సుకవీ, మీ సంకలనం చదవటం పూర్తయింది. వెంటనే స్పురించిన కొన్ని మాటలు మీకు ఇలా..
మనసును శాంతింపజేసే మంచి కవిత ఎదురైతే చాలు, ఆ పుస్తకాన్ని అలాగే గుండె మీద పరచి ఆనందావస్థ లోకి జారిపోగలను, సృష్టి నాకదే చేసిపెట్టింది. సకలమైన వ్యక్తిగతాలను కళ్లద్దాల వలె మార్చుకుని ఏ ఒక్క కవిత చదవను. అలా చేస్తే నా సెంటిమెంటుకి దగ్గరగా ఉంది గనుక భలే కవిత ఇదని చెప్పడం ఫక్తు దొంగనాటకం కదా, నాకు కుదరదు. కనుక ఘనీభవించిన కలను గాని, ఊహను గానీ ముందస్తుగా సిద్ధం చేసుకోకుండా పుస్తకంలోని కవితలన్నీ చదివాను.
రాసిన కవికీ, చదివిన నాకూ నుదుటి మీద గానీ, అరచేతిలో గాని ఒక ప్రత్యేక కన్ను ఏర్పడిందని స్పష్టం అయింది.
ఎట్టి వర్ణనలకు లొంగని ప్రశాంతమైన ఆనందలోకం, రెక్కలొచ్చిన నిశ్శబ్దం, వెన్నెల వెలుగు పరావర్తనం వంటివన్నీ నాలో జరిగిపోయాయి.
రంగుల పిల్లలు, ఇవాల్టి పని వంటి కవితలు ఎవరు చదివినా వారికి అవ్యక్త మాధుర్యాన్నిస్తాయి, అందుకు పూచికట్టు నాది.
"ఏ కారణమూ లేదనుకున్నా దయలోకి కరిగి పోవటం కంటే ఏదీ అనుభవం" తపోదర్శనం వంటి ముక్క ఇది. "అర్ధం లేకపోవటంలోకి ఎగరలేక కదా ఇదంతా ఇంత బరువు" "లోపలికంటా కురిసే ఒక వాన చాలు" ఇలా చెప్పుకుంటూపోతే నాకు తెలీకుండా నీ మొత్తం పుస్తకం అప్పగిస్తానో ఏమో.. నమస్తే కవీ!
తల్లావఝుల శివాజీ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి