి. అంటే ద్వైతభావం, సౌందర్యస్పృహ కనిపించే కవితలు. అప్పట్లో నాపైన రవీంద్రుని గీతాంజలి ప్రభావం ఉండేది.

ప్రశ్న : తర్వాతి కాలంలో అటువంటి కవితలు రాయకపోవడాని కారణం ఏమిటంటారు? ఇపుడు భక్తి భావాలు కలగడం లేదా?

జవాబు : భక్తి భావం కలుగుతుంది. అరుణాచలం అన్నా, రమణమహర్షి అన్నా ఇష్టం. భక్తిపరమైన ఉద్వేగాలు కూడా కలుగుతాయి. కానీ కవిత్వంలో వాటిని వ్యక్తీకరించటం లేదు.

ప్రశ్న : దానికి కారణం చెప్తారా?

జవాబు : రెండు కారణాలున్నాయి.

ఒకటి. కవిత్వం మరొకరి కోసమే రాస్తాం. ఎంతగా మనల్ని వ్యక్తపరచుకోవటానికనీ, మన కోసమే రాసుకోవటమనీ చెప్పినా పాఠకుడిని ఉద్దేశించే మాట్లాడతాం. వాళ్ళకి అందేలా రాయాలనే అనుకుంటాం.

ఈ కాలంలో భక్తిని భక్తిలా స్వీకరించే పాఠకులు అరుదు. పాఠకులలో ఇప్పుడు రెండురకాల వారున్నారు. స్వప్రయోజనాల కోసం వారివారి నమ్మకాలని అనుసరించి ప్రార్ధనలు చేయటమే భక్తి అనుకునేవారు ఒకరు. ఒక అనంతశక్తికి చిత్తశుద్ధితో శరణాగతి చెందేవారు మరొకరు.

మొదటివారిని ఉద్దేశించి రచనలు చేసే ఆసక్తి లేదు. రెండవవారిని లక్ష్యం చేసుకుని రాసినపుడు సాకారోపాసన కన్నా, నిరాకారోపాసన తోనూ, సగుణోపాసన కన్నా, నిర్గుణోపాసనతోనూ రాయటం వలన భావాలను హేతుబద్ధంగానూ, సార్వజనీనంగానూ చెప్పే వీలుకలుగుతుందనిపించింది.

ఆకాశం సంపుటిలో రమణమహర్షి గురించి రాసిన కవితని గమనిస్తే ఈ ఎరుక ఎంతగా వుంటుందో తెలుస్తుంది. దానిలో ఎక్కడా మూఢభక్తి ఉండదు. హేతుబద్ధంగా చూసినా ఒప్పుకోగల విషయాలు మాత్రమే చెప్పాను.

ఇక కవిత్వంలో భక్తిని తీసుకురాకపోవడానికి రెండవ కారణం. బహుశా, నేను దానిని రహస్యంగా ఉంచాలనుకోవడం కావచ్చు.

ప్రశ్న : రహస్యంగా ఉంచడం ఎందుకు?

జవాబు : మన వ్యక్తిగత అనుభూతిని, ఒకరిపై మనకున్న ఇష్టాన్ని అందరికీ చెప్పాలనుకోము. భగవంతుడికీ, నాకూ ఉన్న బంధం వ్యక్తిగతం. దానిని కవిత్వంలోకి తీసుకురావడం, బాహాటంగా ప్రకటించడం ఇష్టం లేదు. అలా ప్రకటిస్తే ఆ బంధంలోని పరిమళం పోతుందనిపిస్తుంది. భక్తుడిననే అతిశయం ప్రకటిస్తూ పాఠకులకు కనిపించాలని కూడా లేదు.

ప్రశ్న : ఇపుడు మీరు చెప్పినది జ్ఞానానికీ వర్తిస్తుంది కదా!

జవాబు : నిజమే, జ్ఞానిననే అహంభావం ప్రకటిస్తున్నట్లు పాఠకులు అనుకొనే అవకాశం ఉంది.

ప్రశ్న : అదికాదండీ. జ్ఞానం విషయంలో కూడా ప్రకటనలా చేయడం ఉండదు కదా! వ్యక్తీకరణలో అలాంటి అభిప్రాయం కలగకుండా చూసుకునే ప్రతిభ ఉంటుంది కదా అని.

జవాబు : ఉంటుంది. ఒకచోట రాశాను, నాకు నచ్చిన భావాలను నీకు నచ్చిన మాటలలో చెప్పడం కవిత్వం, అని. అలానే రాయడానికి ప్రయత్నిస్తూ వుంటాను. అంటే వస్తువు మార్చుకోను. చెప్పాలనుకున్నదే చెప్తాను. కానీ, ఎలా చెబితే పాఠకులు స్వీకరించగలరో అలా చెప్తాను.

ప్రశ్న : మీరు ఇందాక భక్తి విషయంలో ఉద్వేగమూ, ఆర్తీ ఉంటాయి. జ్ఞానమార్గంలో అవి ఉండవు అన్నారు. మరి ఉద్వేగం ఉన్నపుడే పాఠకులకి దగ్గరయే అవకాశం ఎక్కువ కదా. అది లేకుండా రాసినపుడు పాఠకులను ఎలా చేరుతుంది?

జవాబు : భక్తిని అందరూ ఒప్పుకోలేరు, కనుక, భక్తిని తీసుకోనన్నాను. కానీ శాంత, కరుణ రసాలు ఉండేలా చూస్తాను కవిత్వంలో. అనుకంప కలిగేలా జాగ్రత్త పడతాను. ఆ అనుకంపన శాంతికీ, అంతిమ సత్యానుభవానికీ దారి తీసేలా చూస్తాను.

*****
థాంక్యూ Radhika T గారు..

https://sreevalliradhika.substack.com/p/e2a

15 డిసెంబర్ 2025

ఆహా! ఎంత అందమైనదీ సృష్టి! - వాసు (న్యాయపతి శ్రీనివాస్)

 బి.వి.వి. ప్రసాద్ నలుగురి మన్నననూ పొందిన కవి. ఆయన హైకూలు రాస్తూండిన కాలం నుంచే ఆయనకొక fan following ఏర్పడింది. అది కవులకు అరుదుగా దొరికే గుర్తింపు. ప్రసాద్ కవిత్వంలోని విమల కోమల పదాల, వాక్యాల వరుసల్లో కనిపించే ప్రశాంతత వెనుక ఆయన నమ్మే అద్వైత సిద్ధాంతముంది. ఇందులోని కవితాత్మక పంక్తుల కుంభవృష్టిలో తడిసిపోయిన పాఠకులు చివరకు మిగిలేది ఏమిటో ఇట్టే గ్రహిస్తారు. ఇదొక రెండంచుల కత్తి. తను నమ్మిన సిద్ధాంతం తళుక్కున మెరుస్తూండే కవిత్వం రాయడం ఏ కవికి ఎంత కష్టమో గానీ ఈ కవికి ఇది సులభసాధ్యమేనని ఈ కవితా సంపుటి చెబుతోంది. "ఊరికే జీవితమై" సంపుటి తరువాత రెండేళ్ళకు ఇది వస్తూ ప్రసాద్ అభిమానులను అలాగే అలరించగలిగిన సంపుటి ఈ "సృష్టి". కవి ఈ చరాచర సృష్టినీ జీవితాన్నీ అద్వైతసిద్ధాంతపు వెలుగులో చూస్తూ అనుభవించగా చెందిన తన్మయమే ("తత్"+మయం!) ఇతని కవిత. వర్షం, రంగులు, పిల్లలు, తల్లీపిల్లలు, కొండా కోనా - వీటన్నిటినీ ఏ కవీ చూసి ఊరుకోలేడు, ఉరకలు వేస్తాడు. ఈ కవి వేసిన ఉరకలు చల్లగా వెన్నెల్లా సోకుతాయి. ఇంకా, ఈ కవి చెప్పిన సత్యాల వెనుక కఠోరమైన అనుభవాలున్నాయి. "గాఢమైన దుఃఖం తర్వాత మళ్ళీ పుడతావు/లోపలి జీవితేచ్ఛ నిన్ను మళ్ళీ ప్రసవిస్తుంది" అనడానికి ఎంతో బాధ తెలిసుండాలి. కవితాత్మక వాక్యాలు ఇందులో ఆద్యంతమూ కనిపిస్తూ హాయినిస్తాయి. "ఒక ఉదయం లేచేసరికి/పూవుగా మారిపోయి ఉంటావు" అనడమొక ఉదాహరణ. "వాన కురిసే వేళ/నీకు నువ్వు నిజంగా దక్కుతావు" అన్నప్పుడు కవి ఎన్నో పరకాయప్రవేశాలు చేసాడని ఊహించవచ్చు. ఏకాంతం విలువ, అది పెట్టే ఒత్తిడీ తెలిసిన కవి కనుక, "చీకటి పడేకొద్దీ ప్రకాశిస్తావు నీలోపలికి" అనగలిగాడు ఈ కవి. ఇందులో వరమో శాపమో అర్థం కాని, బహుశా రెంటికీ అతీతమైనదేదో దొరికేట్టుచేసే epigrams కూడా చాలా ఉన్నాయి. ఇది చూడండి: "గగనంలో తేలిన ఇంద్రధనువు/గగనంలోనే మునిగినట్లు/జీవితంలోంచీ తేలిన నువ్వు/జీవితంలోనే మునుగుతావు". "కనబడని ఆనందంలోకి తిరిగిరాకుండా తప్పిపోవాలి" ఈ వాక్యం కవి కొండల్లో తొలిచిన రోడ్లమీదుగా వెళుతుండగా రాసిన కవితలో ఆఖరి వాక్యం. జీవితానికి అర్థం చెప్పిన మహావాక్యమూ ఇదే. "ఇతరులు లేరనేంత ప్రేమ నీపై నీకు లేకపోవటమూ/ఇతరులు నువ్వే అనేంత ప్రేమ వారిపై లేకపోవటమూ/జీవితం లోతుల్లోని బలమైన విషాదం" అంటూ మనిషికే భాష్యం చెప్పాడు ఈ కవి. "చూస్తూ ఉండగా, గాఢమైన దిగులులోంచీ/కాంతివంతమైన మృత్యుపుష్పం/నీ ముందు దయగా విచ్చుకుంటుంది". నన్నడిగితే, ఈ దీవెన చాలు. ఈ సంపుటిని విశ్లేషిస్తూ గంగారెడ్డి గారు అన్నట్టు ఇది కవి తనకు తాను రాసుకున్న మ్యూజింగ్స్‌లాంటి కావ్యలేఖ. గంగారెడ్డిగారి కన్నా బాగా ఈ సంపుటిని అర్థం చేసుకున్న వారున్నారా అని నా సందేహం. ఉన్నారేమో! వాళ్ళు ఏదీ రాయరు. 

-వాసు-

Thank you Srinivasa Nyayapati garu!



జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నం నా కవిత్వం

మనుష్యులు తమతమ రోజువారీ యుద్ధాలను దాటడానికి పోరాటం ఎంత ముఖ్యమో పోనివ్వాలనే చూపూ అంతే ముఖ్య మని తెలిసిన కవి బివివి ప్రసాద్. అందుకే గెలుపు జ్వరం పట్టిన లోకంలో, ఓడిపోవడానికే ఎక్కువ ధైర్యం కావాలని ఇప్పటికి ఎన్నో యేళ్ళ క్రితమే తన కవిత్వంలో చెప్పగలిగారు. లోపలి ప్రపంచంతో నిజాయితీగా సాగే సంభాషణల్లో, కొంత ఆనందమూ, కొంత దిగులూ, కొంత ఆశా కొంత వెలితీ అన్నీ తెరలు తెరలుగా తనలోనే వచ్చిపోవడం మనిషికి తెలుస్తుంది. ఆ ఉద్వేగాల ఉధృతిని అర్థం చేసుకునేందుకు ఉపకరించే తాత్విక అన్వేషణతోకూడిన కవిత్వం బివివి గారిది. లోపలి మనిషిపట్లా, లోకంపట్లా, దయాపూరితమైన చూపును, ఆలోచనను, మెలకువను ఈ కవిత్వంలో నేను చూశాను. సీతాకోక రెక్కల్లోని ఆశను, వర్షపు చినుకుల సంగీతాన్ని, వెన్నెలరాత్రుల నిశ్శబ్దంలోని గాఢమైన శాంతిని ఈ పదాల్లో నుండీ అందుకున్నాను. బివివి ప్రసాద్‌ కొత్త కవిత్వ సంపుటి ‘సృష్టి’ విడుదలైన సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ.

‘ఆకాశం’ సంపుటితో మొదలై మీ కవిత్వ సంపుటుల్లో మీదైన శైలి ప్రస్ఫుటంగా కనపడుతూ వస్తోంది. దీని వెనుక ఉన్న సాధన, ప్రభావాలను చెప్పండి.

‘ఆకాశం’ రాసేనాటికి, శిల్పపరమైన ఎలాంటి కండిషన్ లేకుండా, నన్ను నేను వాక్యాల్లోకి తెరుచుకోవటం కొంత చాతనైంది అనుకుంటాను. అయితే నా వాక్యం నేను కనుగొనడానికి సహాయపడినవారు ముఖ్యంగా టాగోర్, ఖలీల్ జిబ్రాన్. పరమ ఉదాత్తమైనదాన్నే కవితా సమయంలో తాకాలని నేర్పారు వారు. తర్వాత ఇస్మాయిల్. కవిత్వంలోకి అనుభవాన్ని అనువదించడం, ప్రధానంగా, ఆయన నుండి వచ్చిందనుకుంటాను.

మొదటి సంపుటి ‘ఆరాధన’లోని కవితలలో ఏకరూప్యత లేకపోవటం గమనిస్తే, నాదైన వాక్యం కోసం తపన పడటం తెలుస్తుంది. ‘నేనే ఈ క్షణం’ సంపుటిలోని కవితల కాలంలోనే, విస్తృతంగా సాధన చేసిన హైకూ ప్రక్రియ brevity, effect, easeలను నేర్పింది. గనుక జపనీయ కవుల ప్రభావం కూడా నా వాక్యాల్లో ఉండవచ్చును.

మీ కవిత్వం ప్రధానంగా తాత్విక అన్వేషణతో సాగుతుంది. మీపై ఉన్న తాత్విక ప్రభావాలేమిటి?

శ్రీ రమణమహర్షి బోధించిన ప్రశ్న ‘నేనెవరు’ నా తాత్విక అన్వేషణకి మూలం. ఆ ‘నేను’ను గురించి విస్తృతంగా, లోతుగా వివరించిన నిసర్గదత్త మహరాజ్‌ని చదవటం స్పష్టతనిచ్చింది. ‘నేను’ను మరింత సూక్ష్మంగా బోధించినవారు శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యంగారు. పూర్వ ఋషుల బోధలు, ఎకార్ట్ టోలీ వంటి ఆధునిక ద్రష్టల సూచనలు కూడా నా వెదుకులాటకి సహాయపడుతున్నాయి అనుకుంటాను. అయితే, అంతిమంగా ఎవరైనా తమదైన స్పష్టత, వెలుగు తామే పొందాల్సి ఉందనిపిస్తుంది.

రూమి, టాగోర్ లాంటి తాత్వికకవుల్లో దైవం కోసం, దైవానుగ్రహం కోసం, సన్నిధి కోసం వెదుకులాట ఉంటుంది. మీ అన్వేషణకు దైవం కేంద్రం కాదు. ఎందుకు?

పూర్వ తాత్వికకవులు సత్యాన్ని దైవంగా, object గా, చూడబడేదిగా తలచటం ఎక్కువ, కొన్ని మినహాయింపులున్నా. సత్యం subject అని, చూసేవాడు అని, నేనే సత్యమని జ్ఞానులు చెబుతారు. కనక, నా ప్రయత్నమంతా నన్ను నేను తెలుసుకోవటం వైపే, నేను నేనుగా ఉండటం వైపే ఉంటుంది. రమణమహర్షి తనలో తాను సంస్థితం కావటం అంటారు. తెలియటం కూడా కాదు, అదిగా ఉండటం. అది సర్వ దర్శనాల లక్ష్యంగా తోచింది.

ఒక ఆబ్జెక్ట్‌ని కవిత్వం చేయటంలో వెసులుబాటు ఉంటుంది. ‘నేను’కీ ఆ వస్తువుకీ మధ్యనున్న ఖాళీలో ఎన్ని ఊహలైనా, నాటకీయత అయినా, ఎంత రసమైనా చొప్పించవచ్చును. కానీ ‘నేను’ను కవిత్వం చేయటం దుస్సాధ్యం.

కానీ, ప్రసాద్ అనే నేను, ఏమీకాని నేనుగా ఉండాలనుకున్నపుడు ఆ ప్రయత్నం, వెదుకులాట, దుఃఖం, ఆనందం కవిత్వంగా మారే వీలు కలుగుతుంది. ఆ చలనాలు కేవలం బౌద్ధికం (intellectual) కాకుండా, హృదయగతమైనప్పుడు అది కవిత్వంగా పండుతుంది.

మీ కవితల్లో అధికభాగం ‘నువ్వు’ అని సంబోధిస్తూ రాస్తారు. దీనికేమైనా ప్రత్యేకమైన కారణం ఉందా?

నా కవిత్వం నాతో నేను జరిపే సంభాషణ. కవిగా ఉన్న తాను, ఒంటరి తనతో జరిపే సంభాషణలో కవి, ఒంటరి మనిషిని ఉద్దేశించి చెబుతుంటాడు. ఈ ధోరణి ఉద్దేశపూర్వకంగా కాకుండా, సహజంగా నాలో ఏర్పడిందనుకుంటాను.

గాఢమైన అనుభవంతో నిండిన ఒక మనిషి సాంత్వనగా పలుకుతున్న మాటల్లా వినపడుతుంది మీ కవిత్వం, అదే సమయంలో వాక్యాలు బోధ చేస్తున్నట్లు కూడా ఉండవు. ఇది ఎలా నిర్వహిస్తారు.

నా కవిత్వం, ముఖ్యంగా ‘ఆకాశం’తో మొదలు పెట్టి, నన్ను నేను కన్విన్స్ చేసుకునే ప్రయత్నం, జీవితాన్నీ, మనుషుల్నీ, నన్నూ ప్రేమించటానికి, మరింత లోతుగా గ్రహించటానికి. చాలాసార్లు జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నం కూడా. నాకు నేనే ఔట్‌సైడర్‌గా ఒక బోధకుడిలా, తండ్రిలా, మిత్రునిలా, కౌన్సిలర్‌లా ఉంటూ నాకు చెప్పుకోవటం. చెప్పే నేను, వినే నేను ఒకరే గనుక ఒకరు ఎక్కువా, ఒకరు తక్కువా కారు గనక, బోధ ఉన్నా అది ఆజ్ఞలా కాక, మృదువుగా, భుజం మీద చేయి వేసి మాట్లాడినట్లు వస్తుంది.

ఒక కవిత మీలో ఎలా తయారై, ఎలా వ్యక్తమవుతుంది?

కవిత్వం నా జీవితానుభవం నుండి, చూపు నుండి, ఆర్తి నుండి పుడుతుంది. అది ఆకాశంలో మేఘాలు పుట్టినట్టు, సాంద్రమైన భావాలుగా రూపు దిద్దుకొంటూ ఉంటుంది. మేఘం బరువెక్కినపుడు ఇక కురవబోతుంది అని మనకి తెలిసినట్లే, భావ సాంద్రత ఏదో ఒక సమయంలో ఒక ఊహ ద్వారానో, వాక్యం ద్వారానో, ఉపమ ద్వారానో పదాల్లోకి కురవబోతుంది అనిపిస్తుంది. మొదటివాక్యం పూర్తవుతూ ఉండగా, రెండవ వాక్యం తెరుచుకుంటుంది. ముగింపు వరకూ అలానే నడుస్తుంది. వాన వెలుస్తుంది. కవిత్వం రాయటం అయిదు, పదినిమిషాల పని. కానీ ఆ కవితకి తయారుకావటం వెనక జీవితమంతా ఉంటుంది అనుకుంటాను.

మీ కవిత్వం మొత్తం మానసిక ప్రపంచం చుట్టూ తిరుగుతుంది. నిర్దిష్ట వస్తువుల మీదా, సమస్యల మీదా కవితలు కనపడవు. ఎందువల్ల?

జీవితంలోని విషయాల కన్నా, అన్నిటినీ కలుపుకున్న జీవితమనే అనుభవం గురించి రాయటమే, కాలక్రమేణా నాకు ఇష్టంగా, సహజంగా మారింది. మారాల్సింది విషయాలు కాదు, చూపు అని జ్ఞానులు చెప్పటం వల్ల కూడా కావచ్చును, మొత్తం జీవితాన్ని చూసే చూపు మార్చుకొనే సాధనలోనే నా కవిత్వం భాగమవుతూ వచ్చింది. కనుకనే నిర్దిష్ట వస్తువులు, సమస్యలు నా కవితల్లో కనిపించవు. ఇది కాగితం మీది బొమ్మల గురించి గాక, బొమ్మలకు ఆధారమైన కాగితం గురించి మాట్లాడటం వంటిది.

మీ కవిత్వంలో కష్టమైన సంధులుండవు, పరుష పదాలుండవు. పొడుగైన పదబంధాలు కూడా ఉండవు. వత్తులు, ద్విత్వాక్షరాలూ కూడా అరుదు. ఎందుచేత మీ భాషను ఇట్లా నిర్మించుకున్నారు?

నేను అనుభవిస్తున్న, అర్థం చేసుకొంటున్న లోతైన, సున్నితమైన విషయాలు స్పష్టంగా, తేలికగా తెలియచేయటానికి చాలా సరళమైన మీడియం అవసరం అనిపించింది. అందువలన భాష ఎక్కడా అడ్డు పడకుండా చూసుకుంటాను.

నా కవిత్వంలో భాష, ఇదిగో నేనున్నాను అనదు. తానున్నానా, లేనా అన్నంత నిశ్శబ్దంగా, నిరాడంబరంగా భావాల్ని, కవి నుండి పాఠకుడికి చేరవేస్తుంది.

పూలు, సీతాకోకలు, వాన, ఆకాశం వంటివి తరచూ మీ కవిత్వంలో కనిపిస్తాయి. ప్రత్యేక కారణం ఏమైనా?

ప్రాకృతిక దృశ్యాలు మనం జీవితమని భ్రమపడుతున్న దాని నుండి జీవించటంలోకి మేల్కొలుపుతాయి. మానవుల్ని ఆశలూ, భయాలతో నిండిన మానసిక ఉద్వేగాల నుండి విముక్తం చేసి, సంతోషమూ, నిండుదనమూ, కనికరమూ వంటి హృదయ స్పందనలలోకి తీసుకువెళతాయి. ప్రాకృతిక పదాలు సహజంగానే కవిత్వ పరిమళాన్ని కలిగి ఉంటాయి గనుక, అవి ఉపయోగించటం ఇష్టంగా ఉంటుంది.

‘‘ఈ లోకం చిటికెనవేలు పట్టుకుని ఇక్కడ ఉండటానికి భయమేమిటి, బాధేమిటి’’ అంటారు ‘సృష్టి’లో. ‘‘చాలు అన్న మాట చివర ఏముందో ఎప్పుడన్నా చూసావా’’ అని ‘ఊరికే జీవితమై’లో అంటారు. ‘‘నిశ్శబ్దంగా బ్రతికితే ఏమిటి? నిరాడంబరంగా వెళ్ళిపోతే ఏమిటి?’’ అంటారు ‘ఆకాశం’లో. ఈ పరుగుల ప్రపంచంలో ఇంత నెమ్మదికి చోటెక్కడుంది? ‘‘పోనీలే’’ అన్న మీ మాటతో పక్కకు తప్పుకుంటే ఈ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవడమెలా?

పరుగుల ప్రపంచం లోక మోహంలో మనసు కల్పించేది. తృప్తి మనసు తనతో తాను నిండినపుడు కలిగేది. మొదటిదానిలో పడి కొట్టుకుపోతున్నాం, గనకే రెండవది నొక్కి చెప్పటం. అనుభవాలా, శాంతా ఏది చివరిది అనే చూపు నివ్వటానికి ప్రయత్నమేమో, నా రాతలన్నీ.

జీవం నిండిన మెలకువతో పగలు గడపటానికి, రాత్రులు గాఢమైన నిద్ర అవసరం. పగటికి రాత్రి వ్యతిరేకం కాదు, పూరకం. అలానే, ఘర్షణతో నిండిన జీవితంలో ఉత్సాహంగా పాల్గొనటానికి శాంతి నిండిన మనసు అవసరం. ఆ శాంతిని కలిగించే మౌలిక విలువలలో, పోనివ్వు కూడా ఒకటి.

ఆశలలో కొట్టుకుపోయే మనసుకి, చాలు అనే భావన అమృత బిందువు. అది నిరాశని, చేతకానితనాన్ని ఇచ్చే చాలు కాదు, నిండుదనాన్ని, వివేకాన్ని ఇచ్చే చాలు.

ఇంటర్వ్యూ : మానస చామర్తి 79754 68091