01 జూన్ 2016

జీవించాలనే కోరిక ..



జీవించాలనే కోరిక మౌలికమైన కోరిక.
మిగతావన్నీ ఆ కోరికపై ఆధారపడినవి.
--
ఇతరులకి  సహాయం చేయటానికి ముందు, ఒకరు,  ఇతరుల సహాయం అవసరంలేని  స్థితిలో ఉండాలి.

~ నిసర్గదత్త

జ్ఞానం మనకులేని దేనినో ఇవ్వదు. మనది కాని దానినుండి విముక్తం చేసి, మన సహజస్థితిలో నిలబెడుతుంది. మహరాజ్ మాటలన్నీ, మనల్ని మళ్ళీ మనం బయలుదేరిన చోటు కి, దారితప్పిన చోటుకి తిరిగి మళ్లిస్తాయి. మన సహజస్థితి తెలుసుకొని, అక్కడ నిలకడగా, స్థిరంగా ఉండగలిగితే.. ఇక లోటూ, భయమూ అనే సంవేదనలకి చోటే ఉండదు మనలో.

జీవించాలనే కాంక్ష ప్రగాఢమైనది జీవులన్నిటికీ. దాని తరువాతనే, దాని లోపలనే, దాని చుట్టూనే మిగతా కాంక్షలన్నీ తిరుగుతుంటాయి. మిగతా కోరికలన్నీ కాసేపు ప్రక్కకునెట్టి ఆ మౌలికమైన కోరికని శ్వాసిస్తూ, ధ్యానిస్తూ ఉంటే మనలో గొప్ప నిలకడ, స్తిమితం ఏర్పడుతూ ఉండటం గమనిస్తాము. మన ఉద్వేగాలలో, సంవేదనల్లో, ఆలోచనల్లో అంతకు ముందుకన్నా లోతైన స్పష్టత ఏర్పడటం, మన లోపలి డొల్లతనం స్థానంలోకి ఒక నిండుదనం చేరుకోవటం గమనిస్తాము.

కానీ మనపైనా, మన జీవితంపైనా మనకు అంత ప్రేమా, శ్రద్ధా ఉన్నాయా? మన జీవితానుభవం పైన మనకు అంత లాలస ఉందా?

ఇతరులు మనల్ని గుర్తించటం, మెచ్చటం అనే ఏ మాత్రమూ అర్థమూ, అందమూ, జీవమూ లేని వెర్రిలో పడి, మన నిజస్థితికి ఎంత దూరమౌతామో.

ఎంతగా లోకంలో కూరుకుపోతామో, అంతగానూ మనల్ని మనం కోల్పోతాం. అంతగానూ మనం చెదిరిపోయి, లోకమంతా చెదిరిపోయిందని, దీనిని బాగుచేసి తీరాలని నడుం కడతాం. నా నమ్మకాల ప్రకారం మాత్రమే లోకంలో శాంతి రావాలని కత్తులు దూస్తాం. నాది మాత్రమే ప్రేమనిండే మార్గమని గట్టిగా కోపించి, కొట్టి మరీ చెబుతాం.

కానీ, తనను తాను చేరుకోవటమే లోకశాంతికి మొదటి అడుగని తెలిసినవారు నిశ్శబ్దంగా ఆ పని చేస్తూనే ఉంటారు.

~ బివివి ప్రసాద్

26 మే 2016

'బ్రహ్మోత్సవం' సినిమా గురించి..


‘బ్రహ్మోత్సవం’ మంచి సినిమాలు కోరుకొనేవాళ్ళు తప్పక చూడవలసిన సినిమా. సినిమా రెండవసారి చూసినపుడు మరింత బాగా అనిపించింది. కొన్ని సీన్లు ఎడిట్ చేయటం వలన అనుకొంటాను, మొదటిసారి చూసినపుడు మొదటిభాగంలో కలిగిన విసుగు కలగలేదు. సినిమాని మరింత బాగా ఆస్వాదించదలిస్తే, కథ ముందుగా తెలుసుకొని వెళ్తే బావుంటుంది. సన్నివేశాలలోని వేగమూ, సంభాషణలలోని లోతూ గ్రహించటానికి కథ ముందుగా తెలియటం ఉపయోగపడుతుంది. 

మనం అన్నీ నోటి దగ్గరకి అందిస్తే తినటానికి అలవాటుపడ్డవాళ్ళం. Flat గా ఉండే పాత్రలు, సన్నివేశాలు, ఏమంత ఆలోచించాల్సిన, అనుభూతించాల్సిన అవసరం లేకుండా, సినిమానే మనకి ఆలోచనల్నీ, అనుభూతుల్నీ బాగా అర్థమయ్యేలా వివరిస్తే మరబొమ్మల్లా వాటిని ఆస్వాదించి వస్తాం. మన ఆలోచనకి, అనుభూతికి, మనకి అలవాటైన ఉద్వేగాలకి పరీక్ష ఎదురైతే ఆందోళనలో పడతాము. మన మానసిక చైతన్యాన్ని మరికాస్త మెరుగుపరిచే ప్రయత్నాలని వెక్కిరింతలతో త్రిప్పికొడతాము.

శ్రీకాంత్ మనకున్న శక్తివంతులైన దర్శకులలో ఒకడు. మంచి అభిరుచి, భావపరిణతి ఉన్నవాడు. సినిమా సమాజానికి ఎంతోకొంత మంచి చేయాలి అనుకొనేవాడు. కమర్షియల్ సినిమాకి, కళాత్మక సినిమాకి మధ్య వారధి కట్టే వీలుందా అని ప్రయత్నిస్తున్నవాడు. అతని ప్రయత్నాలని సామాన్య ప్రేక్షకులు ఎలా ఉన్నా, మంచి సినిమాలు కోరుకొనేవారైనా సానుకూల దృక్పథంతో చూడటం అవసరం అనుకొంటాను.

సినిమాకి సూత్రప్రాయమైన కథ చాలు కానీ, కథనం చాలా ముఖ్యం అనుకొంటాను. కథనంలో చూపించగల పాత్రల రంగులు, వాటి ఉద్వేగాల వెలుగు నీడలు, వీటి లోతునీ, విస్తృతినీ బట్టి ఆ సినిమా ప్రేక్షకుడి పైన ముద్ర వేస్తుంది. చెప్పదలచిన కథ, అది చెప్పటానికి ఎన్నుకొన్న ఉద్వేగాలు, ఆ ఉద్వేగాల్ని ప్రతిఫలించే పాత్రలు, అవి మసలే సన్నివేశాలు, ఆ సన్నివేశాలలోని మాటలు, నిశ్శబ్దాలు. ఇవీ బలమైన సినిమాని నిర్మిస్తాయనుకొంటాను.

ఈ సినిమా కథ కూడా చాలా చిన్నది. తన కష్టంతో పైకి ఎదిగిన సత్యరాజ్ (నటుల పేర్లే రాస్తున్నాను) ఎప్పుడూ తనతో పదిమందీ ఉండాలనుకొంటాడు. అందరూ కలిసి ఉండాలి అనుకోవటమూ, ఎవరికైనా ఎంత ఇవ్వాలనిపిస్తే అంతా ఇవ్వటమూ అతనికి ఇష్టం. నలుగురు బావమరుదులు అతనితో పాటే ఉంటారు. ఈ అయిదు కుటుంబాలు, సత్యరాజ్ స్నేహితులు కలగలిసి మసలే జీవితంలో, అతను మాత్రమే కేంద్రంగా ఉండటాన్ని తట్టుకోలేకపోతున్న ఒక బావమరిది, రావు రమేశ్ , తన కూతురిని సత్యరాజ్ కొడుకైన మహేష్ కి ఇస్తే తన హోదా పెరుగుతుంది అనుకొంటాడు.

విదేశాల నుండి వచ్చిన, సత్యరాజ్ స్నేహితుడి కూతురైన కాజల్, మహేష్ ప్రేమించుకొంటారు. కాజల్ స్థిరమైన ఆలోచనలు లేని, స్వేచ్చగా బ్రతకాలనుకొనే అమ్మాయి. వారి ప్రేమ కొంత దూరం నడిచాక, ఆ అమ్మాయి ఇంత పెద్ద కుటుంబంలో, తన స్వేచ్చని పోగొట్టుకొని ఉండలేనని చెప్పి వెళ్ళిపోతుంది. వీళ్ళ ప్రేమకథ తెలిసిన రావు రమేశ్, ఇక తాను సత్యరాజ్ తో కలిసి ఉండలేనని చెపుతాడు. అతనిలో దాగిన అసూయకి, ద్వేషానికి గాయపడిన సత్యరాజ్ కొడుకు మహేష్ తో తన బాధ పంచుకొంటూనే ప్రాణం వదిలేస్తాడు.

ఒంటరిగా మిగిలిన మహేష్ కుటుంబం లోకి , విదేశాలలో నివసిస్తున్న అతని చెల్లెలి స్నేహితురాలు, సమంత ప్రవేశిస్తుంది. ఆమె కూడా మహేష్ లానే నలుగురూ కావాలనుకొనే, జీవితాన్ని తేలికగా గడపాలనుకొనే మనిషి. మహేష్ కుటుంబం ఏటా జరుపుకొనే శ్రీనివాస కళ్యాణం సందర్భంలో ఏడుతరాల ప్రస్తావన వస్తుంది. మహేష్ ఏడుతరాలకి సంబంధించిన బంధువుల్నీ కలుసుకొందామని సమంత, మహేష్ బయలుదేరతారు. వాళ్ళని వెదుకుతూ, కలుస్తూ ఇద్దరూ తిరగటమూ, చివరిలో రావు రమేశ్ కూతురి పెళ్లిలో ఒక విషయం తెలియటం వల్ల అతనిలో వచ్చిన పరివర్తనతో కథ ముగుస్తుంది.

మొదట వచ్చే సమంత సీన్ మినహాయిస్తే, స్నేహితుడి కూతురి పెళ్లి తను జరిపించటంతో కథ మొదలవుతుంది. తరువాత జరిగే శ్రీనివాస కళ్యాణమూ, అందరూ కలిసి ప్రయాణం చెయ్యటమూ, వీటి మధ్యలోనే, మహేష్, కాజల్ ల ప్రేమ కథ, రావు రమేశ్ విడిపోవటం, సత్యరాజ్ మరణంతో మొదటి భాగం ముగుస్తుంది. రెండో భాగంలో సమంత ప్రవేశం, వాళ్ళు బంధువులని వెదుకుతూ, తిరగటం, రావు రమేశ్ కూతురి పెళ్లి ఉంటాయి.

పాతికకు పైగా పాత్రలు, వాటికి తగిన సమర్ధులైన నటులూ ఉన్న ఈ సినిమాలో, కొన్ని పాత్రలు నీడల్లాగానే మిగిపోతాయి. కథ ప్రధానంగా సత్యరాజ్, మహేష్, రావు రమేష్, కాజల్, సమంత ల చుట్టూ తిరుగుతుంది. రెండో ప్రాధాన్యతలో రేవతి, జయసుధ, మరి నలుగురైదుగురు కనిపిస్తారు. వీరిలో మహేష్, రావు రమేష్, సమంత బాగా చేసారనిపించింది. మిగిలినవారంతా తమ పరిధి మేరకు చేసారు. కాస్త సీరియస్ tone లో నడిచే కథలో రెండో భాగంలో వచ్చే వెన్నెల కిషోర్ పాత్ర రిలీఫ్ గా అనిపిస్తుంది.

కుటుంబసంబంధాల విలువని గుర్తుచేసుకోవటానికి ఈ సినిమా చూడాలి. ముఖ్యంగా శ్రీకాంత్ రాసుకొన్న సంభాషణలు కొన్ని ఆలోచించవలసినవి. నా వరకూ, సత్యరాజ్ కూతురి తో సంభాషణ, చివర రావు రమేశ్ సన్నివేశం కళ్ళు తడిచేలా చేసాయి. దర్శకుడు సన్నివేశాలని ఓపెన్ చేసే, క్లోజ్ చేసే పద్ధతి మనకు నలిగిన ఆలోచనా, అనుభూతీ ధోరణులనుండి మనల్ని మేల్కొలిపే ప్రయత్నం చేస్తుంది. కొన్ని సంభాషణల్లో సాంద్రంగా పలకరించి వెళ్ళిపోయిన భావాలని, సన్నివేశాలుగా డీకోడ్ చేసి ఉంటే, మరో మాటలో, డ్రామా ఇంకా బాగా పండి ఉంటే, ఈ సినిమా మరింత గాఢంగా హృదయాలని తాకి ఉండేది. బహుశా, ఒక క్లాసిక్ గా కూడా మిగిలేది. మహేష్ పాత్రకి కొంత స్పేస్ తగ్గించి, మిగిలిన పాత్రల మధ్య మరికొన్ని సీన్లు వస్తే, కథనంలో మరింత కాంట్రాస్ట్, క్లారిటీ వచ్చేవి అనిపించింది.

కంటినిండా పరుచుకొనే సెట్టింగ్స్, కెమెరా పనితనం, సంగీతం ఈ సినిమాకి నిండుదనాన్ని తెచ్చాయి. కోరియోగ్రఫీ, రీ రికార్డింగ్, ఎడిటింగ్ పరవాలేదు. కారణమేమో కాని, కొన్ని సంభాషణలు సరిగా వినిపించలేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే ఒక అద్భుతమైన మధుర ఫలం, మరికాస్త పక్వం కావలసిందేమో అనిపించింది. అయినా, ఒక తాజా అనుభూతి కోసం, కాస్త జీవంతో ఉన్న ఆలోచనల కోసం ఈ సినిమా తప్పక చూడాలి.

18 మే 2016

నాలుగు మానసిక శక్తులు:

అనుభవాన్ని చూసే శక్తి, తీసుకొనే శక్తి, నిలుపుకొనే శక్తి, వ్యక్తీకరించే శక్తి అని నాలుగు ఉంటాయనిపిస్తుంది.

అనుభవాన్ని తీసుకొనే చూపు ఎంత విశాలమైతే, సూక్ష్మమైతే, లోతైనదైతే అంతగానూ అనుభవం నాణ్యత ఉంటుంది. ఆ చూపు వికసించటంపైనే దృష్టి నిలిపినవారు, జీవితమంతా పసిపిల్లల్లా నేర్చుకొంటూనే, వికసిస్తూనే ఉంటారు. వీళ్ళే మానవాళికి ముందు నడుస్తారు. పువ్వులో అరణ్యాన్నీ, ఇసుకరేణువులో ఎడారినీ చూడాలని ఒక కవి అంటాడు కదా.

ఇక, అనుభవాన్ని తీసుకోవాలంటే మనసులో తగినంత ఖాళీ ఉండాలి. ఆశ్చర్యపడే గుణం ఉండాలి. తాను అనుభవంలోకి ఇంకిపోయే అమాయకత్వం ఉండాలి. మనుషులు నిజాయితీ గలవారైనపుడు మాత్రమే, అనుభవాలు వాళ్ళపై సూటిగా పనిచేస్తాయి. ఇతరులతో నటించటం అలవాటై, ఇమేజ్ లో బతకటమే సహజమైపోయి, చివరికి తమతో తాము కూడా నటించటంలోనే మునిగిపోయినవాళ్ళు అనుభవాలకి మొద్దుబారిపోతారు. వాళ్ళ జీవితానుభవం మృతప్రాయమౌతుంది.

అనుభవాన్ని నిలుపుకోవాలంటే జీవికి తగినంత ఓపిక ఉండాలి, జీవించటం అంటే చాలా ఇష్టం ఉండాలి. తనతో తనలో తానే నిండిపోవటం తెలియాలి. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి బలమైన జీవులు ఉంటారు.. చాలామందికి అనుభవాన్ని తీసుకొనే వరకూ కంగారు, అనుభవం తాలూకు పరీమళాన్ని మళ్ళీ మాటల్లో ఒంపుకొనే వరకూ ఆరాటం. ఈ తొందర మరీ ఎక్కువ ఉన్నవాళ్ళనే సాధారణంగా అల్పజీవులుగా భావిస్తాము. ఇదేమీ చులకనగా చూడవలసిన విషయంకాదు కానీ, ఇలాంటివాళ్ళు తాము శాంతిగా ఉండరు, ఇతరుల్ని ఉండనివ్వరు.

అనుభవాన్నిదర్శించటమూ, తీసుకోవటమూ, నిలుపుకోవటమూ ఎంతగా చాతనయితే అంతగానూ అనుభవాన్ని వ్యక్తీకరించేశక్తి సహజంగా వికసిస్తుంది. ఆ వ్యక్తీకరణ జీవి నేపధ్యాన్నీ, ఆసక్తినీ, కొద్దిపాటి సాధననీ అనుసరించి మాటల్లో, చేతల్లో, కళల్లో ఏ రూపంలోనైనా ఉండవచ్చు.

మనుషుల చూపు ఎదగనంత కాలం, పరస్పరనిందలతో, హింసతో కాలం గడపటం తప్ప జీవితాలకి శాంతి ఉండదు. సమాజంలో సహజమైన లయ ఏర్పడదు.

~ బివివి ప్రసాద్

23 ఏప్రిల్ 2016

నిలబడిన చోటు

మిత్రులం మాట్లాడుకొనేటపుడు ఒక్కోసారి, స్టాండ్ పాయింట్ అనే మాట వస్తుంది మా మధ్య. స్టాండ్ పాయింట్ అంటే ఏమిటండీ అన్నాడు ఒక కొత్తమిత్రుడు. మొత్తం జీవితాన్ని చూడటానికి మనలోపల మనం నిలబడివున్న చోటుని స్టాండ్ పాయింట్ గా అంటూ ఉంటాము.

కాస్త సులువుగా అర్థం కావాలంటే, సైకిల్ మీద తిరిగినప్పుడు, మోటారుసైకిళ్ళూ , కార్లూ ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అలాగే మోటార్ సైకిల్ మీదనో, కారులోనో తిరిగినప్పుడు మిగతావి రెండూ ఇబ్బంది పెడతాయి. మనమున్న స్థితిని బట్టి మనకు అసూయ కలిగించేవో, చులకనభావం కలిగించేవో కనిపిస్తాయి. ఇది కేవలం వాహనాల విషయంలోనేకాదు, మనమున్న ఆర్ధిక, సామాజిక, రాజకీయ స్థితులని బట్టి, ఇంకా సూక్ష్మమైన తలంలో (ప్లేన్) చెప్పాలంటే మనకూ, ఇతరులకూ ఉన్న ఇచ్చా, క్రియా, జ్ఞాన శక్తులలోని పోలికలూ, వైరుధ్యాలని బట్టి మనకు తక్కిన మనుషుల పట్ల ఒక అభిప్రాయమూ, బంధమూ ఏర్పడతాయి.

అంటే మనం ఎక్కడ నిలబడి సమస్తాన్నీ అర్థం చేసుకొంటున్నామో, అనుభూతిస్తున్నామో, అనుభవిస్తున్నామో, ఏ భావాల, ఉద్వేగాల, ఆలోచనల సమూహాన్ని నేనుగా, నాదిగా అనుకొంటున్నామో దానిని స్టాండ్ పాయింట్ అంటాము.

నిరపేక్ష సత్యం అనుభవంలోకి రావాలంటే, అర్థంకావటమో, అనుభూతి చెందటమో, నిరపేక్షసత్యం తాను కావటమో జరగాలంటే స్టాండ్ పాయింట్ మారాలి అనుకొంటూ ఉంటాము.

మానసిక ప్రపంచంలో ఒకరినుండి మరొకరికి ఎన్ని వైరుధ్యాలున్నా, ఒకరి చూపు నుండి మరొకరిది ఎంత భిన్నంగా ఉన్నా చివరికి అవన్నీ మనసు నుండి బయలుదేరిన చూపులే గనుక అవన్నీ ఒకలాంటివే అవుతాయి. ఉదాహరణగా చెప్పాలంటే, ఒక విశాలమైన చెరసాలలో ఉన్నవారు, ఆ చెరసాలలో ఎక్కడ నిలబడి తక్కిన ఆవరణని చూసినా వారంతా చెరసాలలో నిలబడి చెరసాలని చూడటమే జరుగుతుంది. అట్లా కాక, ఎవరైనా ఒకరు, దానిగోడలు దాటివెళ్లి చెరసాలని చూడగలిగితే, వారి అవగాహన పూర్తిగా వేరుగా ఉంటుంది.

మనస్సు అత్యంతబలమైన, కానీ, అదృశ్యమైన గోడలతో నిర్మించిన చెరసాల వంటిది. దానిని దాటి మనస్సు కల్పించే జీవితాన్ని చూసినపుడు, అప్పటివరకూ బంధనామయంగా, దుఃఖపూరితంగా తోచిన ప్రపంచం స్వేచ్చామయంగా, దయపూర్ణంగా దర్శనమిస్తుంది.

కాస్త సూక్ష్మ బుద్ధి గలవారికి ఈ మాటలు అర్థంకాగానే అంతా తెలిసినట్టు అనిపిస్తుంది కాని, క్షణమాత్రంగా తెలియటం వేరు, అది అనుభూతిగా వికసించి, అనుభవంగా ఫలించి, చివరకు తానుగా స్థిరపడటంవేరు.

~ బివివి ప్రసాద్

17 మార్చి 2016

ఎండ


నవ్య వారపత్రిక 'ప్రపంచ కవితా దినోత్సవం ' ప్రత్యేక సంచికలో..

నవ్య వారపత్రిక

17 జనవరి 2016

నిరపేక్ష సత్యం : రెండు మార్గాలు

"విశ్రాంతిగా 'నేను'ను గమనిస్తూవుండు.
వాస్తవం దాని వెనుకే వుంది.
ప్రశాంతంగా, నిశ్శబ్దంగా వుండు;
అది వికసిస్తుంది లేదా నిన్ను లోగొంటుంది.

నిన్ను సంస్కరించుకొనే ప్రయత్నం చెయ్యకు,
మార్పు ఎంత నిష్ఫలమో గ్రహించు.
మార్పు చెందేది మారుతూనే వుంటుంది,
మారనిది ఎదురుచూస్తూ వుంటుంది.

మారేది మారనిదాన్నిస్వీకరించాలని ఎదురుచూడకు,
అది ఎప్పటికీ జరగదు.
మారేదంతా భ్రమా జనితమని గ్రహించి విడిచిపెడితే,
మార్పులేనిది తనంత తానే వస్తుంది. (తెలుస్తుంది)" ~ నిసర్గదత్త

నిరపేక్షసత్యాన్ని తెలిసేందుకు 
ఆధునిక జ్ఞానులు బలంగా ప్రతిపాదిస్తున్న మార్గాలు ముఖ్యంగా రెండు కనిపిస్తున్నాయి.
ఒకటి. 'నేను'. రెండు. 'ఇప్పుడు'.

మన చుట్టూ ఉన్న ఇతర దేహాల నుండి మన దేహాన్ని వేరు చేస్తున్నమౌలిక భావమేది అని పరిశీలిస్తే 
అది 'నేను' అన్న భావంగా తెలియవస్తుంది.
ఆ 'నేను' అన్నది ఒక ఆలోచన కాదు, ఒక ఊహకాదు, ఒక ఉద్వేగం కాదు.

ఆ 'నేను' అన్నది మనలోని అతిసున్నితమైన అనుభూతిగానో,
మహా బలమైన అనుభవంగానో,
పుట్టింది మొదలు ఇప్పటివరకూ ఏమార్పూ చెందని స్థిరమైన ఉనికిలానో,
అతి సూక్ష్మమైన స్పురణ గానో మనకి తెలుస్తూ ఉంటుంది.

మానసిక కల్లోలాల పట్ల అనాసక్తంగా ఉండి,
వాటికి ఆధారంగా, స్థిరంగా ఉన్న 'నేను' పట్ల ఆసక్తితో, దానినే గమనిస్తూ ఉంటే
'నేను' కు ఆధారమైన నిరపేక్షసత్యం తెలుస్తుందంటారు.
అది తెలియటమనీ. చూడటమనీ, అనుభవమనీ అనటానికి కూడా లేదు.
కానీ, భాష ఎంతదూరం వెళ్ళినా మానసిక పరిధిలోనిదే గనుక,
మనస్సుకి అతీతంగా, ఆధారంగా ఉన్న'అది'ని గురించి అంతకన్నా దగ్గరగా చెప్పటం వీలుకాదు.

అట్లాగే 'ఇప్పుడు' అన్నపుడు కూడా 
అది మన ఇంద్రియ సంవేదనలకు అంటే శబ్దమూ, స్పర్శా, రూపమూ, రుచీ, వాసనలకు తెలిసే ఇప్పుడు కాదు.
ఆ సంవేదనలను మెలకువగా గమనిస్తే, 
వాటికి ఆధారంగా ఒక అగాధమైన, స్థిరమైన నిశ్శబ్దం లేదా శూన్యం లేదా నిండుదనం (పూర్ణం) తెలుస్తుంది.

అది క్షణక్షణం మారే కాలానికి ఆధారంగా ఉన్న'ఇప్పుడు'.
నాకు దానిని substance (ఆధారం?) అనాలనిపిస్తుంది.
ఉదాహరణగా చెప్పాలంటే,సినిమా తెరమీది దృశ్యం మారుతున్నా, తెర మారనట్లు
కాలం మారుతున్నా, ఆ 'ఇప్పుడు' మారటంలేదు.
గతమూ, భవితా ఎప్పుడూ మన ఊహ లేదా జ్ఞాపకమే కాని 'ఇప్పుడు' కాలేవు కదా.

ఇప్పుడు కి, ఇప్పుడులో, మనం అనుభవిస్తున్నసంవేదనలకి ఆధారమేమిటి అని పరిశీలిస్తే
జ్ఞానులు చెప్పే ఆ అనంతమైన వర్తమానం లేదా ఇప్పుడు కి ఆధారంగా ఉన్న'ఇప్పుడు' స్పురిస్తుంది.

ఇంద్రియ సంవేదనలూ, వాటి వలన, వాటి కోసం పుట్టిన ఉద్వేగాలూ, ఆలోచనలూ విడిచి 
తెరవంటి 'ఇప్పుడు' ని గమనిస్తూ ఉన్నా, ఆ నిరపేక్ష సత్యం మనని లోగొంటుంది అని వారు చెబుతారు.

~ బివివి ప్రసాద్