02 డిసెంబర్ 2025

వెలుగునీడల దోబూచులాటలో తండ్రీ తానే, బిడ్డా తానే: ఏ.గంగారెడ్డి

 1

కవి రాసిన సృష్టి కావ్యం ఆసాంతం, ఒకటికి రెండుసార్లు చదివాను. కవి ఏం చెబుతున్నాడో కనెక్ట్ కావడానికి ప్రయత్నించాను. ఇది సున్నితమైన, కళాకారుడైన ఓ జీవుడి ఘర్షణ. ఘర్షణ నుండి, ద్వంద్వాల నుండి బయటపడాలని చేస్తున్న తాత్విక ప్రయాణం. ఏది నిజమో, ఏది అబద్దమో పూర్తిగా తేల్చుకోలేని ఊగిసలాట. దొరికినట్లు, జారినట్లు ఉండే జీవనఫల ప్రయాణం.

బయటి మనిషికి, లోపలి మనిషికి మధ్య నడుస్తున్న రాయబారం. బయటి ప్రపంచంలో కొడుకు అలసిపోతే, తన లోపలి తానే తండ్రిగా కొడుకు భుజం మీద చెయ్యి వేసి ఓదార్చుతున్న తాత్వికకావ్యం. ఇక్కడ తండ్రీ తానే, కొడుకూ తానే. బాధా తానే, బోధా తానే. బాహ్యానికి అంతరానికి మధ్యలో సంధి కుదిర్చే ప్రయత్నం. లోకం నుండి పోవాలనుకునే కవికి, ఉండాలనుకునే కవికి మధ్య సయోధ్య ఈ కావ్యం. పొంతన కుదరని అంతర, బాహ్యాలకు, చీకటి, వెలుగులకు మధ్య సమన్వయ ప్రయత్నం ఈ కావ్యం. సత్యాసత్యాల సంఘర్షణ ఈ తాత్వికకావ్యం. మనసు పగుళ్ళతో విరక్తి చెంది, మనసులేని ప్రకృతి ఒడిలో సాంత్వన పొందుతున్న కవి అంతరంగప్రయాణం ఈ కావ్యం.

ఇట్లాంటి మనోస్థితిని అనుభవించే సున్నితమైన బుద్ధిజీవులు ఉండవచ్చు. కానీ, దాన్ని ఓ తాత్వికకావ్యంగా మలుచుకుంటూ, దాంట్లోనే విముక్తిని కోరుకునే ఇలాంటి కవులు అరుదుగా ఉంటారు.

ఇది తనకు తానే రాసుకున్న మ్యూజింగ్స్ంటి కావ్యలేఖ. ఈ కవిత్వం చదివి, అర్థం చేసుకున్న తరువాత నాలో ఈ విచారధార అప్రయత్నంగా ఇలా వస్తున్నది. ఇది కవిత్వ పరామర్శకు సంబంధించిన విషయమా, కాదా నాకు తెలియదు. కవిత్వాన్ని తూచే కొలతలూ తెలియవు. ఈ కావ్యమంతా కవి జీవితస్వేచ్ఛను,విముక్తిని కోరుతున్నాడు. ఇది సుస్పష్టం. అయితే విముక్తి దేని నుండి? తన నుండి తనకే! ఇంతకీ ఆ తను ఎవరు? తనువా, ఆలోచనా; రూపమా, మానసిక నిర్మాణమా?

2

సూక్ష్మంగా ఆలోచిస్తే ఇలా ద్యోతకమవుతుంది : మనం పుట్టామా?

పుట్టినట్లు అనుకుంటున్నామా? పుట్టింది తనువా? ఆలోచననా? పుట్టినట్లు మనకు ఏ వయసు నుండి అనుభవంలో ఉంది? మన ఇంట్లో పెరుగుతున్న పిల్లలను జాగ్రత్తగా చూసినా కూడా ఏం అర్థమవుతుంది? నేను పుట్టాను, అందరితోపాటే పెరుగుతున్నాను అనుకుంటూ, నేను వేరు అనే వ్యక్తిత్వభావనను పెంచుకుంటారు. చుట్టూ ఉన్న సమాజం అలానే నేర్పుతుంది. నమ్ముతాడు. అదే అలవాటుగా మారుతుంది. గత సంస్కారం ద్వారానో, జీన్స్ ద్వారానో కొన్ని లక్షణాలను తెచ్చుకుంటాడు. స్థల, కాలాలు మారుతున్నట్లుగా అనుభవంలోకి వస్తుంటాయి. అవి నిజమని నమ్ముతాము.

నామరూపాల మాంత్రిక సముద్రంలో ఈదడం మొదలెడతాము. భాషకు, రూపానికి సంబంధించిన అర్థాలు ఇవే అని బలపడుతుంటాయి. జ్ఞాపకాల బలం పెరుగుతుంది. సమాజం, మతం, సైన్స్ అనేవి కూడా శాస్త్రం, హేతువుల పేరుతో ఈ 'అనుకోడాన్ని' మరింత బలపరుస్తున్నట్లుగా కనిపిస్తాయి. కండిషన్ అవుతాము. ఇలా కండిషనింగ్ గా మారడమే అహంగా మారడం. అహమంటే ఒక్కటిగా కాకుండా భేదంతో చూడడం, భేదమైపోవడం. ఇదే స్ట్రాంగ్, ఫిక్సెడ్ అండ్ రిజిడ్ గా మారి నేను నీవు అనే సపరేషన్తో, గొప్ప శక్తిగా విస్తరిస్తుంది. పోలికతో గొప్ప ఆటను సృష్టిస్తుంది. కానీ, తనను తాను మరిచి, పెద్ద సమస్యై కూర్చుంటుంది.

మనిషి గాయపడడమంటే, దుఃఖపడడమంటే ఈ అహం గాయపడడమే. భయపడడం అంటే అభద్రతతో ఈ అహం భయపడడమే. సుఖసంతోషాలు కూడా ఈ అహానికే. అహం చుట్టూ నేను, నీవు; నాదీ, నీది; మంచీ, చెడు; ఈర్ష్య, అసూయ: సుఖదుఃఖాల వలయం ఏర్పడుతుంది. అది నైజమై కూర్చుంటుంది. ఈ ఫాల్స్ ఇగో ముదిరి పెద్దదవుతుంది. ఇక దాని నుండి బయటపడం.

చుట్టూ ఉన్న వాతావరణంలో మనం భౌతికంగా మానసికంగా అలానే పెరుగుతున్నట్లుగా భావిస్తూ, ఆ మనోనిర్మాణానికి అలవాటుపడతాము. తాను శరీరాన్ని మాత్రమే అనే ఆలోచనతో బందీ అవుతాము. ఆలోచన అంటే కాలమే. కాలం, ఆలోచన పరస్పర ఆశ్రయాలు. మొదటి ఆలోచన మరెన్నో ఆలోచనలను సృష్టిస్తుంది. ఎన్నో ఆలోచనలు జ్ఞాపకాలుగా, జ్ఞాపకాలు ఆలోచనలుగా మరింత ముదురుతాయి. ఇంద్రియజ్ఞానం దృఢమైన ఓ నమ్మకంగా, నిజంగా మారుతుంది. ఇలా ఈ కంటిన్యుటీ అనే తాడుతో బలంగా కట్టివేయబడి, కొనసాగి అసలైన తనను మర్చిపోతుంటాము. పోలిక, కోరిక, లక్ష్యం, ఐడెంటిటీ, అసూయ, అవసరం, అహంకారం, చర్యా, ప్రతిచర్యలతో భగభగ మండుతుంటాము. ఇక ఈ కంటిన్యుటీ తాడు తెగదు.

వాస్తవానికి మనకు పుట్టిన అనుభవమూ లేదు, మరణించిన అనుభవమూ లేదు. కానీ అందరిలాగే పుట్టినట్లు, మరణిస్తున్నట్లు నమ్ముతుంటాము. ఇతరులను అంటే బాహ్యంలోని మార్పును చూసి, మన మార్పును నమ్ముతాము. మారినట్లుగా ఉన్నది బయటనా, మన లోపలనా? ఈ ఇతరమే పెద్ద మాయ! ఇతరం ఉన్నదా, ఉన్నట్లు కనిపిస్తున్నదా? ఇతరము తనలో ఉన్నదా, బయట ఉన్నదా? ఇది కేవలం తన ఆలోచనలలో మార్పా, సత్యమా? ఆలోచనలు ఎక్కడినుండి ఎందుకు మొదలయ్యాయో, దాని పునాది ఎక్కడుందో తెలియదు. కనీసం రెండు ఆలోచనల మధ్యన ఉన్న ఖాళీని స్పష్టంగా చూడలేని ఆలోచనల వేగపరంపర. ఇక ఆ కంటిన్యుటీ తాడు తెగదు.

అనుకోవడాలూ, అలవాట్లూ అనే ఈ రెండూ మనల్ని బంధిస్తాయి. తానే వేటగాడై పన్నిన మాయావల ఇది. వల వేసిన వేటగాడూ తానే, చిక్కుకున్న పక్షి తానే. అది మనం ఏర్పరుచుకున్న మాయవల అని తెలియకుండానే మన ఒరిజినాలిటీ కోల్పోతాము. భౌతికంగా చూస్తున్నదే నిజమని నమ్ముతాము. ద్వంద్వాల సుడిగుండంలో గిరగిరా తిరుగుతుంటాము. గాయపడుతుంటాము. పడతాము, లేస్తాము, మళ్ళీ పరుగెడతాము. వాస్తవానికి సత్యం కోసం నిజంగా కలవరించే సతాన్వేషికి దుఃఖం, నొప్పి, కన్నీళ్ళు అనేవి వరమే. గాయాలు తూట్లు పొడుస్తున్నపుడు, బాహ్యం పట్ల భ్రమ తగ్గి, సత్యం కోసం లోపల చూసుకునే తపన తీవ్రమవుతుంది. ఇంద్రియ, ఇంద్రియాతీతమైన అనుభూతుల ఘర్షణలో తన తావును వెతుక్కునే ప్రయత్నం నిరంతరం చేస్తుంటాడు. దాని స్పర్శ ఏ కొంచెం దొరికినా, మళ్ళీ మళ్ళీ దాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటాడు.

అయితే అలవాట్లు, అంటే, బలమైన వాసనల వల్ల, అంతర్లీనంగా ఉన్న వ్యక్తిత్వకాంక్షల వల్ల, దొరికిన నిజస్థితి అవగాహన నుండి జారిపోతుంటాడు. ఈ కావ్యంలో కూడా కవి తనకు దొరికినట్లే దొరికి చేజారిపోతున్న స్వస్థితి స్పర్శ కోసం వేదన పడతాడు. తన నిజస్వరూపం కోసం అల్లాడుతుంటాడు. తానే తయారు చేసుకున్న తన మనోనిర్మాణంతోనే నిరంతరం గాయపడుతూ, దాన్ని దాటిన స్వస్థితి కోసం కలలు కంటాడు. అటువంటి తాత్వికకవి మనస్సును, తపనను ఈ కవిత్వం నిండా చూడవచ్చు.

ఏ "అనుకోవడాలు” ద్వారా, ఏ అలవాట్ల ద్వారా, ఆలోచనల ద్వారా ఈ మాయాప్రపంచంతో మానసికబంధం ఏర్పరచుకుని ఓ మనోనిర్మాణపు వలయంలో చిక్కుకున్నాడో కవి, ఆ నిర్మాణాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ, లోకంతో సమన్వయం కోసం, తన శాంతి కోసం, తప్పిపోతున్న తనకు, తానే బోధించుకుంటూ, తిరిగి దారిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తనను తానే ఓదార్చుకుంటూ అమృతఘడియల వైపు ప్రయాణిస్తున్నాడు. తన జీవనయాత్రలో ఎన్నిసార్లు దారి తప్పి దుఃఖపువలలో చిక్కుకున్నా, తిరిగి మళ్ళీ మళ్ళీ లేస్తూ, ఏ మానసికఛాయలు లేని అమ్మలాంటి సహజప్రకృతి ఒడిలో సేద తీరుతూ, తనదైన రాగంలో పాటలు అల్లుకుంటున్నాడు కవి.

3

ఈ కావ్యమంతా తనే గురువు, తనే శిష్యుడు. తనే తండ్రి, తనే బిడ్డా. వేదన తానే, ఓదార్పు తానే. కవి అత్యంత సున్నితత్వం గలవారు. ఆ సున్నితత్వంలోంచే తన్ను తాను ఆవిష్కరించుకుంటున్నారు. తన సంతోషాల్ని, దుఃఖాల్ని, గాయాలను, ఆత్మానందాన్ని, భయాల్ని, ఓదార్పుల్ని, కన్ఫెషన్స్ ని, తాను శాంతిని పొందుతున్న తావులని కవితలుగా మలిచారు. ఎవరికో ఏదో చెప్పడం కాకుండా తనకు తాను లోపలి టోన్లో చేసుకుంటున్న ఆత్మావిష్కరణ. ఇది ఓ రకంగా భిన్న ప్రయోగం. తన కవితాశక్తి ద్వారా కవి తన మనోభూమికపై ఎగసిపడుతున్న అలల సముద్రానికి పటం కట్టి తనను తాను చూసుకుంటున్నాడు. మనల్ని మనకూ చూపిస్తున్నాడు. ఐడెంటిఫై చేసుకునే వాళ్ళకు కవి చాలా దగ్గరగా తోస్తాడు. దిస్ ఈస్ ఎ వెరీ యూనిక్ అండ్ సెన్సిబిల్ టోన్.

జననం, మృత్యువు, మనస్సు, విముక్తి, సత్యం, అసత్యం, స్వర్గం, కల, మెలకువ, గాయాలు, నవ్వులు, ఏడుపులు, సుఖం, ప్రేమ, దయ, శాంతి, అసూయ, దిగులు, వేదన, ఆనందం, కలత, లాలస, స్పర్శ, దుఃఖం, వెలితి, గాయం, క్షమా, స్నేహం, ఏకాంతం, నిట్టూర్పు, పోలిక, కోరిక, ఓదార్పు, భయం, బాధా, ఆశ్చర్యం, మంచీ, చెడూ, అనుమానం, అనంతం, జ్ఞానం అనే ఈ జీవనకోణాలన్నిటి వెంట కవి పదేపదే ప్రయాణించి తన నిశ్శబ్ద ఏకాంతానికి చేరుకునే ప్రయత్నం చేస్తుంటాడు.

ఈ కావ్యంలో వాడిన సింబాలిక్ ఇమేజెస్ మొత్తం చూస్తే, కవి రాగ ద్వేషాలు అంటని స్వచ్ఛప్రకృతి ముందు తనను తాను హృదయార్పితం చేసుకోవడం వలన, తన త్రోవ ఏమిటో స్పష్టపరుస్తున్నాడు. ఆ ఇమేజెస్: ఆకాశం, నక్షత్రాలు, మేఘాలు, చంద్రుడు, సూర్యుడు, పగలు, రాత్రి, కాంతి, గాలి, నీరు, వెలుతురు, పూలు, కాలం, సూర్యాస్తమయాలు, వాన, మబ్బులు, ఇంద్రధనస్సు, మంచుబిందువు, రంగులు, పిట్టలు, సీతాకోకలు.

ఇలా మనసు సోకని బాహ్యప్రకృతిని కవి పదేపదే వాడడంలో నిర్మలప్రకృతిని ఆలింగనం చేసుకుంటున్న తీరును గమనిస్తే, లోకం, మనుషుల తీరుకన్నా, తనను గాయపరచని, దుఃఖపరచని ప్రకృతి జాడలే తనకు సుఖమని సింబాలిక్గా నమ్ముతున్నాడు. అంతేకాకుండా మనోమాలిన్యం లేని, తన లోపలి సత్ వస్తువు పట్ల ఎట్లా తపించిపోతున్నాడో కూడా ఈ సింబాలిక్ ఇమేజెస్ వల్ల అర్థమవుతున్నది. మనస్సు లేని అటువంటి తావుల్లో తన శాంతిని కాంక్షిస్తున్నాడు. ఈ ఇమేజెస్ అన్నీ బయటి వస్తువులుగా కనబడుతున్నా, మనస్సు అంతమయ్యే లోపలిచూపుకు దారిగా కవిని అవి గట్టిగా పట్టుకుంటున్నాయి.

కవి ఎక్కడ ఉన్నాడని చూస్తే, కవితల్లో ద్వంద్వాల మధ్య మానసికయుద్ధం చేస్తున్నాడు. వీటిలో లోకంతో పొసగక అశాంతితో, ఇక వెళ్ళిపోతాను అన్న కవితలూ ఉంటాయి. జీవితేచ్ఛతో సమన్వయాన్ని పొందుతూ, హాయిగా బతికిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుని శాంతిని పొందిన కవితలూ ఉంటాయి. తనకు తానే గురువై బోధించుకుని ఓదార్చుకుంటున్న కవితలూ ఉన్నాయి. ఒక కవిత నుండి మరో కవితకు కాంట్రడిక్షన్లా అటూ ఇటూ ఊగిసలాడడం ఉంటుంది. ఒక కవితలో జీవితామృతం దొరికిందని జీవితేచ్ఛను వ్యక్తం చేస్తారు, మరో కవితలో జీవితం దుఃఖమయమని నిరాశను వ్యక్తం చేస్తారు. ఇవి ఆయా సందర్భాల్లో కవి మూడ్స్్స్న రిఫ్లెక్ట్ చేస్తాయి.

రచయిత, సత్యాన్వేషి చలంగారు కూడా తన నలభై ఏళ్ళవయసులో జీవితం చాలా నిరాశగా ఉంది అన్నారట. ఏభై ఏళ్ళ వయసులో ఇక జీవితంలోంచి వెళ్ళిపోవాలనుకున్నారట. అరవై ఏళ్ళు వచ్చేసరికి అసలైన జీవితం ఇప్పుడే మొదలైంది అన్నారట! ఇక్కడ అరవై ఏళ్లకు చేరుకుంటున్న కవి మనోభావాలు కూడా ఆశనిరాశలవలయంలో చలిస్తూ ఉంటాయి. గ్రౌండ్వల్లో ఉండి తనను తాను ఆవిష్కరించుకుంటున్నారు. రోజువారీ డైరీ రాసినట్లు, సందర్భాలను బట్టి ఈ కవితాశిల్పాలను మనసుపెట్టి చెక్కారు. అందుకే కవిని చదువుతూ మనల్ని కూడా అందులో చూసుకోవచ్చు.

4

కవి మనోరీతిని ఈ కవితల్లో చూడవచ్చు :

"ఈ లోకంలో ఏమన్నా బ్రతికితే, చిన్నపుడు బ్రతుకుతాం, మిగిలిన జీవితమంతా బదులు చెల్లిస్తాం, కాసిని శైశవక్షణాలు అనుభవించినందుకు ఇంత బదులుతీర్చడం అవసరమా అని అడుగుతావు దేవుడిని, ఉండీ, లేనివాడిని, లేకుండడంలో దాగినవాడిని, జవాబురాదు, బ్రతికావు కదా కాసిని రోజులో, నిమిషాలో, శుభ్రమైన పసిదనంలో, స్వేచ్ఛలో, భయరహిత క్షణాల్లో, ఏదీ గుర్తుండని కాంతిలో, చెల్లించి వెళిపోవా మిగిలిన బరువైన రోజుల్ని". ఇలా కవే తనను బ్రతిమాలుకుంటూ, సంవేదనను అనుభవిస్తూ, భారమైనా సరే మిగతా జీవితం గడపాలి అంటాడు. ఇదంతా భయావహ ప్రపంచం అంటాడు.

"జీవించడం అసౌకర్యమైన అనుభవం, పీడకలలవేళ దేహం కూడా కదిలినట్లు, జీవితం నుండి మరణంలోకి నిన్ను నీవు బ్రతిమాలుకుంటావు" అని తనను మరణంలోకి లాక్కొంటాడు. మనుష్యులతో తనకు సంబంధం లేని క్షణాల్లో ప్రపంచం తటాలున విశాలమవుతుంది అంటాడు. మనుషులు తనకేమీ కాని క్షణాలు, వారు తన చేతనలోకి చొరబడని క్షణాలు అద్భుతం అంటాడు. ఉన్నచోటును విడిచి లోపలికి వెళ్ళకుండా, బయటకి రాకుండా తనలోని భయమే తనను అడ్డుకుందని వాపోతాడు. దుఃఖపు తేనెపట్టు పిండి, జీవితం చప్పరించాలని చూశారట, కానీ చివరకు విషాదమే మిగిలింది అని వేదన చెందుతారు.

తెలియకపోవడంలోని హాయిని పసిపాప తేలికగా అనుభవిస్తుంది, తెలియటం కదా ఇంత దుఃఖానికి మొదలు అని విచారం వ్యక్తం చేస్తారు. రాత్రులు నిదురించే ముందు దైవాన్ని ఇది కడపటి నిద్ర కావాలని ప్రార్థిస్తారు కవి. "విసుగుపుట్టే రోజున తెలివిలేని సినిమాకు వెళ్ళినట్లు తీరికగా చేరుతావు ఈ లోకంలోకి, ఇది బాలేదు, అయినా వెళ్ళలేవు, అట్లాగని ఉండాలన్న ఉబలాటం లేదు” అని తన మనోస్థితిని ఆవిష్కరించుకుంటారు.

కవి బ్రతికి ఉన్న క్షణాలు, తన జీవితంలో తనకు హాయిని, ఆశ్చర్యాలను ఇచ్చిన అద్భుతాలని కూడా ఇలా వట్టుకుంటాడు :

పున్నమి చంద్రుడు నెమ్మదిగా ఎగురుతున్నపుడు, ఇంద్రధనువులు రంగులని విరజిమ్ముతున్నపుడు, ఉదయపు వెలుగు, పిట్టలు పాడడం, లేళ్ళు గెంతడం, పిల్లలు నవ్వడం, యవ్వనం ప్రేమించుకోవడం, సెలయేళ్ళు ప్రవహించడం, సూర్యుడు కాంతిని విరజిమ్మడం, అమ్మ బిడ్డతో దోబూచులాడడం, తనతో తాను హాయిగా నవ్వుకున్నపుడు, తన బిడ్డను కడుపారా కావలించుకున్నపుడు, ఆజన్మాంతం గాలిపటంలా ఎగిరే ఆకాశాన్ని చూసినపుడు, ఎండ పాడుకునే సన్నటి నేపథ్య సంగీతం విన్నపుడు, చేపల్లా ఈదే రాత్రులను, పగళ్ళను చూసినపుడు, ఇట్లాంటపుడు తాను మృత్యువును దాటాను అంటాడు.

వాన కురిసినప్పుడు తనకు తాను దక్కుతారట! ఎడతెగని వాన తనను కాగితపు పడవ చేసి ఎటైనా తీసుకపోతే బాగుంటుందని ఎదురుచూస్తాడు. ఉదయాలు బంగారాన్ని వెదజల్లింది తన ప్రశాంతమైన చూపు కోసమే కావచ్చు అంటాడు. ఉదయం గడ్డిపరకపై వాలిన మంచుబిందువు, దానిలో ఆడుకుంటున్న రంగులు, ఏవీ పట్టకుండా ఓ బైరాగిలా ఊరిలో, తన ఇంట్లో తిరుగాడే క్షణాలుంటే అద్భుతమంటారు. ఇలాంటివి తాను బతికున్న క్షణాలకు గుర్తులుగా ఉన్నాయంటాడు.

కవి తనను తాను ఓదార్చుకుంటున్న క్షణాలు :

నీలోంచి నవ్వు వస్తే రానివ్వాలి, భయం పుడితే పుట్టనివ్వాలి, పూలు రాలుతుంటే రాలనివ్వాలి, సీతాకోకలని ఎగరనివ్వాలి, గాలి వీచినట్లు సహజంగా, నీరు పారినట్టు సరళంగా జరగనివ్వాలి, వెళ్ళనివ్వాలి. తేలికగా ఉండాలి, తెలియనట్లు ఉండాలి, ప్రపంచాన్ని తన కల కననివ్వాలి, పెద్దగా గొడవపడేదేం లేదు ఇక్కడ, అంతగా నిలబెట్టుకోవాల్సింది కనరాదు, కాలం గడిచిందా లేదా అన్నట్లుండాలి, స్థలమొకటుందా లేదా అనుకోవాలి, ఊరికే కదలాలి, మాట్లాడాలి, అలసటతో హాయిగా నిద్రపోవాలి, కడపటిబిందువు ఎదురైనపుడు తృప్తిగా దానిలో లీనం కావాలి.

అనుకునేంత భయావహం కాదు, ఊరికే ఉండు కాలువలో నిశ్శబ్దంగా పారే నీటిలా, బ్రతకాలని చూడకు, పోవాలని కూడా, ఉండటమే చాలు, అంతకన్నా నీ నుండి ఈ గాలి కోరేదేమీ లేదు అని ఓదార్చుకుంటారు. మనమా బ్రతికేది, వెళ్లిపోయేది, జీవితం తనను తాను చూసుకుంటుంది, నమ్మకం లేకపోతే నీలాకాశం కిందికి వెళ్ళి చూడు విప్పారిన నేత్రంతో నిన్ను చూస్తూ నీకు నమ్మకాన్ని ఇస్తుంది అని తనకు తాను ఓదార్చుకుంటూ తేలిక పడతారు .

మృత్యువు గురించి ఇలా వివరిస్తారు :

“చూస్తూ ఉండగా కాలం చివరికొస్తుంది, పలుసంధ్యలు పూలలా రాలిపోతాయి, పలు చందమామలు ఉదయాల్లో కరిగిపోతాయి, ప్రేమ నిండిన నవ్వులు తడి నిండిన బంధాలు, చూస్తూ ఉండగా పొడిబారిపోతాయి, కాలం చివరికొస్తుంది, కలలు చివరికొస్తాయి, దుఃఖాలు చివరికొస్తాయి, బ్రతుకు భయం చివరికొస్తుంది, స్వర్గమో నరకమో తెలీని ప్రపంచానుభవం ముగింపుకొస్తుంది, చూస్తూ ఉండగా గాఢమైన దిగులులోంచి కాంతివంతమైన మృత్యుపుష్పం నీ ముందు దయగా విచ్చుకుంటుంది”. ఇంకోచోట “ఈ మృత్యువు ఇంత విశాలమైనది, శబ్దాల పక్షులూ, రంగుల చేపలూ సంచరించే జాడైనా లేని పరమ చల్లనిశాంతి గుండెలకి హత్తుకుంటుంది” మృత్యువుని ఇలా కాంతిగా, శాంతిగా వర్ణించడంలో కవి వైరాగ్యాన్ని కొత్త టోన్ లో ప్రకటిస్తున్నారు.

ఈ కావ్యంలోని కవితలన్నీ చదివాక, కవి తాను నిర్మించుకున్న ప్రత్యేకలోకంలోకి మనల్ని తన వెంట తీసుకెళ్లి, తన దుఃఖాన్ని, భయాల్ని, తన సంతోషాన్నీ, తాను బతికిన క్షణాలను, తన ప్రేమగీతాలను, తన ఆత్మను మనకి నిర్మొహమాటంగా విప్పి చెప్పి మనల్ని సహానుభూతికి లోను చేస్తారు .

5

కవి తనను తాను ఆవిష్కరించుకున్న కావ్యం ఇది. ఒకరకంగా ఇది కన్ఫెషన్ స్టేట్మెంట్. ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ జీవితేచ్ఛతో లేచే ప్రయత్నం. మనుష్యులు, మనసులేని మరోలోకంలో విహరించాలని కవికి బలంగా ఉంది. ఊగిసలాట నుండి స్థిరత్వానికి వెళ్ళిపోవాలనే కాంక్ష అంతర్లీనంగా బలంగా ఉంది. సాధారణంగా కవిత్వంలో తాత్వికత ఉంది అంటారు. కానీ, ఈ కవిలోని తాత్వికకాంక్షనే ఈ కవిత్వాన్ని ఓ నెపంగా ఎన్నుకుని కావ్యమై ప్రవహిస్తున్నది. 

అందుకే ఈ కవిత్వం మొత్తం ఈ కొస నుండి ఆ కొస వరకు ఏదో అశాంతి. ఆ అలజడిని తిరిగి శాంతిలోకి తీసుకువెళ్లాలనే తపన, ప్రయత్నం కనిపిస్తుంది. మళ్ళీ అశాంతి. ఇది పరంపరగా కొనసాగుతుంది. ఎప్పడికప్పుడు ఇలా తన మూడ్స్ రికార్డ్ చేయడం కవి నిజాయితీని చెబుతుంది.

ఎందుకు జారిపోతుంటాము?

లోపల ఉన్న వాసనలు (లేటెంట్ టెండెన్సీస్), అలవాట్లు, భయాలు, ఐడెంటిటీ, ఆలోచనలు, వ్యక్తిత్వకాంక్ష, కొనసాగాలనే ఇచ్ఛ ఇవన్నీ స్వేచ్ఛలోకి, విముక్తిలోకి దూకాలనే కాంక్షను అడ్డుకుంటాయి. స్వస్థితిని మరుపుకు లోను చేస్తాయి. కేవలం ఇక్కడ కవికే కాదు, అనేకానేక మహాసాధకులకి కూడా ఆ అనుభవం దొరికినట్లే దొరికి జారిపోతుంటుంది.

ఎందుకంటే, కన్స్ట్రక్టెడ్ ఇగో దట్ ఈస్ ద అప్పారెంట్ ఐ, విచ్ ఆల్వేస్ ట్రెస్ టు లివ్ ఇన్ సెపరేషన్, యాజ్ సపరేట్నెస్ ఈస్ ఇట్స్ డియరెస్ట్ ఫుడ్. ఇన్ సెపరేట్నెస్, ద ఫాల్స్ ఇగో ఎంజాయ్స్ ద టేస్ట్ ఆఫ్ డిఫరెన్స్ టు కంటిన్యూ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. నీవు, నేను; చావు, పుట్టుక; అహం, భయం; రాగద్వేషాలు; బంధం, విముక్తి. ఇలా పరంపర కొనసాగుతుంది. అయితే తపన, ఆర్తి కలిగినవాళ్ళు రెడీనెస్లో ఉన్నవాళ్ళు ఎన్నిసార్లు జారిపోయినా, కింద పడ్డా పట్టు వదలరు. తనలోని మలినాన్ని తొలగించుకోవడానికి, పదేపదే ప్రయత్నిస్తారు. తనను తాను లోలోపలికి చూసుకుంటారు. తనలోని శాంతిని అడ్డుకున్న తెరలను తొలగించుకుంటారు.

తనకు తాను తయారుచేసుకున్న ఈ నేను (ఇగో) అనే మనోనిర్మాణాన్ని కరిగించుకోవడం ఓ మహాతపస్సు. అది కరగడానికి ఇష్టపడదు. పోవడానికి అసలే ఇష్టపడదు. భయాన్ని, అభద్రతను ఎగదోస్తుంది. కళ్ళకు గంతలు కడుతుంది. మన అసలు తావును మరపులోకి తీసుకెళ్తుంది.

విముక్తి అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడడం. కన్ఫ్యూషన్ క్లారిటీగా మారడం. అహం మాయమవడం. దుఃఖానికి లోను కాకపోవడం. భయం నుండి విముక్తి చెందడం. ఎరుకతో ఆ అనుభవంలో ఉండడం. సదా వర్తమానం అనుభవంలోకి రావడం. విముక్తి అనేది ఎక్కడో లేదు, అది ఇపుడు ఇక్కడే నాలోనే ఉందని, నేనై ఉందని తెలుసుకోవడం.

ఇక అప్పుడు ఆలోచనలుండవా? ప్రపంచం ఉండదా? కుటుంబం ఉండదా? ఉన్నదంతా సత్యమే. ఎప్పటిలాగే అన్నీ ఉన్నట్లు ఉంటాయి. అందరూ ఉన్నట్లు ఉంటారు. కానీ ఏదీ నిన్ను అంటదు. చేయాల్సినవి అన్నీ చేస్తావు, కానీ నీవు చేసినట్లుగా ఉండవు. లేస్తావు, పొలానికెళ్తావు, పంట పండిస్తావు, తింటావు, పడుకుంటావు. ఎప్పటిలాగే కుటుంబంతో ఉంటావు, నవ్వుతావు, ఏడుస్తావు, అన్నీ చేసినట్లుగా ఉంటావు, కానీ ఏమీ చేయవు. పాత్రోచితధర్మం నిన్ను నడిపిస్తుంది. పాత్రోచిత రియాక్షన్ ఉంటుంది.

భేదం కేవలం ఉన్నట్లుగా ఉంటుంది, కానీ ఆ భేదం వల్ల దుఃఖం ఉండదు. ఎందుకంటే ఆ భేదం నాటకీయమైనది. ఏకత్వం అనే తెరమీద నటించే పాత్ర అది. కంటిన్యుటీ తాడు తెగిపోతుంది. కంటిన్యుటీ ఉన్నట్లుగా ఉంటుంది, కానీ కలలాగా ఉంటుంది. ఉన్నది నీవే, జరుగుతున్నట్లు అనిపిస్తున్నదంతా నీలోనే అని తెలుస్తుంది. మేలుకున్న తరువాత కల నిన్ను అంటనట్లుగా, ఏవీ నీకు అంటవు. ఎప్పుడూ ఏమీ జరగలేదు అనే అనుభవంలో ఉంటావు.

ఇది ఆలోచననో, ఊహనో కాదు, వాటి ప్రమేయం ఏమాత్రం లేని నీ ఉనికి. శరీరంలో నేను ఉన్నాను అన్న స్థితి నుండి నాలో శరీరం ఉంది అనే షిఫ్ట్ జరిగి శరీరానికి ఎడంగా అవుతావు. శరీరం మనస్సును సృష్టించదు, మనస్సే శరీరాన్ని సృష్టిస్తుంది అని అర్థమవుతుంది. ప్రపంచంలో నేను ఉన్నాను అనే స్థితి నుండి ప్రపంచం నాలో ఉంది అనే షిఫ్ట్ ను చూస్తావు. గతం కలలాగా ఉంటుంది. మూడు కాలాలు, స్థలాలు 'నేను' అనే తెర మీద వచ్చి పోతున్నట్లుగా ఉంటుంది. తేలిక. బరువు ఉండదు. ఇది నీకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని వివరించడానికి అవసరానికి పదాలు వాడుతావు గానీ, పదాలలో అది ఇమడదు అని తెలుస్తుంది. అందుకే నీలో నీవు నవ్వుకుంటావు. ఉంటాయి. కలగా నీవు ఎరుకతో ఉండడం కాదు, ఎరుక నీతో ఉంటుంది, నీవై

ఉంటుంది. నీలో పొంగే కరుణ, ప్రేమ నీ ప్రయత్నం లేకుండానే విప్పుకోవడం చూస్తావు. విముక్తి అంటే ఏదో కొత్తగా సాధించేది కాదు, అంతవరకు నిన్ను కప్పివేసిన మాలిన్యతెరలు ఏవో తొలగిపోవడం, హృదయం శాంతితో నిండడం. నీవు సదా మార్పు లేకుండా ఒక్కలాగే ఉన్నావని, మార్పు అంతా నీ మీద వచ్చి, పోతున్నది కానీ అది నీవు కాదని తెలుస్తుంది.

తన పైన ప్రవహిస్తున్న ప్రసాద్ అనే వ్యక్తిని తొలగించుకోవడానికి

అనేక ఎత్తుపల్లాలను, దుఃఖాలను, అనుభవాలను చూసిన కవి చివరకు "బోనులో సింహం ఆకలితో లొంగినట్టు, జీవితానికి లొంగి చూడు" అంటాడు. "సమస్తాన్ని దేవుడినీడలా ప్రేమిస్తున్నావు" అంటాడు. ఈ భావన గొప్పది. టోటల్ యాక్సెప్టెన్స్ అండ్ సరెండర్ అనేది గొప్పయోగం. అది జారకుండా ఉండాలని, ఆ కాన్స్టాంట్ అవేర్నెస్తో కవి ప్రయత్నం, జీవితం, సాధన సఫలం కావాలని, ఆ నిర్మలశాంతి తీరంలో ఆయన నిరంతరం సేద తీరాలని మనసార కాంక్షిస్తూ!

ఏ . గంగారెడ్డి
హైదరాబాద్
11.11.2025



01 డిసెంబర్ 2025

జీవన గీతం సృష్టి : గార్లంక భగవాన్

అందిన కవిత్వం, ప్రసాద్ గారి  మూడు దశాబ్దాల సుధీర్ఘ జీవన  గీతం  కొన్ని పుస్తకాలుగా విడివిడిగా అలరిస్తుంది. అరుదైన కవి అద్భుతమైన వాక్యాలు, మహాత్మాగాంధీ తాను విచారానికి కలవరపాటుకు గురైన ప్రతిసారి  భగవద్గీత సాంత్వన కలిగిస్తుందని చెప్పుకున్నారు. BVV Prasad's Poetry నావరకూ ఆకోవకు చెందినదే , ఒక్కటే అసూయ ఇవన్నీ నా అక్షరాలే ప్రసాద్ గారి ద్వారా వెలువడుతున్నాయి అని , ఇలాంటి కవి మన భాషలో ఇంతకాలం జీవం తొణికిసలాడుతూ కొనసాగటం భాషకు గౌరవం. ఈ నల్లనివాడు పద్మనయనమ్ములవాడు మహా శక్తిమంతుడు.  ఏముందిలే అదే వాక్యం అదే భావం మళ్ళీ మళ్ళీ అదే కదా అనుకుంటామా ఛటేల్మని ఓ వాక్యం వీపు చరుస్తుంది , ఎంతో సంక్లిష్ట భావాన్ని అలవోకగా చిటెకేసినట్లు అలా విసురుతారు అంతే మనసు జిగేల్మని రగులుతుంది  . "ఛ్ఛా"  ఏం చెప్పారు  ఎంతటి భావాన్ని ఇంతందంగా చెప్పారు కదా అనిపిస్తుంది.  ఈ కవికి పరాజయం  తొట్రుపాటు ఆత్మన్యూనత లాంటి మామూలు మనుఘలకు వుండే అవలక్షణాలేమీ లేవు.   మనల్ని ఏ వేళనైనా తన సహజ సుందర  వాక్యంతో ఆత్మీయంగా  హత్తుకునే మహత్తుగలవాడు . ఇంతకీ" సృష్టి " ఎలా వుందీ అనే ప్రశ్నకు ప్రసాద్ గారి కవిత్వం  పైకి ఆత్మాశ్రయంగా కనిపిస్తుంది కానీ జీవితాన్ని సాహిత్యాన్ని లోతుగా అరగదీసిన  అనుభవశాలురను తీవ్రంగా అలరిస్తుంది . ధన్యవాదాలు ప్రసాద్ గారు 

Thank you Bhagavan Garlanka garu for writing this!










30 నవంబర్ 2025

తేన త్యక్తేన భుంజీథాః - ఈ ఈశోపనిషత్తు వాక్యాన్ని స్ఫురింపచేసిన కవితలు- ' సృష్టి'.

మూగవాడు తిన్న పంచదార ఈ సృష్టి, కవులు తన గురించి మాట్లాడకపోతే. కవి పలకటం మొదలు పెట్టినపుడు, లోకానికి, అప్పుడు సంతోషం, తన తరఫున ఒక గొంతు విచ్చుకుందని, తనకొక ప్రతినిధి దొరికాడని. 
 కానీ, కవి చాలా సార్లూ తన గురించే మాట్లాడతాడు. అలా మాట్లాడినా సృష్టికి అది తన గురించి లాగే వినిపిస్తుంది. 
 అలా తనను కవి చిరంజీవి చేస్తాడనే ఆనందం. 
 మరి కవి? అతని కవిత?
 అమృతం కురిసిన ఆ రాత్రి , అందరూ నిద్రపోతున్నప్పుడు తను అమరుడనయ్యానని ప్రకటించాడు తిలక్. 
నిజానికి ఒక ‘వాన కురిసిన రాత్రి’ కదా, తను తప్ప మరెవ్వరూ, ఎక్కడా లేని ఆ నాటి రాత్రి కదా, అతని చేతన పూర్తిగా మేలుకుని ‘విరహిణి కన్నులా, ఎర్రనై , ఏకాంత సరసున కలువ వంటి దీపశిఖ’ యై మేలుకున్నది, ఇక్కడి నుంచే అమరలోకాలను కూడా వెలిగించింది. 
 ‘సృష్టి’ కవికి తెలుసు తనకు ఒక్క వాన చాలని. అమృతం అక్కరలేదు, అమరత్వం కాదు ఇతని కోరిక. విలీనం ఈ కవి వాంఛ. 
 ‘వాన కురిసిన రాత్రి’ తనను కేవలం ఒళ్ళు తడిపి, ఒక చిన్న నీళ్ళ గుంట చేసి ఇచ్చి, దాంట్లోకి కాగితం పడవ చేసి వదులు అని చెప్పే పిల్లవాన కురవవద్దు తనకు.
వర్షం తనకు ప్రళయపరిమాణంలో కురవాలి. “నను అది కాగితం పడవ చేసి లాక్కుపోవాలి”. “నోవా పడవకు దొరకకుండా” కొట్టుకుపోవాలి ఆ వర్షంలో అని కోరుకుంటున్నాడు.
పునః పునః పుట్టుచావులకు తనను దొరకనీయకుండా మహాప్రళయంలోకి లయం చేసే వర్షం కావాలి. 
ఇదేమి కోరిక! 
కవి అయినా కాకపోయినా, ఆలోచించే మనిషిగా పుట్టిన ప్రతివాడికీ, ప్రపంచం కావాలి…ప్రపంచం వద్దూ. 
రెండూ బలమైన ఆశలే. మధ్యనున్న తలుపు రెక్క తీసి తనదైన గది లోంచి గవాక్షం ఉన్న పెద్ద నడిఇంట్లోకి తను వెళ్ళివచ్చినంత సులువుగా తను ఆ రెండు స్థితులలోకి వెళ్ళివస్తుండాలనుకుంటాడు. కానీ, ఈ తలుపును యథేచ్ఛగా వేసీ, తీస్తుండే విద్య అంత సులభంగా అబ్బేది కాదే. 

సృష్టి ఏర్పడినప్పటినుంచీ దీనికి అవతల ఏముందా అని కుతూహల పడేవారు తక్కువ లేరు. 
దీన్ని మించి అవతల మరేం లేదు, భయం లేదు మీకు అనేవారూ ఎక్కువే ఉన్నారు. ఈ రెండుమాటల సమన్వయాన్ని కవిత్వం ద్వారా సాధించటం ఒక వ్యాపకం.
కవిది ఎప్పుడూ ఒక అందమైన అసంబద్ధ ఊహ. అయినా దాన్ని శాస్త్రబద్ధంగా క్షుణ్ణంగా అల్లుతాడు.
సత్యమూ స్వప్నమూ చెరొక పోగు తన నేతలో. వెలి చూపు కొంత, అంతర్దృష్టి మరింత. 
సుకవి బాహ్యాన్ని చూస్తూ తననూ, అంతర్దృష్టితో ప్రపంచాన్నీ అనుభవంలోకి తెచ్చుకుంటాడు.
కవిత్వం లోది తన వ్యక్తీకరణమా? దాని నుంచి విముక్తా? 
రెండూ! 

మొదటి టాస్క్ గా ఈ కవి, సృష్టి ఎలా వచ్చింది అని ఒక పిల్లవాడు అడిగిన ప్రశ్నకు తల్లిలా జవాబు చెప్తాడు. దేన్నైనా సూక్ష్మం చేసి తేటగా చెప్పగలది తల్లి గాక మరెవరు! వస్తువు పనిచేసే తీరు తెలియాలంటే దాని నిర్మాణ రహస్యం తెలిసుండాలి ముందు-
         కొన్ని రంగులు వంపు, గీతలు గీయ్, కదిలించు వాటిని కాస్త, చివరగా నీకు తెలిసిన ఉద్వేగాలు కలుపు, అంతే! కొండలూ నదులూ పగలూ రాత్రి ప్రేమా ద్వేషాలతో సమస్త లోకాలూ నీ తెల్లకాగితం మీదనే అంటాడు కవి బ్రహ్మ. 
సృష్టికి ముందరి శూన్యాన్ని, కవితకు మునుపటి ఖాళీ కాగితాన్ని సిద్ధం చేయటమే కవి పని. కవి లయకారుడు.
అప్పుడు కవిత్వమో, తత్త్వమో తనే వచ్చి తనను రాసుకుంటుంది అంటుంది కవి చేతన. 

 ఆ ఖాళీ చేసుకోవటమే ఈ కవితలు. 
ఇతను భగవాన్ రమణుల భక్తుడు.

సకలమూ తనలో నింపుకునేప్పుడు ఇతడు, అరుణాచలం లో చలాన్ని కూడా చూసినవాడు. 
కొండ తండ్రిలానూ కనిపిస్తుంది - అరుణాచలం నీవు కాక మరేమిటి అనీ అంటుంది: “కొండంత అద్దంలో నీవే కనపడతావు”.
కల్తీలేని వైరాగ్యం, నిండు జీవన లాలస - ఈ రెండూ పరస్పర విరుద్ధాలు కావు ఒకే నాణేనికి ఇరు ముఖాలని తెలిసిన కవితలివి.
కల్పము, వికల్పము.
“పగలంతా గగనంలో చాప పరిచి నిద్రపోయిన పగటి ఎండ చాప చుట్టగానే తెల్లని చుక్కల నల్లనేల తళతళలాడుతుంది” పిల్లల కథ కోసం చేసిన కల్పనలా కనపడుతూన్న ఈమాట, పగటి వెలుగు ను నమ్మవద్దు, అది విశ్వరహస్యాలకు మనలను అంధులను చేస్తుంది అని హెచ్చరించే గంభీర ఉపనిషద్ స్వరం. మరో నిమిషం లో వల్లమాలిన గారాబం తో ముద్దు చేస్తాడు ఈ ప్రపంచపు రంగులను - “గునగనా నడుస్తూ ఆరిందాల్లా వస్తాయి రంగులు, అంతటినీ చక్కదిద్దే ఘనుల్లా.” ఈ రంగులే మరి “లోకం మీద నీ ఆశలు నిలిపేవి, ఆశల మీద ఈ లోకాన్ని నిలిపేవి.”
రాగము లోకాన్ని నిలబెడుతుంటుంది. దాన్ని విరాగము రద్దు చేస్తుంటుంది. 
జ్ఞానికి రెండవది మాత్రం సమ్మతం. కవికి రెండూ ప్రియమే. ఆశ, దుఃఖం రెండిటి రుచీ తెలిసినవాడు. 
“అస్తమయబింబం ఆకాశంలోకి విసిరే చివరి నారింజకాంతి లా ఎంత దుఃఖంలోనూ ఎక్కడో ఉండే ఆశ ఉంటుంది చూసావా!”
ఈ దుఃఖం కానీ ఆశ కానీ లౌకిక వస్తుపరమైనవేనా ! వాటికి అతీతమైన నిగూఢ సత్యాన్ని అధ్యయనంచేసేవారికి కూడా కళ్ళతడి తప్పదేమో. 
ఆశ, కోరిక, లాలస తెగవు. తరువాత ఏమిటి అనేది ఆలోచించటమూ మానవు. అదే ఆ కళ్ళ తడి. అందుకే ప్రేమ.
“జీవితం ప్రియురాలి రూపంలో నన్నే చూసుకుని ఆశ్చర్యపోతూ ప్రేమిస్తున్నాను.” 
వస్త్వేకత్వం! జీవితం, తనూ, ప్రేమా వేరు వేరు కాదు. ఈ మాటలను మేధ కు పరిమితం చేయక అనుభవానికి తెచ్చుకుంటున్న కవి సమయాలేమో ఇవి. 
“జీవితం నీ ద్వారా తనని తాను కావలించుకోవాలని చూస్తోంది, విలువలనూ, భయాలను విప్పుకుని నగ్నంగా దూకగలవా ఇదే జీవితం అని గట్టిగా అనిపిస్తున్న ప్రేమలోకో, అందంలోకో, అనుకంపనలోకో? అడుగుతుంటారు నిన్ను లోపలి నుంచి.” క్షణక్షణం కఠినమైన అగ్నిపరీక్ష పెడ్తూ లోపల్నించి ఈ ప్రశ్నలు అడిగేవన్నీ గురువులే. 

ప్రవర్తనలో విశృంఖలత్వమా! కాదు. నిజ తత్త్వానికి పడిన శృంఖలాలను విరగగొట్టటం. 
“నీటి బుడగపై తిరుగాడే బొమ్మలాంటిది ఈ ప్రపంచం.” 
కంటిపాప అనే నీటిబుడగ. 
అది చూస్తుంటుంటేనే ఇవన్నీ ఉంటుంటాయి.
ఈ ఎఱుక వచ్చాక కూడా “నేల మీద నమ్మకం పోదు, ఆకాశం మీద నమ్మకం కలగదు. ఆకాశం ఇచ్చే సుఖంలో స్వేచ్ఛ లోని ఒంటరితనం అయిష్టం” అంటాడు. కారణం? “నేల మేల్కొలిపే కరుణ ఇష్టం.” “నేల దుఃఖదాయిని.” 
ఇంతకన్నా క్లుప్తంగా మనిషిగా పుట్టడంలోని సార్ధకత ఏది చెప్పగలదు! నీ దుఃఖం నిను శోకం కాదు చేయవలసింది. తక్కిన లోకం కోసం కరుణగా మారు. కరుణ గా మారటానికే ఈ నేలకు వచ్చాడు మనిషి. కానినాడు నేల కు మరి వేరే ప్రయోజనం లేదు అని గట్టిగా నమ్మే కవి. 
అందుకే ఈ జీవితం ఇష్టం.అది ఇచ్చే ఏ అనుభవమైనా ఇష్టమే. 

అందులో నిండా మునిగీ అది తనను ముంచకుండా చేసుకున్నప్పుడే, “తేన త్యక్తేన భుంజీథాః”- అనే ఈశోపనిషద్ వాక్య సాయంతో సమస్తమూ చూడగలిగినప్పుడే, “ఊరికే జీవితమై” (అతని సృష్టేనా ఈమాట ?) ఉన్నప్పుడే చేయగల కవిత్వసృష్టి ఇది. 

శాంతం లో మూగవాడు. సంతోషం లో వాచాలుడు. రెండూ ఉంటాయని చూడగలిగిన దుఃఖంలో కవౌతాడు.

ఆ కవిత్వం ఈ ‘సృష్టి’ అనే పుస్తకంలో ఉంది.
కావాలంటే 92472 53884 ను అడగండి. 
నేను అలా అడిగే జీ పే చేసే తెప్పించుకున్నాను.

ఈ పుస్తకం గురించీ, కవీ గూర్చి వెనక కవర్ మీది రమణజీవి గారి మాటలు, వెనకమాటగా ఏ. గంగారెడ్డి గారి మాటలు విలువైనవి.

- పద్మజ సూరపరాజు 

Many thanks to Padmaja Suraparaju garu for writing this!


23 నవంబర్ 2025

సృష్టి : బివివి ప్రసాద్ కవిత్వం

 పుస్తకాలు రేపటి నుండి విజయవాడ అనేక బుక్ స్టాల్ లో దొరుకుతాయి. మంచి కవిత్వం ఈ మాత్రం కాపీలు కొనేవారు ఉండకపోతారా అని 300 కాపీలు ప్రింట్ చేయించాను. లేదంటే పీడీఎఫ్ పంచిపెట్టేవాడిని. చూద్దాం, మంచి కవిత్వానికి ఈమాత్రం ఆదరణ అయినా మిగిలిందో, లేదో. పుస్తకం కొనే ఆసక్తి లేనివారు, దయచేసి పీడీఎఫ్ కోసం చూడగలరు. (మనం OTT సినిమా కోసం చూసినట్టు ;))

సృష్టి : బివివి ప్రసాద్ కవిత్వం
144 కవితలు, 250 పేజీలు, 250 రూపాయలు

అనేక బుక్స్, అరసవిల్లి కృష్ణ గారి 
నంబర్ 92472 53884 కి అమౌంట్ పంపిస్తే, 
స్పీడ్ పోస్ట్ లో పుస్తకం పంపిస్తారు. 

ధన్యవాదాలతో..




#సృష్టి #బివివి ప్రసాద్ కవిత్వం #srushti #srishti #bvv prasad poetry #telugu poetry Srishti #సృష్టి కవిత్వం

17 నవంబర్ 2025

AI పాడిన బివివి ప్రసాద్ కవిత

నీలో కొన్నిసార్లు సంపుటిలోని
పూవు రాలేను కవిత ఏఐ ఇలా పాడింది. 
బావుంది. వినండి.

https://suno.com/s/b07VVHFozcCOFEfp

సృష్టి కి రాసుకున్న ప్రవేశిక :

ఈ కవిత్వం..

ఈ కవిత్వం సాంస్కృతిక వినోదం కోసం కాదు. దుఃఖితుల తరపున ఎవరిపైననో నెపం వేయటానికీ కాదు. జీవితం దుఃఖమయమని తమకి తాముగా గ్రహించిన వారికోసం. దుఃఖవిముక్తి కోసం తమలో తాము పెనుగులాడుతున్న వారి కోసం.

జీవిత పరమావధి దుఃఖమా, ఆనందమా అనే విచికిత్సకు లోనైనవారితో జరిపే సంభాషణ ఈ కవిత్వం. అందం, ఆనందం వెలుపలి వస్తువులా, లోపలి సత్యమా అనే చూపుతో వెదికేవారికోసం ఈ కవిత్వం.

నిజానికి, ఇది, కవిత్వమో, కాదో తెలియదు. ఒక భయ, దుఃఖ కంపిత హృదయపు వెదుకులాట ఈ మాటలు. ఒకడు తన విముక్తి కోసం, అవగాహన కోసం, తాను వెదికే తన లోపలికాంతి కోసం తడుముకొంటూ, తనకి తాను బోధించుకొంటున్నవి. తనని తాను ఓదార్చుకొనే యత్నం ఇవి.

జాతులుగా వేరు విలువలకు చెందినా, హృదయంగా మనుషులు ఒకటనే నమ్మకంతో, తన పెనుగులాటలే ప్రతి హృదయంలో ఉంటాయని భావించి, సాటి మానవులతో పంచుకున్న కన్నీళ్ళు, ఓదార్పులు, సౌందర్యాలు, స్వప్నాలు, తెలియరాని గమ్యాలకి అన్వేషణలు.

ముప్పై, నలభై ఏళ్ళుగా ఏం రాసుకుంటున్నాడో అదే, భిన్నమైన ఛాయల్లో, భిన్నమైన కాంతుల్లో, గాఢతలో, లోతుల్లో మళ్ళీ రాస్తున్నాడు.

పుస్తకం ఎక్కడో ఒకచోట తెరవండి. కొన్ని పంక్తులు చదవండి. ఆగి, లోనికి చూసుకొన్నపుడు, వాటి సారంలో మీకు మీరు కనిపిస్తే, లేదా, అవి మీకు ఊరట కలిగించి వుంటే, ఇవి మీ కోసం రాసినవి. కనబడలేదా, ఇవి మీ కోసం కాకపోవచ్చును, లేదా చదివే సమయం వేరే ఉండవచ్చును.

అందరికీ శుభం కోరుతూ..

బివివి ప్రసాద్
7.11.2025
తణుకు

సృష్టి : బివివి ప్రసాద్ కవిత్వం
144 కవితలు, 250 పేజీలు, 250 రూపాయలు
ప్రతులకు : అనేక బుక్స్, విజయవాడ ఫోన్ :  92472 53884 (అరసవిల్లి కృష్ణ)