22 డిసెంబర్ 2025

"సృష్టి" First look , first impression. - CV Ramana

Bvv Prasad గారి కవితాసంకలనం, 'సృష్టి' అందింది . కృతజ్ఞతలు! కవితలు చదివి, పాఠకుని గా ప్రతిస్పందన చెప్పమన్నారు. ఆయన కవితల్లో లోతు తెలిసినవారు, అలా చెప్పడానికి చాలా టైం పడుతుంది అని వొప్పుకుంటారు . 

వీటిలో అధిక భాగం, 2023-25 సంవత్సరాల మధ్య రాసినవి లాగ ఉన్నాయి. మొత్తం 144 కవితలు. 250 పేజీలు. Rs 250/- 

Very rarely he has written so profusely and prolifically ever since I knew him .

ఆయన "రాయాలి"  అనుకుని Will Power తో రాశారా ? లేక ఏదైనా శక్తి పూని ఆయన చేత రాయించిందా ? 

ఆయనే రాశారా? లేకా ఆయన ద్వారా, ప్రసాద్ గారు 'వాహకం' గా, కవిత్వమే ఆయనను పూని రాయిపించిందా? అనేది, ఆయన కవిత్వం, BVV Prasad's Poetry రెగ్యులర్ గా చదివే పాఠకులు అర్ధం చేసుకో గలరు. 

గంగారెడ్డిగారు, స్వాతికుమారిగార్లు ఎపిలోగ్ లు అనగా, పుస్తకం చివరిమాటలు రాశారు. 

Most of his earlier poetry too, was deeply philosophical. నాకు ఆయన అలానే పరిచయం, 2010 నుంచి, due to deep philosophy in his writing. Profound feel. 

2012 లోనో, ఏమో, ఒక కవిత చదివాను. From BVV Prasad sir. కూతురిని కాలేజి హాస్టల్ లో వదిలి, కాస్త దిగులు తో ఇంటికి వచ్చిన తండ్రికి, phone call from his daughter.  

"బెంగ గా ఉంది నాన్నా, ఇక్కడ, ఈ రాత్రి!" అంటూ. 

It made such a profound impact on me that I still remember it today. I could resonate with it deeply. I wish he reproduces it sometime or it's already published in one of his poetry books.

***

"ఎన్నో దుఃఖాలు ఈది, భయాలు దాటి 
ఏళ్ళకి ఏళ్ళు నడిచి
ఈ ప్రశాంతమైన ఉదయానికి చేరుకున్నావు 
ఈ క్షణం స్వచ్ఛ స్ఫటికంలా 
నిలిచిపోతే బావుండుననిపిస్తుందా 
ఇక మెల్లగా మంచులా చెదురుతుంది ప్రశాంతత"

ఈ పీసు, ఒక కవిత లో ని ఈ మొదటి పద్యం , దానిలోని చివరి 2 పాదాలు చదివాక, 30 నిముషాలు, కళ్ళు మూసుకుని ఉండి పోయాను. Reflecting, brooding. 

"ఈ క్షణం, స్వచ్ఛస్ఫటికంలా ఇలానే నిలిచిపోతే బాగుండును అనిపిస్తుందా? 
ఇక మెల్లగా, మంచులా చెందుతుంది ప్రశాంతత!" 

నా మనసు జిడ్డు కృష్ణమూర్తి దగ్గరకు వెళ్ళిపోయింది . 
ఆయన దగ్గరికి వచ్చిన ఒకరు అడిగారు "ఒక్కసారి వచ్చింది ఆ ప్రశాంతమైన ఫీలింగ్. వచ్చి అలా వెళ్ళిపోయింది. మళ్ళీ ఎంత ధ్యానం చేసినా, ఎంత అన్వేషించినా, దొరక లేదు! దాన్నీ మళ్ళీ వెదికి పట్టుకోవడం ఎలా?' అని అడిగారు, కళ్ళల్లో నీటిపొరలతో. దుఃఖంతో.  

JK said, with the compassion of a surgeon's knife "The very demand for continuation or continuity is the denial of it! It will spoil the beauty of it. Besides, demand for continuity will become the genesis for fear of death (మృత్యు భయం), desire, fear and all the rest of it.  What ever happens, let it happen. What ever leaves you , let it leave" అని. 

ఈ పద్యం లో చివరి 2 పాదాలు చదివాక, నన్ను జిడ్డు కృష్ణమూర్తి ఆవహించారు.

18 డిసెంబర్ 2025

మనలో ఒక ఖలీల్ జిబ్రాన్ : రఘు శేషభట్టర్

రాత్రుల్లో విందు చేసే మిణుగురు పుష్పాల్ని ఎండలోకి రమ్మని ఎవరూ అడగరు. చేతుల్లోకి తీసుకున్న బంతిపూల దండ నుండి జాజుల మత్తు కోసం ఎవరూ వెతకరు. వాటి సహజ గుణాలు తెలుసు కనుక గౌరవించి తప్పుకుంటాం. Bvv Prasad కూడా అంతే. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేని అలౌకిక ప్రపంచం తనకుంది. అది దాటి కవిత చెప్పమని అడిగితే కృతకంగా ఉంటుంది..

జీవితం పట్ల తనకున్న ప్రేమను వ్యాకులతను పలు పార్శ్వాల్లో మననం చేసే BVV బహుశా ఖలీల్ జిబ్రాన్ స్థాయి కవి. ఆయన లీనమయ్యే విషయాలేవన్నది పక్కన పెడితే తనను చదువుతున్నప్పుడు, చదివి ఆపినప్పుడు ఒక తల నెరిసిన మనిషి జీవిత సత్యాలేవో చెబుతున్నట్టుంటుంది. ఒక ప్రశాంత గంభీరత తట్టి కుదుపుతుంది.

   ' ప్రేమ ఉంటే పెద్దగా చెప్పేందుకు ఏమీ ఉండదు
     మాటలన్నీ మంచు ముక్కల్లా కరిగిపోతాయి '

   ' లోకాన్ని నువ్వు, నిన్ను లోకమూ చేయగలిగిందేమీ లేదు
     ఒకేచోట తిరిగే గాలిదీ కాంతిదీ వేరు వేరు ప్రపంచాలైనట్టు
     ఒకదానినొకటి ఏమీ చేయలేనట్టు '

     ' ప్రపంచంలో గడిపాక
      ఈత చాలించిన దేహంలా ఏకాంతంలో మునిగినప్పుడు'

ఈ తరహా మాటలు అతి సహజంగా ఉబికి వస్తాయి తన తాజా సంపుటి ' సృష్టి' లో. దిగులు పడినప్పుడు, విడిపోతున్నప్పుడు పొగిలి పోయే మనిషి సృష్టితో చేసే సంభాషణ పుస్తకం నిండా ఆవిరించి ఉంటుంది. ఎన్నో వెతుకులాటలు, దూది అద్దిన భాషణలు సీతాకోకల్లా తాకిపోతాయి.

'ఎవరైనా నిష్కపటంగా ఒక జీవిని ప్రేమించటం చూస్తే ముఖం ప్రసన్నమౌతుంది' అని BVV చెప్పిన మాటల్ని అతని కవిత్వానికి కూడా అన్వయించ వచ్చు.

Thank you Raghu Seshabhattar garu 🙏❤️

16 డిసెంబర్ 2025

సమకాలీన వచన కవులు భక్తికవిత్వాన్ని ఎలా చూస్తున్నారు? : బివివి ప్రసాద్ తో శ్రీవల్లి రాధిక ముఖాముఖి

సమకాలీన వచన కవులలో బి.వి.వి. ప్రసాద్ గారికి తాత్త్వికతను, సత్యాన్వేషణను అందించే కవిగా పేరుంది. వారు కూడా జయంతి పత్రికలో పంచుకున్న అభిప్రాయాలలో తన కవిత్వ లక్ష్యం అదేనని చెప్పడం, భక్తి కవిత్వాన్ని గురించి కూడా ఒకటి రెండు వ్యాఖ్యలు చేయడం గమనించాను. కనుక వారిని కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా సమాకాలీన కవులు భక్తికవిత్వాన్ని ఎలా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చుననిపించింది. 17 జూన్ 2021 నాడు వారితో ఒక ముఖాముఖి నిర్వహించాను. ఆ ప్రశ్నలను, వాటికి వారిచ్చిన సమాధానాలను ఇక్కడ అందిస్తున్నాను.

ప్రశ్న : సమకాలీన కవులలో మీకు తాత్త్విక కవులని పేరు. మీ కవిత్వం తాత్త్విక విషయాలతో నిండి ఉంటుందని మీ అభిమానులు, సహకవులు అనడం విన్నాను.

జవాబు : అవును. తాత్వికత, సౌందర్యస్పృహ నా అభిమాన విషయాలు. అన్నిసార్లూ కాదు గాని, చాలా కవితల్లో నిరపేక్షసత్యం గురించి నాకు అర్థమైన విషయాలు కవిత్వంలో చెప్పే ప్రయత్నం చేస్తాను.

నాకు అర్థమైనంతలో, అద్వైతతత్వమూ, బౌద్ధమూ కూడా అంతిమంగా ఒకటే సత్యాన్ని బోధిస్తున్నట్లు తోస్తోంది. బుద్ధుని శూన్యమూ, శంకరుని పూర్ణమూ ఒకే సత్యానికి రెండు ముఖాలు అనిపిస్తాయి. సత్యాన్ని దృశ్యంగా చూస్తే శూన్యం, ద్రష్టగా అనుభవిస్తే పూర్ణం అని నా నమ్మకం.

ఆ అంతిమసత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకునేందుకు లేదా దానిలో కరిగిపోయేందుకు చేసే సాధనని కవిత్వంగా రాస్తూ వుంటాను.

ప్రశ్న : భక్తి కూడా ఉంటుందా మీ కవిత్వంలో? భక్తి పట్ల మీ దృక్పథం ఏమిటి?

జవాబు : కవిత్వంలో ఉండదు. వ్యక్తిగతంగా నాకు భక్తి ఉంది. కానీ, కవిత్వంలో భక్తిని కాక, జ్ఞానమార్గాన్ని చెప్పాలనిపిస్తుంది.

ప్రశ్న : భక్తీ, జ్ఞానం ఒకటి కాదా?

జవాబు : కాదు, వేర్వేరు. భక్తి అంటే హృదయస్వచ్ఛత. ఉద్వేగసంబంధి. జ్ఞానం అంటే ఉన్నది ఒక్కటేననే అవగాహన. మేథోసంబంధి. భక్తిలో ద్వైతం ఉంటుంది. జ్ఞానం అంటే అద్వైతస్థితి. దానిలో భగవంతుడు, భక్తుడు అని ఇద్దరు ఉండరు.

ప్రశ్న : సిద్ధస్థితిలో భక్తికీ, జ్ఞానానికీ భేదం ఉండదంటారు కదా! అద్వైత గురువులయిన శంకరాచార్యులు, రమణమహర్షీ కూడా భక్తి రచనలు చేశారు కదా!

జవాబు : వారి స్థాయికి వచ్చినపుడు భక్తికి, జ్ఞానానికి భేదం ఉండదు. సాధన స్థితిలో భేదం ఉంటుంది. భక్తికి విశ్వాసం ప్రధానం. జ్ఞానానికి హేతుదృక్పథం ముఖ్యం.

అయితే భక్తి ద్వారా కూడా అద్వైతస్థితిని చేరవచ్చు ననుకొంటాను. భక్తి వలన హృదయశుద్ధి, దానివల్ల బుద్ధి సూక్ష్మత్వం, దానివల్ల అద్వైతానుభవమూ కలిగే వీలుందనిపిస్తుంది.

ప్రాచీనులు భక్తినీ, జ్ఞానాన్నీ అభిన్నంగా చూసినట్లు కనిపిస్తుంది. కానీ వర్తమానంలో ఆ దృష్టి మారుతోంది. ఇప్పుడు భక్తితో సంబంధం లేకుండానే, అద్వైతస్థితికి చేరినవారు కనిపిస్తున్నారు.

ప్రశ్న : సాహిత్యానికి సంబంధించినంతవరకు భక్తి, జ్ఞానాలకు భేదం ఎలా ఉంటుందంటారు?

జవాబు : సాహిత్యంలో భక్తిని చెప్తున్నపుడు సౌందర్య స్పృహ ఉంటుంది. ఒక రూపం గురించి చెప్పడం ఉంటుంది. ఉద్వేగం ఉంటుంది. ఆర్తి ఉంటుంది.

జ్ఞానం అన్నపుడు తాత్వికస్పృహ, నిర్గుణతత్త్వాన్ని చెప్పటం వుంటాయి.

నా మొదటి కవితాసంపుటి ఆరాధనలో భక్తిపరమైన కవితలు కొన్ని ఉన్నాయి. అంటే ద్వైతభావం, సౌందర్యస్పృహ కనిపించే కవితలు. అప్పట్లో నాపైన రవీంద్రుని గీతాంజలి ప్రభావం ఉండేది.

ప్రశ్న : తర్వాతి కాలంలో అటువంటి కవితలు రాయకపోవడాని కారణం ఏమిటంటారు? ఇపుడు భక్తి భావాలు కలగడం లేదా?

జవాబు : భక్తి భావం కలుగుతుంది. అరుణాచలం అన్నా, రమణమహర్షి అన్నా ఇష్టం. భక్తిపరమైన ఉద్వేగాలు కూడా కలుగుతాయి. కానీ కవిత్వంలో వాటిని వ్యక్తీకరించటం లేదు.

ప్రశ్న : దానికి కారణం చెప్తారా?

జవాబు : రెండు కారణాలున్నాయి.

ఒకటి. కవిత్వం మరొకరి కోసమే రాస్తాం. ఎంతగా మనల్ని వ్యక్తపరచుకోవటానికనీ, మన కోసమే రాసుకోవటమనీ చెప్పినా పాఠకుడిని ఉద్దేశించే మాట్లాడతాం. వాళ్ళకి అందేలా రాయాలనే అనుకుంటాం.

ఈ కాలంలో భక్తిని భక్తిలా స్వీకరించే పాఠకులు అరుదు. పాఠకులలో ఇప్పుడు రెండురకాల వారున్నారు. స్వప్రయోజనాల కోసం వారివారి నమ్మకాలని అనుసరించి ప్రార్ధనలు చేయటమే భక్తి అనుకునేవారు ఒకరు. ఒక అనంతశక్తికి చిత్తశుద్ధితో శరణాగతి చెందేవారు మరొకరు.

మొదటివారిని ఉద్దేశించి రచనలు చేసే ఆసక్తి లేదు. రెండవవారిని లక్ష్యం చేసుకుని రాసినపుడు సాకారోపాసన కన్నా, నిరాకారోపాసన తోనూ, సగుణోపాసన కన్నా, నిర్గుణోపాసనతోనూ రాయటం వలన భావాలను హేతుబద్ధంగానూ, సార్వజనీనంగానూ చెప్పే వీలుకలుగుతుందనిపించింది.

ఆకాశం సంపుటిలో రమణమహర్షి గురించి రాసిన కవితని గమనిస్తే ఈ ఎరుక ఎంతగా వుంటుందో తెలుస్తుంది. దానిలో ఎక్కడా మూఢభక్తి ఉండదు. హేతుబద్ధంగా చూసినా ఒప్పుకోగల విషయాలు మాత్రమే చెప్పాను.

ఇక కవిత్వంలో భక్తిని తీసుకురాకపోవడానికి రెండవ కారణం. బహుశా, నేను దానిని రహస్యంగా ఉంచాలనుకోవడం కావచ్చు.

ప్రశ్న : రహస్యంగా ఉంచడం ఎందుకు?

జవాబు : మన వ్యక్తిగత అనుభూతిని, ఒకరిపై మనకున్న ఇష్టాన్ని అందరికీ చెప్పాలనుకోము. భగవంతుడికీ, నాకూ ఉన్న బంధం వ్యక్తిగతం. దానిని కవిత్వంలోకి తీసుకురావడం, బాహాటంగా ప్రకటించడం ఇష్టం లేదు. అలా ప్రకటిస్తే ఆ బంధంలోని పరిమళం పోతుందనిపిస్తుంది. భక్తుడిననే అతిశయం ప్రకటిస్తూ పాఠకులకు కనిపించాలని కూడా లేదు.

ప్రశ్న : ఇపుడు మీరు చెప్పినది జ్ఞానానికీ వర్తిస్తుంది కదా!

జవాబు : నిజమే, జ్ఞానిననే అహంభావం ప్రకటిస్తున్నట్లు పాఠకులు అనుకొనే అవకాశం ఉంది.

ప్రశ్న : అదికాదండీ. జ్ఞానం విషయంలో కూడా ప్రకటనలా చేయడం ఉండదు కదా! వ్యక్తీకరణలో అలాంటి అభిప్రాయం కలగకుండా చూసుకునే ప్రతిభ ఉంటుంది కదా అని.

జవాబు : ఉంటుంది. ఒకచోట రాశాను, నాకు నచ్చిన భావాలను నీకు నచ్చిన మాటలలో చెప్పడం కవిత్వం, అని. అలానే రాయడానికి ప్రయత్నిస్తూ వుంటాను. అంటే వస్తువు మార్చుకోను. చెప్పాలనుకున్నదే చెప్తాను. కానీ, ఎలా చెబితే పాఠకులు స్వీకరించగలరో అలా చెప్తాను.

ప్రశ్న : మీరు ఇందాక భక్తి విషయంలో ఉద్వేగమూ, ఆర్తీ ఉంటాయి. జ్ఞానమార్గంలో అవి ఉండవు అన్నారు. మరి ఉద్వేగం ఉన్నపుడే పాఠకులకి దగ్గరయే అవకాశం ఎక్కువ కదా. అది లేకుండా రాసినపుడు పాఠకులను ఎలా చేరుతుంది?

జవాబు : భక్తిని అందరూ ఒప్పుకోలేరు, కనుక, భక్తిని తీసుకోనన్నాను. కానీ శాంత, కరుణ రసాలు ఉండేలా చూస్తాను కవిత్వంలో. అనుకంప కలిగేలా జాగ్రత్త పడతాను. ఆ అనుకంపన శాంతికీ, అంతిమ సత్యానుభవానికీ దారి తీసేలా చూస్తాను.

*****
థాంక్యూ Radhika T గారు..

https://sreevalliradhika.substack.com/p/e2a

15 డిసెంబర్ 2025

ఆహా! ఎంత అందమైనదీ సృష్టి! - వాసు (న్యాయపతి శ్రీనివాస్)

 బి.వి.వి. ప్రసాద్ నలుగురి మన్నననూ పొందిన కవి. ఆయన హైకూలు రాస్తూండిన కాలం నుంచే ఆయనకొక fan following ఏర్పడింది. అది కవులకు అరుదుగా దొరికే గుర్తింపు. ప్రసాద్ కవిత్వంలోని విమల కోమల పదాల, వాక్యాల వరుసల్లో కనిపించే ప్రశాంతత వెనుక ఆయన నమ్మే అద్వైత సిద్ధాంతముంది. ఇందులోని కవితాత్మక పంక్తుల కుంభవృష్టిలో తడిసిపోయిన పాఠకులు చివరకు మిగిలేది ఏమిటో ఇట్టే గ్రహిస్తారు. ఇదొక రెండంచుల కత్తి. తను నమ్మిన సిద్ధాంతం తళుక్కున మెరుస్తూండే కవిత్వం రాయడం ఏ కవికి ఎంత కష్టమో గానీ ఈ కవికి ఇది సులభసాధ్యమేనని ఈ కవితా సంపుటి చెబుతోంది. "ఊరికే జీవితమై" సంపుటి తరువాత రెండేళ్ళకు ఇది వస్తూ ప్రసాద్ అభిమానులను అలాగే అలరించగలిగిన సంపుటి ఈ "సృష్టి". కవి ఈ చరాచర సృష్టినీ జీవితాన్నీ అద్వైతసిద్ధాంతపు వెలుగులో చూస్తూ అనుభవించగా చెందిన తన్మయమే ("తత్"+మయం!) ఇతని కవిత. వర్షం, రంగులు, పిల్లలు, తల్లీపిల్లలు, కొండా కోనా - వీటన్నిటినీ ఏ కవీ చూసి ఊరుకోలేడు, ఉరకలు వేస్తాడు. ఈ కవి వేసిన ఉరకలు చల్లగా వెన్నెల్లా సోకుతాయి. ఇంకా, ఈ కవి చెప్పిన సత్యాల వెనుక కఠోరమైన అనుభవాలున్నాయి. "గాఢమైన దుఃఖం తర్వాత మళ్ళీ పుడతావు/లోపలి జీవితేచ్ఛ నిన్ను మళ్ళీ ప్రసవిస్తుంది" అనడానికి ఎంతో బాధ తెలిసుండాలి. కవితాత్మక వాక్యాలు ఇందులో ఆద్యంతమూ కనిపిస్తూ హాయినిస్తాయి. "ఒక ఉదయం లేచేసరికి/పూవుగా మారిపోయి ఉంటావు" అనడమొక ఉదాహరణ. "వాన కురిసే వేళ/నీకు నువ్వు నిజంగా దక్కుతావు" అన్నప్పుడు కవి ఎన్నో పరకాయప్రవేశాలు చేసాడని ఊహించవచ్చు. ఏకాంతం విలువ, అది పెట్టే ఒత్తిడీ తెలిసిన కవి కనుక, "చీకటి పడేకొద్దీ ప్రకాశిస్తావు నీలోపలికి" అనగలిగాడు ఈ కవి. ఇందులో వరమో శాపమో అర్థం కాని, బహుశా రెంటికీ అతీతమైనదేదో దొరికేట్టుచేసే epigrams కూడా చాలా ఉన్నాయి. ఇది చూడండి: "గగనంలో తేలిన ఇంద్రధనువు/గగనంలోనే మునిగినట్లు/జీవితంలోంచీ తేలిన నువ్వు/జీవితంలోనే మునుగుతావు". "కనబడని ఆనందంలోకి తిరిగిరాకుండా తప్పిపోవాలి" ఈ వాక్యం కవి కొండల్లో తొలిచిన రోడ్లమీదుగా వెళుతుండగా రాసిన కవితలో ఆఖరి వాక్యం. జీవితానికి అర్థం చెప్పిన మహావాక్యమూ ఇదే. "ఇతరులు లేరనేంత ప్రేమ నీపై నీకు లేకపోవటమూ/ఇతరులు నువ్వే అనేంత ప్రేమ వారిపై లేకపోవటమూ/జీవితం లోతుల్లోని బలమైన విషాదం" అంటూ మనిషికే భాష్యం చెప్పాడు ఈ కవి. "చూస్తూ ఉండగా, గాఢమైన దిగులులోంచీ/కాంతివంతమైన మృత్యుపుష్పం/నీ ముందు దయగా విచ్చుకుంటుంది". నన్నడిగితే, ఈ దీవెన చాలు. ఈ సంపుటిని విశ్లేషిస్తూ గంగారెడ్డి గారు అన్నట్టు ఇది కవి తనకు తాను రాసుకున్న మ్యూజింగ్స్‌లాంటి కావ్యలేఖ. గంగారెడ్డిగారి కన్నా బాగా ఈ సంపుటిని అర్థం చేసుకున్న వారున్నారా అని నా సందేహం. ఉన్నారేమో! వాళ్ళు ఏదీ రాయరు. 

-వాసు-

Thank you Srinivasa Nyayapati garu!



జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నం నా కవిత్వం

మనుష్యులు తమతమ రోజువారీ యుద్ధాలను దాటడానికి పోరాటం ఎంత ముఖ్యమో పోనివ్వాలనే చూపూ అంతే ముఖ్య మని తెలిసిన కవి బివివి ప్రసాద్. అందుకే గెలుపు జ్వరం పట్టిన లోకంలో, ఓడిపోవడానికే ఎక్కువ ధైర్యం కావాలని ఇప్పటికి ఎన్నో యేళ్ళ క్రితమే తన కవిత్వంలో చెప్పగలిగారు. లోపలి ప్రపంచంతో నిజాయితీగా సాగే సంభాషణల్లో, కొంత ఆనందమూ, కొంత దిగులూ, కొంత ఆశా కొంత వెలితీ అన్నీ తెరలు తెరలుగా తనలోనే వచ్చిపోవడం మనిషికి తెలుస్తుంది. ఆ ఉద్వేగాల ఉధృతిని అర్థం చేసుకునేందుకు ఉపకరించే తాత్విక అన్వేషణతోకూడిన కవిత్వం బివివి గారిది. లోపలి మనిషిపట్లా, లోకంపట్లా, దయాపూరితమైన చూపును, ఆలోచనను, మెలకువను ఈ కవిత్వంలో నేను చూశాను. సీతాకోక రెక్కల్లోని ఆశను, వర్షపు చినుకుల సంగీతాన్ని, వెన్నెలరాత్రుల నిశ్శబ్దంలోని గాఢమైన శాంతిని ఈ పదాల్లో నుండీ అందుకున్నాను. బివివి ప్రసాద్‌ కొత్త కవిత్వ సంపుటి ‘సృష్టి’ విడుదలైన సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ.

‘ఆకాశం’ సంపుటితో మొదలై మీ కవిత్వ సంపుటుల్లో మీదైన శైలి ప్రస్ఫుటంగా కనపడుతూ వస్తోంది. దీని వెనుక ఉన్న సాధన, ప్రభావాలను చెప్పండి.

‘ఆకాశం’ రాసేనాటికి, శిల్పపరమైన ఎలాంటి కండిషన్ లేకుండా, నన్ను నేను వాక్యాల్లోకి తెరుచుకోవటం కొంత చాతనైంది అనుకుంటాను. అయితే నా వాక్యం నేను కనుగొనడానికి సహాయపడినవారు ముఖ్యంగా టాగోర్, ఖలీల్ జిబ్రాన్. పరమ ఉదాత్తమైనదాన్నే కవితా సమయంలో తాకాలని నేర్పారు వారు. తర్వాత ఇస్మాయిల్. కవిత్వంలోకి అనుభవాన్ని అనువదించడం, ప్రధానంగా, ఆయన నుండి వచ్చిందనుకుంటాను.

మొదటి సంపుటి ‘ఆరాధన’లోని కవితలలో ఏకరూప్యత లేకపోవటం గమనిస్తే, నాదైన వాక్యం కోసం తపన పడటం తెలుస్తుంది. ‘నేనే ఈ క్షణం’ సంపుటిలోని కవితల కాలంలోనే, విస్తృతంగా సాధన చేసిన హైకూ ప్రక్రియ brevity, effect, easeలను నేర్పింది. గనుక జపనీయ కవుల ప్రభావం కూడా నా వాక్యాల్లో ఉండవచ్చును.

మీ కవిత్వం ప్రధానంగా తాత్విక అన్వేషణతో సాగుతుంది. మీపై ఉన్న తాత్విక ప్రభావాలేమిటి?

శ్రీ రమణమహర్షి బోధించిన ప్రశ్న ‘నేనెవరు’ నా తాత్విక అన్వేషణకి మూలం. ఆ ‘నేను’ను గురించి విస్తృతంగా, లోతుగా వివరించిన నిసర్గదత్త మహరాజ్‌ని చదవటం స్పష్టతనిచ్చింది. ‘నేను’ను మరింత సూక్ష్మంగా బోధించినవారు శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యంగారు. పూర్వ ఋషుల బోధలు, ఎకార్ట్ టోలీ వంటి ఆధునిక ద్రష్టల సూచనలు కూడా నా వెదుకులాటకి సహాయపడుతున్నాయి అనుకుంటాను. అయితే, అంతిమంగా ఎవరైనా తమదైన స్పష్టత, వెలుగు తామే పొందాల్సి ఉందనిపిస్తుంది.

రూమి, టాగోర్ లాంటి తాత్వికకవుల్లో దైవం కోసం, దైవానుగ్రహం కోసం, సన్నిధి కోసం వెదుకులాట ఉంటుంది. మీ అన్వేషణకు దైవం కేంద్రం కాదు. ఎందుకు?

పూర్వ తాత్వికకవులు సత్యాన్ని దైవంగా, object గా, చూడబడేదిగా తలచటం ఎక్కువ, కొన్ని మినహాయింపులున్నా. సత్యం subject అని, చూసేవాడు అని, నేనే సత్యమని జ్ఞానులు చెబుతారు. కనక, నా ప్రయత్నమంతా నన్ను నేను తెలుసుకోవటం వైపే, నేను నేనుగా ఉండటం వైపే ఉంటుంది. రమణమహర్షి తనలో తాను సంస్థితం కావటం అంటారు. తెలియటం కూడా కాదు, అదిగా ఉండటం. అది సర్వ దర్శనాల లక్ష్యంగా తోచింది.

ఒక ఆబ్జెక్ట్‌ని కవిత్వం చేయటంలో వెసులుబాటు ఉంటుంది. ‘నేను’కీ ఆ వస్తువుకీ మధ్యనున్న ఖాళీలో ఎన్ని ఊహలైనా, నాటకీయత అయినా, ఎంత రసమైనా చొప్పించవచ్చును. కానీ ‘నేను’ను కవిత్వం చేయటం దుస్సాధ్యం.

కానీ, ప్రసాద్ అనే నేను, ఏమీకాని నేనుగా ఉండాలనుకున్నపుడు ఆ ప్రయత్నం, వెదుకులాట, దుఃఖం, ఆనందం కవిత్వంగా మారే వీలు కలుగుతుంది. ఆ చలనాలు కేవలం బౌద్ధికం (intellectual) కాకుండా, హృదయగతమైనప్పుడు అది కవిత్వంగా పండుతుంది.

మీ కవితల్లో అధికభాగం ‘నువ్వు’ అని సంబోధిస్తూ రాస్తారు. దీనికేమైనా ప్రత్యేకమైన కారణం ఉందా?

నా కవిత్వం నాతో నేను జరిపే సంభాషణ. కవిగా ఉన్న తాను, ఒంటరి తనతో జరిపే సంభాషణలో కవి, ఒంటరి మనిషిని ఉద్దేశించి చెబుతుంటాడు. ఈ ధోరణి ఉద్దేశపూర్వకంగా కాకుండా, సహజంగా నాలో ఏర్పడిందనుకుంటాను.

గాఢమైన అనుభవంతో నిండిన ఒక మనిషి సాంత్వనగా పలుకుతున్న మాటల్లా వినపడుతుంది మీ కవిత్వం, అదే సమయంలో వాక్యాలు బోధ చేస్తున్నట్లు కూడా ఉండవు. ఇది ఎలా నిర్వహిస్తారు.

నా కవిత్వం, ముఖ్యంగా ‘ఆకాశం’తో మొదలు పెట్టి, నన్ను నేను కన్విన్స్ చేసుకునే ప్రయత్నం, జీవితాన్నీ, మనుషుల్నీ, నన్నూ ప్రేమించటానికి, మరింత లోతుగా గ్రహించటానికి. చాలాసార్లు జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నం కూడా. నాకు నేనే ఔట్‌సైడర్‌గా ఒక బోధకుడిలా, తండ్రిలా, మిత్రునిలా, కౌన్సిలర్‌లా ఉంటూ నాకు చెప్పుకోవటం. చెప్పే నేను, వినే నేను ఒకరే గనుక ఒకరు ఎక్కువా, ఒకరు తక్కువా కారు గనక, బోధ ఉన్నా అది ఆజ్ఞలా కాక, మృదువుగా, భుజం మీద చేయి వేసి మాట్లాడినట్లు వస్తుంది.

ఒక కవిత మీలో ఎలా తయారై, ఎలా వ్యక్తమవుతుంది?

కవిత్వం నా జీవితానుభవం నుండి, చూపు నుండి, ఆర్తి నుండి పుడుతుంది. అది ఆకాశంలో మేఘాలు పుట్టినట్టు, సాంద్రమైన భావాలుగా రూపు దిద్దుకొంటూ ఉంటుంది. మేఘం బరువెక్కినపుడు ఇక కురవబోతుంది అని మనకి తెలిసినట్లే, భావ సాంద్రత ఏదో ఒక సమయంలో ఒక ఊహ ద్వారానో, వాక్యం ద్వారానో, ఉపమ ద్వారానో పదాల్లోకి కురవబోతుంది అనిపిస్తుంది. మొదటివాక్యం పూర్తవుతూ ఉండగా, రెండవ వాక్యం తెరుచుకుంటుంది. ముగింపు వరకూ అలానే నడుస్తుంది. వాన వెలుస్తుంది. కవిత్వం రాయటం అయిదు, పదినిమిషాల పని. కానీ ఆ కవితకి తయారుకావటం వెనక జీవితమంతా ఉంటుంది అనుకుంటాను.

మీ కవిత్వం మొత్తం మానసిక ప్రపంచం చుట్టూ తిరుగుతుంది. నిర్దిష్ట వస్తువుల మీదా, సమస్యల మీదా కవితలు కనపడవు. ఎందువల్ల?

జీవితంలోని విషయాల కన్నా, అన్నిటినీ కలుపుకున్న జీవితమనే అనుభవం గురించి రాయటమే, కాలక్రమేణా నాకు ఇష్టంగా, సహజంగా మారింది. మారాల్సింది విషయాలు కాదు, చూపు అని జ్ఞానులు చెప్పటం వల్ల కూడా కావచ్చును, మొత్తం జీవితాన్ని చూసే చూపు మార్చుకొనే సాధనలోనే నా కవిత్వం భాగమవుతూ వచ్చింది. కనుకనే నిర్దిష్ట వస్తువులు, సమస్యలు నా కవితల్లో కనిపించవు. ఇది కాగితం మీది బొమ్మల గురించి గాక, బొమ్మలకు ఆధారమైన కాగితం గురించి మాట్లాడటం వంటిది.

మీ కవిత్వంలో కష్టమైన సంధులుండవు, పరుష పదాలుండవు. పొడుగైన పదబంధాలు కూడా ఉండవు. వత్తులు, ద్విత్వాక్షరాలూ కూడా అరుదు. ఎందుచేత మీ భాషను ఇట్లా నిర్మించుకున్నారు?

నేను అనుభవిస్తున్న, అర్థం చేసుకొంటున్న లోతైన, సున్నితమైన విషయాలు స్పష్టంగా, తేలికగా తెలియచేయటానికి చాలా సరళమైన మీడియం అవసరం అనిపించింది. అందువలన భాష ఎక్కడా అడ్డు పడకుండా చూసుకుంటాను.

నా కవిత్వంలో భాష, ఇదిగో నేనున్నాను అనదు. తానున్నానా, లేనా అన్నంత నిశ్శబ్దంగా, నిరాడంబరంగా భావాల్ని, కవి నుండి పాఠకుడికి చేరవేస్తుంది.

పూలు, సీతాకోకలు, వాన, ఆకాశం వంటివి తరచూ మీ కవిత్వంలో కనిపిస్తాయి. ప్రత్యేక కారణం ఏమైనా?

ప్రాకృతిక దృశ్యాలు మనం జీవితమని భ్రమపడుతున్న దాని నుండి జీవించటంలోకి మేల్కొలుపుతాయి. మానవుల్ని ఆశలూ, భయాలతో నిండిన మానసిక ఉద్వేగాల నుండి విముక్తం చేసి, సంతోషమూ, నిండుదనమూ, కనికరమూ వంటి హృదయ స్పందనలలోకి తీసుకువెళతాయి. ప్రాకృతిక పదాలు సహజంగానే కవిత్వ పరిమళాన్ని కలిగి ఉంటాయి గనుక, అవి ఉపయోగించటం ఇష్టంగా ఉంటుంది.

‘‘ఈ లోకం చిటికెనవేలు పట్టుకుని ఇక్కడ ఉండటానికి భయమేమిటి, బాధేమిటి’’ అంటారు ‘సృష్టి’లో. ‘‘చాలు అన్న మాట చివర ఏముందో ఎప్పుడన్నా చూసావా’’ అని ‘ఊరికే జీవితమై’లో అంటారు. ‘‘నిశ్శబ్దంగా బ్రతికితే ఏమిటి? నిరాడంబరంగా వెళ్ళిపోతే ఏమిటి?’’ అంటారు ‘ఆకాశం’లో. ఈ పరుగుల ప్రపంచంలో ఇంత నెమ్మదికి చోటెక్కడుంది? ‘‘పోనీలే’’ అన్న మీ మాటతో పక్కకు తప్పుకుంటే ఈ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవడమెలా?

పరుగుల ప్రపంచం లోక మోహంలో మనసు కల్పించేది. తృప్తి మనసు తనతో తాను నిండినపుడు కలిగేది. మొదటిదానిలో పడి కొట్టుకుపోతున్నాం, గనకే రెండవది నొక్కి చెప్పటం. అనుభవాలా, శాంతా ఏది చివరిది అనే చూపు నివ్వటానికి ప్రయత్నమేమో, నా రాతలన్నీ.

జీవం నిండిన మెలకువతో పగలు గడపటానికి, రాత్రులు గాఢమైన నిద్ర అవసరం. పగటికి రాత్రి వ్యతిరేకం కాదు, పూరకం. అలానే, ఘర్షణతో నిండిన జీవితంలో ఉత్సాహంగా పాల్గొనటానికి శాంతి నిండిన మనసు అవసరం. ఆ శాంతిని కలిగించే మౌలిక విలువలలో, పోనివ్వు కూడా ఒకటి.

ఆశలలో కొట్టుకుపోయే మనసుకి, చాలు అనే భావన అమృత బిందువు. అది నిరాశని, చేతకానితనాన్ని ఇచ్చే చాలు కాదు, నిండుదనాన్ని, వివేకాన్ని ఇచ్చే చాలు.

ఇంటర్వ్యూ : మానస చామర్తి 79754 68091






14 డిసెంబర్ 2025

సృష్టి పై Sivaji Tallavajhula గారి స్పందన

సుకవీ, మీ సంకలనం చదవటం పూర్తయింది. వెంటనే స్పురించిన కొన్ని మాటలు మీకు ఇలా.. 

మనసును శాంతింపజేసే మంచి కవిత ఎదురైతే చాలు, ఆ పుస్తకాన్ని అలాగే గుండె మీద పరచి ఆనందావస్థ లోకి జారిపోగలను, సృష్టి నాకదే చేసిపెట్టింది. సకలమైన వ్యక్తిగతాలను కళ్లద్దాల వలె మార్చుకుని ఏ ఒక్క కవిత చదవను. అలా చేస్తే నా సెంటిమెంటుకి దగ్గరగా ఉంది గనుక భలే కవిత ఇదని చెప్పడం ఫక్తు దొంగనాటకం కదా, నాకు కుదరదు. కనుక ఘనీభవించిన కలను గాని, ఊహను గానీ ముందస్తుగా సిద్ధం చేసుకోకుండా పుస్తకంలోని కవితలన్నీ చదివాను.

రాసిన కవికీ, చదివిన నాకూ నుదుటి మీద గానీ, అరచేతిలో గాని ఒక ప్రత్యేక కన్ను ఏర్పడిందని స్పష్టం అయింది. 

ఎట్టి వర్ణనలకు లొంగని ప్రశాంతమైన ఆనందలోకం, రెక్కలొచ్చిన నిశ్శబ్దం, వెన్నెల వెలుగు పరావర్తనం వంటివన్నీ నాలో జరిగిపోయాయి.

రంగుల పిల్లలు, ఇవాల్టి పని వంటి కవితలు ఎవరు చదివినా వారికి అవ్యక్త మాధుర్యాన్నిస్తాయి, అందుకు పూచికట్టు నాది.

"ఏ కారణమూ లేదనుకున్నా దయలోకి కరిగి పోవటం కంటే ఏదీ అనుభవం" తపోదర్శనం వంటి ముక్క ఇది. "అర్ధం లేకపోవటంలోకి ఎగరలేక కదా ఇదంతా ఇంత బరువు" "లోపలికంటా కురిసే ఒక వాన చాలు" ఇలా చెప్పుకుంటూపోతే నాకు తెలీకుండా నీ మొత్తం పుస్తకం అప్పగిస్తానో ఏమో.. నమస్తే కవీ!

తల్లావఝుల శివాజీ

13 డిసెంబర్ 2025

నిండైన శూన్యం : స్వాతి కుమారి

"ఈ కవితలు మీరు రాస్తున్నవి కావు, మీ ద్వారా రాయబడుతున్నవి” అని గతంలో ప్రసాద్ గారితో కొన్నిసార్లు అన్నాను. ఈ పుస్తకానికి సంబంధించి ఆ మాటలు పూర్తిగా నిజం అనిపిస్తుంది.

రాత్రింబవళ్ళకి, వెలుగునీడలకి మధ్యలో స్పష్టమైన విభజనరేఖ లేనట్టుగానే - మనిషితనంలోని మధనకి, కవిసమయంలోని కరుణకి మధ్య పరచుకున్న సాయంకాలపు నీరెండలాంటిది ఈ కవిత్వం.

ఇక్కడ కవి తనను మించిన, తను ఊహించిన, అనుభవించిన లేదా అనుభూతికి అతీతమైన ఒక మహాశక్తికి పూర్తిగా తనని తాను అర్పించుకోవడం కనపడుతుంది. దీనిలో రహస్యం ఏమీ లేదు, అన్నీ మనందరి కళ్ళ ముందర తేటతెల్లంగా కనబడే సంగతులే. ఇవి కేవలం దిగుళ్ళో, ప్రశ్నలో, బాధలో, భయాలో కాదు. అలా అని సంతోషపు కేరింతలో, పరవశత్వపు పలవరింతలో మాత్రమే కూడా కాదు. నిమిత్తమాత్రంగా, నిర్మోహంగా, నిరామయంగా తనతో సహా సమస్త ప్రపంచాన్ని చూసుకునే చూపు, లేదా కొత్తగా చూడాల్సిందేమీ లేదనే గుర్తింపు.

ఇంతా కలిసి మాటల్లో చెప్పలేని దాన్ని మాటలు గానే ప్రత్యక్షం చేసుకున్న కవి కఠోరతపస్సు, మౌనంగా మోయవలసిన బరువుని మౌనంలోకే దింపుకున్న ఒక మామూలు మనిషి తేలికపాటి మనసు. తెలియనంత వరకు చిక్కుముడిగానే ఉన్నదాన్ని, తెలుసుకోవడం అంటే "ఇది ఎప్పటికీ చిక్కుముడి అనే ఎరుకతో మసలడం" మాత్రమే అనే గమనింపు.

అదే కాలం, అదే కవిత్వం, అదే ఈ సృష్టి

స్వాతి కుమారి

(సృష్టి సంపుటికి కవితల ఎంపికలో సహాయం చేసిన స్వాతికుమారి పరిచయ వాక్యాలు. )



02 డిసెంబర్ 2025

వెలుగునీడల దోబూచులాటలో తండ్రీ తానే, బిడ్డా తానే: ఏ.గంగారెడ్డి

 1

కవి రాసిన సృష్టి కావ్యం ఆసాంతం, ఒకటికి రెండుసార్లు చదివాను. కవి ఏం చెబుతున్నాడో కనెక్ట్ కావడానికి ప్రయత్నించాను. ఇది సున్నితమైన, కళాకారుడైన ఓ జీవుడి ఘర్షణ. ఘర్షణ నుండి, ద్వంద్వాల నుండి బయటపడాలని చేస్తున్న తాత్విక ప్రయాణం. ఏది నిజమో, ఏది అబద్దమో పూర్తిగా తేల్చుకోలేని ఊగిసలాట. దొరికినట్లు, జారినట్లు ఉండే జీవనఫల ప్రయాణం.

బయటి మనిషికి, లోపలి మనిషికి మధ్య నడుస్తున్న రాయబారం. బయటి ప్రపంచంలో కొడుకు అలసిపోతే, తన లోపలి తానే తండ్రిగా కొడుకు భుజం మీద చెయ్యి వేసి ఓదార్చుతున్న తాత్వికకావ్యం. ఇక్కడ తండ్రీ తానే, కొడుకూ తానే. బాధా తానే, బోధా తానే. బాహ్యానికి అంతరానికి మధ్యలో సంధి కుదిర్చే ప్రయత్నం. లోకం నుండి పోవాలనుకునే కవికి, ఉండాలనుకునే కవికి మధ్య సయోధ్య ఈ కావ్యం. పొంతన కుదరని అంతర, బాహ్యాలకు, చీకటి, వెలుగులకు మధ్య సమన్వయ ప్రయత్నం ఈ కావ్యం. సత్యాసత్యాల సంఘర్షణ ఈ తాత్వికకావ్యం. మనసు పగుళ్ళతో విరక్తి చెంది, మనసులేని ప్రకృతి ఒడిలో సాంత్వన పొందుతున్న కవి అంతరంగప్రయాణం ఈ కావ్యం.

ఇట్లాంటి మనోస్థితిని అనుభవించే సున్నితమైన బుద్ధిజీవులు ఉండవచ్చు. కానీ, దాన్ని ఓ తాత్వికకావ్యంగా మలుచుకుంటూ, దాంట్లోనే విముక్తిని కోరుకునే ఇలాంటి కవులు అరుదుగా ఉంటారు.

ఇది తనకు తానే రాసుకున్న మ్యూజింగ్స్ంటి కావ్యలేఖ. ఈ కవిత్వం చదివి, అర్థం చేసుకున్న తరువాత నాలో ఈ విచారధార అప్రయత్నంగా ఇలా వస్తున్నది. ఇది కవిత్వ పరామర్శకు సంబంధించిన విషయమా, కాదా నాకు తెలియదు. కవిత్వాన్ని తూచే కొలతలూ తెలియవు. ఈ కావ్యమంతా కవి జీవితస్వేచ్ఛను,విముక్తిని కోరుతున్నాడు. ఇది సుస్పష్టం. అయితే విముక్తి దేని నుండి? తన నుండి తనకే! ఇంతకీ ఆ తను ఎవరు? తనువా, ఆలోచనా; రూపమా, మానసిక నిర్మాణమా?

2

సూక్ష్మంగా ఆలోచిస్తే ఇలా ద్యోతకమవుతుంది : మనం పుట్టామా?

పుట్టినట్లు అనుకుంటున్నామా? పుట్టింది తనువా? ఆలోచననా? పుట్టినట్లు మనకు ఏ వయసు నుండి అనుభవంలో ఉంది? మన ఇంట్లో పెరుగుతున్న పిల్లలను జాగ్రత్తగా చూసినా కూడా ఏం అర్థమవుతుంది? నేను పుట్టాను, అందరితోపాటే పెరుగుతున్నాను అనుకుంటూ, నేను వేరు అనే వ్యక్తిత్వభావనను పెంచుకుంటారు. చుట్టూ ఉన్న సమాజం అలానే నేర్పుతుంది. నమ్ముతాడు. అదే అలవాటుగా మారుతుంది. గత సంస్కారం ద్వారానో, జీన్స్ ద్వారానో కొన్ని లక్షణాలను తెచ్చుకుంటాడు. స్థల, కాలాలు మారుతున్నట్లుగా అనుభవంలోకి వస్తుంటాయి. అవి నిజమని నమ్ముతాము.

నామరూపాల మాంత్రిక సముద్రంలో ఈదడం మొదలెడతాము. భాషకు, రూపానికి సంబంధించిన అర్థాలు ఇవే అని బలపడుతుంటాయి. జ్ఞాపకాల బలం పెరుగుతుంది. సమాజం, మతం, సైన్స్ అనేవి కూడా శాస్త్రం, హేతువుల పేరుతో ఈ 'అనుకోడాన్ని' మరింత బలపరుస్తున్నట్లుగా కనిపిస్తాయి. కండిషన్ అవుతాము. ఇలా కండిషనింగ్ గా మారడమే అహంగా మారడం. అహమంటే ఒక్కటిగా కాకుండా భేదంతో చూడడం, భేదమైపోవడం. ఇదే స్ట్రాంగ్, ఫిక్సెడ్ అండ్ రిజిడ్ గా మారి నేను నీవు అనే సపరేషన్తో, గొప్ప శక్తిగా విస్తరిస్తుంది. పోలికతో గొప్ప ఆటను సృష్టిస్తుంది. కానీ, తనను తాను మరిచి, పెద్ద సమస్యై కూర్చుంటుంది.

మనిషి గాయపడడమంటే, దుఃఖపడడమంటే ఈ అహం గాయపడడమే. భయపడడం అంటే అభద్రతతో ఈ అహం భయపడడమే. సుఖసంతోషాలు కూడా ఈ అహానికే. అహం చుట్టూ నేను, నీవు; నాదీ, నీది; మంచీ, చెడు; ఈర్ష్య, అసూయ: సుఖదుఃఖాల వలయం ఏర్పడుతుంది. అది నైజమై కూర్చుంటుంది. ఈ ఫాల్స్ ఇగో ముదిరి పెద్దదవుతుంది. ఇక దాని నుండి బయటపడం.

చుట్టూ ఉన్న వాతావరణంలో మనం భౌతికంగా మానసికంగా అలానే పెరుగుతున్నట్లుగా భావిస్తూ, ఆ మనోనిర్మాణానికి అలవాటుపడతాము. తాను శరీరాన్ని మాత్రమే అనే ఆలోచనతో బందీ అవుతాము. ఆలోచన అంటే కాలమే. కాలం, ఆలోచన పరస్పర ఆశ్రయాలు. మొదటి ఆలోచన మరెన్నో ఆలోచనలను సృష్టిస్తుంది. ఎన్నో ఆలోచనలు జ్ఞాపకాలుగా, జ్ఞాపకాలు ఆలోచనలుగా మరింత ముదురుతాయి. ఇంద్రియజ్ఞానం దృఢమైన ఓ నమ్మకంగా, నిజంగా మారుతుంది. ఇలా ఈ కంటిన్యుటీ అనే తాడుతో బలంగా కట్టివేయబడి, కొనసాగి అసలైన తనను మర్చిపోతుంటాము. పోలిక, కోరిక, లక్ష్యం, ఐడెంటిటీ, అసూయ, అవసరం, అహంకారం, చర్యా, ప్రతిచర్యలతో భగభగ మండుతుంటాము. ఇక ఈ కంటిన్యుటీ తాడు తెగదు.

వాస్తవానికి మనకు పుట్టిన అనుభవమూ లేదు, మరణించిన అనుభవమూ లేదు. కానీ అందరిలాగే పుట్టినట్లు, మరణిస్తున్నట్లు నమ్ముతుంటాము. ఇతరులను అంటే బాహ్యంలోని మార్పును చూసి, మన మార్పును నమ్ముతాము. మారినట్లుగా ఉన్నది బయటనా, మన లోపలనా? ఈ ఇతరమే పెద్ద మాయ! ఇతరం ఉన్నదా, ఉన్నట్లు కనిపిస్తున్నదా? ఇతరము తనలో ఉన్నదా, బయట ఉన్నదా? ఇది కేవలం తన ఆలోచనలలో మార్పా, సత్యమా? ఆలోచనలు ఎక్కడినుండి ఎందుకు మొదలయ్యాయో, దాని పునాది ఎక్కడుందో తెలియదు. కనీసం రెండు ఆలోచనల మధ్యన ఉన్న ఖాళీని స్పష్టంగా చూడలేని ఆలోచనల వేగపరంపర. ఇక ఆ కంటిన్యుటీ తాడు తెగదు.

అనుకోవడాలూ, అలవాట్లూ అనే ఈ రెండూ మనల్ని బంధిస్తాయి. తానే వేటగాడై పన్నిన మాయావల ఇది. వల వేసిన వేటగాడూ తానే, చిక్కుకున్న పక్షి తానే. అది మనం ఏర్పరుచుకున్న మాయవల అని తెలియకుండానే మన ఒరిజినాలిటీ కోల్పోతాము. భౌతికంగా చూస్తున్నదే నిజమని నమ్ముతాము. ద్వంద్వాల సుడిగుండంలో గిరగిరా తిరుగుతుంటాము. గాయపడుతుంటాము. పడతాము, లేస్తాము, మళ్ళీ పరుగెడతాము. వాస్తవానికి సత్యం కోసం నిజంగా కలవరించే సతాన్వేషికి దుఃఖం, నొప్పి, కన్నీళ్ళు అనేవి వరమే. గాయాలు తూట్లు పొడుస్తున్నపుడు, బాహ్యం పట్ల భ్రమ తగ్గి, సత్యం కోసం లోపల చూసుకునే తపన తీవ్రమవుతుంది. ఇంద్రియ, ఇంద్రియాతీతమైన అనుభూతుల ఘర్షణలో తన తావును వెతుక్కునే ప్రయత్నం నిరంతరం చేస్తుంటాడు. దాని స్పర్శ ఏ కొంచెం దొరికినా, మళ్ళీ మళ్ళీ దాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటాడు.

అయితే అలవాట్లు, అంటే, బలమైన వాసనల వల్ల, అంతర్లీనంగా ఉన్న వ్యక్తిత్వకాంక్షల వల్ల, దొరికిన నిజస్థితి అవగాహన నుండి జారిపోతుంటాడు. ఈ కావ్యంలో కూడా కవి తనకు దొరికినట్లే దొరికి చేజారిపోతున్న స్వస్థితి స్పర్శ కోసం వేదన పడతాడు. తన నిజస్వరూపం కోసం అల్లాడుతుంటాడు. తానే తయారు చేసుకున్న తన మనోనిర్మాణంతోనే నిరంతరం గాయపడుతూ, దాన్ని దాటిన స్వస్థితి కోసం కలలు కంటాడు. అటువంటి తాత్వికకవి మనస్సును, తపనను ఈ కవిత్వం నిండా చూడవచ్చు.

ఏ "అనుకోవడాలు” ద్వారా, ఏ అలవాట్ల ద్వారా, ఆలోచనల ద్వారా ఈ మాయాప్రపంచంతో మానసికబంధం ఏర్పరచుకుని ఓ మనోనిర్మాణపు వలయంలో చిక్కుకున్నాడో కవి, ఆ నిర్మాణాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ, లోకంతో సమన్వయం కోసం, తన శాంతి కోసం, తప్పిపోతున్న తనకు, తానే బోధించుకుంటూ, తిరిగి దారిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తనను తానే ఓదార్చుకుంటూ అమృతఘడియల వైపు ప్రయాణిస్తున్నాడు. తన జీవనయాత్రలో ఎన్నిసార్లు దారి తప్పి దుఃఖపువలలో చిక్కుకున్నా, తిరిగి మళ్ళీ మళ్ళీ లేస్తూ, ఏ మానసికఛాయలు లేని అమ్మలాంటి సహజప్రకృతి ఒడిలో సేద తీరుతూ, తనదైన రాగంలో పాటలు అల్లుకుంటున్నాడు కవి.

3

ఈ కావ్యమంతా తనే గురువు, తనే శిష్యుడు. తనే తండ్రి, తనే బిడ్డా. వేదన తానే, ఓదార్పు తానే. కవి అత్యంత సున్నితత్వం గలవారు. ఆ సున్నితత్వంలోంచే తన్ను తాను ఆవిష్కరించుకుంటున్నారు. తన సంతోషాల్ని, దుఃఖాల్ని, గాయాలను, ఆత్మానందాన్ని, భయాల్ని, ఓదార్పుల్ని, కన్ఫెషన్స్ ని, తాను శాంతిని పొందుతున్న తావులని కవితలుగా మలిచారు. ఎవరికో ఏదో చెప్పడం కాకుండా తనకు తాను లోపలి టోన్లో చేసుకుంటున్న ఆత్మావిష్కరణ. ఇది ఓ రకంగా భిన్న ప్రయోగం. తన కవితాశక్తి ద్వారా కవి తన మనోభూమికపై ఎగసిపడుతున్న అలల సముద్రానికి పటం కట్టి తనను తాను చూసుకుంటున్నాడు. మనల్ని మనకూ చూపిస్తున్నాడు. ఐడెంటిఫై చేసుకునే వాళ్ళకు కవి చాలా దగ్గరగా తోస్తాడు. దిస్ ఈస్ ఎ వెరీ యూనిక్ అండ్ సెన్సిబిల్ టోన్.

జననం, మృత్యువు, మనస్సు, విముక్తి, సత్యం, అసత్యం, స్వర్గం, కల, మెలకువ, గాయాలు, నవ్వులు, ఏడుపులు, సుఖం, ప్రేమ, దయ, శాంతి, అసూయ, దిగులు, వేదన, ఆనందం, కలత, లాలస, స్పర్శ, దుఃఖం, వెలితి, గాయం, క్షమా, స్నేహం, ఏకాంతం, నిట్టూర్పు, పోలిక, కోరిక, ఓదార్పు, భయం, బాధా, ఆశ్చర్యం, మంచీ, చెడూ, అనుమానం, అనంతం, జ్ఞానం అనే ఈ జీవనకోణాలన్నిటి వెంట కవి పదేపదే ప్రయాణించి తన నిశ్శబ్ద ఏకాంతానికి చేరుకునే ప్రయత్నం చేస్తుంటాడు.

ఈ కావ్యంలో వాడిన సింబాలిక్ ఇమేజెస్ మొత్తం చూస్తే, కవి రాగ ద్వేషాలు అంటని స్వచ్ఛప్రకృతి ముందు తనను తాను హృదయార్పితం చేసుకోవడం వలన, తన త్రోవ ఏమిటో స్పష్టపరుస్తున్నాడు. ఆ ఇమేజెస్: ఆకాశం, నక్షత్రాలు, మేఘాలు, చంద్రుడు, సూర్యుడు, పగలు, రాత్రి, కాంతి, గాలి, నీరు, వెలుతురు, పూలు, కాలం, సూర్యాస్తమయాలు, వాన, మబ్బులు, ఇంద్రధనస్సు, మంచుబిందువు, రంగులు, పిట్టలు, సీతాకోకలు.

ఇలా మనసు సోకని బాహ్యప్రకృతిని కవి పదేపదే వాడడంలో నిర్మలప్రకృతిని ఆలింగనం చేసుకుంటున్న తీరును గమనిస్తే, లోకం, మనుషుల తీరుకన్నా, తనను గాయపరచని, దుఃఖపరచని ప్రకృతి జాడలే తనకు సుఖమని సింబాలిక్గా నమ్ముతున్నాడు. అంతేకాకుండా మనోమాలిన్యం లేని, తన లోపలి సత్ వస్తువు పట్ల ఎట్లా తపించిపోతున్నాడో కూడా ఈ సింబాలిక్ ఇమేజెస్ వల్ల అర్థమవుతున్నది. మనస్సు లేని అటువంటి తావుల్లో తన శాంతిని కాంక్షిస్తున్నాడు. ఈ ఇమేజెస్ అన్నీ బయటి వస్తువులుగా కనబడుతున్నా, మనస్సు అంతమయ్యే లోపలిచూపుకు దారిగా కవిని అవి గట్టిగా పట్టుకుంటున్నాయి.

కవి ఎక్కడ ఉన్నాడని చూస్తే, కవితల్లో ద్వంద్వాల మధ్య మానసికయుద్ధం చేస్తున్నాడు. వీటిలో లోకంతో పొసగక అశాంతితో, ఇక వెళ్ళిపోతాను అన్న కవితలూ ఉంటాయి. జీవితేచ్ఛతో సమన్వయాన్ని పొందుతూ, హాయిగా బతికిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుని శాంతిని పొందిన కవితలూ ఉంటాయి. తనకు తానే గురువై బోధించుకుని ఓదార్చుకుంటున్న కవితలూ ఉన్నాయి. ఒక కవిత నుండి మరో కవితకు కాంట్రడిక్షన్లా అటూ ఇటూ ఊగిసలాడడం ఉంటుంది. ఒక కవితలో జీవితామృతం దొరికిందని జీవితేచ్ఛను వ్యక్తం చేస్తారు, మరో కవితలో జీవితం దుఃఖమయమని నిరాశను వ్యక్తం చేస్తారు. ఇవి ఆయా సందర్భాల్లో కవి మూడ్స్్స్న రిఫ్లెక్ట్ చేస్తాయి.

రచయిత, సత్యాన్వేషి చలంగారు కూడా తన నలభై ఏళ్ళవయసులో జీవితం చాలా నిరాశగా ఉంది అన్నారట. ఏభై ఏళ్ళ వయసులో ఇక జీవితంలోంచి వెళ్ళిపోవాలనుకున్నారట. అరవై ఏళ్ళు వచ్చేసరికి అసలైన జీవితం ఇప్పుడే మొదలైంది అన్నారట! ఇక్కడ అరవై ఏళ్లకు చేరుకుంటున్న కవి మనోభావాలు కూడా ఆశనిరాశలవలయంలో చలిస్తూ ఉంటాయి. గ్రౌండ్వల్లో ఉండి తనను తాను ఆవిష్కరించుకుంటున్నారు. రోజువారీ డైరీ రాసినట్లు, సందర్భాలను బట్టి ఈ కవితాశిల్పాలను మనసుపెట్టి చెక్కారు. అందుకే కవిని చదువుతూ మనల్ని కూడా అందులో చూసుకోవచ్చు.

4

కవి మనోరీతిని ఈ కవితల్లో చూడవచ్చు :

"ఈ లోకంలో ఏమన్నా బ్రతికితే, చిన్నపుడు బ్రతుకుతాం, మిగిలిన జీవితమంతా బదులు చెల్లిస్తాం, కాసిని శైశవక్షణాలు అనుభవించినందుకు ఇంత బదులుతీర్చడం అవసరమా అని అడుగుతావు దేవుడిని, ఉండీ, లేనివాడిని, లేకుండడంలో దాగినవాడిని, జవాబురాదు, బ్రతికావు కదా కాసిని రోజులో, నిమిషాలో, శుభ్రమైన పసిదనంలో, స్వేచ్ఛలో, భయరహిత క్షణాల్లో, ఏదీ గుర్తుండని కాంతిలో, చెల్లించి వెళిపోవా మిగిలిన బరువైన రోజుల్ని". ఇలా కవే తనను బ్రతిమాలుకుంటూ, సంవేదనను అనుభవిస్తూ, భారమైనా సరే మిగతా జీవితం గడపాలి అంటాడు. ఇదంతా భయావహ ప్రపంచం అంటాడు.

"జీవించడం అసౌకర్యమైన అనుభవం, పీడకలలవేళ దేహం కూడా కదిలినట్లు, జీవితం నుండి మరణంలోకి నిన్ను నీవు బ్రతిమాలుకుంటావు" అని తనను మరణంలోకి లాక్కొంటాడు. మనుష్యులతో తనకు సంబంధం లేని క్షణాల్లో ప్రపంచం తటాలున విశాలమవుతుంది అంటాడు. మనుషులు తనకేమీ కాని క్షణాలు, వారు తన చేతనలోకి చొరబడని క్షణాలు అద్భుతం అంటాడు. ఉన్నచోటును విడిచి లోపలికి వెళ్ళకుండా, బయటకి రాకుండా తనలోని భయమే తనను అడ్డుకుందని వాపోతాడు. దుఃఖపు తేనెపట్టు పిండి, జీవితం చప్పరించాలని చూశారట, కానీ చివరకు విషాదమే మిగిలింది అని వేదన చెందుతారు.

తెలియకపోవడంలోని హాయిని పసిపాప తేలికగా అనుభవిస్తుంది, తెలియటం కదా ఇంత దుఃఖానికి మొదలు అని విచారం వ్యక్తం చేస్తారు. రాత్రులు నిదురించే ముందు దైవాన్ని ఇది కడపటి నిద్ర కావాలని ప్రార్థిస్తారు కవి. "విసుగుపుట్టే రోజున తెలివిలేని సినిమాకు వెళ్ళినట్లు తీరికగా చేరుతావు ఈ లోకంలోకి, ఇది బాలేదు, అయినా వెళ్ళలేవు, అట్లాగని ఉండాలన్న ఉబలాటం లేదు” అని తన మనోస్థితిని ఆవిష్కరించుకుంటారు.

కవి బ్రతికి ఉన్న క్షణాలు, తన జీవితంలో తనకు హాయిని, ఆశ్చర్యాలను ఇచ్చిన అద్భుతాలని కూడా ఇలా వట్టుకుంటాడు :

పున్నమి చంద్రుడు నెమ్మదిగా ఎగురుతున్నపుడు, ఇంద్రధనువులు రంగులని విరజిమ్ముతున్నపుడు, ఉదయపు వెలుగు, పిట్టలు పాడడం, లేళ్ళు గెంతడం, పిల్లలు నవ్వడం, యవ్వనం ప్రేమించుకోవడం, సెలయేళ్ళు ప్రవహించడం, సూర్యుడు కాంతిని విరజిమ్మడం, అమ్మ బిడ్డతో దోబూచులాడడం, తనతో తాను హాయిగా నవ్వుకున్నపుడు, తన బిడ్డను కడుపారా కావలించుకున్నపుడు, ఆజన్మాంతం గాలిపటంలా ఎగిరే ఆకాశాన్ని చూసినపుడు, ఎండ పాడుకునే సన్నటి నేపథ్య సంగీతం విన్నపుడు, చేపల్లా ఈదే రాత్రులను, పగళ్ళను చూసినపుడు, ఇట్లాంటపుడు తాను మృత్యువును దాటాను అంటాడు.

వాన కురిసినప్పుడు తనకు తాను దక్కుతారట! ఎడతెగని వాన తనను కాగితపు పడవ చేసి ఎటైనా తీసుకపోతే బాగుంటుందని ఎదురుచూస్తాడు. ఉదయాలు బంగారాన్ని వెదజల్లింది తన ప్రశాంతమైన చూపు కోసమే కావచ్చు అంటాడు. ఉదయం గడ్డిపరకపై వాలిన మంచుబిందువు, దానిలో ఆడుకుంటున్న రంగులు, ఏవీ పట్టకుండా ఓ బైరాగిలా ఊరిలో, తన ఇంట్లో తిరుగాడే క్షణాలుంటే అద్భుతమంటారు. ఇలాంటివి తాను బతికున్న క్షణాలకు గుర్తులుగా ఉన్నాయంటాడు.

కవి తనను తాను ఓదార్చుకుంటున్న క్షణాలు :

నీలోంచి నవ్వు వస్తే రానివ్వాలి, భయం పుడితే పుట్టనివ్వాలి, పూలు రాలుతుంటే రాలనివ్వాలి, సీతాకోకలని ఎగరనివ్వాలి, గాలి వీచినట్లు సహజంగా, నీరు పారినట్టు సరళంగా జరగనివ్వాలి, వెళ్ళనివ్వాలి. తేలికగా ఉండాలి, తెలియనట్లు ఉండాలి, ప్రపంచాన్ని తన కల కననివ్వాలి, పెద్దగా గొడవపడేదేం లేదు ఇక్కడ, అంతగా నిలబెట్టుకోవాల్సింది కనరాదు, కాలం గడిచిందా లేదా అన్నట్లుండాలి, స్థలమొకటుందా లేదా అనుకోవాలి, ఊరికే కదలాలి, మాట్లాడాలి, అలసటతో హాయిగా నిద్రపోవాలి, కడపటిబిందువు ఎదురైనపుడు తృప్తిగా దానిలో లీనం కావాలి.

అనుకునేంత భయావహం కాదు, ఊరికే ఉండు కాలువలో నిశ్శబ్దంగా పారే నీటిలా, బ్రతకాలని చూడకు, పోవాలని కూడా, ఉండటమే చాలు, అంతకన్నా నీ నుండి ఈ గాలి కోరేదేమీ లేదు అని ఓదార్చుకుంటారు. మనమా బ్రతికేది, వెళ్లిపోయేది, జీవితం తనను తాను చూసుకుంటుంది, నమ్మకం లేకపోతే నీలాకాశం కిందికి వెళ్ళి చూడు విప్పారిన నేత్రంతో నిన్ను చూస్తూ నీకు నమ్మకాన్ని ఇస్తుంది అని తనకు తాను ఓదార్చుకుంటూ తేలిక పడతారు .

మృత్యువు గురించి ఇలా వివరిస్తారు :

“చూస్తూ ఉండగా కాలం చివరికొస్తుంది, పలుసంధ్యలు పూలలా రాలిపోతాయి, పలు చందమామలు ఉదయాల్లో కరిగిపోతాయి, ప్రేమ నిండిన నవ్వులు తడి నిండిన బంధాలు, చూస్తూ ఉండగా పొడిబారిపోతాయి, కాలం చివరికొస్తుంది, కలలు చివరికొస్తాయి, దుఃఖాలు చివరికొస్తాయి, బ్రతుకు భయం చివరికొస్తుంది, స్వర్గమో నరకమో తెలీని ప్రపంచానుభవం ముగింపుకొస్తుంది, చూస్తూ ఉండగా గాఢమైన దిగులులోంచి కాంతివంతమైన మృత్యుపుష్పం నీ ముందు దయగా విచ్చుకుంటుంది”. ఇంకోచోట “ఈ మృత్యువు ఇంత విశాలమైనది, శబ్దాల పక్షులూ, రంగుల చేపలూ సంచరించే జాడైనా లేని పరమ చల్లనిశాంతి గుండెలకి హత్తుకుంటుంది” మృత్యువుని ఇలా కాంతిగా, శాంతిగా వర్ణించడంలో కవి వైరాగ్యాన్ని కొత్త టోన్ లో ప్రకటిస్తున్నారు.

ఈ కావ్యంలోని కవితలన్నీ చదివాక, కవి తాను నిర్మించుకున్న ప్రత్యేకలోకంలోకి మనల్ని తన వెంట తీసుకెళ్లి, తన దుఃఖాన్ని, భయాల్ని, తన సంతోషాన్నీ, తాను బతికిన క్షణాలను, తన ప్రేమగీతాలను, తన ఆత్మను మనకి నిర్మొహమాటంగా విప్పి చెప్పి మనల్ని సహానుభూతికి లోను చేస్తారు .

5

కవి తనను తాను ఆవిష్కరించుకున్న కావ్యం ఇది. ఒకరకంగా ఇది కన్ఫెషన్ స్టేట్మెంట్. ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ జీవితేచ్ఛతో లేచే ప్రయత్నం. మనుష్యులు, మనసులేని మరోలోకంలో విహరించాలని కవికి బలంగా ఉంది. ఊగిసలాట నుండి స్థిరత్వానికి వెళ్ళిపోవాలనే కాంక్ష అంతర్లీనంగా బలంగా ఉంది. సాధారణంగా కవిత్వంలో తాత్వికత ఉంది అంటారు. కానీ, ఈ కవిలోని తాత్వికకాంక్షనే ఈ కవిత్వాన్ని ఓ నెపంగా ఎన్నుకుని కావ్యమై ప్రవహిస్తున్నది. 

అందుకే ఈ కవిత్వం మొత్తం ఈ కొస నుండి ఆ కొస వరకు ఏదో అశాంతి. ఆ అలజడిని తిరిగి శాంతిలోకి తీసుకువెళ్లాలనే తపన, ప్రయత్నం కనిపిస్తుంది. మళ్ళీ అశాంతి. ఇది పరంపరగా కొనసాగుతుంది. ఎప్పడికప్పుడు ఇలా తన మూడ్స్ రికార్డ్ చేయడం కవి నిజాయితీని చెబుతుంది.

ఎందుకు జారిపోతుంటాము?

లోపల ఉన్న వాసనలు (లేటెంట్ టెండెన్సీస్), అలవాట్లు, భయాలు, ఐడెంటిటీ, ఆలోచనలు, వ్యక్తిత్వకాంక్ష, కొనసాగాలనే ఇచ్ఛ ఇవన్నీ స్వేచ్ఛలోకి, విముక్తిలోకి దూకాలనే కాంక్షను అడ్డుకుంటాయి. స్వస్థితిని మరుపుకు లోను చేస్తాయి. కేవలం ఇక్కడ కవికే కాదు, అనేకానేక మహాసాధకులకి కూడా ఆ అనుభవం దొరికినట్లే దొరికి జారిపోతుంటుంది.

ఎందుకంటే, కన్స్ట్రక్టెడ్ ఇగో దట్ ఈస్ ద అప్పారెంట్ ఐ, విచ్ ఆల్వేస్ ట్రెస్ టు లివ్ ఇన్ సెపరేషన్, యాజ్ సపరేట్నెస్ ఈస్ ఇట్స్ డియరెస్ట్ ఫుడ్. ఇన్ సెపరేట్నెస్, ద ఫాల్స్ ఇగో ఎంజాయ్స్ ద టేస్ట్ ఆఫ్ డిఫరెన్స్ టు కంటిన్యూ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. నీవు, నేను; చావు, పుట్టుక; అహం, భయం; రాగద్వేషాలు; బంధం, విముక్తి. ఇలా పరంపర కొనసాగుతుంది. అయితే తపన, ఆర్తి కలిగినవాళ్ళు రెడీనెస్లో ఉన్నవాళ్ళు ఎన్నిసార్లు జారిపోయినా, కింద పడ్డా పట్టు వదలరు. తనలోని మలినాన్ని తొలగించుకోవడానికి, పదేపదే ప్రయత్నిస్తారు. తనను తాను లోలోపలికి చూసుకుంటారు. తనలోని శాంతిని అడ్డుకున్న తెరలను తొలగించుకుంటారు.

తనకు తాను తయారుచేసుకున్న ఈ నేను (ఇగో) అనే మనోనిర్మాణాన్ని కరిగించుకోవడం ఓ మహాతపస్సు. అది కరగడానికి ఇష్టపడదు. పోవడానికి అసలే ఇష్టపడదు. భయాన్ని, అభద్రతను ఎగదోస్తుంది. కళ్ళకు గంతలు కడుతుంది. మన అసలు తావును మరపులోకి తీసుకెళ్తుంది.

విముక్తి అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడడం. కన్ఫ్యూషన్ క్లారిటీగా మారడం. అహం మాయమవడం. దుఃఖానికి లోను కాకపోవడం. భయం నుండి విముక్తి చెందడం. ఎరుకతో ఆ అనుభవంలో ఉండడం. సదా వర్తమానం అనుభవంలోకి రావడం. విముక్తి అనేది ఎక్కడో లేదు, అది ఇపుడు ఇక్కడే నాలోనే ఉందని, నేనై ఉందని తెలుసుకోవడం.

ఇక అప్పుడు ఆలోచనలుండవా? ప్రపంచం ఉండదా? కుటుంబం ఉండదా? ఉన్నదంతా సత్యమే. ఎప్పటిలాగే అన్నీ ఉన్నట్లు ఉంటాయి. అందరూ ఉన్నట్లు ఉంటారు. కానీ ఏదీ నిన్ను అంటదు. చేయాల్సినవి అన్నీ చేస్తావు, కానీ నీవు చేసినట్లుగా ఉండవు. లేస్తావు, పొలానికెళ్తావు, పంట పండిస్తావు, తింటావు, పడుకుంటావు. ఎప్పటిలాగే కుటుంబంతో ఉంటావు, నవ్వుతావు, ఏడుస్తావు, అన్నీ చేసినట్లుగా ఉంటావు, కానీ ఏమీ చేయవు. పాత్రోచితధర్మం నిన్ను నడిపిస్తుంది. పాత్రోచిత రియాక్షన్ ఉంటుంది.

భేదం కేవలం ఉన్నట్లుగా ఉంటుంది, కానీ ఆ భేదం వల్ల దుఃఖం ఉండదు. ఎందుకంటే ఆ భేదం నాటకీయమైనది. ఏకత్వం అనే తెరమీద నటించే పాత్ర అది. కంటిన్యుటీ తాడు తెగిపోతుంది. కంటిన్యుటీ ఉన్నట్లుగా ఉంటుంది, కానీ కలలాగా ఉంటుంది. ఉన్నది నీవే, జరుగుతున్నట్లు అనిపిస్తున్నదంతా నీలోనే అని తెలుస్తుంది. మేలుకున్న తరువాత కల నిన్ను అంటనట్లుగా, ఏవీ నీకు అంటవు. ఎప్పుడూ ఏమీ జరగలేదు అనే అనుభవంలో ఉంటావు.

ఇది ఆలోచననో, ఊహనో కాదు, వాటి ప్రమేయం ఏమాత్రం లేని నీ ఉనికి. శరీరంలో నేను ఉన్నాను అన్న స్థితి నుండి నాలో శరీరం ఉంది అనే షిఫ్ట్ జరిగి శరీరానికి ఎడంగా అవుతావు. శరీరం మనస్సును సృష్టించదు, మనస్సే శరీరాన్ని సృష్టిస్తుంది అని అర్థమవుతుంది. ప్రపంచంలో నేను ఉన్నాను అనే స్థితి నుండి ప్రపంచం నాలో ఉంది అనే షిఫ్ట్ ను చూస్తావు. గతం కలలాగా ఉంటుంది. మూడు కాలాలు, స్థలాలు 'నేను' అనే తెర మీద వచ్చి పోతున్నట్లుగా ఉంటుంది. తేలిక. బరువు ఉండదు. ఇది నీకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని వివరించడానికి అవసరానికి పదాలు వాడుతావు గానీ, పదాలలో అది ఇమడదు అని తెలుస్తుంది. అందుకే నీలో నీవు నవ్వుకుంటావు. ఉంటాయి. కలగా నీవు ఎరుకతో ఉండడం కాదు, ఎరుక నీతో ఉంటుంది, నీవై

ఉంటుంది. నీలో పొంగే కరుణ, ప్రేమ నీ ప్రయత్నం లేకుండానే విప్పుకోవడం చూస్తావు. విముక్తి అంటే ఏదో కొత్తగా సాధించేది కాదు, అంతవరకు నిన్ను కప్పివేసిన మాలిన్యతెరలు ఏవో తొలగిపోవడం, హృదయం శాంతితో నిండడం. నీవు సదా మార్పు లేకుండా ఒక్కలాగే ఉన్నావని, మార్పు అంతా నీ మీద వచ్చి, పోతున్నది కానీ అది నీవు కాదని తెలుస్తుంది.

తన పైన ప్రవహిస్తున్న ప్రసాద్ అనే వ్యక్తిని తొలగించుకోవడానికి

అనేక ఎత్తుపల్లాలను, దుఃఖాలను, అనుభవాలను చూసిన కవి చివరకు "బోనులో సింహం ఆకలితో లొంగినట్టు, జీవితానికి లొంగి చూడు" అంటాడు. "సమస్తాన్ని దేవుడినీడలా ప్రేమిస్తున్నావు" అంటాడు. ఈ భావన గొప్పది. టోటల్ యాక్సెప్టెన్స్ అండ్ సరెండర్ అనేది గొప్పయోగం. అది జారకుండా ఉండాలని, ఆ కాన్స్టాంట్ అవేర్నెస్తో కవి ప్రయత్నం, జీవితం, సాధన సఫలం కావాలని, ఆ నిర్మలశాంతి తీరంలో ఆయన నిరంతరం సేద తీరాలని మనసార కాంక్షిస్తూ!

ఏ . గంగారెడ్డి
హైదరాబాద్
11.11.2025



01 డిసెంబర్ 2025

జీవన గీతం సృష్టి : గార్లంక భగవాన్

అందిన కవిత్వం, ప్రసాద్ గారి  మూడు దశాబ్దాల సుధీర్ఘ జీవన  గీతం  కొన్ని పుస్తకాలుగా విడివిడిగా అలరిస్తుంది. అరుదైన కవి అద్భుతమైన వాక్యాలు, మహాత్మాగాంధీ తాను విచారానికి కలవరపాటుకు గురైన ప్రతిసారి  భగవద్గీత సాంత్వన కలిగిస్తుందని చెప్పుకున్నారు. BVV Prasad's Poetry నావరకూ ఆకోవకు చెందినదే , ఒక్కటే అసూయ ఇవన్నీ నా అక్షరాలే ప్రసాద్ గారి ద్వారా వెలువడుతున్నాయి అని , ఇలాంటి కవి మన భాషలో ఇంతకాలం జీవం తొణికిసలాడుతూ కొనసాగటం భాషకు గౌరవం. ఈ నల్లనివాడు పద్మనయనమ్ములవాడు మహా శక్తిమంతుడు.  ఏముందిలే అదే వాక్యం అదే భావం మళ్ళీ మళ్ళీ అదే కదా అనుకుంటామా ఛటేల్మని ఓ వాక్యం వీపు చరుస్తుంది , ఎంతో సంక్లిష్ట భావాన్ని అలవోకగా చిటెకేసినట్లు అలా విసురుతారు అంతే మనసు జిగేల్మని రగులుతుంది  . "ఛ్ఛా"  ఏం చెప్పారు  ఎంతటి భావాన్ని ఇంతందంగా చెప్పారు కదా అనిపిస్తుంది.  ఈ కవికి పరాజయం  తొట్రుపాటు ఆత్మన్యూనత లాంటి మామూలు మనుఘలకు వుండే అవలక్షణాలేమీ లేవు.   మనల్ని ఏ వేళనైనా తన సహజ సుందర  వాక్యంతో ఆత్మీయంగా  హత్తుకునే మహత్తుగలవాడు . ఇంతకీ" సృష్టి " ఎలా వుందీ అనే ప్రశ్నకు ప్రసాద్ గారి కవిత్వం  పైకి ఆత్మాశ్రయంగా కనిపిస్తుంది కానీ జీవితాన్ని సాహిత్యాన్ని లోతుగా అరగదీసిన  అనుభవశాలురను తీవ్రంగా అలరిస్తుంది . ధన్యవాదాలు ప్రసాద్ గారు 

Thank you Bhagavan Garlanka garu for writing this!