31 ఆగస్టు 2025

కవిత : కానిమ్మని..

మళ్ళీ మేలుకొంటావు,
ఈ కాంతీ, అలల్లా ఎగిసే రంగులూ, నీడలూ, 
వాటిలోంచి దాగుడుమూతలాడే 
జీవితమూ పలకరిస్తాయి
ఈ రోజైనా ప్రేమించగలవా మమ్మల్ని

ప్రతి మెలకువలోనూ జీవితం ఇదే చేస్తుంది,
ప్రతి నిద్రకి ముందూ ఇదే చెబుతావు
సంతోషం, ఇక చాలు, విడిచిపెట్టు అని

నిజంగా, ఈ లోకం అందమైనది,
దీని కాంతినృత్యం సంభ్రమాశ్చర్యాలనిస్తుంది
కానీ, ఇంత వినోదం, 
సముద్రపు లోతుల్లోని 
గాఢమైన ఏకాంతాన్నీ, నిశ్శబ్దాన్నీ ఇవ్వలేదు

ఇక్కడ తిరిగావు, నవ్వావు,
గుండెలవిసేలా ఏడ్చావు కొన్నిసార్లు,
చాలా భయపడ్డావు అనేకమార్లు
ఇవన్నీ అవసరమా
ఖాళీ ఆకాశంలాంటి స్వేచ్చలోకి ఎగిరిపోకని
కలగన్నావు, దిగులు పడ్డావు

అయినా ప్రపంచం పిలుస్తుంది,
అమ్మ పిలిస్తే పరుగున వచ్చినట్టు
తటాలున దీనిలోకి మేలుకొంటావు 

పక్షి కూత గాలిలో కలిసిపోతుంది,
వికసించిన పూవు భూమిలో కరిగిపోతుంది,
ఎగసిపడే అల సముద్రంలో మాయమౌతుంది, 
ఆట ముగిశాక ఖాళీ తలుపు తట్టితీరుతుంది 

సరే, ఇవాళ్టికి కానిమ్మని
ప్రపంచంలోకి అడుగుపెడతావు

బివివి ప్రసాద్

మాయాతెరల వెనుక అన్వేషణ - బివివి ప్రసాద్ కవిత్వం

"అనంతమైన కొలతలతో అలల్లా ఎగసిపడే సృష్టి ఇది/ దీనిలోకి వెలుతురు పుట్టినట్టు పుట్టి/చీకటి పుట్టినట్టు వెళ్ళిపోతావు/లేదా నీలో ఇది చీకటి పుట్టినట్టు పుట్టి/ వెలుతురు పుట్టినట్టు వెళ్ళిపోతుంది" అంటారు కదా ఈ కవి.. ఇది మొదలు కాదు.. చివరా కాదు. జీవన ప్రయాణంలో ఎదురైన అనుభవాల తాలూకు వాస్తవం.. నిజానికి సృష్టి నిన్నటినీ, నేటినీ కలిపే అనేకానేక కలిపే రేఖలతో పాటు ఒకే ఒక్క విడదీసే రేఖతో కూడా నడుస్తూనే వుంటుంది. అలాంటి రేఖలకు ఎదురైన శిలా మస్తకాల్ని పలకరిస్తూ, మచ్చిక చేసుకుంటూ ఎదురపుతున్న కంటక ముఖాల్ని తొలగిస్తూ కదల్లేక పోతున్న కాలాన్ని కదిలిస్తూ, నడిపిస్తూ పదం పదం ముందుకు పయనం చేసేవాడే కవి. ఏదో తోచక రాస్తున్నారనుకునే మీమాంశతో సమాజం నడుస్తున్నా కవి తన అక్షరాలతో అర్పేది ఆకలి మంటల్నే కాదు. రాలే కన్నీటి చుక్కల్ని కూడా.. నిత్యం మానసిక దౌర్భల్యంతో ఎదురవుతున్న దిబ్బల్ని, దుబ్బల్ని సస్యశ్యామలం చేస్తూ నవ చలనం కలిగించే రీతిలో సాగే మహా ఋషి కవి.

ఆధ్యాత్మికత, తాత్వికత, వాస్తవికత మూడింటిని ఒక తాటిపై ఒడిసి పట్టుకున్న బొల్లిన వీరవెంకట ప్రసాద్ తెలుగు సాహిత్యంలో కవితా ప్రపంచానికి తనదైన ముద్ర వేసుకున్న కవి. 1966 నవంబరు 21న జన్మించిన ఆయన బాల్యం మాతామహులు, మేనమామలు ఉన్న ఉమ్మడి కుటుంబంబో గడిచింది. అనంతరం తల్లిదండ్రుల వద్ద చాగల్లులో ఏడవ తరగతి వరకు, తణుకులో బీకాం రెండవ సంవత్సరం వరకు, చివరి సంవత్సరం కాకినాడలో చదివారు.

సాహిత్యం పట్ల ఆయనకున్న ఆసక్తి చిన్ననాటి నుంచే అవిర్భవించింది. స్కూలు చదివే రోజుల్లో చిత్రకళలో మొదలైన సృజనాత్మకత కళాశాల దశలో కవిత్వంగా రూపాంతరం చెందింది. 1989లో ఆయన తొలి కవితా సంపుటి "ఆరాధన" వెలుపడేలోపు అనేక కవితలు, కథలు, సాహిత్య తత్త్వ చింతనలు రచించారు. ఆరంభంలో వచన కవిత్వం రాసిన ఆయనకు హైకు ప్రక్రియపై ప్రత్యేక ఆకర్షణ పెరిగింది. ఫలితంగా 1995, 1997, 1999లో వరుసగా "దృశ్యాదృశ్యం", "హైకూ", "పూలురాలాయి" పేర్లతో మూడు హైకూ సంపుటాలు వెలువడ్డాయి. ఆయన హైకూలలో ప్రకృతి సౌందర్యం, జీవన సత్యం, అనుభూతి విశ్వం సులభమైన పదాలతో అవిష్కృతమవుతాయి.

వచన కవిత్వంలో ఆయన శైలి అనుభూతి ప్రాధాన్యతను చాటి చెబుతుంది. 2006లో “నేనే ఈ క్షణం”, 2011లో "ఆకాశం", 2015లో "నీలో కొన్నిసార్లు" అనే సంపుటాలు ఆయన కవితా వైశాల్యానికి నిదర్శనం, ఈ కవిత్వంలో కవి మనిషి అంతర్ముఖంలోని నిశ్శబ్దాన్ని, సమాజంపై ఉన్న అవగాహనను సున్నితంగా వ్యక్తం చేస్తారు. 2022లో "ఊరికే జీవితమై" అనే వచన కవితా సంపుటి కూడా ఈ ప్రయాణానికి చిహ్నం. అదనంగా హైకూలు, హైకుపై వ్యాసాలను కలుపుకొని "బివివి ప్రసాద్ హైకూలు" అనే పుస్తకాన్ని కూడా ఆయన అందించారు. వీరి కవితల్లో సహజత్వం, వాస్తకవిత్వం ప్రధానంగా ప్రతిఫలిస్తాయి. ఉదాహరణకు "అమాయకం" అనే కవితలో కవి అమాయకత్వాన్ని ఒక శక్తిగా, జీవన విలువల మూలంగా చూపిస్తారు. లోకం అమాయకుడిని హేళన చేసినా, గెలుపు కోసం పరిగెత్తినవారు ఎవరూ తృప్తిగా జీవించలేదని, ఒంటరితనంలోనూ సంపూర్ణత ఉందని కవిగా తమ దోరణిని వ్యక్తీకరిస్తారు. ఈ దృక్పథం వీరి కవిత్వానికి ప్రత్యేకతను అందిస్తుంది.

ప్రకృతిలోని ప్రతి చిన్న చలనం ఆయన కవిత్వంలో ఒక సంకేతంలా కనిపిస్తుంది. గాలి వీచటం, చెట్లు చిగురించడం, వానజల్లులు రావడం అన్నీ కవి దృష్టిలో జీవన సౌందర్యానికి ప్రతీకలు. "మనం ఒకరి లోపలికి ఒకరం మరీ ఎక్కువ చొరబడుతున్నామేమో" అనే ఆయన భావన, ఆధునిక జీవితంలోని హడావిడిలో మనిషి కోల్పోతున్న స్వాతంత్ర్యాన్ని గుర్తు చేస్తుంది. ఆయన కవిత్వం కేవలం భావాల వ్యక్తీకరణ కాదు, అది జీవితాన్ని అనుభవించమనే పిలుపు. భావోద్వేగాలకు, ప్రకృతికి, సంబంధాల సౌకుమార్యానికి ఆయన కవిత్వం అద్దం పట్టింది. అందుకే ప్రసాద్ గారి కవిత్వం నేటికీ పాఠకుడి మనసును మృదువుగా తాకుతూ, అలోచనల్లో కొత్త వెలుగులు నింపుతుంది.

బివివి ప్రసాద్ కవిత్వం సరళమైన భాషలో గాఢమైన అర్థాలను మోసుకువస్తుంది. హైకూలలో సంక్షిప్తత, వచన కవిత్వంలో విస్తృతి కలగలిపిన అయన సాహిత్యసృష్టి తెలుగు కవితా సంప్రదాయానికి ఒక విలువైన వనరుగా నిలిచింది. హైకూ ప్రక్రియలో అనవసర పదాల్లేకుండా, మూడు పాదాల్లోనే ఒక విశ్వాన్ని సృష్టించే సామర్థ్యం ఆయనలో ఉంది. హైకూలలో ప్రకృతి దృశ్యాలు కేవలం వర్ణనకే పరిమితం కాకుండా, జీవన సత్యాలను ప్రతిబింబించే సాధనాలుగా నిలుస్తాయి. "పూలురాలాయి" వంటి హైకూ సంపుటాల్లో కవి ఉపయోగించిన దృశ్యాలు పాఠకుడికి ఒక క్షణానుభూతిని కలిగిస్తాయి.

బివివి ప్రసాద్ కవిత్వ శైలిని విశ్లేషిస్తే, ఆయన రచనల్లో స్పష్టంగా కనబడే కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఆయన కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మొదటగా, ఆయన శైలిలో సహజత్వం ప్రధానంగా ఉంటుంది. బలవంతపు అలంకారాలు, గజిబిజి ప్రయోగాలు ఆయన రాతల్లో కనిపించవు. కవి అనుభవాన్ని ఏకకాలంలో సులభమైన భాషలో, కానీ లోతైన భావాలతో వ్యక్తం చేస్తాడు. ఉదాహరణకు, ప్రకృతిలోని చిన్న సంఘటనలు గాలి. వీయటం, చెట్లు చిగురించటం, వాన చినుకులు పడటం అన్నీ వీరి కవిత్వంలో జీవితానికి ప్రతీకలుగా మారుతాయి. ప్రకృతిని కేవలం వర్ణించడమే కాదు, జీవన తత్త్వాన్ని అందులో కనుగొని పాఠకుడికి అందజేస్తాడు. మరొక్క విషయం వీరి కవితా శైలిలో అనుభూతి ప్రధాన స్థానం కలిగి ఉంటుంది. కవిత్వం కేవలం భావుకతతో కాకుండా, లోతైన మానసిక అన్వేషణతో నిండి ఉంటుంది. ఉదాహరణకు, "మనం ఒకరి లోపలికి ఒకరం మరీ ఎక్కువ చొరబడుతున్నామేమో" అనే వాక్యం, అధునిక మనిషి సంబంధాలపై లోతైన అవగాహనను తెలియజేస్తుంది. ఈ భావనల్లో కవి ఒంటరితనం, మనుషుల మధ్య దూరం, అంతర్మధనం వంటి అంశాలను సున్నితంగా వ్యక్తం చేస్తారు.

వీరి వచన కవిత్వంలో విస్తృతమైన భావప్రవాహం ఉంటుంది. వచనకవిత్వంలో సంప్రదాయ లయ లేదు కానీ, ఆయన రాతల్లో అంతరంగ లయను సృష్టించే పద ప్రయోగం కనిపిస్తుంది. ఈ లయ పాఠకుడికి చదివేటప్పుడు ఒక మృదువైన నాదాన్ని అందిస్తుంది. కవితలోని అత్మీయత, వ్యక్తిగత అనుభవాల సౌకుమార్యం పాఠకుడిని కవితో మమేకం చేస్తాయి. వీరి శైలి తాత్వికతతో కూడి ఉంటుంది. "స్వర్గం వేరే లేదనీ, సంతోషం ముందు కాలంలో దాగి లేదనీ, ఉన్నాం మనం ఒకరి కొకరమని" అనే వాక్యాలు ఆయన తాత్విక దృష్టిని స్పష్టంగా తెలియజేస్తాయి. జీవితం అంటే వర్తమానాన్ని అస్వాదించడం, ప్రస్తుత క్షణంలోనే సంపూర్ణత ఉందని కవి నమ్మకం వ్యక్తం చేస్తారు. వీరు తమ శైలి సంప్రదాయానికి గౌరవం ఇవ్వడంతో పాటు ఆధునికతను కూడా అక్కున చేర్చుకున్నారు.. వీరి భావమేదయినా పాఠకుడిని మృదువుగా తాకుతూ, జీవితాన్ని కొత్తకోణంలో చూడమని అహ్వానిస్తుంది. సరళమైన పదాల్లో గాఢమైన అనుభూతి వ్యక్తం చేయడం ఆయన శైలికి మూలసారం. ఉదాహరణకు...

"నిష్కపట స్వప్నం" కవితను పరిశీలిస్తే, ఇందులోని భావనలతో పాటు కవి శైలిని గమనించడం ఆసక్తికరం.

ఈ కవితలో ప్రధానాంశం నిష్కపటత. ప్రేమ, దయ, కృతజ్ఞత, క్షమ వంటి విలువలను కవి జీవితంలో ఉన్న అత్యున్నత అనుభూతులుగా చూపించాడు. "ఎవరైనా ఇద్దరు మనుషులు నిష్కపటంగా ప్రేమించుకోవటం చూస్తే కనులు చెమ్మగిలుతాయి" అనే పాదంలో కవి మానవ సంబంధాల సౌందర్యాన్ని సున్నితంగా వ్యక్తం చేశాడు. ప్రేమను కేవలం వ్యక్తిగత అనుభవం కాకుండా, సామాజిక విలువగా ప్రతిపాదించారు.

వీరి కవితలో ఒక ప్రత్యేకమైన అనుభూతి ప్రవాహం ఉంది. ప్రతి పద్యంలో మొదట ఒక దృశ్యం ప్రేమ, జీవనానందం, దయ చూపించి, తరువాత దాని ఫలితంగా కలిగే అంతరంగ మార్పుని వ్యక్తం చేశాడు. ఉదాహరణకు, "ఒక జీవి నిష్కపటంగా జీవనానందంలో మునిగితే హృదయం సారవంతమౌతుంది" అనే వాక్యం పాఠకుడికి ఒక నిశ్శబ్దమైన ఉల్లాసాన్ని కలిగిస్తుంది. భాషలో సరళత ఉన్నప్పటికీ, భావంలో లోతు ఉంది. కవి కట్టుబాట్లకు, భయాలకు అతీతమైన ఆత్మీయ క్షణాన్ని సృష్టిస్తాడు:

"ఉన్నట్లుండి పనులు పక్కన పెట్టేస్తావు, భయాలు మరిచిపోతావు, / కట్టుబాట్లు గాలికి వదిలేస్తావు"
 "ఎందుకు బతికావని/ ఎవరూ అడగకూడదనుకొన్నట్టే/ఎందుకు వెళ్ళిపోయావని కూడా ఎవరూ అడగకూడదనిపిస్తే/జీవితానికి పరమ గౌరవంతో నమస్కరిస్తావు// బహుశా అప్పుడు జీవితం కూడా నిన్ను మహా ప్రేమతో హత్తుకుంటుంది" 
ఈ పాదాల్లో ఒక తాత్విక స్వేచ్ఛా భావం వ్యక్తమవుతుంది. ఇది బివివి ప్రసాద్ కవిత్వానికి ప్రత్యేకత.

ఈ కవి ఒక సామాజిక-తాత్విక దృక్పథాన్ని చేర్చడం మనం గమనించవచ్చు. ఆ క్షణాలు భవిష్యత్ తరాల మనుషుల్లో కూడా మిగులుతాయని చెప్పడం ద్వారా ప్రేమ అనేది కేవలం వ్యక్తిగత అనుభవం కాదు, అది మానవ జాతి పరంపరలో కొనసాగుతున్న ఒక సాంస్కృతిక శక్తి అని స్పష్టం చేయడం కూడా మనం గమనించవచ్చు. శైలి ప్రయోగంలో సరళమైన వచనంలా కాకుండా వుంచడానికి ప్రయత్నిస్తారు. కృత్రిమ అలంకారాలు లేకుండా, సున్నితమైన అనుభూతుల్ని జతచేస్తూ వ్యక్తిగత అనుభవం నుంచి విశ్వానుభూతి వరకు తామెరిగిన దృశ్యాల ద్వారా భావవ్యక్తీకరణ చేస్తూ ప్రేమ,
దయ, జీవనానందం వంటి అరుదైన భావాలను దృశ్య రూపంలో చూపించడం ఒక ప్రత్యేకతే. దానితో పాటు తాత్విక స్పర్శ వర్తమానంలో మునిగి, సత్యాన్వేషణ చేయమనే పిలుపును వినిపించడం విశేషం. ఉదాహరణకు "నట్టనడిమి" కవితలో బివివి ప్రసాద్ గారి శైలిని, భావాన్ని విశ్లేషిస్తే అనేక సున్నితమైన లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఈ కవితలో ప్రధానంగా ధ్యానంలో ఒక క్షణికమైన మెలకువ, అంతరంగపు నిశ్శబ్ద అనుభూతి ప్రధాన పాత్రల్ని పోషిస్తాయి. ఈ కవి మొదటి పద్యంలోనే ఒక ప్రతీకాత్మక దృశ్యాన్ని సృష్టించారు గమనించండి.

"తుదిమొదలు తెలియని శూన్యంలో/ తెగిన గాలిపటంలా ఊగుతున్న జీవితమిది" ఇది కవితలోని పరివర్తన భావాన్ని బలంగా తెలియజేస్తుంది. కఠినత నుండి సున్నితత్వానికి, ఆందోళన నుండి విశ్రాంతికి మధ్య వుంచే మార్పును కవి ఒక శబ్దంతో, ఒక అనుభూతితో కలిపి చూపించారు. ఈ రూపకం కవి శైలిలోని అధ్యాత్మికతకు ఒక ప్రత్యేకమైన ఉదాహరణ.

 "మెలకువొకటి" అనే కవితలోని దృశ్యాల్ని సందర్శించాల్సి వస్తే "పూలపై వాలిన బంగారు కిరణం", "ఎగిరే పక్షి రెక్కల నుండి లీలగా తాకిన గాలి", "హోరు తరువాత వికసించే నిశ్శబ్దం" ఇవన్నీ కేవలం వర్ణనలు కాకుండా మనసుకు శాంతి ఇచ్చే ప్రతీకలుగా మిగిలిపోతాయి. వాటిని అనుసరిస్తూ ఒకే దిశగా కవితను ముందుకు నడిపిస్తాయి అందోళనల నుండి విముక్తి, ఒక తాత్కాలిక స్వేచ్చ, 

"భారమవుతున్న జీవితాన్ని తలుచుకొని ఏమీ లేదులే అంటావు శాంతంగా" అనే పాదం కవితలోని తాత్విక మెలకువను వ్యక్తం చేస్తుంది. ఇది జీవితభారాన్ని గుర్తించడం, కానీ దానికి లొంగిపోకుండా క్షణాన్ని అస్వాదించడం అనే భావన. కవి ఇక్కడ భయాలను అధిగమించే అంతరంగిక శాంతిని ప్రతిపాదించాడు.

తదుపరి పాదాల్లో కవి తన కవిత్వ స్వభావాన్నే ప్రతిబింబించాడు: "మరి కొంచెం సమయం అక్కడే ఉండమని పసిపిల్లల్లా అదుగుతాయి ఈ అక్షరాలు" ఇది కవిత్వం పాఠకుని దగ్గరికి రావడాన్ని, ఆ అనుభూతిలో మరికొంత సమయం గడపమని చేసే వేడుకోలు. కవి ఇక్కడ కవిత్వాన్ని ఒక ప్రాణమున్న జీవిగా ప్రతీకాత్మకంగా చూపించాడు.

కవిత యొక్క హృదయాన్ని అవిష్కరించడదలిస్తే "కానీ, ప్రేమ ఉంది చూసావా ఆ సున్నితమైన శబ్దం గుర్తుకు తెచ్చినది" కవిత ఒక తాత్విక వాక్యంతో ముగుస్తుంది చీకటా, వెలుతురా అనేది సందేహంగా ఉన్నా, ప్రేమ మాత్రం ఉందని కవి దృవీకరిస్తారు. చివరి పాదాలు "మబ్బుల వెనుకకి మాయమయే ముందు విశాలమైన గగనంలో ఒంటరిగా సంచరించే చందమామ" కవితను ఒక సజీవమైన, దృశ్యాత్మక ముగింపుకు తీసుకువెళ్తాయి.

పచ్చగడ్డి కోసం వచ్చిన లేళ్ళు ఇనుప కంచె తీగల్లో తలదూరుస్తాయి లేదా కాలు చాస్తాయి. తిన్నది తక్కువైనా పాపం నెత్తుటి కాళ్లతో బయటపడతాయి. నక్కిన నక్కల్ని, పొంచివున్న పులుల్ని ఈ మాటుకో తరిమేస్తూ నేటిని రేపు అనే అశతో కదిలించే దిశగా వీరి కవితల్లోని శైలి లక్షణాలు సున్నితమైన భాష, సులభమైన వచన నిర్మాణం, ప్రతీకాత్మక దృశ్యాలు పూలు, కిరణం, పక్షి, చందమామ తాత్విక మెలకువ జీవితం కంటే విలువైనది అనుభూతి, ప్రేమ అంతర్ముఖ దృష్టి, భయాల నుంచి బయటకు తీసుకువచ్చే అంతరంగ శాంతి కవిత్వ స్వరూపంపై అవగాహన అక్షరాలను పసిపిల్లలుగా పోల్చడం.

ఇది బివివి ప్రసాద్ శైలిలోని ప్రత్యేకత భావం, దృశ్యం, తత్త్వం కలిసిన సరళమైన కవిత్వం. బివివి ప్రసాద్ కవిత్వం సహజత్వంతో, మానవీయతతో నిండి ఉంటుంది. ఆయన పదాలు అలంకారభరితం కావు, కాని అనుభూతి లోతైనది. ప్రతి కవితలో ఒక తాత్విక మెలకువ, జీవితాన్ని కొత్త కోణంలో చూడమనే ఆహ్వానం ఉంటుంది. నిష్కపట ప్రేమ, దయ, కృతజ్ఞత వంటి విలువలను కవి అత్యున్నత సత్యాలుగా ప్రతిపాదిస్తాడు. ప్రకృతిని ఆయన కవిత్వంలో కేవలం దృశ్యరూపంగా కాకుండా, అంతరంగ శాంతికి ప్రతీకగా ఉపయోగిస్తాడు. చిన్న క్షణాల్లో పెద్ద అర్థాలను సృష్టించడం ఆయన శైలికి ప్రత్యేకత. హైకూలలో సంక్షిప్తత, వచన కవిత్వంలో భావ విస్తృతి కవిత్వానికి ద్వంద అందాన్ని తెస్తాయి. అందోళనలతో నిండిన ప్రపంచంలో ఆయన కవిత్వం పాఠకుడికి శాంతి, స్వేచ్ఛ, ప్రేమ అనే మార్గాలను చూపుతుంది. బివివి ప్రసాద్ కవిత్వం మనసుకు మృదువైన స్పర్శ, జీవితానికి అంతరంగ వెలుగులా నిలుస్తుంది. ఎంతో భావాలున్నాయి ఇంకా వర్ణించడానికి.. ఎన్నో వ్యక్తీకరణలున్నాయి.. వివరించడానికి.. కవి అంతరంగాన్ని కొలవడానికి కామాలుండవు. చుక్కలుండవు. అయినా గెలుపు కవిదే.. ఒక కవిని విశ్లేషించాలనుకున్న నా ధైర్యానిదే.. ప్రణామాలు..!

శైలజామిత్ర

ప్రచురణ : సృజనక్రాంతి 31.8.25
శైలజామిత్రగారికి అనేక ధన్యవాదాలు,
మిత్రులు పెరుగు రామకృష్ణ గారికి నమస్సులు 





30 ఆగస్టు 2025

కవిత : వెనుదిరిగి చూసినపుడు

వీడ్కోలు తరువాత, ఎవరో పిలిచినట్టు 
ఇద్దరూ ఒకేసారి వెనుదిరిగి చూస్తారు

అప్పుడు వారిమధ్య
తొలకరివానల మట్టివాసనలు వీస్తాయి,
మొగ్గలింకా వికసించక ముందరి 
ఉదయకాంతులు పారాడుతాయి

అనాది కాలపు దయ
లేత అలలా హృదయాల్ని తాకుతుంది,
నల్లరేగడి నేలలోంచి
కొంచెం పచ్చదనం ఆకాశంవైపు తొంగి చూస్తుంది

వారు తొలిసారి కలిసిందే 
మళ్ళీ కలవటానికనే భావం
కిటికీలు తెరిచినప్పటి 
కాంతిలా లోపలికి దుముకుతుంది 

తరువాత ఏమైనా కానీ,
చివరికి ఏమైనా కానీ, 
మనుషులిద్దరు తొలిసారి 
వెనుకకు తిరిగి చూసుకొన్నపుడు

వారు మామూలు మనుషులు కారు,
మామూలు ప్రాణులు కారు,
వారి మధ్య పాలపుంతలు 
కలగనే సఖ్యత ఏదో 
ఒకసారి వెలిగి ఆరుతుంది

బివివి ప్రసాద్

29 ఆగస్టు 2025

కవిత : ఆటలో పడి..

కుదురుగా ఉన్న సృష్టి 
తనని ఖాళీ అద్దంలో చూసుకుంది,
అందంగా లేననిపించి
ఇద్దరిగా మారింది; ఆమె, అతను

తాను నిండుగా లేననిపించి,
ఒకటి కావాలని చూసింది,
వారి మధ్య ప్రేమగా మారింది

అప్పుడు మొదలుపెట్టింది ఆట
ఇసుకగూడు కట్టడంలో మునిగి
స్థలకాలాలు మరచిపోయిన పిల్లల్లా

ప్రేమలోని అనంతమైన ఛాయల్ని 
ఊహించటంలో మునిగి
బయటికి రాలేదు ఇప్పటికీ

ఎంత నవ్విందో,
ఎన్నింతలు ఏడ్చిందో తెలియదు కానీ,
ఇసుక గూటిని విడిచి
ఇప్పట్లో తాను రావాలనుకున్నా రాలేదు

బివివి ప్రసాద్

28 ఆగస్టు 2025

కవిత : ఆకాశం వైపు

చీకాకుల మునుగీతలోంచి
అప్రయత్నంగా తలయెత్తి 
సాయంకాలపు ఆకాశాన్ని చూసావు

అమ్మమ్మ ఒడిలోంచి
ఆశ్చర్యంగా కన్నార్పక చూసిన ఆకాశాన్ని,
ఆరుబయట చాపలపై కథలు చెప్పుకుంటూ
కనులు మూసే ముందు తలనిమిరిన ఆకాశాన్ని,
ఆటల్లో కింద పడినపుడు 
హఠాత్తుగా విశాలమైన ఆకాశాన్ని,

ఆమె మౌనానికి అర్థం తెలియక 
దిగులుగా కనులప్పగించినపుడు 
కరుణతో కౌగలించుకున్న ఆకాశాన్ని,
మిత్రుడి సాయంతో జీవితం లోతుల్ని 
పట్టుకోవాలని చూసే మాటల మధ్య 
మౌనంగా దర్శనమిచ్చిన ఆకాశాన్ని

చీకాకులెటూ పోవు
బలహీనతల్ని గిల్లుతూ వుంటాయి,
లేదా, బేలగా నీ వంక చూస్తుంటాయి,
భయాలు ఊది మంట రాజేస్తూ వుంటాయి,
తప్పించుకునే దారికోసం వెదకమంటాయి 

కానీ, ఆకాశం నిన్నేమీ చేయమనదు 
ఊరికే నిన్ను చూస్తుంది,
నీ చూపుకోసమే చూస్తున్నట్లు, పిలుస్తున్నట్లు,
పోనీ, నేను రానా అని అడుగుతున్నట్లు,
ఎందుకా చీకాకులన్నీ ఇంటికి వచ్చేయి అన్నట్లు
దయగా, తల్లిలా చూస్తుంది

ఇప్పుడిక చీకాకులన్నీ 
దొరికిన నీడల్లో కల్లా కాసేపు మాయమయాక,
నీ ముందు రెండు ప్రశ్నలు నిలుస్తాయి
పట్టుకొంటూ, పట్టుబడటమా, 
విదిలించుకొని, ఎగిరిపోవటమా

మొదటిదే గెలుస్తుందని 
రాసే నీకూ, చదివే మిత్రులకీ చెప్పనక్కరలేదు,
లేదంటే, నువు ఎందుకు రాసేవాడివి,
వారెందుకు చదివేవారు,
ఏనాడో మేఘాలపైకి ఎగిరిపోయేవారు

బివివి ప్రసాద్

27 ఆగస్టు 2025

కవిత : ఇందుకు వస్తారు

కలలు కనటానికి వస్తారు 
కొందరు ఈ మొరటు ప్రపంచంలోకి

పాపం, లోకమేమీ మొరటు కాదు,
సౌకుమార్యంలోకి మేలుకొనేందుకు
తగినంత నిద్రపోతూ వుంది
గూటిలో ముడుచుకున్న గొంగళిపురుగులా

ఎండ కాయటంలోని ఉత్సవ సౌరభం 
లోకం గమనిస్తుంది ఏదో ఒకనాడు,
గాలి వీయటం, చెట్లు చిగురించటం,
స్వచ్ఛ జలాలు సందడిగా పరుగులెత్తటం 
శ్రద్ధగా పరిశీలిస్తుంది

జీవులు ఒకటినొకటి తాకటమూ,
ఒకదాని చూపులోకి మరొకటి 
లాలనగా ప్రవహించటమూ,
ప్రార్థన గాక మరొకటి కాదని
ఎరుకలోకి తెచ్చుకొంటుంది 

స్వర్గం వేరే లేదనీ, 
సంతోషం ముందు కాలంలో దాగి లేదనీ,
ఉన్నాం మనం ఒకరి కొకరమని
తలుచుకోవటం కన్నా
పొందవలసిన అనుభవమేమీ లేదని 

మొరటు ప్రపంచం 
రంగురంగుల రెక్కలతో
నీరెండలో హాయిగా ఎగిరే కాలాన్ని 
ముందుగా సూచించటానికి
జీవితం కలగంటుంది వారిని

బివివి ప్రసాద్

26 ఆగస్టు 2025

కవిత : అమాయకం

కళ్ళలో కాస్త తడి ఉండటం వల్ల,
నమ్మకం మొక్క ఇంకా పచ్చగా ఉండటం వల్ల,
లోతులన్నీ తెరిచి ముఖం మెరిసేలా నవ్వటం వల్ల

అమాయకుడివి కావచ్చును,
నీతో ఆడుకోవచ్చని లోకం సరదాపడవచ్చును,
ఎలా బ్రతుకుతాడోనని జాలిచూపవచ్చును

ఎంత తెలివైనవారూ,
రేబవలు గెలుపుపై స్వారీ చేసేవారూ
నవ్వుతూనే బ్రతికింది లేదు,
తృప్తిగా వెళిపోయింది లేదు,
గుండె నిండుగా గాలి పీల్చి
ఇదిగో, బ్రతుకుతున్నానన్నది లేదు

ఎవరికి నచ్చినట్టు వారు ఇక్కడ,
ఎవరికి చాతనైనట్టు వారు
ఇలానే బ్రతకాలన్న శాస్త్రం లేదు,
ఉన్నా, మృతభావాలకి విలువలేదు

ఎంత గతాన్ని తలిస్తే అంతగా,
ఎంత భవితని ఊహిస్తే అంతగా 
ఊపిరాడదని తోచాక

ఈ నిముషంలో హృదయంతో జీవించటం కన్నా
పచ్చని ఆకుల్ని లోనికి పిలిచే కిటికీ ఏదీ లోకంలో..

బివివి ప్రసాద్

25 ఆగస్టు 2025

కవిత : ఫలితం

కొన్ని అక్షరాలని 
చీకటి ఆకాశంలో నక్షత్రాల్లా విరజిమ్మితే 
కొంతసేపటికి గెలాక్సీలుగా మొలకెత్తుతాయా

కొన్ని భయాలని
పరిసరాల్లోకి చీకటిపొగలా పంపిస్తే
కాసేపటికి దయ పాదముద్రలు వినిపిస్తాయా

కొన్ని ఉద్వేగాలని 
జీవితంలోకి వలలా విసిరితే
కొన్నాళ్ళకి బంధాలుగా ఫలిస్తాయా

కొన్ని సందేహాలని 
కాలంలోకి తెరచాపల్లా వదిలితే
ఏదో ఒకనాటికి జవాబుల కాంతుల్ని చేరుతాయా

ఇదంతా ఏమీ కాదు

లేకుండాపోయే చిన్ని ప్రార్థనని 
అనంతంలోకి చేతులు చాచి వినిపిస్తే
ఏనాటికైనా కల చెదిరి స్వస్థత పొందుతావా

బివివి ప్రసాద్
ప్రచురణ : మహా పత్రిక 25.8.25



24 ఆగస్టు 2025

కవిత : మెలకువొకటి

సున్నితమైన శబ్దమొకటి 
రాయిలా బిగుసుకుపోతున్న నిన్ను
నీటిలా మార్చుతుంది
అమ్మ ఒడిలోని విశ్రాంతిలోకి తీసుకుపోతుంది

పూలపై వాలిన బంగారు కిరణం,
ఎగిరే పక్షి రెక్కల నుండి లీలగా తాకిన గాలి,
ఎవరో ఎవరిపైననో దయగా నవ్వు,
హోరు తరువాత వికసించే నిశ్శబ్దం

నిన్ను చేయి పట్టుకొని
నీ దగ్గరికి చేర్చుతాయి

భారమవుతున్న జీవితాన్ని తలుచుకొని
ఏమీ లేదులే అంటావు శాంతంగా
ఓడిపోయే భయం నుండి 
బయటపడతావు తేలికగా కాసేపు

మరి కొంచెం సమయం అక్కడే ఉండమని
పసిపిల్లల్లా అడుగుతాయి ఈ అక్షరాలు
ఇందాక పరిచయమై అంతలో వెళిపోతున్న
మనిషిని చేయి వదలకుండా అడిగినట్టు

ఇదంతా చీకటేనేమో తెలియదు,
చీకటిని వెలిగించే వెలుతురు ఉందేమో కూడా
కానీ, ప్రేమ ఉంది చూసావా
ఆ సున్నితమైన శబ్దం గుర్తుకు తెచ్చినది

అది ఉంది

అది మాత్రమే ఉందా చూడమంటుంది
మబ్బుల వెనుకకి మాయమయే ముందు
విశాలమైన గగనంలో 
ఒంటరిగా సంచరించే చందమామ

బివివి ప్రసాద్ 
ప్రచురణ : స్నేహ ప్రజాశక్తి 24.8.25



23 ఆగస్టు 2025

కవిత : విడిపోయినప్పుడు

ఎవరి నుండన్నా విడిపోయినప్పుడు
చుట్టూ సీతాకోకలు స్వేచ్ఛగా ఎగురుతాయి,
దూరమైన నక్షత్రాలు చుట్టూ మూగుతాయి, 
చిన్న వానజల్లుని తోడు తెచ్చుకొని
ఇంద్రధనువు కావలించుకొంటుంది

ఎవరి నుండన్నా దూరం జరిగినప్పుడు
వారి మధ్య గాలి పిల్లకాలువలా ఒంపులు తిరుగుతుంది,
వారిలో మూసుకుపోయిన చిరునవ్వులు
ఉదయకాంతుల్లా పెల్లుబుకుతాయి,
గాలితెర తగిలి పటాలు ఎగరటం మొదలుపెడతాయి

ఒంటరిగా వచ్చి, వెళ్ళవలసిన ప్రాణాలివి,
తోడు దొరికినప్పుడల్లా ఊపిరాడకపోవడమేదో
లోపల వరదనీరు పెరిగినట్టు వ్యాపిస్తుంది

ఉదయం లేచి అంటాం గదా
ఈ కాంతి ఎంత శాంతిగా ఉంది,
ఈ పిట్టకూత ఎంత నిశ్శబ్దాన్ని తెచ్చింది,
ఈ గాలి ఎన్ని కలలు పోగొట్టి హాయినిచ్చింది అని

వాటి హాయిలోని రహస్యమిది
అవి ఒంటరిగా వస్తాయి, చరిస్తాయి
ఒంటరితనంలోని పరిపూర్ణత బోధించి వెళతాయి 

మనం ఒకరి లోపలికి ఒకరం
మరీ ఎక్కువ చొరబడుతున్నామేమో,
మీట నొక్కగానే దీపం వెలిగినప్పుడైనా 
గది నిండే కాంతితో కోల్పోయే 
శాంతిలోనైనా గమనించగలమా

ప్రచురణ : వీధి అరుగు సంచిక 2/10

బివివి ప్రసాద్



22 ఆగస్టు 2025

కవిత : నిష్కపట స్వప్నం

ఎవరైనా ఇద్దరు మనుషులు
నిష్కపటంగా ప్రేమించుకోవటం చూస్తే
కనులు చెమ్మగిలుతాయి,

ఎవరైనా నిష్కపటంగా 
ఒక జీవిని ప్రేమించటం చూస్తే
ముఖం ప్రసన్న మవుతుంది,

ఒక జీవి నిష్కపటంగా
జీవనానందంలో మునిగితే
హృదయం సారవంతమౌతుంది,

ఎవరికి ఎవరిపై నైనా
దయ, కృతజ్ఞత, క్షమ కలిగితే
అది చూడటం కోసం పుట్టినట్లు వుంటుంది,

ఆ క్షణంలో, పుట్టుక మూలంలోకి,
భూమిలోకి, తారల్లోకి ప్రయాణించినట్లు,
తెలియరాని సరిహద్దుల 
ఆవలికి విస్తరించినట్లు వుంటుంది

ఉన్నట్లుండి పనులు పక్కన పెట్టేస్తావు,
భయాలు మరిచిపోతావు,
కట్టుబాట్లు గాలికి వదిలేస్తావు,
బాధ్యతల్ని చూసి దయగా నవ్వుతావు

క్షణాల తర్వాత 
విధిగా మర్యాదలు తొడుక్కుంటావు కానీ,
నిర్మలమైన నీ ప్రేమా, 
స్వేచ్ఛా స్వప్నమూ ఫలిస్తున్నాయని
నీ లోపలి 
తరువాతి తరాల మనుషులు గుర్తుపడతారు

బివివి ప్రసాద్

21 ఆగస్టు 2025

కవిత : ప్రేమిస్తే..

మనుషులు ప్రేమించుకోవాలి పసిపిల్లల్లా
ద్వేషానికి వేయి కారణాలున్నా, 
ప్రేమకి ఒక కారణం చాలదా

ప్రేమిస్తే తేలుతాము, ద్వేషిస్తే మునుగుతాము
చాలదా, ప్రేమలోకి ఎగిరేందుకు

సూర్యుడెలా కాంతి వెదజల్లుతాడు
యుగాలుగా తరగకుండా 
భూమ్మీది చివరి జీవిపై మోహం వల్ల,
తన కాంతిలోని రూపారూపాలలో
తానే ప్రతిఫలించడం వల్ల

ఎలానో బ్రతుకుతాం
బాధల్లో, భయాల్లో, అరుదుగా సంతోషంలో,
నిన్నలో, రేపులో, తటాలున ఇవాళలో,
ఎలానో మరణిస్తాం నవ్వుతూనో, నవ్వలేకనో 

ఏం లేకున్నా ప్రేమిస్తూ వెళతావు చూసావా
తలవంచని గడ్డిపోచవి,
ఏమున్నా ప్రేమించలేకపోతావు చూసావా
కూలిన మహావృక్షానివి

లోకం ఏమిచ్చిందో కాదు, 
నువు ఏమివ్వగలిగావో విషయం కదా
ఉదయపు బంగారురంగు గాలుల్ని చూడు 
గాలుల్లో తేలే శాంతినీ, సౌఖ్యాన్నీ 

నీపై వాలిన ఈగని మృదువుగా విసిరి చూడు,
ఇదే ఈ క్షణాన లోకానికి నువు ఇవ్వగల కానుక

బివివి ప్రసాద్

20 ఆగస్టు 2025

ప్రేమతాత్విక జీవన సత్యం బివివి కవిత్వం : ప్రసాదమూర్తి

 ప్రమూ పరిచయాలు

|ప్రేమతాత్విక జీవన సత్యం బివివి కవిత్వం|

“రంగూ, రుచీ, స్పర్శా, వాసనా లేని జీవితాన్ని తలచావా గుర్తించావా తమకంగా కౌగిలించుకున్నావా
ఊరకనే జీవితమైపోయావా ఎప్పుడైనా” (ఊరికే జీవితమై..)

         ఎగ్జిస్టెన్షియలిజం అంటే ఇప్పుడు తెలుగులో వాడుకోలో ఉన్న అర్థం వేరు. ఇక్కడ దానికి కుల మత ప్రాంత లింగ భాషాపరమైన అస్తిత్వ వాదంగా అది స్థిరపడింది. వాస్తవానికి ప్రపంచ తత్వవేత్తలు నిహిలిజం, ఎగ్జిస్టెన్షియలిజం, అబ్సర్డిజమ్- ఇలాంటి ఇజాలకు చెప్పిన అర్థం వేరు. జీవితానికి అర్థం ఏమిటి అనే విషయాన్ని పట్టుకొని, దేవుడు దాకా వెళ్లి, తిరిగి జీవితం దాకా వచ్చి, మానవుడి ఈ అస్తిత్వానికి దేవుడికి సంబంధం లేదని నిర్ణయాలు చేసుకొని, ఇది అర్థం లేని జీవితం అని నిర్ధారించుకొని, అది నిజమే కానీ నిరాశ వద్దని, అర్థం లేని జీవితాన్ని అర్థవంతం చేసుకోవడం నీ చేతుల్లోనే ఉందని బుద్ధుడు మొదలుకొని నీషే, సార్త్రే దాకా చాలామంది తత్వవేత్తలు, కాఫ్కా, కామూ, దోస్తయేవ్ స్కీ లాంటి రచయితలు ఎగ్జిష్టియన్షియలిజానికి అసలైన నిర్వచనాన్ని చివరికి నిశ్చయించారు. దేవుడి మీద నమ్మకం ఉన్నవారు, కాస్త ఊగిసలాటలో ఉన్నవారు కూడా జీవితాన్ని అర్థవంతంగా జీవించాలనే విషయంలో ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. జీవితం పట్ల అపారమైన ప్రేమ, నమ్మకంతోనూ, అనేకానేక అంతుచిక్కని విషయాల పట్ల విస్మయంతోనూ ఉంటూనే జీవితాన్ని సహస్ర బాహువులతో ఆలింగనం చేసుకొని అపార లౌకిక అనుభవంతో ఈ జన్మను ధన్యం చేసుకోవాలన్న సందేశాన్ని మనకు ఇచ్చినదే అసలైన ఎగ్జిస్టెన్షియలిజం. దీనికి తెలుగులో సంపూర్ణంగా ఒక కవిని ఉదాహరించాలంటే బివివి ప్రసాద్ నే చూపించాలి.

         చాలా రోజులుగా ఇతనితో నాకు స్నేహం ఉన్నా, ఇతని కవిత్వాన్ని స్వయంగా వింటూ లేదా చదువుతూ ఉన్నా, ప్రసాద్ కవిత్వంలోని మూల సూత్రం అంతుచిక్కకుండా కొంతకాలం నాతో ఆటలాడుతుంది. ఆ సూత్రం కొస దొరికిన తరువాత, దాన్ని లాగుతున్న కొద్దీ మనం పైన చెప్పుకున్న జీవితపు అసలైన అస్తిత్వవాదంలోని సౌందర్య రహస్యం ఇంకా ఇంకా బయటపడి నన్ను సిసలైన రసానుభూతికి లోను చేసింది. ఏ కవిత పట్టుకున్నా జీవితంతో మొదలై జీవితంతో నడుస్తూ జీవితం చుట్టూ తిప్పుతూ జీవనలాలస లోని రహస్య మూలాలను తడుముతూ జీవితం అంచులు దాకా తీసుకువెళ్లి అక్కడ నిలబెడుతుంది. ఇది కదా అస్తిత్వవాదం అంటే అనుకున్నాను.

“ ఒక్కరోజు గడిపి వెళ్లిపోతే చాలదా ఇక్కడ అనుకుంటావు చాలాసార్లు 
 మరల మరల ముఖాలు మార్చుకొని ఎదురవుతున్న అవే అనుభవాలను తలపోస్తూ
 విశాలత్వమేదో నిన్ను పిలుస్తున్నట్టుంటుంది 
వెలిసిపోయిన దృశ్యాల్లోంచీ, శబ్దాల్లోంచీ, దుమ్ము పట్టిన బంధాల్లోంచీ బయటకు రమ్మని”(ఆ దిగులు-ఊరికే జీవితమై)

        ఇటీవల ప్రసాద్ ఫేస్బుక్లో వరుసగా పెడుతున్న కవితల పరంపరను చూసిన తర్వాత ఈ మధ్యనే ఇతను వెలువరించిన “ఊరికే జీవితమై..” అనే కవితా సంపుటిని మరోసారి చేతుల్లోకి తీసుకున్నాను. అది భౌతికంగా చూడడానికి ఒక కాగితాల కట్టే అయినా అది ఒక నదిలా మనల్ని తనలోకి లాక్కొని ఒక మహాసముద్రంలోకి తీసుకువెళ్లి ఆ అలల మీదుగా దిగంతాల వైపు నడిపించి ఇదే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడం అని మనకు చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఏ కవితను తడిమినా ఒక పసిపాపను ఎత్తుకున్నట్టో.. ఒక పూల మొక్కను పట్టుకున్నట్టో.. ఒక మబ్బు తునకను  నెత్తి మీద పెట్టుకున్నట్టో.. జీవితం జీవితం.. కేవలం జీవితం తప్ప జీవితానికి మరొక అర్థం లేదనే పరమార్ధాన్ని తెలుసుకొని సంబరంగా ఎగిరినట్టు అనిపిస్తుంది. 

“నీ చుట్టూ పసిపిల్లల్లా నిలిచిన 
దృశ్యాల్ని, శబ్దాల్ని, స్పర్శల్ని 
ఊరికే ఆగి, ఊరికే చూడు 
కాసేపు జీవితాన్ని, 
నువ్వు జీవించటాన్ని” (ఆగి చూడు-ఊరికే జీవితమై)

          ఈ కవిత్వం, పైపైన చూస్తే ఇది కేవలం వ్యక్తిగతమైనదిగా, వ్యక్తుల విడివిడి జీవితాల ఆనందాలకు సంబంధించినదిగా కనిపిస్తుంది. దాంతో లోకంలోని ఘర్షణలు దోపిడీలు పోరాటాలు వగైరా వగైరాలతో సంబంధం లేని కేవలం వ్యక్తినిష్టమైన కవిత్వంగా దీన్ని కొట్టి పారేసే అవకాశం ఉంది. అందమైన జీవితం వెనక కాలమంతా సాగిన అనంత మానవ సంగ్రామాల చరిత్ర ఉందని, ఈ కవికి దానితో సంబంధం లేదనే తీర్మానాలు కూడా చేయవచ్చు. కానీ  తర్కాన్ని పక్కనపెట్టి వాస్తవాన్ని చూస్తే, ఎవరి జీవితం వారిదే. జీవితం పట్ల ఎవరి అనుభవాలు వారివే. అనేకానేక దారుల్లో చీలిన మనుషులు తమవైన అనుభవాలతో జీవితాన్ని పండించుకోవాలనే పరమార్థం అవగతం చేసుకుంటే, బివివి కవితల్లోని అంతరార్థం మనకు బోధపడుతుంది. జీవితానికి ఏ అర్థమూ లేదు, దీన్ని ఇలా జీవించాల్సిందే అనే నిరాశవాదాన్ని ముందుకు తెచ్చిన షొపన్ హాయర్ లాంటి తత్వవేత్తలను చూశాం. వ్యక్తి నైతిక జీవనం, సామూహిక సమున్నత జీవన చైతన్యానికి దారులు తీయాలని దారి చూపిన బౌద్ధ ధర్మసారం చూశాం. పూర్వం ప్రసేనుడనే రాజు తన భార్య మల్లికను, నీకంటే అధికంగా నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతాడు. అప్పుడు ఆమె మహారాజా నాకంటే అధికంగా నేను ఎవరినీ ప్రేమించలేదు అని చెప్తుంది. దానికి ప్రసేనుడు నా విషయంలో కూడా ఇదే సత్యం అంటాడు. అంతేకాదు అదే విషయాన్ని బుద్ధుడుతో ప్రస్తావిస్తాడు. అప్పుడు బుద్ధుడు, ‘నిజమే, మనిషి తనకు తానే ప్రీతిపాత్రుడు. కావున తనపై తనకున్న ప్రేమనెరిగీ, మరొకరికి ఎవరికీ హాని తలపెట్టరాదు’ అంటాడు(బుద్ధ ధర్మసారం- పి. లక్ష్మీ నరసు). వ్యక్తి నైతికత, ఆచరణలో పరోపకారంగా రూపొందడం బౌద్ధంలోని అతి కీలకమైన అంశం. మన భారతీయ తాత్విక మూలాలున్న ఈ భౌద్ధ ధర్మసారంలోని ఏదో వెలుగు బివివి ప్రసాద్ కవిత్వంలో తొణికిసలాడుతోంది. తాను చూస్తున్న జీవన సౌందర్యాన్ని, జీవితంలో ఆ సౌందర్యం లేకున్నా దాన్ని మనం సృష్టించుకోవాలి అన్న జీవన సత్యాన్ని అందరితో పంచుకోవాలి అన్న అవ్యాజమైన ప్రేమతో ఇతను తన కవిత్వ ఆవరణను విస్తరించుకుంటూ వస్తున్నాడేమో.  తర్కాలు విడిచి ఈయన కవిత్వంలో ‘ఉరికే జీవితమై..’ ఊగితే ఒక జీవితానికి సరిపడా ఊరట మనకు దొరుకుతుంది.

“జీవితం ఉందనిపిస్తే 
చేతులు చాపి దగ్గరకు తీసుకుని అనుభవించు,
 జీవితం ఏమిటనిపిస్తే 
దాని భుజంపై చేయి వేసి నిశ్శబ్దంగా కూర్చో, జీవితం లేదనిపిస్తే ఊరికే ఖాళీగా ఉండు
చూడు పక్షులు ఎగురుతున్నాయి సూర్యుడు వాలుతున్నాడు 
తూర్పు ఆకాశంలో కాసేపటికి 
చంద్రోదయం కాబోతోంది”(సాధన-ఊరికే జీవితం)

    విషయంలో వైవిధ్యం లేకపోతే కవిత్వంలో వైవిధ్యం ఉండదు అనే వాదన కూడా ఒకటి ముందుకు వస్తుంది. జీవితం ఒకటే అయినా జీవితంలోని వేలవేల షేడ్స్  ని వివిధ  కవితల్లో ప్రతిఫలింప చేయడం వల్ల ఈ కవిత్వానికి వైవిధ్య లోపం లేదని కచ్చితంగా చెప్పవచ్చు. ఇదంతా పక్కన పెట్టి, ఎంత తత్వమైనా.. వ్యక్తిగతమో సామాజికమో అదేమైనా.. అందులో కవిత్వం మనల్ని తనలోకి లాక్కుంటుందా లేదా అనేది అంతిమంగా మనం తేల్చాల్సిన విషయం. కొన్నిచోట్ల ఇతడు ఏవేవో మీమాంసలలో కొట్టుకుపోతున్నట్టు కనిపిస్తుంది. కొన్ని వైరుధ్యాలుంటాయి. “మనుషులతో విలువలతో కాదు 
ఊరికే కలిసి ఉండాలి జీవించటంతో” అంటాడు ఒకచోట. ఇదేమిటి అని అతన్ని కొంచెం ప్రశ్నార్థకంగా మనం చూస్తామో లేదో, అంతలోనే ఇలా అంటాడు-
“ చెట్లు జీవిస్తున్నాయి నీతో కలిసి 
నీరు జీవిస్తోంది, గాలి జీవిస్తోంది, ఆకాశం జీవిస్తోంది, కాలం జీవిస్తోంది
నీవు కలిసిన వారిలోంచి,
 విడివడిన వారిలోంచి,
 జీవితం తనను తాను జీవిస్తోంది 
కలలాగా నిన్ను తాకుతోంది”. ఈ మాటలతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం. ముందే చెప్పుకున్నాం కదా, జీవితాన్ని జీవితంగా కాకుండా, సమస్త ప్రకృతిలో భాగంగా జీవితాన్ని జీవించడంలోనే అర్థం పరమార్థం ఉంది. జీవితంలో ఉన్న వైరుధ్యాలు, మీమాంసలు, తర్కవితర్కాలూ వీటన్నింటికీ కవిత్వం ఏమీ అతీతం కాదు. ఏ విషయంలో ఎటు కొట్టుకు వెళ్ళినా, కవిత్వం విషయంలో మాత్రం ఇతను పట్టు తప్పడు. గోర్కీ, టాల్ స్టాయి గురించి చెబుతూ, ‘దేవుడి మీద నాకు నమ్మకం లేదు గాని టాల్ స్థాయి నాకు దేవుడిలా కనిపించాడు’ అంటాడు. దేవుడి మీద మరి నాకు కూడా నమ్మకం లేదు కానీ బివివి కవితా పంక్తులు అతని మాటల్లోనే చెప్పాలంటే ‘దేవుడు చినుకుల భాషలో మాట్లాడుతున్నట్టు, చల్లగా, నెమ్మదిగా, ఉల్లాసంగా ఉన్నాయి’. తెలుగులో తాత్వికతను కవితా స్థాయికి తీసుకువెళ్లిన సంపూర్ణ, సమర్ధ కవిగా బివివి నిలిచిపోతాడు. మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు.
           ……………….
ప్రసాదమూర్తి
8499866699

కవిత : ప్రేమ కథ

కొత్తగా మేలుకున్న ఒక స్త్రీ
కొత్తగా మేలుకున్న ఒక పురుషుడిని 
ఆకర్షించినపుడు 

అతను ఆమెతో అన్నాడు
నిన్ను కదా ప్రేమిస్తున్నాను,
ఇకపై జీవితమంతా నీతో గడపాలనివుంది,

ఆమె ఏమీ మాట్లాడలేదు,
నవ్విందో, లేదో తెలీదు, ఆమెకి కూడా
సూటిగా చూసింది
అతని కన్నులలోకి, కలల్లోకి, కాంతిలోకి
తరాలుగా స్త్రీ పురుషుణ్ణి చూసిన చూపు

అతను వెదికాడు 
ఆమె కళ్ళలో ప్రతిఫలించే పురాస్మృతుల్లో
యుగాలుగా పురుషుడు స్త్రీలో వెదికేది

ఆమె సరేనన్నదో, లేదో తెలియలేదు,
ఏమనాలో ఆమెకీ తెలియనట్లే

సరేనని వినలేని దుఃఖంతో అతను,
అనలేని దుఃఖంతో ఆమె,
కొత్తగా మేలుకున్న బరువైన రోజుల్లోకి ఇద్దరూ

ఉదయాస్తమయాలు 
జీవుల్ని మేల్కొలిపి, జోకొడుతున్నాయి,
చీకటివెలుగుల దాగుడుమూతలాటలోకి
తెలియని ఖాళీలోంచి వచ్చేవారు వస్తున్నారు,
ఖాళీలోకి వెళ్ళేవారు వెళుతున్నారు

కాలం పండిన ఒక సాయంసంధ్యవేళ 
వారు ఎదురయారు
ఆమె చూపులో స్త్రీ లేదు,
అతని చూపులో పురుషుడు లేడు 

కాలం, కలలూ రాలిపోయిన శాంతిలో
ఒకరినొకరు చూసినపుడు,
ఒకే జీవనానందం లోపల
వారెపుడూ కలిసి ఉన్నట్లు కనుగొన్నారు

బివివి ప్రసాద్

19 ఆగస్టు 2025

కవిత : కదిలితే మాత్రం..

మనుషుల బలాలకీ, బలహీనతలకీ, 
కదిలిపోతున్నావు కరుణలోకో, విసుగులోకో,
పాపం, పిచ్చి జాతి, ప్రపంచం నాదనుకుంటుంది,
విశ్వాన్ని జయిస్తున్నానని భ్రమిస్తుంది

చాలా పెద్దది కదా ఇదంతా,
చాలా లోతు, వైవిధ్యం, అనూహ్యం,
దీనిలోకి వస్తారో, జారిపడతారో కూడా తెలీదు,
కానీ, ఎంత గర్వం,
ఏనుగు ముందు చీమ ఛాతీ చూపినట్టు
జీవితం నా అదుపులో ఉందని తలపోస్తారు 

ఇంత తెలివిలేని జాతిలో పుట్టి
ఉదయాన్నో, అస్తమయాన్నో చూస్తావు,
సీతాకోక ఖాళీలోకి ఎగరటాన్నో, 
వాన రంగుల్లో ఒళ్ళు విరుచుకోవటాన్నో,
పిల్లలు ఏమీ పట్టనట్టు నవ్వటాన్నో కూడా

ఇదంతా నిన్ను కదిలిస్తుంది, నీతో కదులుతుంది,
కదిలి, కదిలించి, అమ్మ బిడ్డతో దోబూచి ఆడినట్టు 
ఇదంతా లేదు కదా, నిన్ను వదిలిందే లేదు కదా 
అని నవ్వుతుంది తెలియరానిది 

అంతవరకూ కదిలితే కదులు, ఊరుకుంటే ఊరుకో,
ఏమైందిప్పుడు, ఏమీ కావటానికి వీలులేని చోట

బివివి ప్రసాద్

18 ఆగస్టు 2025

కవిత : ఆవలితీరం నుండి..

సుఖంలానో, బాధలానో, భయంలానో 
పురివిప్పినట్టు తెరుచుకునే రోజుల్ని 
ఒక్కొక్కటిగా గడుపుతావు అనేకసార్లు,
పగటి దీపకాంతిలాంటి నువ్వు
చీకటి పడేకొద్దీ ప్రకాశిస్తావు నీ లోపలికి

జీవించటం అసౌకర్యమైన అనుభవం,
పీడకలలవేళ దేహం కూడా కదిలినట్టు
జీవితం నుండి మరణంలోకి 
నిన్ను నువ్వు బ్రతిమాలుకుంటావు,
ఉనికి నుండి మాయంలోకి కలలు కంటావు

చాలా ఆశ్చర్యం ఇదంతా,
భయపడుతూ ఉల్లాసపడటం, కేరింతలు కొట్టడం, 
భయంలోనే పిట్టలు పాడటం, లేళ్ళు గెంతటం,
పిల్లలు నవ్వటం, యవ్వనం ప్రేమించుకోవటం,
భయంలోనే సెలయేళ్ళు ప్రవహించటం,
సూర్యుడు కాంతిని విరజిమ్మటం

బహుశా, నల్లని చీకట్లోనో, గాఢనిద్రలోనో 
భయావహ జీవితం రెక్కలు వాల్చి నిలుస్తుంది,
మరణం తర్వాత కడపటి స్వేచ్ఛ దొరుకుతుంది
ఇదంతా కానిది ఏమైనా ఉంటే దానికి

ఇది ఇవతలి తీరపు మర్మరధ్వని,
ఒకటే ఊరట ఏమంటే
ఆవలితీరం నుండి చూసినప్పుడు ఇదేమీ లేదు

బివివి ప్రసాద్

17 ఆగస్టు 2025

కవిత : జాగ్రత్త

మనకు తెలిసినదాని కన్నా 
మరికాస్త మంచు కురిస్తేనో,
నీరు కదిలితేనో, గాలి వీస్తేనో,
కూలిపోయే చీమల పుట్ట 
యుగాలుగా నిర్మించిన నాగరికత

అప్పుడు కూడా 
ఏ మొక్క నుండో లేత చిగురు
సూర్యకాంతిలోకి తెరుచుకుంటుంది చూడు,
ఏ ప్రాణికో పుట్టిన పసిజీవం
మృదువుగా గాలిలోకి చలిస్తుంది చూడు,
అక్కడ దాగి వుంటుంది 
జీవితం మనవైపు నవ్వే చిరునవ్వు,
మృత్యువు లోపలి కరుణ

లోకమేమీ డొల్ల కాదు, మనుషుల్లా,
చెట్లూ, పుట్టలూ, ఆకాశమూ, మబ్బులూ,
కెరటాలు హోరూ, దుఃఖితుల కన్నీరూ చెబుతాయి

బిడ్డా, జాగ్రత్త, జీవితం గాజు కన్నా అల్పం,
పూల కన్నా ప్రార్థనా స్థలం,
ఎగిరే సీతాకోక రంగుల కన్నా ప్రేమాస్పదం 

జాగ్రత్త కన్నా,
జీవితం నీ ప్రేమకోసం ఏడుస్తున్న 
నీ తప్పిపోయిన శిశువు

బివివి ప్రసాద్

16 ఆగస్టు 2025

కవిత : అతనిది

 దెబ్బ తగలక ముందు ఒకలా ఉంటాం,
మాసిపోయాక కూడా అలానే,
తగిలిన సమయాన 
అతని పిలుపు వినబడుతుంది లీలగానైనా,
మిగిలినదంతా డొల్ల ప్రపంచం

అతను పిలుస్తారు గుమ్మంలో నుండి తల్లిలా,
ఆటల్లో వినబడదు నీకు, విన్నా పట్టదు

చాలా రాత్రులు చూస్తావు, పగళ్లు కూడా,
ఒకటో తరగతిలోని లోకమే విశ్రాంతి కాలంలోనూ,
పుట్టినట్టే వెళ్ళిపోతావు వేల జీవితాల్లో ఒకటిగా

ఇదేమీ నిష్ఫలం కాదు కానీ,
సరస్తీరంలో బతకడానికీ, సరస్సులో మునగటానికీ,
కొంచెం తేడా ఉండవచ్చు, లేకపోవచ్చు కూడా

దెబ్బలు తగిలితే ఆగవద్దు అనటం కన్నా,
ఆయన కూడా ఏమీ చెప్పకపోవచ్చు

ఒక కల కనటానికి వచ్చావు
కంటావా, కనుమూస్తావా నీ స్వేచ్ఛ 
తరువాత కూడా మిగిలి ఉండటం అతనిది

బివివి ప్రసాద్

15 ఆగస్టు 2025

కవిత : బదులు తీర్చటం..

ఈ లోకంలో ఏమన్నా బ్రతికితే
చిన్నపుడు బ్రతుకుతాం
మిగిలిన జీవితమంతా బదులు చెల్లిస్తాం 

ఆడా, మగా తెలియని
పసిదనం తర్వాత ఏముందిక్కడ

రాత్రి చుక్కల పందిరీ,
పగటి వెలుతురు సందడీ మినహా
రేపటి ఆలోచన లేని రోజులు గడిచాక
ఏముందిక్కడ

కాసిని శైశవక్షణాలు అనుభవించినందుకు
ఇంత బదులు తీర్చటం అవసరమా అని
అడుగుతావు దేవుడిని

ఉండీ లేనివాడిని, 
లేకుండటంలో దాగిన వాడిని
జవాబు రాదు 

బ్రతికావు కదా కాసిని రోజులో, నిముషాలో
శుభ్రమైన పసిదనంలో, స్వేచ్చలో
భయ రహిత క్షణాల్లో,
ఏదీ గుర్తుండని కాంతిలో

చెల్లించి వెళిపోవా
మిగిలిన బరువైన రోజుల్నని
నిన్ను నువ్వే బ్రతిమాలుకుంటావు

బదులుగా,
ఇక రావు ఇక్కడికి అనటం కన్నా
ఏ వరం ఇవ్వగలడు దైవమైనా

బివివి ప్రసాద్

14 ఆగస్టు 2025

కవిత : కొంచెం మిగిలినా..

ఈ లోకంలో 
కరుణ మిగిలి ఉన్నందుకు ధన్యవాదాలు

ఉదయపు కిరణాలలో కాంతీ, గాలిలో శాంతీ,
మధ్యాహ్నపు ఎండలో నీడలూ,
సాయంత్రపు దిగుల్లో గగనం నిండా రంగులూ 
మిగిలినందుకు ధన్యవాదాలు

పిల్లలింకా అమాయకంగా 
కన్నార్పక చూస్తున్నందుకు ధన్యవాదాలు

చీకటి మూగిన వేళల 
నింగిలో మూగగా వెలిగే తారలూ,
జీవులు భయంలో మునిగినప్పుడు
కొనవూపిరిలా మెరిసే ఆశలూ,
స్పర్శలో అరుదుగా తాకే ఆర్ద్రతా 
ఈ లోకంలో మిగిలినందుకు ధన్యవాదాలు

కొంచెం ప్రేమ మిగిలినా చాలు,
కఠినమైన చలివేళల ఒక వెచ్చని ఊపిరి చాలు,
ద్వేషాలూ, అపనమ్మకాల మధ్య తడిచూపు చాలు

ఈ లోకం మరిన్ని వేలయేళ్ళు బతుకుతుంది,
ఒక మనిషి మరికొన్ని రోజులు బ్రతుకుతాడు,
నీరెండ మరికొన్ని క్షణాలు 
జీవితాన్ని దీవించి వెళుతుంది

బివివి ప్రసాద్

13 ఆగస్టు 2025

కవిత : ఉండాలి..

ఉండగా ప్రేమించటానికి లెక్కలు వేస్తాం
వెళ్ళిపోయాక చెల్లా చెదురవుతాయి,
మనుషుల కన్నా బుద్ధిహీనం ఉంటాయా,
కాస్త ప్రేమిస్తే చాలు 
ఉదయాలు తాకినట్టు బ్రతుకుతారు వాళ్ళు 
ఒకరికొకరమని సంతోషపడుతూ

ఏ పగలు ఒకరు రాలిపోతారో తెలీదు,
ఏ రాత్రి ఒంటరితనాన్ని మిగిల్చివెళతారో,
బ్రతికున్నాం కదా, ప్రేమించుకుందామని
ధైర్యం చెప్పుకునే తెలివొస్తుందా ఏనాటికైనా
బ్రతికివెళ్లారు కదా ప్రేమించుదామనే రోజులొస్తాయా 

మనుషుల కన్నా అమాయకం ఉన్నాయా,
కాలాలకి తమవారిని బలి ఇచ్చే 
తెలివిలేని జీవులు ఉంటాయా,
లేవగానే, నువు ఉన్నావు చాలనే 
భరోసాతో ఒకరికొకరు ఉండటం కన్నా,
ఈ ఒంటరిలోకం ఎవరి నుండి ఏమాశిస్తుంది
కొంచెం ప్రేమ కోసం కదా, ఇదంతా ఇలా పుట్టింది

నవ్వుతావో, ఏడుస్తావో నీ స్వేచ్ఛ,
ఇక్కడ ఉండు నీకు నచ్చినట్టు,
నాకు దగ్గరగానో, దూరంగానో,
నువు ఉన్నావన్న స్పృహ చాలు,
నేను నిండుగా ఉండటానికి అని
ఎవరితోనైనా, ఎప్పుడైనా అనగలుగుతామా

బివివి ప్రసాద్

12 ఆగస్టు 2025

కవిత : కలలాంటి బంధాలు

కలవటం ఎంతసేపు, విడిపోవటం ఎంతసేపు
చిటికె వేసినట్టు కలవొచ్చు,
పూలు రాలినట్టు విడిపోవచ్చు,
విడిపోవటం భారమా, తేలిక పడటమా

నిజాయితీ కదా వెలగాల్సింది 
బంధంలో, విడివడటంలో,
కలిసి ఉండటమా ముఖ్యం
ఒకరుగా నిండుగా ఉండటం కదా

కాలమింకా చాలా మారాలి
మనం ఎదగాలి, పండాలి,
మరింత కాంతిలోకి వికసించాలి

బ్రతికి ఉండటం కన్నా 
ఏదీ విలువ కాదని తెలియాలి,
తనతో తానుండటం కన్నా 
అపురూప బంధమేదీ లేదని కూడా

మనుషులతో, విలువలతో కాదు
ఊరికే కలిసి ఉండాలి జీవించటంతో

చెట్లు జీవిస్తున్నాయి నీతో కలిసి
నీరు జీవిస్తోంది, గాలి జీవిస్తోంది,
ఆకాశం జీవిస్తోంది, కాలం జీవిస్తోంది

నీవు కలిసిన వారిలోంచి,
విడివడిన వారిలోంచి,
జీవితం తనని తాను జీవిస్తోంది,
కలలాగా నిన్ను తాకుతోంది

బివివి ప్రసాద్

11 ఆగస్టు 2025

కవిత : వీడ్కోలు ప్రేమలేఖ

అమాయకపు స్వర్గం నుండి
జారిపోతున్నా హాయిగానే వుంటుంది

ఆ హాయి లౌక్యానిది కాదు,
అమాయకత్వానిది,
ఈ సంగతి లౌకిక పాతాళంలో 
చిక్కుకున్నాక కానీ తెలిసిరాదు

ఏం ఉపయోగం,
అప్పటికే ఈ లోకపు డొల్లలలో 
ఒకటిగా మిగులుతాము, 
అమాయకమైన కాలం
మనని చూసుకుని దుఃఖపడుతుంది

బివివి ప్రసాద్

10 ఆగస్టు 2025

కవిత : క్షణికం

 1
ఇవాళ ఉన్న ప్రేమ రేపు ఉండకపోవచ్చు,
నిన్నటి కోపం ఇవాళ మిగలనట్లే
జీవితం క్షణమాత్రం కదా, ఇక ఉద్వేగాలెంత 

ఈ క్షణంలోకి నిన్ను కోల్పోవటంలో దాగివుంది
జీవితంలోని అందమంతా,
కొనసాగించాలనిపిస్తుంది చూడూ
అప్పుడు మొదలవుంది జీవనవిషాదం

ఇంద్రధనువు వెళ్ళిపోయాక గగనం వెలిసిపోదు
తనతోనే నిండి వుంటుంది హాయిగా, 
నింగిలో నుండి వచ్చావు కదా
ఉండలేవా చూడు నీతో నిండిపోయి

2
ఏకాంతం జీవన రహస్యం
ఎవరూ లేనప్పుడు, ఏ చప్పుడూ కానప్పుడు,
అద్దంలోని మనిషి ఒకడే ఎదురైనపుడు
ప్రేమించు తనని కూడా,
ఎదురుచూపుల వేదనంతా ఆవిరైపోయి 
తేలికైనకాంతి చొరబడుతుంది లోపలికి

నిన్ను నువు ప్రేమించాలి, క్షమించాలి, 
హృదయానికి దగ్గరగా తీసుకోవాలి,
ఉనికి నిన్ను ప్రార్థించేది ఈ లాలన కోసమే, 
మిగిలిన ప్రపంచం బ్రతిమాలినా నీతో ఉండదు,
దాని పని దానికి ఉంది

ఒంటరితనం శాపం కాదు, వరం
ఇది అర్థమైతే లోకం అందంలోకి మారుతుంది

3
జీవితాన్ని నిజంగా ప్రేమించిన వాళ్ళు
తమ ముద్రలు ఇక్కడ మిగలాలనుకోరు
రేపటి కాంతి కోసం తమ రాత్రిని ఖాళీ చేస్తారు
ఏమి మిగలాలి ఇక్కడ, ఎంతకాలం

నువు ఏడవలేదు, నవ్వలేదు
నీలోంచి ఎవరో వాటిని చూసారు, చూపించారు
నువు ఉండేది లేదు, వారు వెళ్ళేది లేదు

ఇంత అద్భుతమైన లోకం
ఒక్క మృత్యువుతో మాయమవుతుంది
తరువాత మిగిలేది ఏమిటి! ఎవరికి!

బివివి ప్రసాద్